అగ్నిప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యం

అగ్నిప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యం

వి.భద్రయ్య స్టేషన్ ఫైర్ ఆఫీసర్

పెట్రోల్ బంకుల్లో అవగాహన కార్యక్రమం

పరకాల,నేటిధాత్రి

 

అగ్నిప్రమాదంలో వీరమరణం పొందిన 66 మంది అగ్నిమాపక సిబ్బంది స్మృతార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ సందర్బంగా పట్టణంలోని శ్రీ బాలాజీ ఫిల్లింగ్ స్టేషన్‌లో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వి.భద్రయ్య ఆధ్వర్యంలో కరపత్రాలు,పోస్టర్లు పంపిణీ చేసి,అగ్నిప్రమాద నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.పాఠశాలలు, కార్యాలయాలు,వ్యాపార సంస్థలు,గ్రామీణ ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్,సదస్సులు నిర్వహిస్తూ విద్యుత్ భద్రత, ఎల్‌పీజీ వాడకం,గ్యాస్ లీకేజీ నివారణ,అగ్ని సమయంలో పాటించాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నామని అగ్నిప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని భద్రయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎల్ఎఫ్ఎఫ్.కృష్ణకుమార్, G. గణేష్ ఎఫ్ఎఫ్టి,ఎఫ్ఎఫ్ లు దిలీప్,రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

వివేకపూరిత మాటలను వెనక్కి తీసుకోవాలి

వివేకపూరిత మాటలను వెనక్కి తీసుకోవాలి

బీఆర్ఎస్ నాయకుడు ఒంటేరు చక్రి

పరకాల,నేటిధాత్రి

కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటును ఇండియా పాకిస్తాన్,విభజనతో పోల్చిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)నాయకుడు ఒంటేరు చక్రి తీవ్ర ఆక్షేపం తెలిపారు.తేజస్వి సూర్య తన అవివేకపూరిత మాటలను తక్షణమే వెనక్కి తీసుకుని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు.సుదీర్ఘ తెలంగాణ పోరాటాలు, అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రాన్ని దేశ విభజనతో పోల్చడం అతి దారుణమని ఆరోపించారు. తెలంగాణ సాధన అంటే దేశానికి స్ఫూర్తి.ఆ పోరాట స్పూర్తిని చిన్నతం చేసేలా మాట్లాడటం తేజస్వి సూర్య అవివేకానికి నిదర్శనమని పోరాట ఉద్యమాలు లేని బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజల మనోభావాలు ఏమీ తెలియవని ఆయన స్పష్టం చేశారు.తెలంగాణ ప్రజల మనసులను దెబ్బతీసిన ఈ వ్యాఖ్యలకు తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.a

తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలి..ఒంటేరు చక్రి

తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలి..ఒంటేరు చక్రి

హన్మకొండ, నేటిధాత్రి:

తేజస్వి సూర్య కర్ణాటక ఎంపీ ఇటీవల తెలంగాణ ఆంధ్రా రాష్ట్రాల ఏర్పాటు ఇండియా పాకిస్తాన్ ల విభజన లాగ జరిగిందని అవివేకం తో మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని భారత రాష్ట్ర సమితి నాయకులు ఒంటేరు చక్రి హెచ్చరించారు.సుదీర్ఘ తెలంగాణ ఉద్యమ పోరాటాల ద్వారా ఎంతో మంది అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం దేశ విభజనతో పోల్చడం తేజస్వి సూర్య అవివేకానికి నిదర్శనం అని దేశానికి ఒక స్పూర్తి తెలంగాణ రాష్ట్ర సాధన అలాంటి ఒక గొప్ప పోరాటాల స్ఫూర్తిని చిన్నతం చేస్తూ మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి.పోరాట,ఉద్యమ స్పూర్తి లేని బీజేపీ నాయకులకు ఏం తెలుసు తెలంగాణా ప్రజల మనోభావాలు,బేషరతు గా తెలంగాణా ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చేసిన తేజస్వి సూర్య క్షమాపణలు చెప్పాల్సిందే అని భారత రాష్ట్ర సమితి నాయకులు ఒంటేరు చక్రి హెచ్చరించారు.

పాడి గేదెల పథకం దరఖాస్తు గడువు పొడగింపు

పాడి గేదెల పథకం దరఖాస్తు గడువు పొడగింపు

ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇందిరా

భూపాలపల్లి నేటిధాత్రి

ఎస్సీ యాక్షన్ ప్లాన్ లో భాగంగా (2) పాడి గేదెల పథకం కొరకు దరఖాస్తుల గడువు ఈనెల 23 వరకు పొడిగించబడింది. కావున అర్హులైన అభ్యర్థులు ఈనెల 23 లోగా తమ దరఖాస్తులను నమోదు చేసుకోవాలని, జిల్లా స్థాయి లక్ష్యాల ప్రకారం లబ్దిదారుల ఎంపిక జరుగుతుంది
కావున అర్హత ఆసక్తి గల షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులు ఈనెల 23 గడువు లోపు https://gobmms.cgg.gov.in సైట్ నందు దరఖాస్తు చేసుకుని అట్టి దరఖాస్తు ఫారంను సంబందిత మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఇవ్వగలరు ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవలసిందిగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇ. ఇందిర ఒక ప్రకటనలు తెలిపారు

తెలంగాణపై విషం చిమ్మితే చూస్తూ ఊరుకోం…

తెలంగాణపై విషం చిమ్మితే చూస్తూ ఊరుకోం…

మంచిర్యాల డిసిసి అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి

బిజెపి ఎంపీలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి..

పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, వోడ్నాల శ్రీనివాస్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి :

తెలంగాణ ఏర్పాటుపై బిజెపి ఎంపీలు విషం చిమ్మితే చూస్తూ ఊరుకోబోమని మంచిర్యాల డిసిసి అధ్యక్షులు పిన్నింటి రఘునాధ రెడ్డి హెచ్చరించారు. బిజెపి ఎంపీ తేజస్వి సూర్య లోక్ సభలో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, వోడ్నాల శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు.శనివారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమ్మ గార్డెన్ కమాన్ వద్ద రాస్తారోకో చేసి, బిజెపి ఎంపీ తేజస్వి సూర్య దిష్టిబొమ్మని కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, వోడ్నాల శ్రీనివాస్ లతో కలిసి జిల్లా డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

బిజెపి ఎంపీ తేజస్వి సూర్య లోక్ సభలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, తెలంగాణ ఏర్పాటు ఇండియా పాకిస్తాన్ విభజన లాగా జరిగిందని అవహేళనగా మాట్లాడడం అవివేకం అని అన్నారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరూ స్వరాష్ట్రం కోసం పోరాడి ప్రాణ బలిదానాలకు సిద్ధపడి తెలంగాణ తీసుకొచ్చుకుంటే బిజెపి ఎంపీలు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. లోక్ సభలో ఇంత జరుగుతున్న బిజెపి తెలంగాణ ఎంపీలు, మంత్రులు నిలదీయకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపతి రాజయ్య, జంగం కళ, జిల్లా కార్యదర్శి గోపతి భానేష్, కౌన్సిలర్లు గుర్రం శ్రీనివాస్, భీమ మల్లేష్, కూతురు ప్రభాకర్, నాయకులు సుధాకర్, పనాస రాజయ్య, లక్ష్మారెడ్డి, ప్రేమ్ సాగర్ ,రామ్ సాయి, లచ్చులు, నాయకురాళ్ళు పుష్ప, సృజన , పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

టేకుమట్ల టు భూపాలపల్లి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి

టేకుమట్ల టు భూపాలపల్లి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణకు వినతి పత్రం ఇచ్చిన మారేపల్లి మల్లేష్

భూపాలపల్లి నేటిధాత్రి

 

సిపిఐ ఎంఎల్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
టేకుమట్ల మండల కేంద్రం నుండి భూపాలపల్లి జిల్లా కేంద్రం వరకు బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజల జిల్లా కేంద్రానికి పోవాలంటే ఇబ్బందికరంగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా తక్షణమే డి ఎం తో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పిస్తానని అన్నారు చిట్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి ఐ సి డి ఎస్ ఆఫీస్ ఉందని తక్షణమే ఉపయోగం లోకి తేవాలని గతంలో ఇక్కడే అంగన్వాడి కార్యకర్తల ఆయా కార్యకర్తల మీటింగ్లు సమావేశాలు జరిగేవని ఈ ఆఫీసును జిల్లా కేంద్రానికితరలించడం వలన అంగన్వాడీ కార్యకర్తలు ఆయా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు తక్షణమే ఇక్కడికి తరలించాలని ఆయన దృష్టికి తీసుకుపోగా తరలిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే కి పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము

నూతన పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించిన బి జోన్ రజక సంఘం…

నూతన పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించిన బి జోన్ రజక సంఘం…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన మున్సిపాలిటీ చైర్ పర్సన్ గోడిశెల సంధ్యారాణి _రాజా రమేష్, వైస్ చైర్ పర్సన్ మిట్టపల్లి సరిత – శ్రీనివాస్, బిఆర్ఎస్, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ ల 22 మంది కౌన్సిలర్లను రామకృష్ణాపూర్ పట్టణ బి జోన్ రజక సంఘం ఆధ్వర్యంలో రజక సంఘం కార్యాలయంలో వారిని ఘనంగా సన్మానించారు. బీజోన్ రజక సంఘం అధ్యక్షులు నడిగోట తిరుపతి ఆధ్వర్యంలో పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లు మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి రజక సంఘం నాయకులు సన్మానించడం సంతోషంగా ఉందని రానున్న రోజుల్లో మునిసిపాలిటీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేస్తామని అన్నారు. అన్ని కుల సంఘాలను కలుపుకొని ముందుకెళ్తామని మునిసిపాలిటీ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రాజా రమేష్, రామిడి కుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్,సంఘం గౌరవాధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, ఎస్ ఆర్ కె పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉప్పలయ్య, రజక సంఘం సభ్యులు పున్నం, కంచర్ల శ్రీనివాస్, మల్లయ్య, రాంబాబు, నాగరాజు, రాజేశ్వరి, బిఆర్ఎస్, సిపిఐ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

విద్యా సదస్సును విజయవంతం చేయండి

విద్యా సదస్సును విజయవంతం చేయండి

TPTFజమ్మికుంట అధ్యక్షులు కొండపాక తిరుపతి
జమ్మికుంట (నేటిధాత్రి )

 

టిపిటిఎఫ్ (TPTF) తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలని జమ్మికుంట TPTF అధ్యక్షులు శ్రీ తిరుపతి గారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జమ్మికుంట మండల కేద్రములో కరపత్రాలు, పోస్టర్లను విడుదల చేశారు.
ఈ సదస్సు 2026 ఏప్రిల్ 30న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
“సమరశీలతత్వాన్ని చాటుకుందాం – విద్యా సమానత్వం సాధిద్దాం” అనే నినాదంతో ఈ సదస్సు జరుగుతుందని తెలిపారు. విద్యారంగ సమస్యలతో పాటు సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు నిరంతరం పోరాటాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరికీ నాణ్యమైన, ఉచిత, సమాన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత అని, “కామన్ స్కూల్ విధానం” అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. విద్యా హక్కుల సాధన కోసం సమగ్ర ఉద్యమాన్ని నిర్మించడమే టిపిటిఎఫ్ లక్ష్యమని తెలిపారు.
ఈ రాష్ట్ర విద్యా సదస్సుకు ముఖ్య అతిథిగా డాక్టర్ కె. నవీన్ నికోల ఐఏఎస్ హాజరుకానున్నారు. గౌరవ అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం పాల్గొననున్నారు. జాతీయ విద్యా విధానం, సామాజిక న్యాయం పై ప్రొఫెసర్ హరగోపాల్, తెలంగాణలో విద్యా అసమానతలపై ప్రొఫెసర్ కాసిం, అంతర్జాతీయ రాజకీయాలపై శ్రీనివాస్ తదితరులు ప్రసంగించనున్నారు.
ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొండపాక తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు మర్రి అవినాష్ జమ్మికుంట మండల జనరల్ సెక్రటరీ పాక కుమారస్వామి,ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు తదితరలు పాల్గొన్నారు.

శ్రుతి హాసన్‌ పెళ్లిరంగంలోకి కమల్..వరుడు అతనేనా?

శ్రుతి హాసన్‌ పెళ్లిరంగంలోకి కమల్..వరుడు అతనేనా?

శ్రుతి హాసన్.. కేవలం కమల్ హాసన్ వారసురాలు మాత్రమే కాదు, తనకంటూ ఒక ప్రత్యేకమైన ‘బ్రాండ్’ క్రియేట్ చేసుకున్న మల్టీట్యాలెంటెడ్ స్టార్.
సౌత్ స‌హా బాలీవుడ్ లోనూ అన‌తి కాలంలోనే సినిమాలు చేసి అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ త‌న‌దైన ముద్ర వేసింది. వ్వ‌క్తిగ‌త జీవితంలోనే శ్రుతిహాస‌న్ ప్రేమాయ‌ణాలు న‌డ‌ప‌డంలోనూ త‌క్కువేం కాద‌ని ప్రూవ్ చేసింది. తొలుత విదేశీయుడు మైఖెల్ కోర్స‌లేతో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసింది. అత‌డినే పెళ్లాడాల‌నుకుంది.

ఈ క్ర‌మంలో మైఖెల్ ను డాడ్ కు సైతం ప‌రిచ‌యం చేసింది. కానీ ఎందుక‌నో ఆ బంధం పెళ్లి వ‌ర‌కూ దారి తీయ‌లేదు. అటుపై కొంత గ్యాప్ తీసుకుని ముంబైకి చెందిన శంత‌ను హాజారికాతోనూ డేటింగ్ చేసింది. తొలి వైఫ‌ల్యం నేపథ్యంలో శంత‌ను పెళ్లాడుతుంద‌ని అంతా భావించారు. కానీ ఈ బంధం కూడా మ‌ధ్య‌లోనే వీగిపోయింది. అప్ప‌టి నుంచి అమ్మ‌డు ప్రేమ వ్య‌వ‌హారాల‌కు దూరంగా ఉంటూ వృత్తిగ‌త జీవితంపైనే దృష్టి పెట్టింది. సినిమాలు త‌ప్ప మ‌రో ఆలోచ‌న లేకుండా ప‌ని చేస్తోంది. ఈ నేప‌థ్యంలో శ్రుతి హాస‌న్ గురించి ఓ వార్త కోలీవుడ్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

కమల్ హాసన్ తన గారాల పట్టి కోసం సరైన వరుడిని వెతికే పనిలో పడ్డారని వార్త‌లొస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సంబంధాలు చూసార‌ని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా వ్యక్తిగత విషయాలపై చాలా స్పష్టంగా ఉండే కమల్ కూతురి భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రుతి హాసన్‌కు ఇప్పటికే 40 ఏళ్లు నిండాయి. పెళ్లి విష‌యంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా క‌మ‌ల్ బ‌ల‌మైన నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే కమల్ హాసన్ తన మిత్రులు, బంధువుల ద్వారా మంచి సంబంధాలను అన్వేషి స్తున్నారుట‌.

బ‌య‌ట కుర్రాడు కంటే? తెలిసిన కుర్రాడైతే బాగుంటుంద‌నే క్ర‌మంలోనే క‌మ‌ల్ తెలిసిన వాళ్ల ద్వారా పెళ్లి కొడుకును వెతుకుతున్న‌ట్లు తెలుస్తోంది. వ్య‌క్తిగ‌త జీవితంలో కూడా క‌మ‌ల్ హాస‌న్ చాలా స‌వాళ్లు ఎదుర్కు న్నారు. వివాహం అనే జీవితంలో క‌మ‌ల్ చాలా కుదుపుల‌కు లొన‌య్యారు. మొద‌టి భార్య‌తో విడాకులు ..ఆ త‌ర్వాత న‌టి గౌత‌మ్ తో రిలేష‌న్ షిప్ వీగిపోవ‌డం తెలిసిందే. ప్ర‌స్తుతం క‌మ‌ల్ కూడా సింగిల్ గానే ఉంటున్నారు. సాధార‌ణంగా పెళ్లి విష‌యంలో క‌మ‌ల్ హాస‌న్ ఇష్టాలను..స్వేచ్ఛ ను ఎంతో గౌర‌విస్తారు. శ్రుతి హాస‌న్ కి కూడా క‌మ‌ల్ చాలా స్వేచ్ఛ క‌ల్పించారు. ఆ ర‌కంగా శ్రుతి హాస‌న్ కూడా కొంత జీవితాన్ని ఆస్వాదించింది. కానీ గ‌త అనుభ‌వాల దృష్ట్యా కుమార్తెల పెళ్లి విష‌యంలో మాత్రం మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని క‌మ‌ల్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

టాక్సిక్ స్టోరీ లీక్1961 గోవా బ్యాక్‌డ్రాప్..

టాక్సిక్ స్టోరీ లీక్1961 గోవా బ్యాక్‌డ్రాప్

 

కేజీఎఫ్’ సిరీస్‌తో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రాకింగ్ స్టార్ యష్, ప్రస్తుతం ‘టాక్సిక్’ చిత్రంతో మరోసారి వెండితెరపై విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనకున్న మాస్ అప్పియరెన్స్‌కు ఖచ్చితంగా వైలెన్స్ ఉన్న సినిమానే చేయాలి లేదంటే జనాలు యాక్సెప్ట్ చేయరు అనేంతలా. అందుకే.. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ఎన్నో కథలు విని చివరికి టాక్సిక్ సినిమా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్ రిలీజైన తర్వాత ఇండియాలో పెను సంచలనమే సృష్టించింది. కొందరు హాలీవుడ్ స్టైల్ మేకింగ్ అని పొగడ్తలు కురిపిస్తే.. మరికొందరు మాత్రం మసాలా కంటెంట్ ఏంటి ఈ రేంజ్‌లో ఉంది అంటూ కామెంట్స్ చేశారు. ఈ సినిమాను ముందుగా మార్చి 17న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను జూన్ 4కు పోస్ట్ పోన్ చేశారు.

సాధారణంగా గ్యాంగ్‌స్టర్ సినిమాలు అంటే ముంబై అండర్ వరల్డ్, లేదంటే అంతర్జాతీయ మాఫియా చుట్టూ తిరుగుతుంటాయి. కానీ టాక్సిక్ సినిమా కోసం గోవా చరిత్రలోని ఒక క్లిష్ట సమయాన్ని ఎంచుకున్నారు. మన దేశానికి 1947లోనే స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, గోవా మాత్రం 1961 వరకు పోర్చుగీస్ పాలనలోనే ఉంది. ఆ 14 ఏళ్ల కాలంలో గోవాలో స్మగ్లింగ్ ముఠాలు ఎలా రాజ్యమేలాయి? రాజకీయ పరిస్థితులు ఎలా మారాయి? అనే అంశాల చుట్టూ ఈ ఫిక్షనల్ డ్రామా సాగుతున్నట్లు తెలుస్తుంది. ఈ కథ 1940లో మొదలై 1970 వరకు.. అంటే దాదాపు మూడు దశాబ్దాల పాటు సాగుతుంది. ఒక సామ్రాజ్యం పుట్టుక, దాని పతనం ఎలా జరిగిందో ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారట.
ఈ సినిమాలో యష్ ‘రయా’ అనే పవర్ రోల్‌లో నటిస్తున్నాడు. మొత్తానికి ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లింప్స్ నుంచి.. టీజర్, సాంగ్స్ ఇలా ప్రతీది సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోతున్నాయి.

కవిత మైండ్ గేమ్!ఫస్ట్ టార్గెట్ రెడీ!

కవిత మైండ్ గేమ్!ఫస్ట్ టార్గెట్ రెడీ!

మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నోట నుంచి వస్తున్న వ్యాఖ్యలు… బీఆర్ఎస్ లో అంతకంతకూ టెన్షన్ పుట్టిస్తున్నాయి. నిన్నటి వరకు కారు పార్టీకి కవచంలా ఉన్న ఆమె.. ఇప్పుడు అదే కారు స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు సిద్ధమయ్యారు.

బీఆర్ఎస్ పార్టీతోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన కవిత… తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగు జాడల్లో నడిచారు. అయితే ఇప్పుడు తండ్రి పార్టీకే పోటీ అంటూ కవిత చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే తాను కొత్త పార్టీని పెడుతున్నానని ప్రకటించిన కవిత… తన ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్సేనని సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ కు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే తనను కలిశారని ఆమె చెప్పారు. అయితే తనను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరన్న విషయాన్ని తాను ఇప్పుడప్పుడే వెల్లడించబోనని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికీ చాలా మంది బీఆర్ఎస్ మాజీలు తనను కలుస్తూనే ఉన్నారని ఆమె తెలిపారు. తాను పార్టీని ప్రకటించగానే… తనను కలిసిన బీఆర్ఎస్ నేతలంతా తన పార్టీలోకే వస్తారని కూడా ఆమె తెలిపారు.

ఇక తన సోదరుడు, బీఆర్ఎష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గురించి కూడా ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో తాను పాదయాత్ర చేస్తానని ఇటీవలే కేటీఆర్ ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన కవిత… అధికారంలో ఉన్న పదేళ్లు కేటీఆర్ ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆమె విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అధికారం లేకపోయేసరికి ప్రజలు గుర్తుకు వచ్చారని, ఈ క్రమంలో ఆయన ప్రజలను కలుసుకునేందుకు పాదయాత్ర అంటూ బూటకపు మాటలు చెబుతున్నారని ఆరోపించారు.

ఇక రాజకీయాల్లో తన తొలి ప్రత్యర్ధి బీఆర్ఎస్సేనని చెప్పిన వైనానికి గల కారణాలను కూడా కవిత తనదైన శైలిలో వివరించే యత్నం చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కారణంగానే తాను తన తొలి రాజకీయ ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ను ఎంచుకున్నానని తెలిపారు. ఈ విషయంలో తనలో ఎలాంటి మార్పు రాబోదని ఆమె వెల్లడించారు. ఈ నెల 25న తన పార్టీ పేరుతో పాటు పార్టీ సిద్ధాంతాలను ప్రకటిస్తానని కవిత గత నెలలోనే ప్రకటించారు. మరి కవిత పార్టీ ప్రారంభం అయిన తర్వాత బీఆర్ఎస్ ఎంతగా ఇబ్బంది పడుతుందన్నది చూడాలి.

ఉత్తరాదిపై దక్షిణాది విజయం!బిల్లు ఎలా వీగింది..

ఉత్తరాదిపై దక్షిణాది విజయం!బిల్లు ఎలా వీగింది?

డీలిమిటేషన్, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు లోక్ సభలో వీగిపోయిన నేపథ్యంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ విశ్లేషణలన్నింటిలో ఒకటి మాత్రం యావత్తు దేశాన్ని తట్టి లేపిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదేంటంటే… ఉత్తరాది ప్రాధాన్యాన్ని మరింతగా పెంచుతూ దక్షిణాది ప్రాధాన్యాన్ని తగ్గించే దిశగా జరుగుతున్న ఎన్డీఏ ఎత్తులన్నీ చిత్తు అయ్యాయయన్నదే ఆ విశ్లేషణ సారాంశం.

దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న ఎన్డీఏ ఆలోచనతో ఒక్కసారిగా పెద్ద చర్చకే తెర లేసింది. జనాభా ప్రాతిపదికగా జరిగే డీలిమిటేషన్ తో దక్షిణాదిలో లోక్ సభ స్థానాల సంఖ్య తగ్గిపోతుందని, అదే సమయంలో ఇప్పటికే అధిక సంఖ్యలో ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన లోక్ సభ సీట్ల సంఖ్య మరింగా పెరుగుతందన్న ఆందోళన మొదలైంది. ఇదే జరిగితే… కేంద్రంలో అధికార పగ్గాలు చేజిక్కించుకునే పార్టీలు ఇకపై దక్షిణాది రాష్ట్రాల్లోని లోక్ సభ సీట్లతో సంబందం లేకుండానే తమ పని ముగించుకుంటాయన్న వాదనా వినిపించింది. వెరసి దక్షిణాది రాష్ట్రాలకు అసలేమీ ప్రాధాన్యం దక్కదని, నిధుల విడుదలలో భారీ అంతరం చోటుచేసుకునే ప్రమాదం లేకపోలేదని నిపుణులు విశ్లేషించారు.

గురు, శుక్రవారాల్లో జరిగిన చర్చల్లో ఆయా పార్టీలకు చెందిన ఎంపీలు దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలకూ తీరని నష్టం జరుగుతుందన్న వాదనను వినిపించారు. ఈ క్రమంలో విపక్షాల్లోని దక్షిణాది భయాందోళనలను పరిష్కరించే దిశగా ఎన్డీఏ కూటమి… జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ను చేయడం లేదని చెప్పింది. అంతేకాకుండా అన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లోని ప్రస్తుత లోక్ సభ స్థానాలకు అదనంగా 50 శాతం సీట్లు పెరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది. అయితే ఆ విషయాన్ని మాటమాత్రంగా కాకుండా బిల్లులో లిఖితపూర్వకంగా చేపట్టాలని విపక్షాలు కోరాయి. 

ఆ తర్వాత జరిగిన ఓటింగ్ లో విపక్షాలకు చెందిన సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. అధికార పక్ష సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేసినా… మూడొంతుల్లో రెండు వంతుల మెజారిటీ దక్కకపోవడంతో బిల్లు వీగిపోయింది. బిల్లు వీగిపోయిన వెంటనే దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ సీఎంలు ఎంకే స్టాలిన్, ఎనుముల రేవంత్ రెడ్డిలు హర్షం ప్రకటించారు. వెరసి ఉత్తరాది వాదనపై దక్షిణాది విజయం సాధించిందన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తించాయి.

ముందు మర్యాద..వెనుక మంత్రాంగం

ముందు మర్యాద..వెనుక మంత్రాంగం

 

ఎప్పుడూ తనదైన మార్కు డైలాగులతో ‘దూకుడు’ ప్రదర్శించే మల్లన్న.. ఇప్పుడు ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ చెంత వాలి తెలంగాణ పాలిటిక్స్‌లో అసలైన ‘మాస్’ మలుపు ఇచ్చారు. మల్లారెడ్డి మోదీతో భేటీ కావడం అటు తెలంగాణ.. ఇటు దేశ రాజధాని ఢిల్లీలోనూ పెను చర్చకు దారితీసింది. మల్లారెడ్డి వంటి సీనియర్ నేత.. అదీ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి చెందిన ఎమ్మెల్యే, నేరుగా ప్రధానిని కలవడం వెనుక ఉన్న రాజకీయ గూఢార్థాలు ఇప్పుడు విశ్లేషణలకు పని పెడుతున్నాయి.

ఈ భేటీలో అందరినీ ఆకర్షించిన ప్రధానాంశం మల్లారెడ్డి తన కోడలు ప్రీతిరెడ్డిని వెంట తీసుకెళ్లడం.. సాధారణంగా రాజకీయ నాయకులు తమ వారసులను జాతీయ స్థాయి నేతలకు పరిచయం చేస్తున్నారంటే.. అది భవిష్యత్తు ప్రాతినిధ్యానికి పునాది అని అర్థం. గత కొంతకాలంగా ప్రీతిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనే తన కోరికను ఆమె గతంలోనే బహిరంగ పరిచారు. ఇప్పుడు ప్రధాని మోదీతో భేటీ ద్వారా.. ఆమెను బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపే దిశగా మల్లారెడ్డి పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది.

తెలంగాణలో అధికార మార్పిడి జరిగిన తర్వాత బీఆర్ఎస్ లో ఒక విధమైన సందిగ్ధత నెలకొంది. పార్టీలోని కీలక నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు. మల్లారెడ్డికి మేడ్చల్, మల్కాజిగిరి పరిసర ప్రాంతాల్లో బలమైన ఆర్థిక, సామాజిక పట్టు ఉంది. ఆయన వంటి నేత పార్టీని వీడితే అది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బ అవుతుంది. అయితే బీఆర్ఎస్ శ్రేణులు దీనిని “మర్యాదపూర్వక భేటీ”గా అభివర్ణిస్తున్నప్పటికీ రాజకీయాల్లో ‘అకస్మాత్తు మర్యాదలు’ ఉండవనేది జగమెరిగిన సత్యం.

మరోవైపు తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీకి మల్లారెడ్డి వంటి ‘మాస్’ ఇమేజ్ ఉన్న నేతలు అవసరం. ఆర్థిక వనరులు, విద్యాసంస్థల నెట్‌వర్క్ ఉన్న మల్లారెడ్డి కుటుంబం బీజేపీలోకి వస్తే, అది పార్టీకి అదనపు బలాన్ని ఇస్తుంది. బండి సంజయ్‌తో ప్రీతిరెడ్డి గతంలో జరిపిన భేటీని, ఇప్పటి మోదీ భేటీని కలిపి చూస్తే.. మల్లారెడ్డి కుటుంబం కమల తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం ఖరారైనట్లే కనిపిస్తోంది.

జి.జి.ఆర్ పల్లిలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి…

జి.జి.ఆర్ పల్లిలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి:

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలంలోని జి.జి.ఆర్ పల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మక్కలు ఆరబోసిన రైతుల కల్లాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మండల నాయకుడు, మాజీ సర్పంచ్ తుత్తురు రమేష్ మాట్లాడుతూ గతంలో కే.సీ.ఆర్ ప్రభుత్వం గురిజాల పి.ఎ.సి.ఎస్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు సహాయం చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే గురిజాల సొసైటీ పరిధిలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి మోటురి రవి, మాజీ ఎంపీటీసీ బండారి రమేష్, మండల నాయకులు కత్తుల కుమారస్వామి, అన్న రాజమల్లు, అల్లి రవి, వార్డు సభ్యుడు దగ్గుల లింగన్న, యాదవ సంఘం అధ్యక్షుడు తుత్తురు సాంబయ్య, మిట్టపల్లి రాజు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పత్రి కుమారస్వామి, పి.ఎ.సి.ఎస్ డైరెక్టర్ కత్తుల వెంకటేశ్వర్లు, శీలం కట్టయ్య, బానోత్ జై కుమార్, తుత్తురు గోపాల్, మూలం ఐలయ్య, పురాణి నర్సయ్య, కర్జల కుమారస్వామి, గాలి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండిస్తున్నాం…

తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

ఎండి.జాఫర్ రిజ్వి కాంగ్రెస్ సీనియర్ నాయకులు

పరకాల,నేటిధాత్రి

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజనను భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చిన కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎండీ రిజ్వి జాఫర్ తీవ్రంగా ఖండించారు.ఆయన మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దీర్ఘకాల ప్రజా ఉద్యమం,త్యాగాలు కారణమనిగుర్తుచేశారు.అలాంటి చారిత్రక ప్రక్రియను దేశ విభజనతో పోల్చడం సరైంది కాదని స్పష్టం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్యలపై స్పందించకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.ప్రజల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని,అలాంటి సందర్భాల్లో మౌనం అనర్హమని పేర్కొన్నారు.తెలుగు రాష్ట్రాల గౌరవాన్ని కాపాడే బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందని పేర్కొన్న ఆయన, బీజేపీ నాయకత్వం ఈ అంశంపై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు

పచ్చని చిగురులు ప్రకృతికి వెలుగులుపూల అందాలతో మరింత అలంకారం

పచ్చని చిగురులు ప్రకృతికి వెలుగులుపూల అందాలతో మరింత అలంకారం

పరకాల,నేటిధాత్రి

వేసవి ప్రారంభంతోనే ప్రకృతి మళ్లీ పచ్చని వర్ణాలతో కళకళలాడుతోంది.పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు కొత్తగా చిగురించడం ప్రారంభించడంతో పరిసరాలు ఆహ్లాదకరంగా మారాయి.ఎండ తీవ్రత పెరుగుతున్న ఈ కాలంలో చెట్లపై వెలసిన పసిడి-పచ్చని ఆకులు ప్రకృతికి ప్రత్యేక ఆకర్షణను తీసుకొస్తున్నాయి.ఉదయం,సాయంత్రం వేళల్లో ప్రజలు బయటకు వచ్చి ఈ సహజ సోయగాలను ఆస్వాదిస్తున్నారు.ముఖ్యంగా రోడ్ల వెంట చిగురించిన చెట్లు పర్యావరణానికి శోభను చేకూరుస్తున్నాయి.పక్షుల కిలకిలారావాలు,తేలికపాటి గాలులు కలిసిన ఈ దృశ్యం మరింత మనోహరంగా మారుతోంది.ఇదిలా ఉండగా,రంగురంగుల పూలతో రోడ్లకు ఇరువైపులా పువ్వుల అందాలు విరబూస్తూ ప్రయాణికుల కనులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.పూల సువాసనలు,పచ్చని చెట్ల మధ్య కలిసిన ఈ వాతావరణం ప్రకృతిని మరింత సుందరంగా మార్చుతోంది.గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా చిగురించిన చెట్లు పల్లె అందాన్ని మరింత పెంచుతున్నాయి.ఈ పచ్చదనం ప్రయాణికులకు చల్లని అనుభూతిని కలిగిస్తూ సహజ వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది.ప్రకృతి అందాలను కాపాడుకోవాలంటే చెట్ల సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. వేసవిలో చెట్లకు తగినంత నీరు అందించడం,కొత్త మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని మరింత విస్తరించవచ్చని వారు పేర్కొన్నారు.

వడ్ల బస్తాకు ఎన్ని తూట్లో?

అధికారులు పెట్టే చిల్లులు చూడాలి?

`బస్తా నిండేది లేదు.. సివిల్ సప్లైకి రూపాయి ఆదాయం రాదు?

`ప్రభుత్వం అప్పులు చేసి కొనుగోలు చేయక తప్పదు?

`సివిల్ సప్లై అంటేనే ఆదాయం సున్న.. ఖర్చు మిన్న?

`రైతు బతికింది లేదు… అప్పుల నుంచి బైట పడింది లేదు?

`ఆరు గాలం కష్టపడినా రైతుకు పెద్దగా లాభం లేదు!

మిల్లర్లు..అధికారులు కోట్లకు తక్కువ లేరు!

రైతులకు మేలు చేయాల్సిన అధికారులు మిల్లర్లకు సపోర్ట్!

`వచ్చే లాభాలలో మిల్లర్లు, అధికారులు కలిసి వాటాలు!

డీటీ నుంచి డిఏం దాకా కోట్లు సంపాదించుకుంటున్నారు?

చేతులకు వడ్లు అంటకుండా నోట్లు లెక్క బెట్టుకుంటున్నారు!

మిల్లుల్లో అధికారులు పార్టునర్లు అవుతున్నారు?

మిల్లర్లు, అధికారులు కలిసి పౌర సరఫరా శాఖను పాతర పెడుతున్నారు!

`నిజాయితీ మిలర్లకు చుక్కలు చూపిస్తున్నారు?

అధికారులకు మిల్లుల్లో అనధికారిక వాటాలు?

ఆ మిల్లులకే లెక్క లేకుండా వడ్లు?

`అధికారులు,మిల్లర్లు కలిసి బోనస్ కూడా బోంచేస్తున్నారు!

`అధికారులు వడ్లలో మట్టి పెళ్లను కూడా వదలడం లేదు!

పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వడ్లను తెలంగాణా రైతుల పేర రాస్తున్నారు?

తెలంగాణా లో పండే వడ్లకు, అధికారుల లెక్కలకు పొంతన కుదరడం లేదు!

`బోనస్ బోకెందుకు కూడా అధికారులు వెనుకాడడం లేదు!

సివిల్ సప్లై అధికారుల మీద నిఘా లేదు?

`వాళ్లపై నియంత్రణ అసలే లేదు!

`అందుకే అధికారులు ఆడింది ఆట పాడింది పాట!

సివిల్ సప్లై శాఖ అధికారుల సంపాదన మించి వున్న ఆస్తుల మీద నిఘా పెట్టాలి?

ఏసీబీ అధికారులు ఇప్పటికైనా రంగంలోకి దిగాలి?

`సివిల్ సప్లై లో అడుగడుగునా జరిగే అవినీతిని అరికట్టాలి!

`మిలర్ల అక్రమ దందా మీద దృష్టి పెట్టాలి!

అందుకు సహకరిస్తున్న అధికారుల భరతం పట్టాలి!

`ప్రభుత్వాదాయానికి గండి పడకుండా చూడాలి.

 

హైదరాబాద్, నేటిధాత్రి:                                         

  ఆ శాఖకు పేరు గొప్ప..ఊరు దిబ్బ సామెత సరిగ్గా సరిపోతుంది. అంతా సవ్యంగానే కనిపిస్తుంది. మొత్తం అస్తవ్యవస్తంగానే వుంటుంది. అసలు ఆ శాఖలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్దంకాదు. ఎవరూ అర్దం చేసుకోలేరు. ఎంత ప్రయత్నం చేసినా అంతు చిక్కడు. ఐదేళ్లు మంత్రిగా పనిచేసిన నాయకులకు కూడా ఏది అంతు చిక్కదు. ఆ శాఖ మీద పట్టురాదు. ఆ శాఖ అంటే అంతే..ఎవరికీ అంతుపట్టదంతే..ఈ శాఖకు జీవిత కాలం కమీషనర్‌గా పనిచేసినా, ఆ శాఖను గాడిలో పెట్టలేదు. అంత క్లిష్టమైనది. సంక్లిష్టమైనది. అవినీతికిలో అన్ని శాఖలకన్నా ముందుంటుంది. కాని ఎక్కడా కంటికి కనిపించకుండా గుట్టుగా సాగుతుంది. అలాంటి శాఖలో వడ్ల బస్తా కొనుగోలు నుంచి మొదలు, అన్నీ తూట్లే..అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. కాని ఎక్కడా ఎవరికీ కనిపించదు. ప్రభుత్వం గోడు కూడా ఎవరూ పట్టించుకోరు. నిజం చెప్పాలంటే పౌరసరఫరాల శాఖ అనేది ప్రభుత్వాలకు కామదేనువు లాంటిది. కల్ప వక్షం లాంటిది. కాని అది ఎప్ప్పుడూ ఒట్టిపోయే కనిపిస్తుంది. కారణం..అధికారులు…మిల్లర్లు. అందుకే అంతు చిక్కని రహాస్యాలన్నీ మధ్యలోనే మాయమైపోతాయి. ప్రభుత్వం ఖజాన నింపాల్సిన శాఖ, ఖజానా ఖాళీచేయిస్తుంది. రూపాయి ఆదాయం కనిపించకుండా చేస్తుంది. ఇంతటి చిత్రమైన శాఖ మరొకటి వుండదేమో! ప్రతి అడుగులోనూ అవినీతే. అక్రమమే. కాని ఎవరికీ కనిపించదు. ఎక్కడా అవినీతి జరుగుతున్నట్లు తెలియదు. అంతా సవ్యంగా సాగుతున్నట్లు మాత్రమే వుంటుంది. సహజంగా రెవిన్యూశాఖ, రిజిస్ట్రేషన్ శాఖల్లో అవినీతి గురించి మాట్లాడుతుంటారు. అక్కడ అవినీతి కనిపిస్తుంది. పైగా ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం సమకూరుతుంది. కాని ఇక్కడ అంతా అవినీతే నిండుతుంది. ప్రభుత్వాదాయానికి గండిపడుతుంది. అది కూడా పూడ్చలేనంత గండి తెచ్చిపెడుతుంది. అధికారులు ఆ శాఖకు పెట్టే చిల్లులు అన్నీ ఇన్నీ కావు. ఏకంగా పదుల సంఖ్యలో ఎక్కడిక్కడ అధికారులు, మిల్లర్లు కలసి దోచుకుంటారు. కోట్లు కూడబెట్టుకుంటారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఆదాయం చూపరు. పైగా ప్రభుత్వం నుంచే మళ్లీ, మళ్లీ డబ్బులు ఖర్చు చేయిస్తుంటారు. ఇలా ఏటా ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఆ సొమ్మును సివిల్ సప్లయ్‌శాఖతోపాటు, మిల్లర్లు పక్కదారి పట్టిస్తుంటారు. రైతులకు చెందాల్సిన సొమ్మును నొక్కేస్తుంటారు. ప్రభుత్వంతో అనవసరమైన ఖర్చులు చేయిస్తుంటారు. గోనె సంచులు ( గన్నీ బ్యాగులు) కొనుగోలు నుంచి మొదలు అన్నింట్లోనూ అవినీతే జరుగుతుంది. అవసరం లేకున్నా బ్యాగులను కొనుగోలు చేస్తుంటారు. పదే పదే రైతులు చేత బ్యాగులు లేవని అనిపిస్తారు. రైతులకు బ్యాగులు అందుబాటులో లేకుండాపోవడం సమస్యగా మార్చి, కొనుగోలు చేస్తారు. వడ్ల రవాణాలో కూడా అంచనాలకు మించి ఖర్చు చేస్తారు. రైతులకు రూపాయి చెల్లించకుండా మొత్తం మిల్లర్లు, అదికారులు కలిసి మింగేస్తారు. కాని ఇది ఎక్కడా కనిపించదు. కాని దాని వెనుక వందల కోట్ల అవినీతి జరగుతుంది. వడ్ల కేటాయింపుల్లో కూడా చెప్పలేనంత అవినీతి దాగి వుంటుంది. ఏ మిల్లుకు ఎంత వడ్లు పెడుతున్నారన్న సంగతి అదికారులకు తప్ప ఎవరికీ తెలియదు. రసీదుల్లో కనిపించే లెక్కలకు , వడ్ల కేటాయింపులకు పొంతనే వుండదు. ఐకేపి సెంటర్లలో తూకాల మోసాలు ఎవరికీ అర్దం కావు. అదికారులు, మిల్లర్ల కనుసైగల్లోనే సాగుతుంటాయి. ఆఖరు వడ్ల కొనుగోలులో జరిగే అవినీతి ఎవరికీ కనిపించదు. ప్రభుత్వం దష్టికిపోదు. అదికారులు ఎవరికీ సమాధానం చెప్పరు. పైగా ఎవరూ వాటిని అంచనా వేయలేరు. బఫర్ గోడౌన్లకు కేటాయింపులు, రేషన్ షాపులకు కేటాయింపులు ఎలా ఎక్కడ చూసినా తూట్లే కనిపిస్తాయి. ఆఖరుకు ఎఫఆర్‌కే లోనే కాదు, రైతులకు చెల్లించే బోనస్‌లలో బోగస్ రసీదులు తయారు చేస్తారు. పొరుగు రాష్ట్రాల నుంచి రైతులు తెచ్చిన వడ్లను తెలంగాణ రైతుల పేరు మీద రాసి బోనస్‌లు కూడా అదికారులు, మిల్లర్లు పంచుకుంటున్నారని తెలుస్తోంది. ఇన్ని రకాల అవినీతి వ్యవహారాలు సాగుతున్నా ఆ శాఖ మీద అవినీతి నిరోధక శాఖ దష్టిపెట్టదు. అక్కడ నేరుగా ఎవరి పిర్యాదులు పెద్దగా అందవు. అందుకే ఆ శాఖ మీద ఎవరికీ అనుమానం రాదు. కాని కొండంత అవినీతి జరుగుతోంది. ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుతుంది. ఈ అవినీతి అధికారులు, మిల్లర్లు కలిసి పార్టునర్లుగా మరేంత దాకాచేరింది. మిల్లుల్లో కొంత మంది అదికారులు అనధికార పార్టునర్లుగా చెలామణి అవుతున్నారు. మిల్లు ఏర్పాటులో అధికారులది ఏ హస్తం వుండదు. కాని మిల్లుల్లో మాత్రం పార్టునర్ షిప్ సాగుతుంది. అదికారులు ఏ మిల్లుకు ఎన్ని వడ్లు కేటాయించాలో అనేదానికి ఎలాంటి దిశా నిర్ధేశం లేదు. నిబంధనలు అసలే లేవు. అందువల్ల అదికారులు తమకు నచ్చిన మిల్లులకు కావాల్సినంత వడ్లు కేటాయిస్తుంటారు. అంటే స్లీపింగ్ పార్టునర్లుగా వున్న మిల్లులకు శక్తికి మించి వడ్లు కేటాయిస్తుంటారు. వచ్చిన లాభంలో కూడా చెరి సంగం పంచుకుంటుంటారు. ఇలా తెలంగాణలోని అన్ని జిల్లాలోనూ ఇదే సాగుతోంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఎంతో మంది అదికారులు ఇలా మిల్లుల్లో పార్టునర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఆ మిల్లర్లకు, ఆ అదికారులకు తప్ప మూడో వ్యక్తికి తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. గత ఏడెనమిది సంవత్సరా కాలంగా సివిల్ సప్లై శాఖలో అదికారులకు పెద్దగా ట్రాన్స్‌ఫర్లు లేవు. ఒకటో, అరో తప్ప పదేళ్లుగా పాతుకుపోయిన అదికారులే అంతటా వున్నారు. వాళ్లు క్రమంగా మిల్లర్లతో కుమ్మక్కైపోతూ వస్తున్నారు. ఆఖరుకు మిల్లుల్లో స్లీపింగ్ పార్టునర్లు అవుతున్నారు. దాంతో స్వామి కార్యం, స్వకార్యం పూర్తి చేసుకుంటున్నారు. ఇటు జీతాలు, అటు లంచాలు, మిల్లుల నుంచి ఆదాయాలు సమకూర్చుకుంటున్నారు. డిటి స్దాయి నుంచి డిఎం స్దాయి వరకు వున్న అనేక మంది అదికారులు కోట్లకు పడగలెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిఎం. రేవంత్‌రెడ్డి ఎంతో ఉదారతతో రైతుల సంక్షేమం కోసం బోనస్ ప్రకటించారు. అందిస్తున్నారు. అయితే అసలు బోనస్ కన్నా, కొసరు బోనస్‌లు ఎక్కువౌతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు గండిపడుతున్నాయి. తెలంగాణలో పండే పంటకు, ప్రభుత్వం కొనుగోలు చేసే పంట లెక్కలకు పొంతన వుండడం లేదు. పైగా బోనస్‌లలో కూడా అసలు లెక్క తేలడం లేదు. పొరగు రాష్ట్రాలనుంచి వచ్చే వడ్లకు కూడా బోనస్‌లు రాసి, అధికారులు, మిలర్లు పంచుకుంటున్నారు. తెలంగాణ రైతుల పేరు మీద వడ్లు కొనుగోలు చేస్తున్నారు. దాంతో ప్రభుత్వం అంచనాకు మించి, బోనస్ నిధులు విడుదల చేయాల్సి వస్తోంది. అందుకే ఈ అవినీతి బాగోతాలను బైట పెట్టాలంటే అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగాల్సిన అవసరం వుంది. సివిల్ సప్లై శాఖ అదికారుల మీద నియంత్రణ ఎప్ప్పుడూ లేదు. నిఘా అసలే లేదు. రైతులు పిర్యాధులు చేసే పరిస్దితి లేదు. మిల్లర్లు, అదికారుల కలిసి పోవడం వల్ల ఎవరితోనూ ఎవరికి ఇబ్బందులు రావడం లేదు. మిల్లర్లు అవతవకలు జరిగేలా అదికారులే ప్రోత్సహిస్తున్నప్ప్పుడు సమస్యలు వచ్చే అవకాశం లేదు. ఉభయ కుశలోపరి అన్నట్లు మిల్లర్లు, అదికారులు కలిసి సాగుతున్నారు. అవినీతి బైటకు పొక్కకుండా చూసుకుంటున్నారు. కోట్లు వెనకేసుకుంటున్నారు. మిల్లర్లు తప్ప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిన కొంత మంది అదికారులు మిల్లర్లతో చేతులు కలిపారు. మిల్లర్ల సమస్యలు పరిష్కరించపోతే అదికారుల మీది తిరగబడేవారు. ఇప్ప్పుడు అదికారులు, మిల్లర్ల మధ్య సమస్యలకు తావే లేదు. దాంతో సివిల్ సప్లైలో ఏది బైటకు పొక్కదు. మిల్లర్లంటే వ్యాపారులు. అదికారులకు జీతాలు తప్ప మరో మార్గం వుండదు. కాని సివిల్ సప్లై అదికారులకు ఎలా కోట్లకు పడగలెత్తుతున్నారు. అంటే ఇన్ని రకాల అవినీతికి అదికారులు నేరుగా పాల్పడుతున్నారు. ప్రభుత్వానికే తెలియకుండా సొమ్మును దిగమింగుతున్నారు. అందువల్ల ఆదాయానికి మించి ఆస్దులున్న సివిల్ సప్లై శాఖ అదికారుల మీద ఏసిబి దష్టి సారించాలి. కోట్లు సంపాదిస్తున్న అధికారుల సొమ్మును జప్తు చేయాలి. సివిల్ సప్లైలో చిన్న చిన్న అదికారులు కూడా తిరుగుతున్న కార్లును చూస్తేనే అర్దమౌతుంది. ఒక్కసారి ఆ శాఖ మీద దష్టిపెడితే అవినీతి కొండలు, అనకొండలు, తిమింగళాలు బైటకొస్తాయి.

గోల్డెన్ అవర్‌ లో వెంటనే స్పందిస్తే ప్రాణాలను కాపాడొచ్చు

గోల్డెన్ అవర్‌ లో వెంటనే స్పందిస్తే ప్రాణాలను కాపాడొచ్చు

జైపూర్ ఎస్సై రాజశేఖర్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత,సీపీఆర్ విధానం రాహ్-వీర్ పథకం గురించి జైపూర్ ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ప్రమాదం జరిగిన వెంటనే సరైన సమయంలో స్పందిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని ఈ కార్యక్రమంలో వివరించారు.ఈ సందర్భంగా ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన తరువాత తొలి 60 నిమిషాలు అత్యంత కీలకమని తెలిపారు.ఈ సమయంలో గాయపడిన వ్యక్తికి తక్షణ వైద్య సహాయం అందితే ప్రాణాపాయం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు.రక్తస్రావాన్ని ఆపడం, శ్వాస సక్రమంగా ఉండేలా చూడడం వంటి ప్రాథమిక చర్యల ద్వారా ప్రాణాలను రక్షించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ప్రమాద బాధితులకు తక్షణ సహాయం చేసి ప్రాణాలను కాపాడిన వ్యక్తులను ప్రభుత్వం “రాహ్-వీర్”లుగా గుర్తించి ₹25,000 నగదు బహుమతితో సత్కరిస్తుందని తెలిపారు.ఈ పథకం ద్వారా ప్రజల్లో సేవాభావాన్ని పెంపొందించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ముందుకు రావడానికి ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు.అలాగే సీపీఆర్ చేసే విధానం గురించి వివరిస్తూ,గుండె లేదా శ్వాస ఆగిన సందర్భాల్లో సీపీఆర్ ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.ముందుగా బాధితుని స్పందన,శ్వాసను పరిశీలించి, ఛాతిపై సరైన స్థానంలో నిమిషానికి 100–120 కంప్రెషన్‌ల వేగంతో ఒత్తిడి ఇవ్వాలని సూచించారు.శిక్షణ పొందిన వారు మాత్రమే మౌత్-టు-మౌత్ పద్ధతిని అనుసరించాలన్నారు.ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్ సేవలకు సమాచారం ఇవ్వాలని, గాయపడిన వ్యక్తిని అవసరం లేకుండా కదలించకూడదని సూచించారు.రక్తస్రావం ఉంటే గట్టిగా కట్టు కట్టి నియంత్రించాలని చెప్పారు.ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని వివరించారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.

కోదాడ, నేటి ధాత్రి:

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ల జంట కార్యాచరణ సమితి (టి జి ఈ జె ఏ సి) కోదాడ యూనిట్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. శుక్రవారం కోదాడ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం ఎదుట టీఎన్జీవో అధ్యక్షుడు గడ్డం చిరంజీవి ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న 2వ పీఆర్సీ ని తక్షణమే అమలు చేయాలని, సిపిఎస్ స్కీమ్ ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే విడుదల చేసి ఉద్యోగులకు, పెన్షనర్లకు నగదు రహిత వైద్యం కోసం హెల్త్ కార్డులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల అధ్యక్ష,కార్యదర్శులు గడ్డం చిరంజీవి, తీగల నరేష్, రావెళ్ల సీతారామయ్య, వేనేపల్లి శ్రీనివాసరావు, బంధం వెంకటేశ్వర్లు, ఆర్సి రెడ్డి,రామ నరసయ్య, బడుగుల సైదులు, పాండురంగాచారి, అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

భూపాలపల్లి నేటిధాత్రి

 

విద్యుత్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 10 రోజులుగా టీవీఏఈ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరవధిక సమ్మె విజయవంతంగా కొనసాగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కార్మికుల ఐక్యత, క్రమశిక్షణ ప్రశంసనీయం.
జేఏసీ రాష్ట్ర నాయకులు, శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ని కలసి కార్మికుల 6 ప్రధాన డిమాండ్లను వివరించారు.
డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందిస్తూ, వెంటనే సమ్మెను విరమించి ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ తో చర్చలు జరపాలని సూచించారు. అదే సమయంలో సీఎండీ కూడా కార్మికులతో చర్చలు నిర్వహించాలని ఆదేశించారు. జేఏసీ నాయకులు సమ్మెను విరమించి సచివాలయంలో ట్రాన్స్కో సీఎండీ ని కలిశారు. సీఎండీ కార్మికుల సమస్యలను సమగ్రంగా పరిశీలించి, ఫైనాన్షియల్ భారంలేని అంశాలపై ఈరోజే స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా, ఎటువంటి అండర్‌టేకింగ్ లేకుండా కార్మికులు డ్యూటీలో చేరాలని డైరెక్టర్ హెచ్.ఆర్.డి సంబంధిత అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది.
కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ఆర్టిసన్, అన్‌మ్యాండ్ పీస్ రేట్ కార్మికులు వెంటనే డ్యూటీలో చేరాలని జేఏసీ విజ్ఞప్తి చేస్తోంది.
మనమందరం ఐక్యంగా, శాంతియుతంగా పోరాడి ఒక ముఖ్య దశకు చేరుకున్నాము. డిమాండ్లపై సానుకూల స్పందన రావడం ద్వారా కార్మికులకు పాక్షిక విజయం లభించింది.
ఎవరూ అధైర్యపడవద్దు. మన సమస్యలు న్యాయబద్ధమైనవే కావడంతో త్వరలోనే పూర్తి పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాము.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 22,000 మంది ఆర్టిసన్, అన్‌మ్యాండ్ మరియు పీస్ రేట్ కార్మికులందరికీ జేఏసీ తరఫున హృదయపూర్వక ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాము. చైర్మన్ నాగుల తిరుపతిరెడ్డి కన్వీనర్లు మోత్కూరి కోటి తిప్పారపు రాజు ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ యాళ్ల సురేందర్ ఒంటేరు మల్లయ్య అంకుషావలి తదితరులు పాల్గొన్నారు

error: Content is protected !!
Exit mobile version