డ్రాగన్ గర్జన ఈసారి విపత్తు వస్తోంది! నీల్ మళ్లీ వేట

డ్రాగన్ గర్జనఈసారి విపత్తు వస్తోంది!నీల్ మళ్లీ వేట

 

“నాలుగున్న‌ర నిమిషాల గ్లింప్స్ విడుద‌ల చేస్తామంటే… చాలామంది ఒక్క‌టే అనుకున్నారు.
‘ఇంత టైమ్‌లో ఏం చూపిస్తారు..? కథ చెబుతారా… లేక ఓపికను పరీక్షిస్తారా..?’
కానీ గ్లింప్స్ పూర్తయ్యేసరికి అందరికీ ఒక్కటే ఫీలింగ్ వచ్చింది… ‘ప్ర‌శాంత్ నీల్ మ‌ళ్లీ వేట మొద‌లుపెట్టాడు.’”

ఎన్టీఆర్ బ‌ర్త్‌డే కోసం రిలీజ్ చేసిన డ్రాగన్ గ్లింప్స్… ఇప్పుడు కేవలం యూట్యూబ్ వీడియో కాదు.
థియేటర్లలో త్వరలో పేలబోయే యుద్ధానికి వచ్చిన మొదటి హెచ్చరిక.
మొదటి ఫ్రేమ్ నుంచే ప్ర‌శాంత్ నీల్ ఓ విషయం క్లియర్ చేశాడు.
ఇది హీరో ఎంట్రీ వీడియో కాదు…
రక్తంతో నడిచే ఓ సామ్రాజ్యానికి ఇచ్చిన పరిచయం.
250 ఏళ్ల పరాయి పాలన… గోల్డెన్ ట్రయాంగిల్… ఆయుధాల సామ్రాజ్యం…
ఈ బ్యాక్‌డ్రాప్ వినిపించే కొద్దీ… స్క్రీన్ మీద కనిపించేది సినిమా కాదు… యుద్ధానికి సిద్ధమవుతున్న చీకటి ప్రపంచం.

మొదట్లో ఎన్టీఆర్ కనిపించడు… కానీ ఆయన రాక కోసం ప్రతి ఫ్రేమ్ ఎదురు చూస్తుంది.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గన్ సౌండ్స్, డార్క్ విజువల్స్… ఒక్కో షాట్‌కి ఒక్కో ప‌ల్స్ ఉంది.
అలా బిల్డప్ పీక్‌కు చేరుకున్న తర్వాత… ఎన్టీఆర్ వాయిస్ పడుతుంది.
“దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు… ట్రిగ్గర్ నొక్కగానే మర్చిపోవడం.”
ఒక్క డైలాగ్‌తోనే క్యారెక్టర్ మెంటాలిటీని పేల్చేశాడు నీల్.
అక్కడితో ఆగలేదు.
“నిద్రపోయేటప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ల మొహాలు రావు… మిగిలిన శత్రువుల మొహాలే కనిపిస్తాయి.”
ఈ ఒక్క లైన్‌తో… ఇది సాధారణ హీరో కాదని క్లియర్ చేశాడు.

కేజీఎఫ్‌లో రాఖీని ఎలా ఎలివేట్ చేశాడో… సలార్‌లో దేవాను ఎలా చూపించాడో… ఇప్పుడు అదే మ్యాజిక్‌ను ఎన్టీఆర్ మీద దింపేశాడు ప్ర‌శాంత్ నీల్.
ఇటీవల ఎన్టీఆర్ లుక్స్‌పై వచ్చిన ట్రోల్స్ అన్నీ… ఈ ఒక్క గ్లింప్స్‌తో మాయం అయ్యాయి.
సన్నబడిన లుక్ ఇక్కడ స్టైలిష్‌గా, క్రూరంగా, పాత్రకు పర్ఫెక్ట్‌గా కనిపించింది.

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్… గన్ సౌండ్స్… విజువల్స్… ప్రతి ఫ్రేమ్‌లోనూ నీల్ మార్క్ స్పష్టంగా కనిపించింది.
ముఖ్యంగా… ఒక్క సెకన్ కూడా బోర్ అనిపించకుండా నాలుగున్న‌ర నిమిషాలు కట్ చేయడం… అదే అసలు మ్యాజిక్.

అనిల్ కపూర్, బీజూ మీనన్, రుక్మిణి వసంత్, ఆశిష్ విద్యార్థి… ప్రతి క్యారెక్టర్‌కీ ఓ వెయిట్ కనిపించింది.
అంటే ఇది ఒక్క హీరో షో కాదు… భారీ కాన్వాస్‌పై ఆడే రక్తపు కథ అన్న క్లారిటీ ఇచ్చారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్క మాటే వినిపిస్తోంది…
“ఇది గ్లింప్స్ కాదు… థియేటర్ల మీద ముందే వేసిన దాడి.”
మొత్తానికి… ఎన్టీఆర్ అభిమానులకు ఇది కేవలం బర్త్‌డే గిఫ్ట్ కాదు… బాక్సాఫీస్ యుద్ధానికి ఇచ్చిన వార్ సైరన్.

ధాన్యం కొలుగోలు కేంద్రాల్లో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు…

ధాన్యం కొలుగోలు కేంద్రాల్లో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రైస్ మిల్లులను సీజ్ చేయడంతో పాటు పోలీస్ కేసులు నమోదు చేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హెచ్చరించారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్‌లతో కలిసి గణపురంలోని లక్ష్మి గణపతిరైస్ మిల్,భూపాలపల్లి మండలం గొర్లవేడులోని
వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం దిగుమతి జరుగుతున్నప్పటికీ రైతులకు ట్రక్ షీట్‌లు ఇవ్వకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంటా పూర్తయ్యిన వెంటనే రైతులకు ట్రక్ షీట్‌లు ఇవ్వాలని, ఆలస్యం ఎందుకు జరుగుతోందని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ట్రక్ షీట్‌లు ఇవ్వకుండా ధాన్యాన్ని మిల్లులకు తరలించడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలులో రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ముంచరాదని, ఇటువంటి చర్యల వల్ల జిల్లాకు చెడ్డ పేరు వస్తుందని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడితే ఎవరినీ వదిలిపెట్టమని, మిల్లులను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే విధంగా పనిచేస్తే పూర్తి సహకారం ఉంటుందని, కానీ అక్రమాలను సహించబోమని తెలిపారు.
గత ఎనిమిదేళ్లుగా జరుగుతున్న దోపిడీ పద్ధతులు ఇకపై కొనసాగకుండా తక్షణమే సరిచేసుకోవాలని సూచించారు. అన్ని కొనుగోలు కేంద్రాలలో రైతులకు ట్రక్ షీట్‌లు ఇవ్వడం తప్పనిసరి చేయాలని, దీనిపై జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు.
వర్షాలు వస్తే రైతులు ఇబ్బందులు పడతారని మిల్లర్లు హామలిని పెంచి దిగుమతి వేగవంతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్,జిల్లా పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమార్, డీఎం రాములు, సహకార అధికారి వాలియా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ ఇక కోలుకోదా? బండి అంటే భయమా?

బీజేపీ ఇక కోలుకోదా?
బండి అంటే భయమా?

 

“రాజకీయాల్లో కొన్ని దాడులు ప్రత్యర్థిని బలహీనపరచడానికి జరగవు…
ప్రత్యర్థి భవిష్యత్తులో తనకు ప్రమాదకరంగా మారవచ్చో అని తెలిసినప్పుడు కూడా జరుగుతాయి.
తెలంగాణలో బండి సంజయ్ చుట్టూ ఇప్పుడు కనిపిస్తున్న రాజకీయ కలకలం కూడా అలాంటిదే.
పైకి ఇది ఒక కేసుపై స్పందనలా కనిపించొచ్చు.
కానీ లోతుగా పరిశీలిస్తే… ఇది ఒక వ్యక్తిపై కోపం కంటే, అతను నిర్మించిన రాజకీయ ప్రభావంపై భయం ఎక్కువగా కనిపిస్తోంది.
ఎందుకంటే బీఆర్ఎస్‌కు ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నా… తెలంగాణలో తమ అసలు రాజకీయ స్థలాన్ని నెమ్మదిగా ఆక్రమించే అవకాశం బీజేపీకే ఎక్కువ.
అందులోనూ బండి సంజయ్ లాంటి దూకుడు నాయకత్వం మళ్లీ ముందుకు వస్తే…
బీజేపీ కేవలం ఓ పార్టీగా కాకుండా, బలమైన ప్రత్యామ్నాయంగా నిలబడే అవకాశం ఉందనే ఆందోళన గులాబీ శిబిరంలో కనిపిస్తోంది.
బండి సంజయ్ ప్రత్యేకత కూడా అక్కడే ఉంది.
తెలంగాణలో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ క్రమంగా బీజేపీ వైపు మళ్లుతోందనేది గత ఎన్నికల ఫలితాలు, క్షేత్రస్థాయి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు బండి సంజయ్ అనుసరించిన దూకుడు, హిందుత్వ సెంటిమెంట్ రాజకీయాలే ప్రధాన కారణమని కేసీఆర్, కేటీఆర్ బలంగా నమ్ముతున్నారు.
మళ్లీ బండి సంజయ్‌కు పగ్గాలు దక్కితే రాజకీయం మారిపోతుంది. బీసీ సెంటిమెంట్ తో పాటు అన్నీ కలసి వస్తాయి. గతంలో బీజేపీని ప్రజాదరణ వైపు నడిపించిన కీలక నేతను గనుక డిఫెన్స్‌లో పడేయగలిగితే, ఆ పార్టీ క్యాడర్ స్థైర్యం దెబ్బతింటుందని, తద్వారా జారిపోయిన తమ ఓటు బ్యాంక్‌ను తిరిగి దక్కించుకోవచ్చని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందని అనుకోవచ్చు.

ప్రత్యేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న దాడులు చూస్తే…
ఇది సహజ రాజకీయ విమర్శ కంటే, ప్రజల అవగాహనను ప్రభావితం చేసే దీర్ఘకాల నారేటివ్ యుద్ధంలా కనిపిస్తోంది.
ఒకే అంశాన్ని పదేపదే ముందుకు తెచ్చి…
ఒకే వ్యక్తిని నిరంతరం రక్షణాత్మక స్థితిలో నిలబెట్టడం ద్వారా అతని రాజకీయ దూకుడును తగ్గించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే రాజకీయాల్లో ఇలాంటి వ్యూహాలకు ఎప్పుడూ ఒక పరిమితి ఉంటుంది.
ఎందుకంటే ప్రజలు ఆరోపణలను మాత్రమే కాదు…
ఆ ఆరోపణల వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాన్ని కూడా గమనిస్తారు.
అతి తీవ్రంగా వ్యక్తిగత దాడులు జరిగితే…
అదే నాయకుడిపై సానుభూతిని పెంచే అవకాశమూ ఉంటుంది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే…
తెలంగాణ బీజేపీ ఇప్పుడు ఒక్క నాయకుడి చుట్టూ తిరిగే దశ దాటిపోయింది.
గ్రౌండ్ స్థాయిలో కేడర్ పెరిగింది.
సామాజిక వర్గాల్లో చొచ్చుకుపోయే ప్రయత్నం పెరిగింది.
కేంద్ర నాయకత్వ మద్దతు కూడా బలపడింది.
అంటే ఒక వ్యక్తిని బలహీనపరిచి మొత్తం పార్టీ ఎదుగుదలను ఆపేయొచ్చని భావించడం రాజకీయంగా ప్రమాదకరమైన అంచనా కావచ్చు.
చివరికి ఈ మొత్తం వ్యవహారం ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెబుతోంది.
బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీని తాత్కాలిక ప్రత్యర్థిగా చూస్తుండొచ్చు.
కానీ భవిష్యత్తులో తమ అసలు రాజకీయ పోటీ బీజేపీతోనే ఉంటుందని లోపలికి అంగీకరించినట్టే కనిపిస్తోంది.

తెలంగాణలో ఏపీ ఫార్ములా..?

తెలంగాణలో ఏపీ ఫార్ములా..?
చంద్రబాబు-పవన్ తో ఆపరేటర్?

 

ఏపీలో హిట్ అయిన కూటమి ఫార్ములాతో … తెలంగాణలో ల్యాండ్ అవుతుంది బీజేపీ. గోల్కొండపై జెండా కోసం… మాస్టర్ ప్లాన్ రెడీ చేసి నట్టు తెలుస్తోంది.

2023 ఎన్నికలకు ముందు తెలంగాణలో బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది.
నైజాం గడ్డపై అధికారమే టార్గెట్‌గా… గోల్కొండ కోటపై కమలం జెండా ఎగరవేయాలని పెద్ద స్కెచ్ వేసింది.
కానీ ఎన్నికల ముందు మారిపోయిన రాజకీయ సమీకరణాలు… కాంగ్రెస్ ఊహించని రైజ్… కమలనాథుల ప్లాన్‌కు బ్రేక్ వేశాయి.
అయినా బీజేపీ పూర్తిగా వెనక్కి పోలేదు.
గతంతో పోలిస్తే బలంగా నిలబడింది.
8 అసెంబ్లీ సీట్లు గెలిచింది.
దాదాపు 20 నియోజకవర్గాల్లో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది.
ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో కూడా 8 సీట్లు సాధించింది.
దీంతో… “సరైన స్ట్రాటజీ పడితే తెలంగాణలో అధికారమే అసాధ్యం కాదు” అన్న నమ్మకం బీజేపీ హైకమాండ్‌లో పెరిగిందట.
అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ ఫస్ట్ పొలిటికల్ టూర్ తెలంగాణ నుంచే స్టార్ట్ అయ్యిందన్న చర్చ ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది.
కానీ ఈ టూర్‌లో అసలు పొలిటికల్ హీట్ పెంచింది మరో అంశం.
ప్రధాని మోదీ… ఏపీ సీఎం చంద్రబాబు… డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ప్రత్యేకంగా భేటీ కావడం.
బయటకు ఇది సాధారణ సమావేశంలా కనిపించినా… లోపల మాత్రం తెలంగాణ రాజకీయాలపైనే కీలక చర్చ జరిగిందన్న టాక్ వినిపిస్తోంది.
ఎందుకంటే ఇప్పుడు బీజేపీ అసలు టార్గెట్ గ్రేటర్ హైదరాబాద్ అని చెబుతున్నారు.
హైదరాబాద్… మల్కాజ్‌గిరి… సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను కమలం పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుంటోందట.
డీలిమిటేషన్ జరిగితే గ్రేటర్ పరిధిలో అసెంబ్లీ సీట్లు 56 వరకు పెరిగే అవకాశం ఉండటంతో… ఇప్పటినుంచే అర్బన్ తెలంగాణపై ఫోకస్ పెంచిందని చెబుతున్నారు.
అందుకే ఏపీలో సూపర్ హిట్ అయిన బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేయాలన్న ఆలోచనలో మోదీ ఉన్నారన్న గుసగుసలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి.
ఎందుకంటే బీజేపీ లెక్కలు చాలా క్లియర్‌గా ఉన్నాయట.
తెలంగాణలో బీజేపీకి… టీడీపీ పాత క్యాడర్ కలిస్తే…
జనసేన యువత ఫాలోయింగ్ యాడ్ అయితే…
అర్బన్ ఓటింగ్ ప్యాటర్న్ పూర్తిగా మారిపోతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారట.
ముఖ్యంగా సెటిలర్ ఓటు బ్యాంక్‌పై ఈ కూటమి కన్నేసిందన్న చర్చ బలంగా నడుస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు… ఉమ్మడి రంగారెడ్డి… ఖమ్మం… నల్గొండ… మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆంధ్రా సెటిలర్ల ప్రభావం ఇప్పటికీ గట్టిగానే ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో ఈ ఓటు బ్యాంక్ ఎక్కువగా బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపింది.
కానీ తర్వాత రాజకీయ పరిస్థితులు మారడంతో కాంగ్రెస్ వైపు కూడా షిఫ్ట్ అయిన సంకేతాలు కనిపించాయి.
ఇప్పుడు అదే ఓటు బ్యాంక్‌ను తిరిగి తమ వైపు తిప్పుకోవడమే బీజేపీ అసలు గేమ్ ప్లాన్ అంటున్నారు.
చంద్రబాబుకు ఇప్పటికీ తెలంగాణలో… ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక సెక్షన్ క్యాడర్ ఉందని చెబుతుంటారు.
ఖమ్మం… నల్గొండ… మహబూబ్‌నగర్ జిల్లాల్లో కూడా టీడీపీ పాత నెట్‌వర్క్ పూర్తిగా మాయం కాలేదన్న అంచనాలు ఉన్నాయి.
అదే సమయంలో పవన్ కల్యాణ్‌కు తెలంగాణ యువతలో ఉన్న ఇమేజ్… జనసేన సోషల్ మీడియా స్ట్రెంగ్త్ కూడా కూటమికి అదనపు బలం అవుతుందని భావిస్తున్నారట.
ఇప్పటికే తెలంగాణలో జనసేన నిర్మాణంపై కూడా కసరత్తు మొదలైనట్లు సమాచారం.
అంటే… ఇది కేవలం ఒక పొత్తు చర్చ మాత్రమే కాదు…
2029 తెలంగాణ ఎన్నికల కోసం ముందుగానే గ్రౌండ్ రెడీ చేసే ఆపరేషన్‌గా కూడా రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా… యాంటీ ఇన్‌కంబెన్సీ మొదలయ్యేలోపు అర్బన్ ఓటును కన్‌సాలిడేట్ చేయాలని బీజేపీ భావిస్తోందట.
ఇక బీఆర్ఎస్ ఇంకా పూర్తిగా రికవర్ కాకపోవడం కూడా కమలనాథులకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.
అంటే… తెలంగాణలో రాబోయే అసలు పోరు ఇప్పుడు కొత్త మలుపు తిరగబోతుందా..?
ఏపీలో సక్సెస్ అయిన కూటమి ఫార్ములా… నైజాం గడ్డపై కూడా రిపీట్ అవుతుందా..?
లేక తెలంగాణ రాజకీయాల లెక్కలు… ఢిల్లీ వ్యూహాలనే తలకిందులు చేస్తాయా..?

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి

ఏఐఎఫ్ టి యు రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

పెట్రోల్, డీజిల్ డీజిల్ గ్యాస్ పెంచిన ధరలు తగ్గించాలని
ఏఐఎఫ్ టి యు రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరిచే విధంగా పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ ధరలను అమాంతం పెంచేయడం దుర్మార్గమన్నారు. పెట్రోలు, డీజిల్ రేట్లు పెరగడం వలన రవాణా చార్జీలు పెరిగి నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశానంటే ప్రమాదం ఉందన్నారు. రోజువారి ఖర్చులు పెరిగి సామాన్య ప్రజల బతుకు భారంగా మారి అర్ధాకలితో అలమట్టించే రోజులు పునరావృత్తం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు చాలీచాలని జీతాలతో బతుకుతున్న ప్రజలపై భారాలు మోపే ప్రభుత్వాలను గద్దె దింపితే తప్ప ప్రజల బతుకులు మారవన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి అధిక ధరలను నియంత్రించి ప్రజలపై భారాలు తగ్గించాలన్నారు. వారు డిమాండ్ చేశారు

రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత

రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత

మహారాష్ట్ర నుంచి తెలంగాణకు అక్రమ రవాణా

నలుగురిపై కేసు నమోదు – లారీతో పాటు 30.7 టన్నుల విత్తనాలు స్వాధీనం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించి మోసం చేసేందుకు యత్నిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను కోటపల్లి పోలీసులు బట్టబయలు చేశారు.సరైన అనుమతులు,బిల్లులు లేకుండా మహారాష్ట్ర నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న సుమారు 30,700 కిలోల (30.7 టన్నులు) వరి విత్తనాలను రాపన్‌పల్లి అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకున్నారు.వీటి విలువ సుమారు రూ.21,49,000 ఉంటుందని జైపూర్ ఏసీపీ తెలిపారు.మంగళవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోటపల్లి మండల వ్యవసాయ అధికారి (ఏఓ) సాయి కృష్ణ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు కోటపల్లి ఎస్సై ఆధ్వర్యంలో రాపన్‌పల్లి చెక్‌పోస్ట్ వద్ద విస్తృత తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా మహారాష్ట్రలోని సిరోంచా ప్రాంతం నుంచి తెలంగాణలోని మానకొండూర్ వైపు వెళ్తున్న TS-29 TB-6555 నంబర్ గల లారీని ఆపి తనిఖీ చేయగా,అందులో ఉన్న వరి విత్తనాలకు ప్రభుత్వ అనుమతులు,అధికారిక లేబుల్స్,ధృవీకరణ పత్రాలు (సర్టిఫికెట్లు),బిల్లులు లేవని గుర్తించారు.విత్తనాల ప్యాకింగ్ కూడా చట్టబద్ధంగా లేకపోవడంతో వాటిని సీడ్స్ యాక్ట్-1966 మరియు సీడ్ కంట్రోల్ ఆర్డర్-1983 నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నట్లు నిర్ధారించి సీజ్ చేసినట్లు తెలిపారు.విత్తనాల నాణ్యతను పరీక్షించేందుకు నమూనాలను హైదరాబాద్‌ లోని ప్రభుత్వ అనుమతి పొందిన డీఎన్‌ఏ ఎఫ్‌పీ & టీసీఎం ల్యాబ్‌కు పంపినట్లు ఏసీపీ వివరించారు.కేసు నమోదు చేసిన నలుగురు
ఈ ఘటనలో క్రింది నలుగురిపై కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు:కట్ల భద్రయ్య – లారీ డ్రైవర్
నిమ్మటి సతీష్ – సీడ్ ఆర్గనైజర్
జీఎన్‌వీ రామకృష్ణ – మేనేజింగ్ డైరెక్టర్,సోనం సీడ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్
పోలవేని రాజేష్ – లారీ యజమాని

రైతులారా మోసపోకండి: ఏసీపీ
లాభార్జనే ధ్యేయంగా నకిలీ, అనుమతులు లేని విత్తనాలను విక్రయించి రైతులను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవు. ఇలాంటి విత్తనాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు.కాబట్టి రైతులు కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్ల వద్ద నుంచే ధృవీకరించబడిన (సర్టిఫైడ్) విత్తనాలను కొనుగోలు చేసి తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి అని ఏసీపీ వెంకటేశ్వర్లు రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో చెన్నూర్ రూరల్ సీఐ ఆర్.కృష్ణ, కోటపల్లి ఎస్సై రాజశేఖర్, మండల వ్యవసాయ అధికారి సాయి కృష్ణ రెడ్డి ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలపై ఉక్కుపాదం

ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలపై ఉక్కుపాదం

ఎమ్మెల్యే సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ సంయుక్త తనిఖీలు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ సంయుక్తంగా రైస్ మిల్లులపై క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు.
గణపురం బుర్కాయలగూడెంలోని ఓ రైస్ మిల్లును వారు స్వయంగా సందర్శించి, ధాన్యం కొనుగోలు విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే సత్యనారాయణ రావు బాయిల్డ్ రైస్ మిల్లులు రైతుల నుంచి బస్తాకు 41 కేజీల చొప్పున మాత్రమే ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. తాలు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టి, తక్కువ బరువు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అదేవిధంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, నిబంధనలు ఉల్లంఘించే మిల్లులను వెంటనే సీజ్ చేసి, సంబంధిత యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. రైతుల సంక్షేమే ప్రభుత్వ ధ్యేయమని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ తనిఖీలలో అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

నిష్పక్షపాతంగా, పారదర్శకంగా అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ.

నిష్పక్షపాతంగా, పారదర్శకంగా అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ.

#అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు : జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

అక్రెడిటేషన్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా అక్రెడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల అక్రిడికేషన్ దరఖాస్తులను కమిటీ పరిశీలించింది. అర్హత కలిగిన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీతో పాటు పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ, మంగళవారం అక్రెడిటేషన్ మార్గదర్శకాలకు నూతనంగా విడుదలైన నూతన ప్రభుత్వ ఉత్తర్వుల లోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిలోని అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డు అందే విధంగా చూడాలని కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.
ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకమని, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎం.డి. రఫీక్, కమిటీ సభ్యులు ఎం.డి. షఫీ అహ్మద్, గడ్డం దేవేందర్, బి. పృథ్వీరాజ్, బండారి లక్ష్మణ్, ఎం.డి. అబ్దుల్ గఫార్, చుంచు రవి, కే. రాజేష్, వడ్లకొండ వీరయ్య, బి.అశోక్, జూనియర్ అసిస్టెంట్ కొత్తపల్లి శంకర్ పాల్గొన్నారు.

సరస్వతి నాది అంత్య పుష్కరాల ట్రాఫిక్ ఏర్పాట్లపై పరిశీలన

సరస్వతి నాది అంత్య పుష్కరాల ట్రాఫిక్ ఏర్పాట్లపై పరిశీలన

మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కాళేశ్వరం లో నిర్వహిస్తున్న సరస్వతి నది అంత్య పుష్కరాలు సందర్భంగా భక్తుల రాకపోకలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా డీసీపీ ఏ.భాస్కర్ క్షేత్రస్థాయిలో మంగళవారం పర్యటించారు.కాళేశ్వరం లో మే 21 వ తేదీ ఉదయం నుంచి 12 రోజుల పాటు జరగనున్న పుష్కరాల నేపథ్యంలో,డీసీపీ జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు,ఇతర పోలీస్ అధికారులతో కలిసి ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న ప్రాంతాలు, ప్రధాన రహదారులు, వంతెనలను పరిశీలించారు.ఈ సందర్భంగా రామగుండం, పెద్దపల్లి,ఆదిలాబాద్,నిర్మల్, ఆసిఫాబాద్,మంచిర్యాల జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి జైపూర్, భీమారం,చెన్నూర్ మార్గాల మీదుగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యలు,అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.పుష్కరాల సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్లు,కోటపల్లి ఎస్సై రాజశేఖర్,భీమారం ఎస్సై రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య…

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
మొగుళ్లపల్లి నేటి దాత్రి

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య బోధన తోపాటు కార్పొరేట్ సాయికి దీటుగా మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ప్రతి పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన అందిస్తున్నామన్నారు. IFP (ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ ) బోర్డు ఉపయోగిస్తూ విద్యార్థులకు పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తూ ప్రతి అంశాన్ని కల్లకు కట్టినట్లుగా బోధిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, దుస్తులు, పుస్తకాలు అందిస్తున్నామన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక దృఢత్వానికి విశాలమైన ఆటస్థలంలో వారి ఆసక్తికి తగ్గ అంశాలలో తర్ఫీదును అందిస్తున్నామన్నారు. బాలికలకు ఆత్మరక్షణకై కరాటే శిక్షణ, ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఎన్ ఎం ఎం ఎస్ స్కాలర్షిప్ పొందుటకు ప్రత్యేక తరగతులను, పదవ తరగతి విద్యార్థులకు ఉత్తమ మార్కులు సాధించుటకు ప్రత్యేక తరగతులను సైతం నిర్వహిస్తున్నట్లు వివరించారు. విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించుటకు ఎన్సిసి శిక్షణ ఇస్తున్నట్లు డిఈవో తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి విజయపాల్ రెడ్డి, కమ్యూనిటీ మొబిలైజర్ అధికారి సామల రమేష్, బీసీఈబీ అసిస్టెంట్ సెక్రటరీ కిషన్ రెడ్డి, స్థానిక సర్పంచి చాట్ల విజయ, ఉపాధ్యాయులు ప్రవీణ్, కుమారస్వామి, CRP లు రాజయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.

అక్రమంగా పశువులను తరలిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు

అక్రమంగా పశువులను తరలిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు

మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

అక్రమంగా పశువులను తరలిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ తెలిపారు.ఆయన మాట్లాడుతూ రాబోయే బక్రీద్ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేయడంలో భాగంగా అక్రమంగా పశువులను తరలించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాపన్‌పల్లి వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను డీసీపీ సందర్శించి,అక్కడ అమలులో ఉన్న భద్రతా చర్యలను పరిశీలించారు.విధుల్లో ఉన్న అధికారులు,సిబ్బందికి పలు సూచనలు,ఆదేశాలు జారీ చేశారు.డీసీపీ మాట్లాడుతూ ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో అక్రమ జంతు రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపడుతోందని తెలిపారు.జిల్లావ్యాప్తంగా చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని,ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పశువుల సంతలు,చెక్‌ పోస్టుల పనితీరుపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.జిల్లాలో ఎక్కడైనా చట్టవిరుద్ధంగా ఆవులు,దూడలను అక్రమంగా రవాణా చేయడం, వధించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి జరిగే జంతువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌ పోస్టుల వద్ద 24 గంటల నిఘా కొనసాగుతోందని తెలిపారు.చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా పశువులను తరలించే వారిపై ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అనుమానాస్పద కార్యకలాపాలు, పశువుల అక్రమ రవాణా గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.పండుగల సమయంలో పరస్పరం మతాలను గౌరవించుకుంటూ శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏసిపి వెంకటేశ్వర్లు,కోటపల్లి ఎస్సై రాజశేఖర్,భీమారం ఎస్సై రాజేందర్ తదితర అధికారులు పాల్గొన్నారు

ఎన్ని జన్మలెత్తినా అమ్మ రుణం తీర్చలేము

ఎన్ని జన్మలెత్తినా అమ్మ రుణం తీర్చలేము

అమ్మ ప్రేమను వెలకట్టలేము
మొగుళ్లపల్లి నేటి ధాత్రి

మొగుళ్ళపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వర్ధమాన గేయ రచయిత దాసారపు నరేష్ రచించిన పురిటి నొప్పులు పోస్టర్ ఆవిష్కరణ మండల తహసీల్దార్ జాలి సునీత గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ ఈ గేయాన్ని ఆలపించిన అంకుశాపూర్ గ్రామానికి చెందిన జీడి అనితను అభినందిస్తూ సామాజిక చైతన్య గీతాలు ఇంకా ఎన్నో పాడాలని, మంచి పేరు తెచ్చుకోవాలని అమ్మ ప్రేమను వెలకట్టలేమనీ, ఎన్ని జన్మలెత్తినా అమ్మ రుణం తీర్చలేమని, తన మనసు ఆకాశమనీ, కన్నతల్లి ప్రేమను మరువద్దని, జీవితాంతం అమ్మను కంటి రెప్పల కాపాడుకోవాలని ప్రతిరోజు అమ్మను ప్రేమించాలని మరియు పూజించాలని, పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు మంగళపెల్లి శ్రీనివాస్, ఏంఆర్పిఎస్ సీనియర్ నాయకులు నిమ్మల భద్రయ్య ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు,మంద సాంబయ్య,డీలర్ల జిల్లా కార్యదర్శి గంగాదార్ రాజు, ఏం ఆర్పిఎస్ మండల నాయకులు,జీడి సంపత్ ,గాయకులు పుల్ల ప్రతాప్ కార్యాలయ తదితరులు పాల్గొన్నారు

జిల్లా ఎస్పీ సునీతారెడ్డిని కలిసిన అదనపు ఎస్పీ రాజేష్ మీన…

జిల్లా ఎస్పీ సునీతారెడ్డిని కలిసిన అదనపు ఎస్పీ రాజేష్ మీన

ప్రజా సేవలో పోలీస్ శాఖ జిల్లా ఎస్పీ

వనపర్తి నేటీదాత్రి,

 

వనపర్తి జిల్లా నూతన అదనపు ఎస్పీ బాధ్యతలు తీసుకున్న రాజేష్ మీన వనపర్తి జిల్లా ఎస్పీ సునీతరెడ్డని మర్యాద పూర్వకంగా కలిశారు అదనపు ఎస్పీ రాజేష్ మీన మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ని కలిసి పూల మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.వనపర్తి జిల్లాలో యువ ఐ పీ ఎస్ అధికారిగా అదనపు ఎస్పీ రాజేష్ మీన బాధ్యతలు చేపట్టడం పట్ల అభినందించారు ప్రజాసేవ పట్ల జిల్లా పోలీసు శాఖకు మరింత బలాన్ని చేకూరుస్తారని ఎస్పీ ఆశాభావం వ్యక్తం చేశారు.

అక్రమ గుడుంబా స్థావరలపై ఎక్సైజ్ శాఖ,పోలీస్ ల మెరుపు దాడులు..

అక్రమ గుడుంబా స్థావరలపై ఎక్సైజ్ శాఖ,పోలీస్ ల మెరుపు దాడులు

ధ్వంసం చేసి 2500 లీటర్ల గుడుంబా పానకం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అక్రమ గుడుంబా తయారీ కేంద్రంపై పోలీసులు,ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా మంగళవారం ప్రత్యేక దాడులు నిర్వహించారు.చెన్నూర్ పరిధిలో నీల్వాయి ఎస్సై ఆధ్వర్యంలో, చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ సమక్షంలో చెన్నూర్,బెల్లంపల్లి ఎక్సైజ్ అధికారులతో కలిసి బుయ్యారం గ్రామంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.గ్రామ పరిసర ప్రాంతాల్లో గుర్తించిన 30 గుడుంబా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి,సుమారుగా 2500 లీటర్ల పులియపెట్టిన బెల్లం పానకం ను 25 డ్రమ్ములను స్వాధీనం చేసుకొని సంఘటన స్థలంలోనే బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.అనంతరం అధికారులు గ్రామస్తులతో సమావేశమై అక్రమంగా గుడుంబా తయారీ,విక్రయం చేయడం చట్టరీత్యా నేరమని అవగాహన కల్పించారు.గుడుంబా తయారీ లేదా విక్రయంలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ప్రజలు అక్రమ మద్యం తయారీ వినియోగానికి దూరంగా ఉండాలని,గ్రామాలలో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని అధికారులు సూచించారు.ఈ ప్రత్యేక డ్రైవ్ లో పోలీస్,ఎక్సైజ్ శాఖలకు చెందిన సుమారు 40 మంది అధికారులు,సిబ్బంది

సేవాలాల్ మహారాజ్ పండుగ ప్రారంభోత్సవం

సేవాలాల్ మహారాజ్ పండుగ ప్రారంభోత్సవం

భక్తి శ్రద్ధలతో పాల్గొన్న టి సి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, సర్పంచ్

#నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని ఉమ్మడి గొట్లకొండ గ్రామంలో సంత్ సేవాలాల్ మహారాజ్ పండుగ ప్రారంభోత్సవం, దేవాలయ ప్రారంభ కార్యక్రమం భక్తి భావంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు, గ్రామ సర్పంచ్ భుక్యా జనార్ధన్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ, “ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, గ్రామం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు. గ్రామ ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో సేవాలాల్ మహారాజ్‌ను ప్రార్థించారు.

పుచ్చలపల్లి సుందరయ్యకు ఘనమైన నివాళి…

పుచ్చలపల్లి సుందరయ్యకు ఘనమైన నివాళి

సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు

సిపిఎం పార్టీ నిర్మత పుచ్చల పల్లి సుందరయ్య 41వ వర్ధంతి నీ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య కాలనీలో నిర్వహించారు .
ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు మాట్లాడుతూ , కార్మికులను ,పేదలను దోపిడీకి గురిచేస్తున్న పెట్టుబడి దారి వ్యవస్థను కూల్చీ సోషలిజం స్థాపించడమే సుందరయ్య కీ ఘనమైన నివాళి అని అన్నారు . భారత దేశంలో సంపద కొంతమంది దగ్గర పోగుబడుతున్నది 90శాతం మంది పేదలుగా నిరుపేదలుగా జీవనం కొనసాగిస్తున్నారు . నిరుద్యోగ సైన్యం పెంచి పోషించే వ్యవస్థ పెట్టుబడి దారి వ్యవస్థ అన్నారు . మహిళాలను ఆటబొమ్మలుగా చూయించేది ,అత్యాచారాలు జరగడం సహజమే అనే ధోరణి ఈ వ్యవస్థలో ఉన్నదన్నారు . కులం ,మతం పేరుతో సమాజాన్ని నిలువున చీల్చింది పెట్టుబడి దారి వ్యవస్థ అని మండి పడ్డారు . పెట్రోల్ ,డీజిల్ ,ఆదాచేయండి ,బంగారం కొనుగోలు చేయకండి అంటూ స్వయానా ప్రధాని ప్రచారం చేయడం వెనుక దాగివున్న ఉన్న అసలు రహస్యం సంక్షోభమే అన్నారు .పెట్టుబడి దారి వ్యవస్థ ఆర్థిక అసమానతలు ,సామజిక ,రాజకీయ అసమానతలు పెంచి పోషించే దుర్మార్గపు వ్యవస్థ అన్నారు . ఈ వ్యవస్థ మార్పుకోసం నేటి యువత ,కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలనీ ఆయన పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గడప శేఖర్,, నాయకులు సిహెచ్ రవికుమార్, మేకల మహేందర్, మునుకుంట్ల రాజేందర్, జ్ఞానేశ్వరి, వసంత లక్ష్మి, గట్టు శంకర్, గడ్డం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు .

శ్రీరాంపూర్ లో గంజాయి నివారణపై ప్రత్యేక తనిఖీలు…

శ్రీరాంపూర్ లో గంజాయి నివారణపై ప్రత్యేక తనిఖీలు

శ్రీరాంపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో గంజాయి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా,రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సీఐ ఆకుల అశోక్ ఆధ్వర్యంలో నార్కోటిక్ డాగ్ సహాయంతో మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలు శ్రీరాంపూర్ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లోని దుకాణాలు,పాన్ షాపులు,వైన్ షాపులు,ఖాళీ స్థలాలు,ప్లే గ్రౌండ్స్‌తో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో చేపట్టారు.గంజాయి అక్రమ రవాణా,వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

 భారతదేశపు ప్రముఖ డిటిహెచ్ సేవల సంస్థ ‘డిష్ టీవీ ఇండియా లిమిటెడ్’ దక్షిణ భారత వినియోగదారుల కోసం సరికొత్త,

 భారతదేశపు ప్రముఖ డిటిహెచ్ సేవల సంస్థ ‘డిష్ టీవీ ఇండియా లిమిటెడ్’ దక్షిణ భారత వినియోగదారుల కోసం సరికొత్త,

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

ఆకర్షణీయమైన ప్రాంతీయ ఆఫర్లను ప్రకటించింది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా, అత్యంత అందుబాటు ధరలో అంతరాయం లేని వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ప్యాకేజీలను రూపొందించినట్లు సంస్థ పేర్కొంది.
​రూ.149లకే 225కు పైగా ఛానళ్లు:
ఈ కొత్త ఆఫర్‌లో భాగంగా నెలకు కేవలం రూ.149 ప్రారంభ ధరతోనే వినోదం, సినిమాలు, వార్తలు మరియు క్రీడల సమాహారంగా బేస్ ప్యాక్‌ను అందిస్తున్నారు. ఇందులో మొత్తం 225కి పైగా ఛానళ్లు ఉంటాయి. ప్రాంతీయ భాషా ప్రేక్షకులకు పెద్దపీట వేస్తూ తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఒక్కో దానికి 30కి పైగా ఛానళ్లను, తమిళ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా 36కి పైగా ఛానళ్లను ఈ ప్యాకేజీలలో చేర్చారు. వినియోగదారులు తమకు నచ్చిన విధంగా ఈ ప్యాక్‌లను మార్చుకునే (కస్టమైజ్) సౌకర్యాన్ని కూడా కల్పించారు.
​మొదటిసారిగా ‘స్పోర్ట్స్ ఆల్వేస్-ఆన్’ ఫీచర్:
క్రీడాభిమానుల కోసం డిష్ టీవీ ప్రత్యేకంగా ‘స్పోర్ట్స్ ఆల్వేస్-ఆన్’ అనే సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని ద్వారా కస్టమర్ల రీచార్జ్ గడువు ముగిసినా లేదా తాత్కాలికంగా సేవలలో అంతరాయం ఏర్పడినా.. ముఖ్యమైన క్రీడా ప్రసారాలు నిలిచిపోకుండా నిరంతరాయంగా వీక్షించవచ్చు.
​ఈ సందర్భంగా డిష్ టీవీ ఇండియా లిమిటెడ్ సీఈఓ మనోజ్ దోభాల్ మాట్లాడుతూ, దక్షిణ భారతదేశం తమకు అత్యంత కీలకమైన మార్కెట్ అని, ఇక్కడి కుటుంబాల వీక్షణ అలవాట్లను దృష్టిలో ఉంచుకునే ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాకేజీలను తెచ్చామని తెలిపారు. నాణ్యమైన కంటెంట్‌ను, నిరంతరాయ సేవలను తక్కువ ధరలోనే అందించడం ద్వారా దక్షిణ భారత మార్కెట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనున్నట్లు చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ సుఖ్‌ప్రీత్ సింగ్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

28 న వనపర్తి మాజీ ఎమ్మెల్యే దివంగత సురవరం ప్రతాప్ రెడ్డి జియంతి వేడుకలు…

28 న వనపర్తి మాజీ ఎమ్మెల్యే దివంగత సురవరం ప్రతాప్ రెడ్డి జియంతి వేడుకలు
మాజీమంత్రి నిరంజన్ రెడ్డి అధ్యరములో
వనపర్తి నేటీదాత్రి .
 

 

వనపర్తి మొదటి ఎమ్మెల్యే దివంగత
సురవరం.ప్రతాప్ రెడ్డి జయంతి ఉత్సవాల మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని జిల్లా బీ ఆర్ ఎస్ మీడియా సెల్ ఇంచార్జీ నంది మల్ల అశోక్ ఒక ప్రకటన లో తెలిపారు మొట్టమొదటి వనపర్తి శాసనసభ్యులు సురవరం.ప్రతాప్ రెడ్డి గారి 130వ జయంతి ఉత్సవాలు ఘనంగా, నిర్వహించాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో సమావేశం నిర్వహించామని నందిమల్ల అశోక్ తెలిపారు సురవరం.ప్రతాప్ రెడ్డి జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథి దులుగా కవులు సాహితీవేత్తలు సాగునీటిరంగ నిపుణులు వి.ప్రకాష్ శ్రీధర్ రావు దేశ్ పాండే ప్రముఖ సాహితీవేత్త గన్నమరాజు.గిరిజా మనోహర్ బాబు పాల్గొంటారని ఆయన తెలిపారుఈ సమావేశములో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు రిటైర్డు ఉపాధ్యాయులు పలుస శంకర్ గౌడ్ సాహితీవేత్తలు వీరయ్య బలరామ్,నారాయణ రెడ్డి ,బైరోజు చంద్రశేఖర్ సీనియర్ జర్నలిస్టు మల్యాల బాలస్వామి సత్తార్ చంద్రశేఖర్,కిరణ్ జోహెబ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారని అశోక్ తెలిపారు

రైతు గాజుల వెంకటేశ్వర్లు కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

రైతు గాజుల వెంకటేశ్వర్లు కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

నెక్కొండ, నేటి ధాత్రి:

చెందిన రైతు గాజుల వెంకటేశ్వర్లు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో గుండెపోటుతో మృతి చెందిన ఘటన బాధాకరమని అఖిల భారత రైతు కూలీ సంఘం, తెలంగాణ రైతు సంఘం నాయకులు పేర్కొన్నారు. మృత రైతు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.
వెంకటేశ్వర్లు నాలుగు ఎకరాల్లో సాగు చేసి, వరి ధాన్యాన్ని ఐకేపీ కేంద్రానికి తరలించినప్పటికీ 15 రోజులుగా కొనుగోలు జరగక తీవ్ర మనోవేదనకు గురయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అకాల వర్షాలకు ధాన్యం తడుస్తుందనే ఆందోళనతోనే ఆయన గుండెపోటుకు గురై మృతి చెందారని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు.
కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచుల కొరత, లారీల ఆలస్యం, కాంటాల్లో అవినీతి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బీమా పథకానికి ఉన్న వయో పరిమితిని ఎత్తివేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు రాచర్ల బాలరాజు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్, ఓదెల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version