సరస్వతి నాది అంత్య పుష్కరాల ట్రాఫిక్ ఏర్పాట్లపై పరిశీలన
మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్
మంచిర్యాల,నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కాళేశ్వరం లో నిర్వహిస్తున్న సరస్వతి నది అంత్య పుష్కరాలు సందర్భంగా భక్తుల రాకపోకలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా డీసీపీ ఏ.భాస్కర్ క్షేత్రస్థాయిలో మంగళవారం పర్యటించారు.కాళేశ్వరం లో మే 21 వ తేదీ ఉదయం నుంచి 12 రోజుల పాటు జరగనున్న పుష్కరాల నేపథ్యంలో,డీసీపీ జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు,ఇతర పోలీస్ అధికారులతో కలిసి ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న ప్రాంతాలు, ప్రధాన రహదారులు, వంతెనలను పరిశీలించారు.ఈ సందర్భంగా రామగుండం, పెద్దపల్లి,ఆదిలాబాద్,నిర్మల్, ఆసిఫాబాద్,మంచిర్యాల జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి జైపూర్, భీమారం,చెన్నూర్ మార్గాల మీదుగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యలు,అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.పుష్కరాల సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్లు,కోటపల్లి ఎస్సై రాజశేఖర్,భీమారం ఎస్సై రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
