ఓటు ‘పడిపోయింది’ కౌంట్‌ ‘డౌన్‌’ – పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పడిపోయింది

ఓటు ‘పడిపోయింది’

కౌంట్‌ ‘డౌన్‌’

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పడిపోయింది. మండుతున్న ఎండలు ఇతర కారణాలతో ఓటు వేయడానికి ఓటర్లు ఎవరు అంతగా ఆసక్తి చూపలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, సర్పంచ్‌ ఎన్నికలతో పోల్చితే ఓటింగ్‌ శాతం బాగానే పడిపోయింది. ఉదయం 8గంటలకు ఓటింగ్‌ ప్రారంభమైన దగ్గర నుంచి మధ్యాహ్నం వరకు కూడా కొన్ని పోలింగ్‌ కేంద్రాలలో ఓటర్లు కనిపించలేదు. దీంతో పోలింగ్‌ కేంద్రాలన్ని దాదాపు బోసిపోయి కనిపించాయి. మధ్యాహ్నం తరువాత కొద్దిగా పుంజుకున్నట్లు కనిపించిన ఆశించిన మేరకు పోలింగ్‌ శాతం నమోదు కాలేదు. నాయకులు సైతం అసెంబ్లీ ఎన్నికల మాదిరి ఓటర్లను చైతన్యం చేసి వాహనాల్లో తరలించేందుకుగాను, వాహనం సౌకర్యం కల్పించేందుకుగాను అంతగా ఆసక్తి కనబర్చలేదు. దీంతోపాటు గ్రామాల్లో ఓటు హక్కు కలిగి ఉండి చదువు, ఉద్యోగం నిమిత్తం నగరాల్లో ఉంటున్న వారు సైతం ఓటుహక్కు వినియోగించుకోవడానికి గ్రామాలకు రాలేదు. దీంతో కొన్ని గ్రామాల్లో ఉన్న ఓట్లలో 50శాతం కూడా నమోదు కాలేదు. కారణంగా మొత్తంగా పోలింగ్‌ శాతం 60దాటకుండా పోయింది.

ఆసక్తి చూపని హైదరాబాదీలు

ఓటు వేయడానికి భాగ్యనగరవాసులు ఈసారి అంతగా ఆసక్తి కనబర్చనట్లే కనపడుతుంది. తెలంగాణవ్యాప్తంగా చూసుకుంటే హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లోనే అత్యత్పంగా పోలింగ్‌ నమోదు అయ్యింది. హైదరాబాద్‌లో 39.49, సికింద్రాబాద్‌లో 39.20శాతం నమోదు అయ్యింది. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులు పార్లమెంట్‌ ఎన్నికలపై అంతగా ఆసక్తి చూపనట్లు కనపడుతోంది.

మెదక్‌లో అత్యధికం

పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణవ్యాప్తంగా శాతాలు పరిశీలిస్తే మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో 68.60శాతం పోలింగ్‌ అత్యధికంగా నమోదు అయ్యింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన మెదక్‌లో ఓటు వేయడానికి ఓటర్లు కాసింత ఆసక్తి చూపినట్లే కనపడింది.

నిజామాబాద్‌లో 54.20శాతం

తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న నిజామాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గంలో 54.20శాతం ఓటింగ్‌ నమోదు అయ్యింది. ఇక్కడ నుంచి కేసీఆర్‌ తనయ కవిత బరిలో నిలువగా రైతులు అత్యధిక సంఖ్యలో నామినేషన్‌ వేశారు. దీంతో ఈ స్థానంలో పోలింగ్‌ శాతంపై ఆసక్తి ఏర్పడింది.

నగదు పంపిణీ కారణమేనా…?

తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటుకు నగదు పంపిణీ చేయకపోవడం పోలింగ్‌ శాతం తగ్గడానికి కారణంగా కొంతమంది చెపుతున్నారు. అసెంబ్లీ, సర్పంచ్‌ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహం అధికంగా ఉండగా ఈ ఎన్నికల్లో ఈ ప్రవాహం అధికంగా లేకపోవడంతో కొంతమంది ఓటర్లు ఓట్లు వేయడానికి నిరాసక్తత ప్రదర్శించారని కొందరు అంటున్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఓటుకు వంద ఇవ్వడంతో ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది.

తెలంగాణవ్యాప్తంగా పోలింగ్‌ శాతం వివరాలు

తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 17 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. సాయంత్రం 5గంటల సమయానికి అత్యధికంగా మెదక్‌, కరీంనగర్‌లో పోలింగ్‌ శాతం నమోదు కాగా.. హైదరాబాద్‌ జంట నగరాల్లో అత్పల్పంగా పోలింగ్‌ నమోదైంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్‌ శాతాలను పరిశీలిస్తే..

హైదరాబాద్‌ 39.49

మల్కాజ్‌గిరి 42.75

మెదక్‌ 68

మహబూబ్‌నగర్‌ 65

నాగర్‌కర్నూల్‌ 57.12

పెద్దపల్లి 59.24

సికింద్రాబాద్‌ 39.20

వరంగల్‌ 59.17

నల్గొండ 66.11

ఆదిలాబాద్‌ 66.76

ఖమ్మం 67.96

కరీంనగర్‌ 68

చేవెళ్ల 53.08

భువనగిరి 68.25

మహబూబాబాద్‌ 59.90

నిజామాబాద్‌ 54.20

 

‘కమలం’ కష్టాల్లో పడింది – పార్టీ క్యాడర్‌లో సమన్వయం లేకపోవడమేనా…?

‘కమలం’ కష్టాల్లో పడింది

– పార్టీ క్యాడర్‌లో సమన్వయం లేకపోవడమేనా…?

– శాసనసభ ఎన్నికల్లో అదే పరిస్థితి…

నర్సంపేట, నేటిధాత్రి : కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి గ్రామస్థాయి నుండి డివిజన్‌ స్థాయి వరకు సంక్షేమ ఫలాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఎన్నికల సమయానికి వచ్చేసరికి పార్టీ ఉన్నప్పటికీ ఓటింగ్‌ శాతం పూర్తిస్థాయిలో తగ్గిపోవడంతో పార్టీ క్యాడర్‌లో సమన్వయం లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని పలువురు విమర్శించుకుంటున్నారు. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి జాటోతు హుస్సేన్‌నాయక్‌ బరిలో ఉండగా, నర్సంపేట నియోజకవర్గం నుండి మెజార్టీ ఓట్లు వస్తాయని భావించినట్లు సమాచారం. కానీ గత శాసనసభ ఎన్నికల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి నర్సంపేట నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా పోటీ చేయగా ఆయనకు 1476ఓట్లు (0.78శాతం) మాత్రమే నమోదయ్యాయి. నియోజకవర్గంలో ఓటింగ్‌ శాతంలో టిఆర్‌ఎస్‌ పార్టీ మొదటిస్థానంలో, కాంగ్రెస్‌ పార్టీ రెండవస్థానంలో, స్వతంత్ర అభ్యర్థి మూడవస్థానంలో ఉండగా, ఎడ్ల అశోక్‌రెడ్డికి నాల్గవ స్థానం లభించింది. దీనికి కారణం అభ్యర్థి ఎడ్ల అశోక్‌రెడ్డి నియోజకవర్గంలోని పార్టీ నాయకులను కలుపుకోకపోవడమే కారణమని పలువురు నాయకులు చర్చించుకున్నారు.

ఎన్నికలకు ముందు నర్సంపేట పట్టణంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించగా 1500మంది కార్యకర్తలు హాజరైనట్లు నాయకులు తెలపగా ఓటింగ్‌ శాతం మాత్రం ఎందుకు తగ్గిందని నాయకులు, కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకులు చర్చించుకున్నారు. ఈనెల 11వ తేదీన జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో గతంలో కంటే ఓటింగ్‌శాతం పెరిగేనా అని పలువురు విమర్శించుకుంటున్నారు. ఇప్పటికే కొందరు నాయకులు పట్టిపట్టనట్లుగా ఉంటున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంటుందా అని పలువురు చర్చించుకుంటున్నారు. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి హుస్సేన్‌నాయక్‌ ఓటింగ్‌ శాతం పెంచడానికి చేసిన ప్రయత్నాలు ఫలించేనా అని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు.

 

ప్రజలందరూ టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో ఉన్నారు : నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ..

“ప్రజలందరూ టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో ఉన్నారు” నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ..

నర్సంపేటకు పెద్ద బిడ్డగా ఉంటా ..

ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత.

నర్సంపేటలో భారీగా ర్యాలీ రోడ్‌ షో

వేలాదిగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు

నర్సంపేట, నేటిధాత్రి : మహాబూబాబాద్‌ పార్లమెంటు టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెలుపు కోరుతూ నర్సంపేట నియోజకవర్గస్థాయిలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం భారీగా ర్యాలీ, రోడ్డు షో నిర్వహించారు. మహిళా కార్యకర్తలు, కార్యకర్తలు రోడ్డు షోలో పాల్గొని కోలాటాలు, డప్పుచప్పుళ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందఠంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పదహారు సీట్లు టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుస్తుందని దీంతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ దేశ రాజకీయాల్లో కీలకం కానున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో నాయకులకు ముందు సమన్వయం లేకపోవడం వలనే ప్రచారాలు కూడా చేసుకోలేక పోతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం బలవంతంగా సీటు కేటాయించాలని పత్రికల ప్రకటనలు బలరామ్‌నాయక్‌ చెసుకుంటున్నారని తెలిపారు. ప్రజలందరూ టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో ఉన్నారని, ఎన్నికల్లో మాలోతు కవిత గెలుపు ఖాయమని అన్నారు.ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పార్టీ గెలుపు కోసం కషి చేయాలని సూచించారు .

పార్లమెంట్‌ అభ్యర్థి మాలోతు కవిత మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గానికి పెద్ద బిడ్డగా ఉంటానని తెలిపారు. ఆడబిడ్డగా ఆదరించి ఓట్లు వేయాలని కోరారు .నర్సంపేట నియోజకవర్గ అభివద్ధి కోసం నర్సంపేట కషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మున్సిపాల్టీ చైర్మన్‌ నాగెల్లి వెంకటనారాయణ గౌడ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌, వైస్‌చైర్మన్‌ పొన్నం మొగిలి, టీఆర్‌ఎస్‌ ఎన్నారై ఫోరం అధికార ప్రతినిధి సానబోయిన రాజకుమార్‌, మనోహర రెడ్డి, సంజీవరెడ్డి, రాణా ప్రతాప్‌రెడ్డి, మునిగాల వెంకట్‌రెడి, గుంటి కిషన్‌, పుట్టపాక కుమారస్వామి, దార్ల రమాదేవి, ఆకుల శ్రీనివాస్‌, బానోతు సారంగపాణి, అజయ్‌ కుమార్‌, రాయిడి రవీందర్‌రెడ్డిలతోపాటు అన్ని మండలాల కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతిధులు పాల్గొన్నారు.

 

కబ్జాకోరు దార్కారిజం

కబ్జాకోరు దార్కారిజం

– ‘నేటిధాత్రి’ కార్యాలయంపై దాడికి రెక్కి

– కార్యాలయం మూసి ఉండడంతో స్థానికులను ఆరా తీసిన మోట దార్కారులు

– ఐదు ద్విచక్రవాహనాలపై వచ్చిన కబ్జాకోరు గుండా గ్యాంగ్‌

– ఎప్పుడు వస్తారు…? ఎప్పుడు వెళ్లారంటూ హమాలీ కార్మికుడిని ప్రశ్నించిన కబ్జాకోర్లు

– దాడికి సూత్రధారి ఎమ్మెల్యే తమ్ముడే…?

– గ్రేటర్‌లో కబ్జాలన్నింటికి తెరవెనుక అతగాడే…?

– త్వరలో ఆ వివరాలను వెల్లడిస్తాం…

వరంగల్‌ ప్రతినిధి, నేటిధాత్రి : గోపాలపురం ప్రాంతంలో ఓ సామాన్యుని భూమిని అన్యాయంగా కబ్జాచేసి పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిప్పుతూ, అదే స్థలంలో అక్రమంగా నిర్మాణం చేస్తున్న ఓ కబ్జాకోరు నేటిధాత్రి కార్యాలయంపై దాడి చేసేందుకు తన కబ్జాగ్యాంగ్‌ను ఉసిగొల్పాడు. బరితెగించి సామాన్యుని భూమిని కబ్జా చేయడమే కాకుండా ఆ నీచపు పనిని సామాన్యుడి తరపున ‘నేటిధాత్రి’ ప్రశ్నించినందుకు దాడి చేసుందుకు రెక్కి నిర్వహించారు. గురువారం రాత్రి 7.30గంటల ప్రాంతంలో ఐదు మోటారు సైకిళ్లపై మోటాదర్కార్లు నేటిధాత్రి కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో కార్యాలయం మూసిఉండడంతో పక్కనే ట్రాన్స్‌ఫోర్టులో పనిచేసే ఓ హమాలీ కార్మికుడిని ఎప్పుడు వస్తారు…; ఎప్పుడు వెళ్తారు…? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారట.

ఇంత ధైర్యం ఎక్కడిది

కాసేపు బిల్డర్‌నంటూ బిల్డప్‌ కాదు, కాదు పైనాన్సర్‌ను అంటూ బిల్డప్‌ ఇచ్చే హనుమంతరావు అనే వ్యక్తి ‘నేటిధాత్రి’ కార్యాలయానికి సైతం ఫోన్‌చేసి బెదిరింపులకు దిగాడు. ఆధారాలతో రమ్మని అనడంతో తగ్గిన సదరు బిల్డర్‌ అలియాస్‌ కబ్జాకోరు. గురువారం రాత్రి దాడి చేసేందుకు తెగించాడు. అయితే అతనికి ఇంత ధైర్యం ఎక్కడిది…? కబ్జా వెనకాల ఉండి అంతా నడిపిస్తూ గ్రేటర్‌ వరంగల్‌లో కబ్జా కథలన్నింటికి సూత్రధారి అయిన ఎమ్మెల్యే తమ్ముడి అండ చూసుకునే ఇలా చేస్తున్నట్లు తెలిసింది. వీరు కబ్జా చేసే దగ్గర బాధితులను బెదిరించేందుకు ఉపయోగించుకునే చిల్లర రౌడీమూకలను ‘నేటిధాత్రి’ కార్యాలయం పైకి ఎమ్మెల్యే తమ్ముడే పంపించినట్లు విశ్వసనీయ సమాచారం. కేవలం కబ్జాలు8 చేయడానికే ఈ గ్యాంగ్‌ను ఉపయోగించుకుంటూ బలవంతంగా బాధితులను బెదిరించి దాడులతో లొంగదీసుకుని భూములను కబ్జా చేసేందుకు ఈ ముఠాను ఎమ్మెల్యే తమ్ముడు పెంచి పోషిస్తున్నట్లు కొందరు తెలిపారు. ఈ గ్యాంగ్‌ గతంలో అనేకమందిని బెదిరించి దాడులకు దిగి భూములను కబ్జా చేశారని విశ్వసనీయ సమాచారం. బాధితులను బెదిరించినట్లే ‘నేటిధాత్రి’ని బెదిరించాలని చూశౄరు.

బెదిరింపులకు లొంగుతామా…?

జనం పొట్టగొట్టి, పాపాలు మూటగట్టుకుని సంపదను పోగేయాలనుకుంటున్న వారి బెదిరింపులకు ‘నేటిధాత్రి’ ఎప్పుడు లొంగదని గుర్తుంచుకోవాలని సామాన్యులను బెదిరించి భూములు కబ్జా పెట్టి అధికార బలాన్ని ఉపయోగించి కోట్లు కూడబెట్టి ప్రజాప్రతినిధిని అంటూ నిసిగ్గుగా చెప్పుకుంటూ తిరుగుతున్న గోముఖ వ్యాఘ్రాలకు ప్రజాస్వామ్యయుతంగా అక్షరాలతో గట్టి సమాధానమే చెప్తాం.

భుజాలు తడుముకుంటున్న గుమ్మడికాయ దొంగలు? కథనం వెలువడకముందే వెన్నులో వణుకు

భుజాలు తడుముకుంటున్న గుమ్మడికాయ దొంగలు

– వరుస కథనాలతో బెంబేలెత్తుతున్న కొందరు అక్రమ ఎర్నలిస్టులు

– ఇక నెక్ట్స్‌ తమ అవినీతి బయటపడుతుందంటూ సన్నిహితుల వద్ద వ్యాఖ్యలు

– తనపై వార్తకథనం వస్తే దాడికి సిద్దంగా ఉండాలంటూ తన ఉద్యోగులకు సూచించిన ఓ సీనియర్‌ ఎర్నలిస్టు…?

– అంతా తాను చూసుకుంటానని అభయహస్తం

– కథనం వెలువడకముందే వెన్నులో వణుకు

వరంగల్‌ ప్రతినిధి, నేటిధాత్రి : వరుస కథనాలతో కబ్జాయిస్టులు, అక్రమ ఎర్నలిస్టుల వెన్నులో వణుక పుట్టిస్తున్న ‘నేటిధాత్రి’ని బెదిరింపులతో లొంగదీసుకోవచ్చని భావిస్తున్నారు. కొంతమంది తెలివి తక్కువ పిరికి మనుషులు, అవినీతిపరుల కథనాలు అన్ని ప్రచురితం అవుతున్నాయి. ఇక తరువాయి తమపైన వార్త వస్తుందంటూ గుమ్మడి కాయ దొంగల్లా భుజాలు తడుముకుంటున్నారు. కొంతమంది జర్నలిస్టులు అలియాస్‌ ఎర్నలిస్టులు. జర్నలిజం ముసుగు కప్పుకుని తమ చుట్టూ ఉండే భజనపరులకు, అక్షరం ముక్కరాని వారికి గుర్తింపు కార్డులు, అక్రిడిటేషన్లు ఇప్పించి సెటిల్‌మెంట్లు, అక్రమ దందాలకు గ్రేటర్‌ నగరంతో మొదలుకుని వరంగల్‌ ఉమ్మడి జిల్లా మొత్తం తిప్పుతూ సామాన్యులను బెదిరిస్తున్న వీరి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయట. మీడియా పేరుతో కేవలం పోలీస్‌స్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాల్లో తిష్ట వేసి అవినీతి దందాలతో తమ బినామీల ద్వారా అక్రమార్జనకు పాల్పడుతూ సీనియర్‌ జర్నలిస్టులుగా చెప్పుకునే కొంతమంది యూనియన్ల పేరుతో మేథావుల్లా ఫోజులు కొట్టేవారు, తమపై ఎప్పుడు కథనం వెలువడుతుందా అని ఎదురు చూస్తున్నారట. అక్రమాలతో తమకు అసలే సంబంధం లేదని తాము ‘పత్తి ఇత్తులం’ అని చెప్పుకునే వీరు తమపై కథనం వస్తుందని ముందుగానే ఊహించుకోవడం అక్రమార్కులుగా వీరికి, వీరే గుర్తించుకున్నారని స్పష్టం అవుతుంది.

జర్నలిజం ముసుగులో వార్తలు రాయడం తప్ప అన్ని పనులు వెలగబెట్టే ఈ స్వయం ప్రకటిత మేథావుల వల్ల ఒక్క గ్రేటర్‌ నగరంలోనే మూడువందలకుపైగా చదువులేని వారు తమ పేరు తాము రాయలేని వారు, జర్నలిజంలో ఓనమాలు తెలియనివారు ప్రముఖ జర్నలిస్టులుగా ఫోజులు కొడుతున్నారట. వీరికి ఈ స్వయం ప్రకటిత మేథావులు తెరవెనుక సహకరిస్తూ అఇడిటేషన్లు సైతం ఇప్పించారంటే ఏ స్థాయిలో సహకరిస్తున్నారో అర్థం అవుతుంది. నోరు విప్పితే నీతులు, జర్నలిస్టుల అభివృద్ధి పోలీసు పరిచయాలు అంటూ సుద్దపూసలా నీతులు వల్లించే ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ ఐతే ఇడ్లీలు అమ్ముకునే వ్యక్తికి, అక్రమ బిడీ వ్యాపారం చేసే వ్యక్తికి, ప్లెక్సీ ప్రింటింగ్‌, ప్రెస్‌ నడుపుతున్న వ్యక్తులకు అక్రిడిటేషన్‌ ఇప్పించి రోజు సాయంత్రం కాగానే వారితో నగరంలోని ఓ బార్‌షాప్‌లో తాగి తందానలాడుతాడట. దురదృష్టం ఏంటంటే అరకొర తెలివితేటలు గల ఇతగాడు తానే ప్రముఖ జర్నలిస్టుగా ఫోజులు కొట్టడం, అధికారులు, రాజకీయ నాయకుల వద్ద నుంచి కావాల్సింది దండుకోవడం ఇతగాడికి అలవాటుగా మారిపోయిందట.

గ్రేటర్‌ వరంగల్‌లో పెట్రోల్‌బంక్‌లు మొదలుకుని బార్‌షాపులు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు వద్ద నుంచి నెలవారి మాముళ్లు దండుకునే ఇతగాడు మీరు ఎలాగైన వ్యాపారం చేస్కోండి నీను ఉన్నా అని అభయహస్తం అందించాడట. దీంతో నాణ్యత సరిగా లేకున్నా, కల్తీ జరిగినా వినియోగదారులు నిలదీస్తే, మిగతా జర్నలిస్టులు ఇదేంటని జనంపక్షాన ప్రశ్నించిన, ఈయన గారికే ఫోన్‌ వస్తుందట. సెటిల్‌మెంట్‌ జరిగిపోతుందట. ఓ సీనియర్‌ జర్నలిస్టుకు పెట్రోల్‌బంక్‌ మోసం విషయంలో ఇతగాడి నుంచి స్వీయ అనుభవం కలిగిందట. జర్నలిజం తప్ప, ఆ ముసుగులో అన్ని శాఖల బాధ్యతలు ఎలాంటి జంకు లేకుండా నిర్వహిస్తూ సెటిల్‌మెంట్‌ దందాల్లో ఆరితేరిన ఇతగాడిపై అధికారులు, ఏ మాత్రం చర్యలు తీసుకోరు. వీరి ఆగడాలు నగరంలో శృతిమించుతున్న ఇంటెలిజెన్స్‌ మొదలుకుని ఏ నిఘాసంస్థ అధికారులు వారి శాఖకు కనీసం విషయాన్ని కూడా చెప్పరు. కారణం ఇతగాడి జర్నలిజం ముసుగు.

గ్రేటర్‌లో ‘కార్పొరేటర్‌’ గిరి – కార్పొరేటర్లు ఆడింది ఆట…పాడింది పాట

గ్రేటర్‌లో ‘కార్పొరేటర్‌’ గిరి

– కార్పొరేటర్లు ఆడింది ఆట…పాడింది పాట

– అధికారులు సహకరిస్తే సరి…లేదంటే బదిలీలు…సరెండర్లు

– మున్సిపల్‌ కమిషనర్‌ను వదలని కార్పొరేటర్‌ గిరి

– భవన నిర్మాణంలో జోక్యం…అన్ని సరిగా ఉన్న అడిగింది ముట్టజెప్పాల్సిందే

– ఎవరి డివిజన్‌లో వారిదే రాజ్యం

– ఇబ్బందులు పడుతునన నగర ప్రజలు

వరంగల్‌ ప్రతినిధి, నేటిధాత్రి : గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో ప్రస్తుతం కార్పొరేటర్‌ గిరి నడుస్తోంది. గ్రేటర్‌ ఎన్నికల్లో గెలిచింది మొదలు డివిజన్‌లలో వారి ఇష్టారాజ్యం నడుస్తోంది. ఎన్నికల వేళ కాళ్లవేళ్ల పడి గెలిపించాలని అందరిని వేడుకున్న కార్పొరేటర్లు ఇప్పుడు ఓట్లేసిన జనాన్నే ముప్పుతిప్పలు పెడుతున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. కొందరు కార్పొరేటర్లు అయితే ఏకంగా తాము ఎన్నికల్లో ఖర్చుపెట్టామని ఇప్పుడు సంపాదించుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారట. ఓట మల్లన్న…బోడ మల్లన్న సామెతను బాగా ఒంట బట్టించుకున్న కొందరు కార్పొరేటర్లు డివిజన్‌లలో తమ రాజ్యాన్ని నడుపుతున్నారట. తమకు తెలియకుండా ఎంతమాత్రం అభివృద్ధి పనులు జరగరాదని, డివిజన్‌లో ఉన్న ప్రజలు సైతం నిర్మాణాలతో సహ ఎలాంటి పనులైన చేయరాదని అలా చేయాలంటే తమకు కావాల్సింది ముట్టజెప్పాల్సిందేనని తెల్చి చెపుతున్నారట. గతంలో ఎన్నడూ లేనంతంగా ప్రస్తుత కార్పొరేటర్లు డివిజన్‌ ప్రజలకు చుక్కలు చూపెడుతున్నారని, ఇంటి నిర్మాణం, గొడవలు, వ్యక్తిగత విషయాలు, ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ తదితర విషయాలలో తల దూర్చుతూ తాము చెప్పిందే వేదం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు గ్రేటర్‌ వరంగల్‌ వ్యాప్తంగా వినబడుతున్నాయి.

ప్రతి పనికో రేటు…?

డివిజన్‌లలో కార్పొరేటర్లు ప్రతి పనికో రేటు ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. జనన, మరణ ధృవీకరణ పత్రం మొదలుకుని ఇంటి నిర్మాణ అనుమతుల వరకు వీరి జోక్యం చేసుకుంటున్నట్లు తెలిసింది. ‘సచ్చినోడి పెండ్లికి వచ్చిందే కట్నం’ అన్న చందంగా ఉన్న వారు, లేని వారు అనే తారతమ్యాలు లేకుండా డివిజన్‌లో ప్రజలకు కార్పొరేటర్‌తో పని పడింది అంటే చాలు తమకు కావాల్సింది ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. దీంతో డివిజన్‌ ప్రజలు స్థానిక కార్పొరేటర్ల పేరు చెపితేనే వామ్మో…అంటున్నారు.

అధికార్లు సహకరిస్తే సరీ…!

‘కార్పొరేటర్‌ గిరి’తో డివిజన్‌లలో అధికారులకు వేధింపులు ఎక్కువైనట్లు తెలిసింది. ప్రధానంగా డివిజన్‌లలో ఇంటి నిర్మాణ పనుల అనుమతి విషయాలలో కార్పొరేటర్లు చేతివాటానికి అలవాటుపడ్డారట. డివిజన్‌లో ఎవరు నిర్మాణ పనులు మొదలుపెట్టిన పిల్లర్‌కు ఇంత అని నగదు ముట్టజెప్పాలట. నిబంధనల ప్రకారం అన్ని ఉన్న కార్పొరేటర్‌కు సమర్పించేది సమర్పించాలి లేదంటే భవన యజమాని, అధికారులపై కార్పొరేటర్లు కేకలు వేస్తారు. వాటా ముట్టజెప్పందే నిర్మాణాన్ని కొనసాగనిచ్చేది లేదని తెల్చి చెబుతారు. అన్ని సరిగ్గానే ఉన్నాయి. నిబంధనల ప్రకారమే అనుమతులు ఇచ్చామని అధికారులు చెప్పిన కార్పొరేటర్లు వినరు. ఏది ఏమైనా తమకు నగదు ముట్టజెప్పాల్సిందేనని నానా ఇబ్బందులకు గురిచేస్తారట. ఇటీవల హన్మకొండలోని ఓ డివిజన్‌లో ఓ కార్పొరేటర్‌ అధికారిపై ఇలాంటి ప్రతాపాన్నే చూపాడట. ఇంటి నిర్మాణం చేసుకుంటున్న వారి దగ్గర నుంచి అధికారే నగదు వసూలు చేసి అప్పగించాలని ఆదేశించాడట. ఆ అధికారి ససేమిరా అనడంతో ఏదో లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రభుత్వానికి ఆ అధికారిని సరెండర్‌ చేయాలని నిర్ణయించి, సమావేశంలో తీర్మాణం చేయించి పనికినిచ్చాడట.

ఆ అధికారితో సహా మొత్తం ఐదుగురు ఇటీవలే గ్రేటర్‌ పాలకమండలి సరెండర్‌ చేస్తూ తీర్మాణం చేసింది. అధికారులు తమకు సహకరిస్తే సరి లేదంటే బదిలీలు, సరెండర్‌లు కార్పొరేటర్లు అనుసరిస్తున్న అవినీతి విధానాలతో సక్రమంగా, నీతి, నిజాయితీతో విధులు నిర్వహిస్తున్న అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకుని భూకబ్జాలు, అక్రమ వసూలును అడ్డుకున్నందుకే ఐఎఎస్‌ అధికారి గౌతమ్‌ను కార్పొరేటర్లు, ఇతరులు కలసి బదిలీ చేయించినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. దీనికి తోడు కొంతమంది కార్పొరేటర్లు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది. డివిజన్‌లు వీరి రాజ్యం అయినట్లు, ప్రజలను దోచుకునేందుకు వీరికి ఎవరో లైసెన్స్‌ ఇచ్చినట్లు ఇష్టారీతిన వ్యవహారిస్తూ అటు అధికారులను, ఇటు డివిజన్‌ ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్న కార్పొరేటర్‌లకు రానున్న ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పి ప్రజలదే అంతిమ విజయం అని నిరూపిస్తామని కార్పొరేటర్‌గిరికి పులిస్టాప్‌ పెడతామని పలువురు ప్రజలు అంటున్నారు.

…………………………………..

లక్ష్యం చేరేందుకు మూకుమ్మడి ప్రణాలికలు

ఒక ‘లక్ష్య’ం ముగ్గురి భవితవ్యం

మంత్రి పదవే లక్ష్యంగా అరూరి

మరోమారు కుడా చైర్మన్‌ కొరకు మర్రి

అధినాయకత్వం భరోసా,సముచితస్థానం కొరకు మార్నేని

లక్ష్యం చేరేందుకు మూకుమ్మడి ప్రణాలికలు

వర్ధన్నపేట,నేటిధాత్రి: ఒక ఎన్నిక లక్ష్యం నెరవేర్చి అధినాయకత్వం దృష్టిని ఆకర్షించేందుకు ఆ ముగ్గురు ప్రస్తుతం జరుగుతన్న పార్లమెంట్‌ ఎన్నికల్లో శాయశక్తులా పని చేస్తున్నారు. నిర్ధేశిత లక్ష్యంను అధిగమించి తమ కార్యదక్షతను చూపెందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఒక ఎన్నిక ముగ్గురి భవిష్యత్తుగా మారమేంటి అనుకుంటున్నారా. అవును ఇది నూటికి నూరుపాళ్ళు నిజం.వారిలో ఒకరు రాష్ట్రంలో వరుసగా రెండోమారు శాససభ్యునిగా రెండవ అతిపెద్ద మెజారిటి సాధించిన అరూరి రమేష్‌, మరోకరు కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటి చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి మరియు ఉమ్మడి జిల్లా రైతుసంఘం అధ్యక్షుడు ,వర్ధన్నపేట ఎంపిపి మార్నేని రవిందర్‌రావు .అందరు ప్రస్తుతం పదవుల్లోనే ఉన్నారు. మరి ఇంకా వారి భవితవ్యం ఎంటనుకుంటున్నారా.ఉంది దాని కోరకు ప్రస్తుతం వర్ధన్నపేట శాసనసభ్యులు అరూరి రమేష్‌లు,వరంగల్‌ పార్లమెంట్‌ ఎన్నికల సంధర్భంగా నియోజకవర్గ ఇంచార్జీ భాద్యతలు నిర్వహిస్తున్న కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి,ఎంపిపి మార్నేని రవిందర్‌రావు పాటుపడుతున్నారు.

మంత్రి పదవే లక్ష్యంగా అరూరి రమేష్‌…

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రెండవమారు శాసనసభ్యునిగా ఉన్న అరూరి రమేష్‌ మంత్రివర్గంలో స్థానం కోరకు మంత్రివర్గ విస్తరణకు ముందు విశ్వప్రయత్నాలు చేశారు. స్థానిక ప్రజల్లో కూడా ఈ విషయమై విస్తరణకు ముందు మంత్రి పదవి ఖాయమనే చర్చ కూడా జరిగింది.వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్రంలో రెండవ అతిపెద్ద మెజారిటి సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌కు అధినాయకత్వానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేగాక గత ప్రభుత్వంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పని చేసిన కడియం శ్రీహరిని రాజకీయ గురువుగా అరూరి రమేష్‌ భావిస్తారు. కాబట్టి తనకు మంత్రి పదవి వచ్చితీరుతుందనే నమ్మకంతో ఉన్నాడు. జనవరిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈ మారు అత్యధిక మెజారిటితో విజయం ఇస్తే రానున్న ప్రభుత్వంలో వర్ధన్నపేట నియోజకవర్గం నుండి మంత్రి ఉంటాడనే అంశాన్ని కూడా ప్రచారంలో ప్రధానంగా చెప్పుకొచ్చారు. కాబట్టి ఎన్నికల అనంతరం జరగబోయే విస్తరణలో అవకాశం చేజారకుండా ఉండేందుకు గతంలో పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుండి పోటి చేసిన కడియం శ్రీహరి,పసునూరి దయాకర్‌ల కంటే అధికంగా మెజారిటి వచ్చే విధంగా చూడాలని తద్వారా అధిష్టానం దృష్టిని ఆకర్షించి అవకాశం పొందాలనే లక్ష్యంతో అరూరి రమేష్‌ ముందుకు వెళుతున్నారు.నిర్దేశిత లక్ష ఓట్ల మెజారిటి సాధించి శాసనసభ్యుని నుండి మంత్రిగా మారాలని ఆకాంక్షిస్తున్నారు.

మరోమారు ‘కూడా’ చేజిక్కించుకోవాలని…

ప్రస్తుతం కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటి చైర్మన్‌గా ఉన్న మర్రి యాదవరెడ్డి పదవి కాలం మరో 8 నెలల సమయంతో ముగిసిపోతుంది.ఈ నెపథ్యంలో తనను మరోమారు కుడా కు చేర్మన్‌గా బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. అందు కోరకే ఆయన కూడా ప్రస్తుత పార్టమెంట్‌ ఎన్నికల్లో అధిష్టానం అప్పగించిన ఇంచార్జీ బాధ్యతలను పూర్తిస్థాయిలో విజయవంతంగా నిర్వహించి తన విధేయతను నిరుపించేందుకు పాటుపడుతున్నారు. అయితే ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇంచార్జీ బాధ్యతలు తీసుకున్నప్పటికి అర్బన్‌తో సహా,రూరల్‌ ప్రాంతం కూడా వర్ధన్నపేట నియోజకవర్గంలో భాగమై ఉండడం స్థానిక పార్టీ శ్రేణులు,కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.అయినప్పటికి స్థానిక ఎమ్మెల్యే అరూరి,మర్రి మిత్రుడు అయిన స్థానిక ఎంపిపి మార్నేని రవిందర్‌రావులు కలుపుకుపోతూ వారి సహాయసహకారాలు అందిస్తున్నారు. ఎది ఎమైనా సాదించాల్పి లక్ష్యం చేరుకుని మరోమారు కుడా చైర్మన్‌గా కోనసాగాలన్నదే మర్రి యాదవరెడ్డి లక్ష్యంగా కనిపిస్తున్నది.

భవిష్యత్తుపై భరోసా కోరకు మార్నేని రవిందర్‌రావు…

గత రెండు ప్రభుత్వాల్లో పని చేసిన అమాత్యులతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి .ప్రస్తుత గ్రామీణ,ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శిష్యుడిగా,గత ప్రభుత్వంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పని చేసిన కడియం శ్రీహరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న వరంగల్‌ ఉమ్మడి జిల్లా రైతుసంఘం అధ్యక్షుడు,వర్ధన్నపేట ఎంపిపి మార్నేని రవిందర్‌రావు.ఉద్యమ కీలక సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆహ్వనంతో ప్రస్తుత మండల కేంద్రం ఐనవోలులో బహిరంగసభ ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుండి స్థానికంగా టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్మాణం కోరకు తీవ్రంగా కృషి చేశారు. ఆయన కృషి ఫలితంగానే నేడు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పటిష్టంగా ఉంది. అయితే తన రాజకీయ జీవితంలో స్థానికంగా ప్రజాక్షేత్రంలో అన్ని పదవులను చేపట్టి సేవ చేశారు.టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత స్థానికంగా గాని జిల్లాలో గాని పార్టీ అధినాయకత్వం తప్పకుండా రాష్ట్రస్థాయిలో అవకాశం కల్పిస్తారని అంతా అనుకున్నారు. కాని అప్పటి పరిస్థితుల్లో ఆ అవకాశం చేజారింది.అనంతరం ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ మార్కెట్‌గా పిలువబడే వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌ చైర్మన్‌గా అవకాశం ఇస్తారని అధిష్టానం నుండి స్పష్టమైన హామి ఇచ్చినట్లు మార్నేని అనుచరులు బహిరంగంగానే చెప్పుకున్నారు. కాని కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన తప్పనిసరి మార్కెట్‌ చైర్మన్‌లను రిజర్వేషన్ల ద్వారా ఎన్నుకోవాల్సి వచ్చింది. దాంతో చైర్మన్‌ పదవికి రిజర్వేషన్‌ కలిసి రాలేదు. అయితే అప్పటికే వర్ధన్నపేట ఎంపిపిగా ఉన్న మార్నేని నామినేటెడ్‌ పదవుల్లో అయినా అవకాశం ఇస్తారని ఆశించారు. కాని అది కూడా జరగలేదు. దాంతో ఎంపిపిగా కొనసాగారు. సాధారణ ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుండి అభ్యర్ధి ఎంపిక విషయంలో అనుహ్యంగా మార్నేని రవిందర్‌రావు పేరు అనుహ్యంగా తెరపైకి వచ్చింది. అధినాయకత్వం దృష్టిలో సమర్ధనాయకుడిగా,సీనియర్‌గా ఉన్నప్పటికి సామాజికకోణంలో మరోమారు అవకాశం చేజారింది.అయితే పార్టీ కార్యక్రమాల్లో,వచ్చిన ప్రతి ఎన్నికలను అనుకూల ఫలితాల కోరకు పాటుపడిన మార్నేని ఎంపిపిగా ఇంకో నెల రోజులు మాత్రమె కొనసాగుతారు.ఈ నెపథ్యంలో రాష్ట్రస్థాయిలో కాకపోయినా కనీసం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా అయినా అవకాశం వస్తుందని అశించినప్పటికి రిజర్వేషన్‌ రూపంలో మరోమారు రవిందర్‌రావు,వారి అనుచరుల ఆశలను నీరుగార్చింది.దింతో పార్టీలో కీలక నేతగా ఉన్నప్పటికి భవిష్యత్తుపై నిలినీడలు కమ్ముకొవడం పట్ల ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.తన భవిష్యత్తు గురించి సాధారణ ఎన్నికల అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కలిసిన సంధర్భంగా తన భవిష్యత్తును గురించి మార్నేని ప్రస్తావించారని అయితే ఎలాంటి ఆందోళన చెందవద్దని రానున్న అవకాశాల్లో ప్రథమ స్థానంలో ఉంచి అవకాశం ఇస్తానని హామి ఇచ్చినట్లు చర్చ నడుస్తుంది.ఏది ఎమైనా స్థానికంగా ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉన్న నాయకుడికి భవిష్యత్తు భరోసా లేకపోవడం పట్ల స్థానిక ప్రజల్లో కొంత అసహనం ఉంది.ఇప్పటికైన తన భవిష్యత్తుపై భరోసా ఇచ్చి తనకు సముచితస్ధానం కల్పించాలనే లక్ష్యంతో మార్నేని రవిందర్‌రావు ఈ ఎన్నికల్లో కూడా క్రియాశీలకంగా పని చేస్తున్నారు.

ప్రధాని కావాలని లేదు – వరంగల్‌ సభలో సీఎం కేసిఆర్‌ వ్యాఖ్యలు

ప్రధాని కావాలని లేదు

– వరంగల్‌ సభలో సీఎం కేసిఆర్‌ వ్యాఖ్యలు

నేటిధాత్రి బ్యూరో : తనకు ప్రధానమంత్రి కావాలన్న కోరిక అసలే లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. మంగళవారం వరంగల్‌లోని అజంజాహి మిల్లు గ్రౌండ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి పదవిపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అజంజాహి మిల్లు మైదానంలో సమావేశం నిర్వహించిన వారంతా ప్రధానమంత్రులయ్యారని, మంత్రి దయాకర్‌రావు తనతో అన్నారని, తనకు మాత్రం ప్రధానమంత్రి కావాలన్న కోరిక అసలే లేదని కేసిఆర్‌ అన్నారు. తన ప్రసంగంలో కాంగ్రెస్‌, బిజెపి పార్టీలపై విరుచుకుపడ్డ ఆయన కేంద్రంలో చేతకాని వారే పాలిస్తున్నారని, ఈ దేశానికి అంతగా మంచిది కాదని, దేశంలో కాంగ్రెస్‌, బిజెపి లేని కూటమి రావాలని ఆయన ఆశించారు. కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు గోల్‌మాల్‌ గోవిందంలాగా తయారయ్యాయని ప్రధానమంత్రిపై కేసిఆర్‌ విమర్శలు చేశారు.

చిన్నచిన్న సమస్యలు సైతం కేంద్రం దగ్గర పరిష్కారం కాకుండా ఉన్నాయని, గడ్డివాము దగ్గర కుక్కలాగా వారు సమస్యలను పరిష్కరించారు..మనవి పరిష్కరించుకోనివ్వరు అని అన్నారు. నరేంద్ర మోడీ, రాహుల్‌గాంధీ అనవసరంగా పెడబొబ్బలు పెడుతున్నారన్నారు. వరంగల్‌ జిల్లా ఉద్యమంలో అగ్రభాగాన ఉందని, పార్లమెంట్‌ ఎన్నికల తీర్పులో సైతం అగ్రభాగంలోనే ఉండాలన్నారు. వ్యవసాయానికి ఉచితంగా కరెంట్‌ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని, దేశంలో తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తయారైందని, అనేక సంస్కరణలను రాష్ట్రంలో అమలు చేశామన్నారు. ఎస్సారెస్పీ కాలువలు పూర్తి దశకు వచ్చాయని, త్వరలోనే కాళేశ్వరం నుంచి సైతం బటన్‌ నొక్కితే నీళ్లు వచ్చేలా నిర్మాణం పూర్తవుతుందన్నారు.

ప్రధాని మోడీ గుజరాత్‌ రాష్ట్రంలో సైతం 24గంటల కరెంట్‌ అమలులో లేదని, తెలంగాణ రాష్ట్రం ఆ ఘనత సాధించిందన్నారు. ఎన్నికలు వస్తే గెలువాల్సింది పార్టీలు కాదని, ప్రజల అభిమతం గెలవాలని కేసిఆర్‌ అన్నారు. కేంద్రం తెలంగాణకు 35వేల కోట్లు ఇచ్చామని ప్రగాల్బాలు పలుకుతోందని, కేంద్రం మనల్ని సాకడం లేదని, కేంద్రాన్నే మనం సాకుతున్నామన్నారు. వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పసునూరి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చిన కేసిఆర్‌ పసునూరి వివాదరహితుడని, నియోజకవర్గానికి కావాల్సిన పనులను చేయించుకునే సత్తా కలవాడన్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో దేవాదుల, ఇతర ప్రాజెక్టు పనులు పూర్తి కావస్తున్నాయని, ఈ ప్రాజెక్టు వల్ల జిల్లా అంతా సస్యశ్యామలం కానుందన్నారు. తెలంగాణ హక్కులు, ప్రాజెక్టులు తదితర అవసరాల కోసం కేంద్రంపై పోరాడాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ సమస్య కేంద్రంలో పరిష్కారం కావాలంటే ప్రాంతీయ పార్టీలు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఎవడు అడ్డొస్తాడో చూస్తా…!

– కబ్జా స్థలంలోనే నిర్మాణం చేస్తా

– కార్పోరేటర్‌ను మున్సిపల్‌ అనుమతులు నాకో లెక్కా….

– అధికార పార్టీ నాయకులకే అడ్డొస్తారా…అరగంటలో అనుమతి పత్రాలిస్తా

– ఓ కార్పోరేటర్‌ అతి…కబ్జాతో అధికార పార్టీ పరువు తీస్తున్న వైనం

– మున్సిపల్‌ అధికారులు నోటీసులు ఇచ్చిన లెక్క లేదు

– అధికారంలో ఉన్నాం…మాకెవడు అడ్డు అంటూ ఫోజులు

నేటిధాత్రి బ్యూరో: ఓవైపు ముఖ్యమంత్రి స్వయంగా బాధితులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తుంటే పార్టీ బలోపేతానికి కేటిఆర్‌ అహర్నిశలు కృషి చేస్తుంటే గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో నాయకులు మాత్రం అతిగా వ్యవహారిస్తూ యథేచ్చగా కబ్జాలు చేస్తూ పార్టీ పరువును గంగలో కలుపుతున్నారు. అధికారం వీరొక్కరి సొత్తు అయినట్లు అహోరాత్రులు శ్రమించి ప్రజల మనసు గెలిచి టిఆర్‌ఎస్‌ను వీరే అధికార పీఠమెక్కించినట్లు ఫోజులు కొడుతున్నారు. గులాబీ హవాలో, కేసిఆర్‌ చరిష్మాతో కార్పోరేటర్‌గా గెలిచి కాలర్‌ ఎగరేస్తూ హన్మకొండ నడిబొడ్డున కబ్జాపర్వం కొనసాగిస్తున్న ఓ కార్పోరేటర్‌ అధికారంలో ఉన్నాం…మేం ఇష్టం వచ్చినట్లు చేయ్యెచ్చు అంటూ గ్రేటర్‌ వరంగల్‌ కార్పోరేషన్‌ అధికారులపై తన జులుం చూపిస్తున్నాడట. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కబ్జాస్థలంలో నిర్మాణాలు చేస్తున్నారని నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన అధికారుల వద్ద నుంచి నోటీసులు తీసుకుని బూతుపురాణం అందుకున్నాడట. ఎవడు అడ్డొస్తాడో చూస్తా.. కబ్జాస్థలంలోనే నిర్మాణం చేస్తా…అనుమతులు నాకో లెక్క కాదు. అరగంటలో తెస్తా అంటూ డిసి స్థాయి అధికారులపై విరుచుకుపడ్డాడట. గ్రేటర్‌ వరంగల్‌లోని ఓ ఎమ్మెల్యే తన వెనుక ఉన్నాడని, ఈ స్థలంలో ఆ ఎమ్మెల్యేకు సంబంధించిన కాంప్లెక్స్‌ నిర్మాణం చేస్తున్నామని చెపుతున్న ఈ కార్పోరేటర్‌తో సహా మరో ఇద్దరు కార్పోరేటర్లు ఎలాంటి జంకు లేకుండా దర్జాగా కబ్జా పర్వాన్ని కొనసాగిస్తున్నారు. హన్మకొండ నగరంలో వీరు చేసిన కబ్జాస్తలం విలువ పదికోట్లపైగానే ఉంటుంది. ఏకంగా 900గజాలకుపైగా స్థలాన్ని కబ్జా చేసిన వీరు. ఎవరు అడ్డు చెప్పిన వినకుండా నిర్మాణాన్ని మాత్రం అలాగే కొనసాగిస్తున్నారు. అసలు స్థల యజమాని పోలీసులకు, మున్సిపల్‌ కమీషనర్‌కు ఫిర్యాదు చేసిన ఈ ముగ్గురు కార్పోరేటర్లు మాత్రం సేమ్‌ డైలాగ్‌ అందుకుంటున్నారట. అధికారంలో ఉన్నాం…అంటూ విర్రవీగుతున్నారట. ఇలాంటి కబ్జారాయుళ్లపై గులాబీ అధిష్టానం సీనియస్‌గానే ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని వెనకుండి నడిపిస్తున్నాడని అందరూ అంటున్నా గ్రేటర్‌లోని ఆ ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారో చూడాలి.

………………………………………….

మోదీ ప్రసంగంపై ఈసీ క్లీన్‌ చిట్‌

దిల్లీ, నేటిధాత్రి: కక్ష్యలోని ఉపగ్రహాన్ని క్షిపణితో కూల్చివేసే ఏ శాట్‌ పరీక్ష విజయంపై దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంపై ఎన్నికల కమిషన్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఈ విషయంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘన జరగలేదని ఈసీ స్పష్టం చేసింది. ప్రధాని ప్రసంగించే సమయంలో పార్టీ పేరును ప్రస్తావించడం, ఓట్లు అభ్యర్థించడం వంటివి చేయలేదని ఎన్నికల సంఘం పేర్కొంది.
ఉపగ్రహ నిరోధక పరీక్ష విజయంపై గత బుధవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. అత్యంత కఠినమైన మిషన్‌ శక్తి ప్రయోగం విజయవంతమైందని, ఏశాట్‌ ద్వారా తక్కువ ఎత్తులోని కక్ష్యలో తిరుగుతున్న ఓ సజీవ ఉపగ్రహాన్ని కూల్చివేశామని మోదీ చెప్పారు. దేశ ప్రజలకు ఈ ప్రయోగం గర్వకారణమని తెలిపారు. మిషన్ శక్తితో అంతరిక్షంలోనూ మన రక్షణ వ్యవస్థను మెరుగుపరుచుకున్నామని అన్నారు.
అయితే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో మోదీ ఈ ప్రసంగం చేయడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రధాని ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీంతో స్పందించిన ఈసీ.. మోదీ ప్రసంగం అంశాన్ని పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ.. ప్రధాని ప్రసంగానికి సంబంధించిన వివరాలను దూరదర్శన్‌, ఆల్‌ఇండియా రేడియోల నుంచి సేకరించింది. వీటిని పరిశీలించిన అనంతరం మోదీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version