ప్రభుత్వ పాఠశాల డయాస్ ను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి…

ప్రభుత్వ పాఠశాల డయాస్ ను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

మాజీ ఉపసర్పంచ్ రామగుండం రాజకుమార్

వీణవంక, నేటి ధాత్రి:

వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో సర్పంచ్ వ్యవహారంపై తీవ్ర వివాదం చెలరేగింది. గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ రాజకుమార్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు, జిల్లా కలెక్టర్ కి అధికారికంగా ఫిర్యాదు చేశారు.
వారి ఆరోపణల ప్రకారం గ్రామంలో సుమారు రూ.10 లక్షల విలువ కలిగిన ప్రభుత్వ పాఠశాలలో డయాస్ (వేదిక) ను ఎలాంటి అనుమతులు లేకుండా కూల్చివేయడం జరిగింది. ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన ఈ ఆస్తులను ధ్వంసం చేయడం పూర్తిగా ప్రజా నిధుల దుర్వినియోగానికి నిదర్శనమని బీఆర్‌ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కూల్చివేతలో
సంబంధిత అధికారుల నుండి ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం అనుమతి తీసుకోకుండా
గ్రామ సభ తీర్మానం లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు
ఈ చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, గ్రామ ప్రజల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని వారు తీవ్రంగా విమర్శించారు.
ఈ సందర్భంగా మాజీ ఉపసర్పంచ్ రాజకుమార్ మాట్లాడుతూ,
“ప్రజల డబ్బుతో నిర్మించిన ఆస్తులను అన్యాయంగా కూల్చివేయడం గ్రామ అభివృద్ధికి పెద్ద దెబ్బ బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే బీఆర్‌ఎస్ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం” అని హెచ్చరించారు.
కలెక్టర్ సమర్పించిన ఫిర్యాదులో బీఆర్‌ఎస్ నాయకులు
ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని
చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని
ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తులను పునరుద్ధరించాలని
గ్రామ పాలనలో పారదర్శకతను నిర్ధారించాలని
డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై గ్రామ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్య ప్రక్రియలను పక్కనబెట్టి తీసుకున్న నిర్ణయాలపై బీఆర్‌ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధమైందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఈదునూరి భూమయ్య, నల్లగాశ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ఆవాల అరుంధతి- గిరిబాబు,మేడుదుల రాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version