చరిత్ర సృష్టించనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..

చరిత్ర సృష్టించనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఎవరికీ సాధ్యంకాని రికార్డు..

 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఆమె వరుసగా తొమ్మిదవసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఓ అరుదైన రికార్డును సృష్టించబోతున్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఆమె వరుసగా తొమ్మిదవసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరూ ఈ బడ్జెట్ కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అస్థిర భౌగోళిక, రాజకీయ పరిస్థితుల మధ్య ఆర్థిక వృద్ధిని పెంచే లక్ష్యంతో సంస్కరణ చర్యలు బడ్జెట్‌లో ఉంటాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో నిర్మలా సీతారామన్ ఓ అరుదైన రికార్డును సృష్టించబోతున్నారు. ఒకే ప్రధానమంత్రి పదవీకాలంలో తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా సీతారామన్ చరిత్ర సృష్టించబోతున్నారు.

భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్‌ను బ్రిటీష్ పాలనలో ప్రవేశపెట్టారు. దీనిని ఆర్థిక మంత్రి జేమ్స్ విల్సన్ 1860 ఏప్రిల్ 7న చదివారు. స్వాతంత్ర్యం తర్వాత, భారతదేశపు తొలి ఆర్థిక మంత్రి ఆర్.కె. షణ్ముఖం చెట్టి 1947 నవంబర్ 26న తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ సొంతం చేసుకున్నారు. వేరు వేరు సమయాల్లో 10 బడ్జెట్‌లను దేశాయ్ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. 1959-1964లో ఆర్థిక మంత్రిగా దేశాయ్ మొత్తం 6 బడ్జెట్‌లను, 1967-1969 మధ్య 4 బడ్జెట్‌లను పార్లమెంట్ లో చదివారు.ఆ తర్వాత మాజీ ఆర్థిక మంత్రులు పి. చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ వేర్వేరు ప్రధానుల హయాంలో వరుసగా తొమ్మిది, ఎనిమిది సార్లు బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. అయితే నిర్మలా సీతారామన్ మాత్రం ఒకే ప్రధాని హయాంలో వరుసగా తొమ్మిది బడ్జెట్‌లను ప్రవేశపెట్టి, వరుసగా అత్యధిక బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన రికార్డును క్రియేట్ చేయనున్నారు. 2019లో ప్రధానమంత్రి మోదీ రెండవసారి గెలిచినప్పుడు, ఆమె భారతదేశపు మొట్టమొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. 2024లో మోదీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆమెను ఆర్థిక మంత్రిగా కొనసాగించారు. ఇప్పటివరకు, ఆమె ఫిబ్రవరి 2024లో తాత్కాలిక బడ్జెట్‌తో సహా మొత్తం ఎనిమిది వరుస బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు.

నిర్మలా సీతారామన్ 9వ బడ్జెట్.. దేశ చరిత్రలో రికార్డు: పాకా సత్యనారాయణ…

నిర్మలా సీతారామన్ 9వ బడ్జెట్.. దేశ చరిత్రలో రికార్డు: పాకా సత్యనారాయణ

 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో రికార్డు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఆమె అనుభవాన్ని, ఒకే ప్రభుత్వం పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో రికార్డు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ (BJP MP Paka Satyannarayana) వ్యాఖ్యానించారు. ఆమె అనుభవాన్ని, ఒకే ప్రభుత్వం పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ప్రజల ఆశలకు అనుగుణంగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ బడ్జెట్‌తో దేశ వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుందని వెల్లడించారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారని తెలిపారు.
ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉందని వివరించారు. 2014లో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ, నేడు నాల్గోస్థానానికి చేరుకోవడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదేళ్ల అద్భుత పరిపాలనకు నిదర్శనమని ఉద్ఘాటించారు. 2014లో రూ. 14.30 లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్, నేడు రూ. 50.40 లక్షల కోట్లకు చేరుకుందని చెప్పుకొచ్చారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడమే కాకుండా, ప్రపంచ యుద్ధాల ప్రభావం భారత్‌పై పడకుండా ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించిందని తెలిపారు. రష్యా నుంచి చమురు దిగుమతులు, యూరోపియన్ యూనియన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలు భారతదేశ పరపతిని పెంచాయని తెలిపారు.

భారత్ ఎదిగితే ప్రపంచం ఎదుగుతుందని యూరోపియన్ యూనియన్ అధ్యక్షులు చెప్పడం విశేషమని పేర్కొన్నారు. ఏపీ ప్రయోజనాల దృష్ట్యా ఈ బడ్జెట్‌లో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని తెలిపారు. పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా తీసుకోవడంతో పనులు వేగవంతం కానున్నాయని చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. అమరావతిని చట్టబద్ధమైన ఏకైక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్యాకేజీలు, నాబార్డ్ వంటి సంస్థల నుంచి ఆర్థిక సహాయం అందనుందని వెల్లడించారు.

ప్రపంచ ఆక్వా ఎగుమతుల్లో భారత్ వాటా 76 శాతం కాగా, అందులో 60శాతం కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతోందని వివరించారు. ఈ రంగానికి బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యత లభించిందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రి నారా లోకేశ్ ప్రయత్నాల వల్ల ప్రపంచ వాణిజ్య సంస్థలకు ఆంధ్రప్రదేశ్‌పై నమ్మకం పెరిగి, భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. మొత్తంగా, ఈ బడ్జెట్ అటు దేశ భద్రతకు, ఇటు వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.

విజయవాడలో బీజేపీ వారధి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పాకా సత్యనారాయణ హాజరై మాట్లాడారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం బీజేపీ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని వెల్లడించారు. ప్రజల సమస్యలను వివిధ ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లి, వాటికి త్వరితగతిన పరిష్కరించేలా ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు.

ప్రతి శుక్రవారం ఒక ప్రజా ప్రతినిధి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా నాలుగు ప్రాంతాల్లో ఈ ‘వారధి’ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలపారు. ప్రజలు తమకు ఉన్న ఇబ్బందులను, సమస్యలను ఈ వేదిక ద్వారా తెలియజేసి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం, ప్రజల మధ్య ఒక ‘వారధి’లా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పాకా సత్యనారాయణ పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version