ధాన్యం కొలుగోలు కేంద్రాల్లో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రైస్ మిల్లులను సీజ్ చేయడంతో పాటు పోలీస్ కేసులు నమోదు చేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హెచ్చరించారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్లతో కలిసి గణపురంలోని లక్ష్మి గణపతిరైస్ మిల్,భూపాలపల్లి మండలం గొర్లవేడులోని
వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం దిగుమతి జరుగుతున్నప్పటికీ రైతులకు ట్రక్ షీట్లు ఇవ్వకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంటా పూర్తయ్యిన వెంటనే రైతులకు ట్రక్ షీట్లు ఇవ్వాలని, ఆలస్యం ఎందుకు జరుగుతోందని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ట్రక్ షీట్లు ఇవ్వకుండా ధాన్యాన్ని మిల్లులకు తరలించడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలులో రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ముంచరాదని, ఇటువంటి చర్యల వల్ల జిల్లాకు చెడ్డ పేరు వస్తుందని స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడితే ఎవరినీ వదిలిపెట్టమని, మిల్లులను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే విధంగా పనిచేస్తే పూర్తి సహకారం ఉంటుందని, కానీ అక్రమాలను సహించబోమని తెలిపారు.
గత ఎనిమిదేళ్లుగా జరుగుతున్న దోపిడీ పద్ధతులు ఇకపై కొనసాగకుండా తక్షణమే సరిచేసుకోవాలని సూచించారు. అన్ని కొనుగోలు కేంద్రాలలో రైతులకు ట్రక్ షీట్లు ఇవ్వడం తప్పనిసరి చేయాలని, దీనిపై జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు.
వర్షాలు వస్తే రైతులు ఇబ్బందులు పడతారని మిల్లర్లు హామలిని పెంచి దిగుమతి వేగవంతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్,జిల్లా పౌరసరఫరాల అధికారి కిరణ్ కుమార్, డీఎం రాములు, సహకార అధికారి వాలియా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
