రామడుగు పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన సిపి గౌష్ ఆలం
రామడుగు నేటిధాత్రి:
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కరీంనగర్ జిల్లా రామడుగు పోలీస్ స్టేషన్ ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తనిఖీ చేశారు. ఈసందర్భంగా స్టేషన్ ఎస్పై రాజు కమిషనర్ కు పూల మొక్కను అందించి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ ఆఫ్ హానర్ ను స్వీకరించారు. ఈసందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహించిన పరేడ్, లాఠీ పరేడ్ ను పర్యవేక్షించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన కమిషనర్, కేసుల్లో స్వాధీనమైన వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో విధుల్లో ఉన్న సిబ్బందితో ముఖాముఖి చర్చలు జరిపారు. కేసుల నమోదు, సీసీటీఎన్ఎస్ 2.0, పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ-సమన్లు, టీఎస్ కాప్, హెస్ఆర్ఎంఎస్, ఈ-సాక్ష్య, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్ కేసుల దర్యాప్తు కోసం వినియోగించే టెక్ డాటం వంటి సాంకేతిక వ్యవస్థలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు కేటాయించిన ఫింగర్ ప్రింట్ డివైస్ వినియోగాన్ని బ్లూకోల్ట్స్ సిబ్బంది చేత పరిశీలించారు. అలాగే ఎఫ్ఎఆర్ ఇండెక్స్, పెండింగ్ కేసులపై సమీక్ష చేసి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రామడుగు మండలంలోని గ్రామాలను సెక్టార్లు, సబ్ సెక్టార్లుగా విభజించి గ్రామ పోలీసు అధికారులను నియమించాలని సూచించారు. కోత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు రికార్డు నిర్వహణ, కోర్టు డ్యూటీ, బీట్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, సమన్లు తదితర విధులపై పూర్తిస్థాయి అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. విధుల్లో నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరని స్పష్టం చేశారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, వారి కదలికలను నిరంతరం గమనిస్తూ తాజా సమాచారం సేకరించాల్సిన అవసరం ఉందని కమిషనర్ ఆదేశించారు. ఈకార్యక్రమంలో రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, రామడుగు ఎస్పై రాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.