ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
మొగుళ్లపల్లి నేటి దాత్రి
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య బోధన తోపాటు కార్పొరేట్ సాయికి దీటుగా మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ప్రతి పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన అందిస్తున్నామన్నారు. IFP (ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ ) బోర్డు ఉపయోగిస్తూ విద్యార్థులకు పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తూ ప్రతి అంశాన్ని కల్లకు కట్టినట్లుగా బోధిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, దుస్తులు, పుస్తకాలు అందిస్తున్నామన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక దృఢత్వానికి విశాలమైన ఆటస్థలంలో వారి ఆసక్తికి తగ్గ అంశాలలో తర్ఫీదును అందిస్తున్నామన్నారు. బాలికలకు ఆత్మరక్షణకై కరాటే శిక్షణ, ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఎన్ ఎం ఎం ఎస్ స్కాలర్షిప్ పొందుటకు ప్రత్యేక తరగతులను, పదవ తరగతి విద్యార్థులకు ఉత్తమ మార్కులు సాధించుటకు ప్రత్యేక తరగతులను సైతం నిర్వహిస్తున్నట్లు వివరించారు. విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించుటకు ఎన్సిసి శిక్షణ ఇస్తున్నట్లు డిఈవో తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి విజయపాల్ రెడ్డి, కమ్యూనిటీ మొబిలైజర్ అధికారి సామల రమేష్, బీసీఈబీ అసిస్టెంట్ సెక్రటరీ కిషన్ రెడ్డి, స్థానిక సర్పంచి చాట్ల విజయ, ఉపాధ్యాయులు ప్రవీణ్, కుమారస్వామి, CRP లు రాజయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.
