ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేయాలి
అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
ధాన్యం కొనుగోళ్లపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ శరవేగంగా పూర్తి చేయాలని, అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, అన్ లోడింగ్ వేగవంతం చేయడం, గోదాంలలో నిల్వ చేయడం, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ పురోగతి, తదితర అంశాలపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పౌర సరఫరాలు, సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా, రవాణా, తదితర శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సోమవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల వారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న పరిస్థితులు, ధాన్యం నిల్వ సామర్థ్యం వివరాలను జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ చేయాలని, నిరంతరం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రైస్ మిల్లులకు టార్గెట్ ఇవ్వాలని ఆదేశించారు. వారం రోజుల్లోగా కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని సూచించారు.
రైస్ మిల్లులు, గోదాంలు, అపెరల్ పార్క్ లో హమాలీల సంఖ్యను పెంచి, అన్ లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. తుది దశలో ఉన్న కేంద్రాల్లో కొనుగోళ్లు మరింత వేగవంతం చేసి.. పూర్తి చేయాలని ఆదేశించారు.జిల్లాలో గన్నీ బ్యాగుల కొరత లేదని, కేంద్రాల వారీగా ఎన్ని గన్నీ బ్యాగులు అవసరం ఉన్నాయో ముందే తెలుసుకుని, సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించేందుకు సరిపడా వాహనాలను సమకూర్చాలని, ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు ఈ దిశగా వాహనాలు సమకూర్చేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
