సీఎం పర్యటనకు కోటంచలో పటిష్ట ఏర్పాట్లు

ఈనెల 8న సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు

కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

భూపాలపల్లి నేటిధాత్రి

ఈనెల 8న మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బుధవారం కోటంచలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సంకీర్త్ కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, పూజారులు సంప్రదాయ ఆలయ మర్యాదలతో వడివట్టం కట్టి ఘన స్వాగతం పలికారు.
భద్రత, ట్రాఫిక్, మౌలిక సదుపాయాలపై సమీక్ష
అనంతరం దేవాలయ పరిసరాల్లో సీఎం పర్యటనకు సంబంధించి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, పారిశుద్ధ్యం, త్రాగునీటి సదుపాయాలు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం పర్యటన సందర్భంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.

ప్రతి సెక్టార్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని తెలిపారు. దేవాలయాన్ని సుందరంగా అలంకరించాలని, పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి ముమ్మరంగా శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని, విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా అందించాలన్నారు.
ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ సీఎం పర్యటన దృష్ట్యా నాలుగు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సౌకర్యంగా దారి సూచించే సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
సీఎం పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ ఏర్పాటు స్థలాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ ముందుగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, విద్యుత్తు శాఖ ఎస్‌ఈ మల్చూర్ నాయక్, ఆర్ అండ్ బి ఈఈ రమేష్, ఆర్‌డబ్ల్యుఎస్ ఈ శ్వేత, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, ఆలయ ఈఓ మహేష్, తహసీల్దార్ శ్వేత, ఎంపిడిఓ వెంకటేశ్వర్లు, ఎంపిఓ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

 

బుధవారం రేగొండ మహాత్మా జ్యోతి భా పూలే బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన సామాజిక న్యాయ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతి బా పూలే చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాలు, మహిళలు, దివ్యాంగులు, వెనుకబడిన తరగతుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.
సామాజిక న్యాయం ద్వారా సమానత్వం, సమాన అవకాశాలు, గౌరవప్రదమైన జీవనం సాధ్యమవు తాయని తెలిపారు. ప్రతి పౌరుడు చట్టపరమైన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. వివక్షకు తావు లేకుండా సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అనంతరం సామాజిక న్యాయం పాటింపుపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేపించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ హరికృష్ణ, సహాయ బిసి సంక్షేమ అధికారి క్రాంతి కిరణ్, తహసీల్దార్ శ్వేతా, ఎంపిడిఓ వెంకటేశ్వర రావు, డిసిఓ స్వప్న, ప్రిన్సిపాల్ అపర్ణ, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి మున్సిపాలిటీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి…

భూపాలపల్లి మున్సిపాలిటీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను శనివారం ఐడీఓసి కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ నిర్వహించారు.
ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ, 30 వార్డులకు గాను ఎస్టీ – 2, ఎస్సి – 6, బిసి – 7, అన్ రిజర్వ్డ్ – 15 స్థానాలు కేటాయించినట్లు తెలిపారు.
అలాగే ఎస్టీ వార్డుల్లో 1 మహిళకు,
ఎస్సి వార్డుల్లో 3 మహిళలకు,
బిసి కేటాయించిన 7 స్థానాల్లో 3 మహిళలకు,
అన్ రిజర్వ్డ్ 15 స్థానాల్లో 8 మహిళలకు రిజర్వేషన్లు కేటాయించినట్లు వివరించారు.
రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వీడియో గ్రఫీ మధ్య లాటరీ పద్ధతిలో నిర్వహించామని, ఈ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా సాగిందని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

స్వామి వివేకానంద బోధనలు మార్గదర్శం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ…

స్వామి వివేకానంద బోధనలు మార్గదర్శం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

సోమవారం జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత లక్ష్యసాధనలో పట్టుదలతో ముందుకు సాగాలని, సమాజ సేవను తమ జీవిత లక్ష్యంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
వివేకానందుని ఆలోచనలు నేటి యువతకు దిశానిర్దేశకమని, విద్య, క్రీడలు, సేవా కార్యక్రమాల ద్వారా సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి,
యువజన సర్వీసులు క్రీడల శాఖ అధికారి రఘు, ఆర్డీఓ హరికృష్ణ, యువజన సర్వీసులు శాఖ సిబ్బంది సాగర్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version