Political Heat Rises in Telangana: తెలంగాణలో ఆ రెండు పార్టీల మధ్యే పోటీ

 

గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ సాధించిన ఎమ్మెల్యే సీట్లు ఎన్ని? ఒక్కటంటే… ఒక్కటి! రాజా సింగ్ మాత్రమే తన స్వంత బలంతో ఓల్డ్ సీటీలో గెలిచాడు. మిగతా అన్ని చోట్లా కాషాయం కొట్టుకుపోయింది. అయితే, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లు రావటంతో కమలం క్యాంపులో కాస్త కళ వచ్చింది. రాజా సింగ్ కు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ తోడవ్వటంతో టీ అసెంబ్లీలో బీజేపీ బలం ‘ఆర్ఆర్ఆర్’ అయింది! అయినా కూడా ‘ట్రిపుల్ ఆర్’ ఎమ్మెల్యేలతో కమలం ఇంకా హస్తం కంటే బాగా వెనుకబడే ఉంది! అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు…
తెలంగాణలో 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారం చేజిక్కించుకుంది. కేసీఆరే సీఎంగా కొనసాగుతున్నారు. అయితే, ఆయనపై అలుపెరుగని పోరాటం చేస్తోంది మాత్రం… గత దశాబ్ద కాలంగా… కాంగ్రెస్ పార్టీయే. ఇప్పటికిప్పుడు కూడా తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం హస్తం పార్టీయే. మరి బయట బోలెడు ప్రగల్భాలు పలికే బీజేపీ పరిస్థితి ఏంటి? హిమాచల్ మొదలు కర్ణాటక దాకా అనేక చోట్ల ఓడిపోతోన్న కమల దళం తెలంగాణలో ఏ మాత్రం ఎదిగే సూచనలు కనిపించటం లేదు. ఈటెల రాజేందర్ గెలిచాక ఆయనను చేరికల కమీటి అంటూ ఒకటి ఏర్పాటు చేసి… దానికి నాయకుడ్ని చేశారు. అయినా చేరికలూ జరగలేదు. తీసివేతలు కాలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది టీ బీజేపీ పరిస్థితి. పైగా గత కొన్ని రోజులుగా తెలంగాణ కమలంలో ముసలం పుడుతోంది…
టీ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ పోకడలు ఈటెల మొదలు ధర్మపురి అరవింద్ వరకూ చాలా మందికి నచ్చటం లేదట. ఈ విషయం వారు స్వయంగా అంగీకరించనప్పటికీ అనేక లుకలుకలైతే ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. బీజేపీ దిల్లీ హైకమాండ్ వద్దకి బండి సంజయ్ వ్యతిరేకులు బృందంగా వెళ్లి రావటం కూడా బహిరంగ రహస్యమే! అలాగని వారి కోసం బండిని అధ్యక్ష పదవి నుంచీ తొలగిస్తారా? మోదీ, అమిత్ షా అటువంటి నిర్ణయం తీసుకుంటారా? అబ్బే అలా జరగదంటున్నారు బీజేపీలోని వారే! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడిపోతోన్న వేళ ప్రెసిడెంట్ ని మార్చితే గందరగోళం అవుతుందని వారి వాదన!
బీఆర్ఎస్ ను అధికారంలోంచి దించి భాగ్యనగరంలో కాషాయ జెండా ఎగురవేస్తామని ప్రగల్భాలు పలికిన టీ బీజేపీ నాయకులు ఇప్పుడు అంతర్యుర్ధాలతో సతమతం అవుతున్నారు. మరోవైపు, దిల్లీ కాషాయ పెద్దలు కేసీఆర్ కుమార్తె విషయంలో మొదట్లో తెగ హడావిడి చేశారు. కవితని అరెస్ట్ చేస్తాం అన్నట్టుగా వాతావరణం సృష్టించారు. ఇప్పుడు చూస్తుంటే లిక్కర్ కేసు మత్తు మొత్తం దిగిపోయినట్టే కనిపిస్తోంది. కవిత అరెస్టు ఒట్టి మాటేనని బీజేపీలోని వారే ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటున్నారు. కవిత ఎపిసోడ్ వల్ల జనం ముందు బీజేపీ చులకనైందని వారి ఆవేదన. బీఆర్ఎస్ తో గట్టిగా పోరాడేది బీజేపీ కాదు కాంగ్రెస్సేనని క్షేత్రస్థాయిలో జనం భావిస్తున్నారట!
ప్రస్తుతానికి బీఆర్ఎస్, టీ కాంగ్రెస్ ల తరువాతి స్థానంలో ఎక్కడో సుదూరంగా ఉన్న బీజేపీ ఆలు లేదు చూలు లేదు అన్న చందంగా అప్పుడే అనేక సమస్యలతో కుదేలవుతోంది. జనంలో నమ్మకం కలిగించలేక, పార్టీలోని నేతల్లో ఐకమత్యం తీసుకురాలేక కమల దళం చేతులు ఎత్తేస్తోంది. అందుకు మంచి ఉదాహరణే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావుల వ్యవహారం. మొదట్లో వారిద్దరూ కాషాయ కండువా కప్పేసుకుంటారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంత వరకూ అది జరగలేదు. మరోవైపు, కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత పొంగులేని, జూపల్లి టీ కాంగ్రెస్ నాయకులతో టచ్ లోకి వచ్చారట. వారిని ఎలాగైనా పార్టీలోకి తీసుకోవాలని హస్తం పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే జరిగితే వలసలపై బీజేపీ పెట్టుకున్న ఆశలు ఆడియాశలే అవుతాయి. బీఆర్ఎస్ వద్దనుకున్న వారికి కాంగ్రెస్సే ఛాయిస్ గా మారుతుంది. బీజేపీ 2018లో మాదిరిగానే… మరోసారి మూడు, నాలుగు సీట్లతో మూడో స్థానానిక పరిమితం అవుతుంది!
ఈ సంవత్సరం చివర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్, టీ కాంగ్రెస్ మధ్య మాత్రమే. కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ హస్తం పార్టీ చరిత్ర సృష్టిస్తే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. మరి బీజేపీ సంగతేంటి? ఆటలో అరటి పండుగా మిగలటమే!

తెలంగాణ కాంగ్రెస్ లో మరో సంచలనం – అయన రూపంలో వైఎస్ కదలాడతారు!

 

గంగా నది మన దగ్గరకు రాదు. వేల మైళ్లు ప్రయాణించి అయినా మనమే గంగ దగ్గరికి వెళ్లాలి. ప్రజాస్వామ్యంలో జనమే… గంగా ప్రవాహం లాంటి వారు! వాళ్ల మధ్యకి వెళ్లి కలిసి నడిచిన వారే జన నేతలు అవుతారు!
‘జనం మధ్యలో జన నేత’ అంటే మనకు ఎవరు గుర్తుకు వస్తారు? పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా తెలుగు వారందరికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కళ్ల ముందు కదలాడతారు! తలపై పాగా, తెల్లటి పంచె, స్వచ్ఛతలో ఒక దానితో ఒకటి పోటీ పడే ఆయన లాల్చీ, చిరు నవ్వులు… మనల్ని గతంలోకి తీసుకు వెళ్లిపోతాయి. అదుగో… ఆ రాజన్న ఇప్పుడు పేదలు, బడుగు, బలహీన వర్గాల వారికి మరోసారి గుర్తుకు వస్తున్నారు. తమని ఆదుకునే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని వాళ్ల కళ్లలో ఆశలు మిలమిల మెరుస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క ‘పీపుల్స్ మార్చ్’ అంటూ పోరుబాట పట్టిన విషయం మనకు తెలిసిందే! ఆయన ప్రస్తుతంలో ఎర్రటి ఎండల్లోనూ జనం మధ్య, జనంతో మమేకం అవుతున్నారు…
మార్చ్ లో ప్రారంభమైన భట్టి పాదయాత్ర దివంగత రాజశేఖర్ రెడ్డిని జనానికి తలపిస్తూ ముందుకు సాగుతోంది. వైఎస్ లాగే పంచెకట్టుతో, భరోసా ఇచ్చే చిరు నవ్వుతో, రైతుల్లో రైతుగా మారిపోయి… సామన్యుల్లో సామాన్యుడై… మన తెలంగాణ భూమి పుత్రుడు అడుగులు వేస్తున్నారు. జనం ఆయనతో తమ కష్ట, నష్టాలు చెప్పుకుంటూ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కోసం కంకణాలు కట్టుకుంటున్నారు. హస్తానికే తమ ఓటు అంటూ ప్రతిజ్ఞలు చేస్తున్నారు.
వైఎస్ ను తలపించే రూపం, హావభావాలు మాత్రమే కాదు… భట్టి విక్రమార్క మరో మారు రాజన్న రాజ్యాన్ని కాంగ్రెస్ మార్కు పథకాలు, పాలనతో తాను తీసుకు వస్తానని సూటిగా, స్పష్టంగా చెబుతున్నారు. పేదల గోడు వినని ప్రస్తుత దొరల పాలనకు తమ ప్రభుత్వం పూర్తి భిన్నంగా ఉంటుందని ఆయన ప్రకటించారు. ప్రగతి భవన్, ఫామ్ హౌజ్ ల్లోనే తొమ్మిదేళ్లు గడిపేసిన కేసీఆర్ తన రాజ ప్రాసాదాల్లోకి కామన్ మ్యాన్ కి నో ఎంట్రీ అనేశాడు. సచివాలయంలోకి కూడా సామాన్యుడు రాకుండా పోలీసుల్ని కాపాలా పెట్టేశాడు! కాంగ్రెస్ వస్తే రాజశేఖర్ రెడ్డి హయాంలో మాదిరిగా ప్రజాదర్భార్, రచ్చబండ కార్యక్రమాలు పునః ప్రారంభం అవుతాయని భట్టి అంటున్నారు. జనం సీఎం వద్దకు రావచ్చని… సీఎం జనం వద్దకు వచ్చి తీరుతాడని ఆయన హామీ ఇచ్చారు! రాబోయే ఖచ్చితంగా… పేదలకు, సామాన్యులకు ఆపన్న ‘హస్తం’ అందించే… రాజన్న రాజ్యమే!

తెలంగాణ రాజకీయంలో కీలక పరిణామం చోటు చేసుకోనుందా..?

తెలంగాణలో కాంగ్రెస్ వైపుకి రెడ్డి సామాజిక వర్గం, బ్రాహ్మణులు మొదలు దళితులు, గిరిజనుల దాకా, మైనార్టీలతో సహా… అన్ని వర్గాల్లోనూ కాంగ్రెస్ కు ఓటర్ల బలంగా ఉన్నారు! ఇది మనకు స్వతంత్రం వచ్చిన నాటి నుంచీ నిరూపితం అవుతోన్నదే! అయితే, తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు అతి పెద్ద బలం రెడ్డి సామాజిక వర్గం. వాళ్లు మొదటి నుంచీ హస్తంతోనే కొనసాగుతున్నారు. ఇతర వర్గాల ధోరణి ఎలా ఉన్నా… ఎన్నికలు వచ్చిన ప్రతీ సారి రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు చేతి గుర్తుకే చేయెత్తి జైకొడుతున్నారు. అయితే, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణలోనూ రెడ్లు ఎప్పటిలాగే కాంగ్రెస్ ను ఆదరిస్తూ వచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాస్త మార్పు కనిపించింది!
జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ తెలంగాణ రెడ్డి సామాజిక వర్గాన్ని కొంత వరకూ అప్పట్లో ప్రభావితం చేసింది. కేసీఆర్ తో స్నేహం చేసిన జగన్ కారు గుర్తుకు ఓటు వేయాలంటూ పనిగట్టుకుని తెలంగాణలో ప్రచారం చేయించాడు. అనధికారికంగా వైసీపీ మీటింగులు పెట్టి కేసీఆర్ వైపుకు రెడ్డి ఓట్లను మళ్లించింది. అయితే, అయిదేళ్ల తరువాత ఇప్పుడు మరో మారు ఆ సామాజికవర్గం కాంగ్రెస్ వైపుకే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది!
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కుచుకుళ్ల దామోదర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి,ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కీలక నేత కేఎల్ఆర్ అలియాస్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మళ్ళీ యాక్టివ్ అవ్వడం.. ఇలా అనేక మంది రెడ్డి సామాజిక నేతలు, ప్రముఖులు హస్తంతో చేతులు కలుపుతున్నారు. ఎన్నికలు దగ్గరపడేకొద్ది టీ కాంగ్రెస్ లోకి మరింత మంది రెడ్డి  సామాజికవర్గం నేతలు వలససొచ్చే అవకాశాలున్నాయని బలమైన టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే బీఆర్ఎస్ సీఎం కూర్చీపై ఆశలు వదులుకోవాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే, తెలంగాణలో ఆర్థిక, రాజకీయ పలుకుబడిలో రెడ్లదే మొదటి స్థానం. అలాగే, ఓటర్లుగా కూడా రెడ్డి కులస్థులు గణనీయంగా ఉంటారు. ఏక కాలంలో… అటు రెడ్డి నేతలు, ఇటు రెడ్డి ఓటర్లు… కాంగ్రెస్ కు జైకొడితే… కర్ణాటక తరువాత దక్షిణాదిలో మరో రాష్ట్రం హస్తం వశం కాకుండా… ఎవరూ ఆపలేరంటున్నారు రాజకీయ పండితులు!

KLR focus on Malkajigiri : మల్కాజిగిరిపై కేఎల్ఆర్ దృష్టి… మంత్రులపై ఫోకస్‌!

 

కాంగ్రెస్ పార్టీ కీలక నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్)గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రాంత వాసులకి అత్యంత సుపరిచితులైన మన డైనమిక్ లీడర్. ప్ర‌స్తుతం ఆయ‌న‌ హై కమాండ్ ఆదేశాలతో ఎలక్షన్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఏక కాలంలో కేసీఆర్ క్యాబినెట్‌లోని ఇద్ద‌రు మంత్రులు, ఒక మాజీ మంత్రి నియోజకవర్గాలపై గురి పెట్టారు. ఈ మూడింట్లో ఏదొక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతారని కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వలస వెళ్లిన సబితా ఇంద్రా రెడ్డి ప్రస్తుతం మహేశ్వరం ప్రాంతంలో సెగ్మెంట్‌లోని ఆమె ప‌నితీరు, లోటు పాట్లపై కేఎల్ఆర్ దృష్టి సారించారు. మంత్రిగా కూడా అధికారం వెలగబెడుతోన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు చేసిందేమీ లేదని తెలుస్తోంది. అలాగే, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మరో మంత్రి మల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంపై కూడా ఫోకస్ చేస్తున్నారు. మేడ్చల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆయన రేయింబవళ్లూ సీఎం కేసీఆర్, కేటీఆర్ భజనలో తరిస్తుంటారు. జనానికి చేసిన మేలు మాత్రం అంతంతమాత్రమే. రానున్న ఎన్నికల్లో కేఎల్ఆర్‌ను మేడ్చల్ నుంచి కూడా అధిష్టానం బరిలో దింపవచ్చట.

ఇక తాండూరులో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి లేదా సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని కిచ్చన్నగారి లక్ష్మారెట్టి ఢీకొట్టే అవకాశం ఉంది. మాజీ మంత్రిపై ఉన్న వ్య‌తిరేకత‌తో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి పైలెట్ రోహిత్ రెడ్డిని ప్ర‌జ‌లు గెలిపించారు. అయితే, ఆప‌రేష‌న్ ఆకర్ష్‌లో భాగంగా రోహిత్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడ‌డంతో పార్టీ క్యాడెర్‌, ప్ర‌జ‌లు ఆగ్ర‌హంగా ఉన్నారు. ఒక‌వేళ కేఎల్ఆర్ ఇక్క‌డ నుంచి బ‌రిలోకి దిగితే కేసీఆర్ టీమ్‌లోని బలమైన నేతగా ఉన్న మహేందర్ రెడ్డికి క‌ష్ట‌కాలం త‌ప్ప‌దని వినికిడి. మొత్తానికి ఈ మూడు స్థానాల్లో కేఎల్ఆర్ ఎక్క‌డ నుంచి బ‌రిలోకి దిగిన‌ కాంగ్రెస్‌కు ఒక సీటు కన్ ఫర్మ్ అని తెలుస్తోంది.

భట్టికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరు ప్రత్యేకంగా ఫోన్ చేశారో తెలుసా?

mallu bhatti vikramarka with rahul gandhi
తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మరిచిపోలేని దుర్దినాలు… అప్పట్లో చంద్రబాబు పాలనలో ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం అరాచక పాలన, కరువుతో అల్లాడిపోయేది. తెలంగాణ కూడా ఇందుకు మినహాయింపు కాదు. నీటి చుక్క లేక జనం అల్లాడుతూ… కన్నీటి చుక్కలతోనే… తమ దాహం తీర్చుకునేటంతటి దుస్థితి! అదుగో అప్పుడు బయలుదేరాడు దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి!
తన మనస్సుల్లాడే స్వచ్ఛమైన తెల్లటి పంచె, దానిపైన సంప్రదాయబద్ధమైన లాల్చీ, నెత్తిన రైతుల్ని తలపించే పాగా, కాళ్లకి స్పోర్ట్స్ షూసు… ఈ రూపం ఎక్కడ కనిపించిన మనకు పెద్దాయనే గుర్తుకు వస్తారు. అటువంటి సందర్భమే మరోసారి వచ్చింది తెలంగాణ నేలపై. అప్పుడు చంద్రబాబు లాగే ఇప్పుడు కేసీఆర్ అరాచక పాలన సాగుతోంది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న తెలంగాణ ప్రజానీకానికి తొమ్మిదేళ్లుగా కన్నీళ్లే మిగిలాయి. వారి చెమర్చిన కళ్లు తుడవటానికే మనందరి జన నేత భట్టి విక్రమార్క పట్టుబట్టి బయలుదేరారు. వేయి కిలో మీటర్లు దాటి వంద రోజుల మైలు రాయిని త్వరలో చేరుకోబోతున్నారు!
ఆనాటి రాజశేఖర్ రెడ్డి లాగే ఇంటి నుంచీ బయలుదేరి నిర్విరామంగా జనం మధ్య గడుపుతోన్న భట్టికి జూన్ 15న ఆయన బర్త్ డే సందర్భంగా ఒక స్పెషల్ కాల్ వచ్చింది! అది మరెవరి నుంచో కాదు… ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిన సోనియమ్మ తనయుడు దిల్లీ నుంచీ ఫోన్ చేశారు! భట్టికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన రాహుల్ గాంధీ పాదయాత్ర గురించి అడిగి తెలుసుకున్నారు. గల్లీ నుంచీ దిల్లీ దాకా చర్చగా మారిన పీపుల్స్ మార్చ్… రాహుల్ ను కూడా ఆకర్షించింది. జనం కోసం జన నేత భ్టటి విక్రమార్క చేస్తోన్న పోరాటం ఆయన చేత ఫోన్ చేయించింది. తెలంగాణలో సామాన్య జనం బాగోగుల గురించి ఆరా తీయించింది! ప్రజల కోసం ఆరాటపడుతోన్న నాయకుడికి అండగా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉంటుందని ఆయన అన్నట్లు సమాచారం. మొత్తంగా భట్టి పాదయాత్ర ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీలో చర్చగా మారింది! రాహుల్ నుంచీ ఫోన్ రావటంతో భట్టి విక్రమార్క మరింత ధృఢ సంకల్పంతో ఇక పై ముందుకు దూసుకుపోనున్నారు…

1000 కిలోమీట‌ర్లు.. 500 పైగా గ్రామాలు.. 30కి చేరువ‌లో నియోజ‌క‌వ‌ర్గాలు

 

సీఎల్పీ నేత జ‌న‌నాయకుడు భ‌ట్టి విక్ర‌మార్క మార్చి 16న చేప‌ట్టిన పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర 85వ రోజు నాటికి
996 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకుంది. ఈ పాద‌యాత్ర‌లో వంద‌ల 500 పైగా గ్రామాలు.. తాండాలు, ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు చుట్టేస్తూ సాగుతోంది.

గిరిజ‌నులు, ఆదివాసీలు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు, మైనారీటీలు, అట్ట‌డుగు వ‌ర్గాలు, అణ‌గారిన ప్ర‌జ‌లు.. భ‌ట్టి విక్ర‌మార్క‌ను జ‌న నాయ‌కుడిగా పేర్కొంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని గెలుపుతీరాలకు చేర్చే చుక్కానిలా భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర ముందుకు సాగుతోంది. గ‌తంలో కాంగ్రెస్ పార్టీకి దూర‌మైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అట్ట‌డుగు, అణ‌గారిన వ‌ర్గాన‌లు తిరిగి పార్టీకి ద‌గ్గ‌ర చేయ‌డంలో భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర విజ‌యం సాధించింద‌ని చెప్ప‌వ‌చ్చు. .

మార్చిన 16న సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజ‌క‌వ‌ర్గం బజరహాత్నూర్ మండ‌లం పిప్పిరి గ్రామం నుంచి పాద‌యాత్రను ప్రారంభించారు. ఇప్న‌టికే బోథ్‌, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంప‌ల్లి, చెన్నూర్, మంచిర్యాల‌, రామ‌గుండం, ధ‌ర్మ‌పురి, పెద్ద‌ప‌ల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వ‌ర్ధ‌న్న‌పేట‌, వ‌రంగ‌ల్ వెస్ట్, స్టేష‌న్ ఘ‌న్ పూర్, జ‌న‌గామ‌, అలేరు, భువ‌న‌గిరి, ఇబ్ర‌హీం ప‌ట్నం, ఎల్బీన‌గ‌ర్, మ‌హేశ్వ‌రం, రాజేంద్రనగర్, చేవెళ్ల‌, షాద్ న‌గ‌ర్, ప‌రిగి, జ‌డ్చెర్ల‌, నాగ‌ర్ క‌ర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర సాగింది.

సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర కొన‌సాగిన నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం కావ‌డంతో పాటు.. కేడ‌ర్ లో స‌రికొత్త జోష్ నెల‌కొంది. దీంతో ఇప్పుడు పాదయాత్ర వెళ్లని నాయకులనుంచి.. మా నియోజకవర్గాల్లో కూడా పాదయాత్ర చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీద తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. భట్టి పాదయాత్ర నియోజకవర్గాల్లో సాగితే.. పార్టీలో కొత్త జోష్ రావడంతో పాటు, అభ్యర్థుల గెలుపు అవకాశాలు పెరుగుతున్నాయన్న అంచనాలతో.. పీపుల్స్ మార్చ్ పై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

గాలి దుమారాలు.. విపరీత ఎండలు.. ఊహించన భారీ వర్షాలు.. అయినా కూడా తనతో నడిచే కార్యకర్తలతో సమానంగా టెంట్ లో ఉంటూ.. వారితో కలిసి తింటూ.. కలియ తిరుగుతున్న భట్టి విక్రమార్క.. సరికొత్త ట్రెండ్ సెట్టర్ గా మారారు. కాంగ్రెస్ నౌకను గెలుపు తీరాలకు చేర్చే.. తెరచాపలా.. భట్టి విక్రమార్క ముందుకు సాగుతున్నారు.

ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ హన్మకొండ జనగామ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి వికారాబాద్ మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ నల్లగొండ సూర్యాపేట ఖమ్మం జిల్లాలో పాదయాత్ర కొనసాగిన తరువాత
ఈనెల 25 నాటికి 101 రోజులు పాదయాత్ర పూర్తి అవుతుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజరవుతారు. ముగింపు సభకు దాదాపుగా రెండు లక్షల పైగా జనాలు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగానే నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మూడు నామాల దోస్తీ!

మూడు నామాల దోస్తీ!

`దండుగా టిఆర్‌ఎస్‌ తో కుస్తీ!!

`మళ్ళీ ఆ ముగ్గురు కలుస్తున్నారు!

`తెలుగు రాజకీయాలను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు.

`అధికారం లోకి రావాలని కలలుగంటున్నారు.

`ఐటి, ఈడీలను రంగంలోకి దించారు?

`ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్నారు?

` టిఆర్‌ఎస్‌లో వున్న టిడిపి నేతలు బిజేపిలోకి చేరేలా ప్లాన్‌ చేశారు?

` ఈడీ, ఐటి సోదాలతో దారిలోకి తెచ్చుకునే రాజకీయం ఆడుతున్నారు.

` తెలంగాణలో మళ్ళీ బిజేపి, టిడిపి, జనసేన ఏకతాటి పైకి వచ్చారు.

` తెలంగాణలో బిజేపిని అధికారంలోకి తేవాలని చూస్తున్నారు.

` ఇదే త్రయ జోడి ఆంద్రప్రదేశ్‌ లో కలిసి పోటీ మళ్ళీ పొత్తు చిగురింపజేసుకున్నారు.

` అక్కడ టిడిపికి అధికారం అప్పగించాలని నిర్ణయానికొచ్చారు?

` ఇప్పటికే ప్రధాని మోడీతో పవన్‌ భేటీ అయ్యారు.

` చంద్రబాబు దూతగా పవన్‌ రాయబారం నడిపారు.

`తెలంగాణలో టిడిపి కి పునరుజ్జీవనం చేస్తున్నారు.

`అది బిజేపి అధికారానికి సహకారం అందిస్తున్నారు.

`జనసేన తోడుతో గట్టెక్కాలనుకుంటున్నారు.

` 2014 త్రినామత్రయం ఆంధ్రాలో సక్సెస్‌ అయ్యారు.

` ఇప్పుడు తెలంగాణలో కలిసేందుకు మీటింగ్‌ పెట్టుకున్నారు.

`ఎవరు ఒంటరిగా వెళ్లినా టిఆర్‌ఎస్‌ ను టచ్‌ చేయడం కష్టమని తెలుసుకున్నారు.

` టిఆర్‌ఎస్‌ ను ఓడిరచాలంటే మూడు పార్టీలు కలిస్తేనే సాధ్యమవుతుందని లెక్కలేసుకున్నారు?

`టిడిపి ఆంద్రప్రదేశ్‌ లో నిలబడాలంటే ముందు తెలంగాణలో బిజేపిని అధికారంలోకి తేవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు?

`అది బూచిగా చూపి, ఆంధ్ర ప్రదేశ్‌ లో ఓట్లు అడుక్కోవాలని చూస్తున్నారు!

  హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఎక్కడ పోగొట్టుకున్నామో! అక్కడే వెతుక్కొమన్నారన్న సామెత గుర్తొచ్చినట్లుంది. విడిగా వుంటే వీకౌతున్నామని గమనించారు. విడిపోయి తప్పు చేశామని మధనపడిపోతున్నారు. లోలోన కుమిలిపోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ను తక్కువ అంచనా వేసి, తాము బలవంతులమనుకున్నారు. కేసిఆర్‌ వేసే ఎత్తులు తట్టుకోలేక, ఒకరినొకరు మళ్లీ ఓదార్చుకొని పాత రోజులు గుర్తు చేసుకున్నారు. చేదు రోజులు మర్చిపోదామని చర్చించుకున్నారు. మళ్లీ ఒక్కటౌదామని అంగీకారానికి వచ్చారు. ఇంతకీ ఎవరనుకుంటున్నారా? ప్రధాని నరేంద్ర మోడీ…చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌. ప్రధాని నరేంద్ర మోడీకి కూడా వీళ్ల అవసరం భవిష్యత్తులో అవసరం కానున్నది. దేశంలో ఇప్పుడు అనుకున్నంత బలంగా బిజేపి లేదని తేలిపోయింది. తెలిసిపోయింది. త్వరలో జరగనున్న గుజరాత్‌లో కష్టమే అన్నది కళ్లముందు కనిపిస్తోంది. అక్కడ బిజేపి ఓడిపోతే ఇక దేశంలో కూడా ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. బిజేపికి మళ్లీ పాత రోజులే దిక్కని అర్ధమైపోయింది. అందుకే పాత స్నేహాలు మళ్లీ చిగురింప జేకుంటే, ఉభయకుశలోపరి స్వామి కార్యం, స్వకారం అందరికీ ఏక కాలంలో తీరిపోతుంది. అందుకే మళ్లీ ముచ్చటగా ముగ్గురు కలిసేందుకు ముహూర్తం చూసుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో తెలంగాణలో బిజేపికి అవసరం. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేనకు అవసరం. అందుకే ఒక్కటౌదామని నిర్ణయానికి వచ్చారు. ఇరు పార్టీలు రాజకీయ దూతగా పవన్‌ను ఎంచుకున్నారు. ఇక్కడి విషయాలు అక్కడికి, అక్కడి విషయాలు ఇక్కడికి ఇప్పుడు చేరవేసే పని పవన్‌ పెట్టుకున్నాడు. డిసెంబర్‌ 4న చంద్రబాబుతో కూడా మంతనాలు మొదలుపెట్టేందుకు మోడీ సంకేతాలిచ్చారు. ఎందుకంటే పుల్లలుగా వుంటే కేసిఆర్‌ లాంటి నాయకులు విరిచేస్తున్నారు. ముక్కలు చేసేస్తున్నారు. బిజేపిని లెక్కలోకి తీసుకోవడం లేదు. అందుకే ఈ ముగ్గురు కట్టెల మోపుగా మారి బలపడాలనుకుంటున్నారు. గత ఫలితాలు మరోసారి పునరావృతం చేయాలనుకుంటున్నారు. ముందుగా తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్నారు. ఏడాది ముందు వచ్చే తెలంగాణలో బిజేపిని గద్దెనెక్కించే పనిని పంచుకునేందుకు సిద్దమౌతున్నారు. పనిలో పనిని తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పునరుజ్జీవం పోసే పని పెట్టుకున్నారు. కాసాని జ్ఞానేశ్వర్‌ను ముందు పెట్టి రాజకీయం నడిపేందుకు సిద్ధమౌతున్నారు. జిల్లా కమిటీలు కూడా చకచకా వేసుకుంటున్నారు. ఎన్నికల వేడి సెగ తగిలేలోపు అన్ని సిద్ధం చేసుకోవాలని చూస్తున్నారు. తాము బలపడి బిజేపిని అధికారంలోకి తెచ్చేందుకు బిజేపికి సహకరించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. 

 కేంద్రంలో పరిస్దితి ఈసారి ఎలా వుంటుందో అన్నదానిపై బిజేపిలో కూడా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.

 గత రెండు ఎన్నికలంత సులువు కాదని తేలిపోయింది. దేశంలో పరిస్ధితి చూస్తుంటే బిజేపికి కొంత ఇబ్బందికరమైన పరిస్ధితులే కళ్లముందున్నాయి. అందులోనూ దక్షిణాదిలో ఇప్పుడు పాగా వేయలేకపోతే భవిష్యత్తులో బిజేపికి ఇక స్ధానం ఎప్పుడూ వుండదు. అందుకే శత్రువు, శత్రువు మిత్రుడైనట్లు, వాళ్లు వాళ్లు శత్రువులైనా కేసిఆర్‌ లాంటి బలమైన నాయకుడిని డీ కొట్టాలంటే కలిపిపోవాలని నిర్ణయించుకున్నారు. మొదట్లో 2014 ఎన్నికల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా బిజేపికి అనుకూలంగానే వుంటూ వచ్చారు. కాని బిజేపి గత ఎన్నికల తర్వాత కేసిఆర్‌ను తక్కువగా అంచనా వేసుకొని ఆయనతో గొక్కునే ప్రయత్నం చేస్తూ వచ్చింది. దానికి కేసిఆర్‌ తన ఉగ్రరూపాని చూపిస్తూ వస్తున్నారు. బిజేపికి ఊపిరాడకుండా చేస్తూ వస్తున్నారు. బిజేపి మీద ఆయన వీలు చిక్కినప్పుడల్లా దుమ్మెత్తిపోస్తున్నాడు. చెడుగుడు ఆడుకుంటున్నారు. దేశంలో ప్రధాని మోడీ పాలనను కడిగేస్తున్నారు. ప్రజల ముందు కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడుతున్నాడు. ఇక తట్టుకోలేని బిజేపి పాత దోస్తులైన చంద్రబాబు, పవన్‌ కలుపుకుపోతే తప్ప మనుగడ లేదని తెలుసుకొని కలిసిపోయారు. టిఆర్‌ఎస్‌ మీద పోరు ప్రకటించేందుకు సిద్ధమౌతున్నారు. 

  ఏకమై 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేసినట్లే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా పోటీ చేయాలని సంకల్పిస్తున్నాయి.

 అసలు 2014లో ఏర్పడిన ఈ త్రయ మైత్రి మూడేళ్లలోనే ఇచ్చుకపోయింది. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ల కలిసి సంయుక్తంగా తిరుపతి సభలో మేము ముగ్గురం…వెంకన్న స్వామి నామాలకు రూపాలం అని చెప్పుకున్నారు. మేం ముగ్గురం ఒక్కటే అన్నారు. ఎన్నికల ముందు అనుకున్నదొక్కటి. ఆ తర్వాత జరిగిందొక్కటి. ఎన్నికల సమయంలో ఆంధ్ర ప్రదేశ్‌ విడిపోవడంపై ఎంతో బాధను వ్యక్తం చేసిన నరేంద్ర మోడీ ప్రధాని అయితే ఇక ఆంధ్రప్రదేశ్‌కు తిరుగులేదని చంద్రబాబు కలలుగన్నాడు. అమరావతి రాజధాని శంకుస్ధాపను ఒట్టి చేతులతో పోతే ఏం బాగుంటుందనుకున్నాడో ఎమో కాని ప్రధాని డిల్లీ పార్లమెంటు ప్రాంగణ మన్ను, యమునా నది నీళ్లు తెచ్చి షాక్‌ ఇచ్చారు. అయినా అదే మహా ప్రసాదమని చంద్రబాబు భావించారు. ఆ తర్వాత గాని మోడీ అసలు రూపం తెలియలేదు. దానికి చంద్రబాబుకు మండిరది. అది కూడా ఆఖరు నిమిషంలో జరిగింది. అయినా వేచి చూసే ధోరణే అవలంభించిన చంద్రబాబు ఇక కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదని తెలియడంతో యూటర్న్‌ తీసుకున్నాడు. బిజేపికి రాంరాం చెప్పాడు. అయితే మొదట మోడీని నమ్మడమే చంద్రబాబు చేసిన పెద్ద తప్పిదం. మళ్లీ అదే తప్పు ఇప్పుడు చేసి నిండా మునిగేందుకు రెడీ అవుతున్నాడు. ఒంటరిగా ఎలాగూ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చక్రం తిప్పలేదు. ఒంటరి పోరు ఎప్పుడూ చంద్రబాబుకు సాధ్యం కాదు. తోడుగా జనసేన కావాలి. అయినా బలం సరిపోదు. అందుకు బిజేపికి సహాకారం తీసుకోవాలి. ఇస్తినమ్మ వాయినం…పుచ్చుకుంటినమ్మ వాయినం…అన్నట్లు తెలంగాణలో బిజేపిని అధికారంలోకి తెచ్చేందుకు టిడిపి సహకరిస్తుంది? ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి, జనసేన సంయుక్త ప్రభుత్వానికి బిజేపి తోడుగా నిలుస్తుంది. ఇదీ డీల్‌…

  తెలంగాణలో ముందు ఆపరేషన్‌ మొదలైంది. 

ప్రస్తుతం క్రియాశీలకంగా వున్న పూర్వపు టిడిపి నాయకుల మీద ముందు వల వేస్తున్నారు. వారిని ఈడి, ఐటిల పేరుతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఒక్కసారి గమనిస్తే ఈడి, ఐటిరైడ్స్‌ సోదాలకోసం ఎంచుకున్న నేతల్లో టిడిపి నుంచి వెళ్లిన నేతలే కనిపిస్తున్నారు. ఆఖరుకు పిపిసి ప్రెసిడెంటు రేవంత్‌రెడ్డి కూడా వున్నారు. అంటే బిజేపి ఒక పధకం ప్రకారం ముందుకు వెళ్తుందనేది స్పష్టమౌతోంది. ఉద్యమ కారుల జోలికి వెళ్లడం లేదు. ఎందుకంటే వాళ్లంతా టిఆర్‌ఎస్‌ హార్డ్‌ కోర్‌ నాయకులు. గతంలోనే ఓసారి చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే విషయంలో దొరికిపోయాడు. ఇప్పుడు బిజేపి దొరికిపోయింది. కేసిఆర్‌తో పెట్టుకొని చంద్రబాబు తెలంగాణలో బిచాణా ఎత్తేశాడు. ఇక ఏమి లేకున్నా, ఎంతో వున్నట్లు ఊహించుకుంటున్న బిజేపికి అవన్నీ కలలని తెలిసిపోయే రోజులు కేసిఆర్‌ చూపించడం ఖాయం. ఎలాగూ అక్రమ మార్గంలో టిఆర్‌ఎస్‌ను ఎలాగూ కట్టడి చేయలేకపోతున్నామని గమనించి, కనీసం టిడిపి పాత బ్యాచ్‌ను టిఆర్‌ఎస్‌ దూరం చేసి, వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఎలా వుంటుందన్నదానిపై కసరత్తు సాగుతోంది. రాజకీయ నూకలు మాకు ఇంకా మిగిలే వున్నాయన్న ఆశ వారిని ఏకం చేస్తున్నాయి.

ఆధిపత్య రాజకీయాలు!

` పొటేళ్ల పోట్లాట

` తెలంగాణలో రెండు పార్టీలు.

`ఎదురులేకుండా చూసుకునేందుకు టిఆర్‌ఎస్‌.

`కలబడి నిలబడతామని బిజేపి.

`ఎక్కడున్నదో తెలియని కాంగ్రెస్‌.

`ఐటి, ఈడి దాడులతో టిఆర్‌ఎస్‌ లో గందరగోళం.

`ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంతో బిజేపిలో కలవరం.

`ఆసక్తిగా గమనిస్తున్న విశ్లేషకులు.

` రాష్ట్రంలో బిజేపి రాకుండా టిఆర్‌ఎస్‌ కు ఎర్రసైన్యం తోడు.

`బిజేపి ఒంటరిపోరు.

`బెదిరించి లొంగదీసుకునే ఎత్తులో బిజేపి.

`ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపర్చడం సాహేతుకం కాదు.

`ఎన్నికలలో గెలిస్తే అది నిజమైన విజయం.

`లోపాలు ఎత్తి చూసుకోవడం గొంగడిలో భోజనం చేయడమే.

` ప్రజలు ఏం ఆలోచిస్తున్నారనేది అంతుచిక్కని వైనం.

`ఈ రాజకీయాలు ఎటువైపు దారి తీస్తాయో అన్నది ఆసక్తికరం.

 హైదరాబద్‌,నేటిధాత్రి: 

తెలంగాణ రాష్ట్రంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రతిపక్ష బిజేపి లు పొటేళ్ల పోట్లాటలా రాజకీయాలలో నువ్వా, నేనా అనే దూకుడును ప్రదర్శిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది కాలం వుంది. అయినా ఇప్పటికే రాజకీయాలు రంజుగా మారాయి. ఒక రకంగా చెప్పాలంటే గత రెండేళ్లగా పోట్లాట సాగుతూనే వుంది. అసలు గత ఎన్నికలలో బిజేపి గెల్చిన సీటు ఒక్కటి. దానిని అక్కడికే పరిమితం చేయాల్సి వుండేది. కానీ టిఆర్‌ఎస్‌ పార్టీ చేసిన రాజకీయ తప్పిదం మూలంగా బిజేపి ఎదిగింది. బిజేపికి తెలంగాణలో ఎలాంటి సీన్‌ వుండదన్న అతి నమ్మకం చేసిన మోసమే ఇది. టిఆర్‌ఎస్‌ కు ఎప్పటికైనా కాంగ్రెస్‌ తో తిప్పలనుకున్నారే గాని, బిజేపితో ఎదురౌతుందని టిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా ఊహించలేకపోయారు. బిజేపితో భవిష్యత్తులో పేచీ వస్తుందని కూడా అనుకోలేదు. నిజానికి కేంద్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయి సహకారం అందించింది. కాని బిజేపి దానిని నిలుపుకోలేదు. పైగా తాము బలడుతున్నామన్న భావన బిజేపిలో కూడా బలపడిరది. ప్రజలు తమ మాటలు కూడా విశ్వసిస్తున్నారని తెలిసిపోయింది. దాంతో జిహెచ్‌ఎంసి. ఎన్నికలలో మెజారిటీ స్థానాలు గెల్చుకున్నది. ఇదొక్కటే బిజేపి సొంతంగా సాధించుకున్న విజయమని చెప్పొచ్చు. దుబ్బాక రూపంలో మరోసారి బిజేపి కలిసొచ్చింది. రఘునందన్‌ రావు గెలుపు ఆ పార్టీకి వరమైంది. నిజానికి అది కేవలం రఘునందన్‌ రావు గెలుపు మాత్రమే. అయినా దానిని బిజేపి తన ఖాతాలో వేసుకున్నది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికతో బిజేపిలో మరింత జోష్‌ పెరిగింది. ఈ రెండు ఉప ఎన్నికలలో అవి రఘునందన్‌ రావు, ఈటెల రాజేందర్‌ వ్యక్తి గత విజయాలే…కారణాలు ఏవైనా కావొచ్చు పార్టీ శ్రేణులలో ఉత్సాహం నింపడంలో బిజేపి సూపర్‌ సక్సెస్‌ అయ్యిందనే చెప్పాలి. ఎనమిదేళ్లుగా అధికారంలో వుండి, అనేక అవకాశాలు పొందుతున్న టిఆర్‌ఎస్‌ నాయకులకంటే బిజేపి నేతలు ఎన్నో రెట్లు మేలనే అనాలి. వాళ్లు పదవుల కోసం ఆలోచించరు. పరపతి కోరుకోరు. తమకు ప్రత్యేక పీట కావాలనరు. అంకిత భావంతో పని చేస్తున్నారు. టిఆర్‌ఎస్‌ నేతలు ముందు ఇది తెలుసుకోవాలి. తెలంగాణలో ఇప్పుడు ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికలలో గెలుపుకోసం ఇప్పటి నుంచే రాజకీయాలు మొదలుపెట్టాయి.  

ఎదురులేకుండా చూసుకునేందుకు టిఆర్‌ఎస్‌.

 మొదటి నుంచి టిఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న ఈ విధానం పూర్తి సత్పలితాలనిచ్చిందనే చెప్పాలి. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ఎన్నికలలో గెలిచిన టిఆర్‌ఎస్‌ అధికారం చేపట్టి ప్రతిపక్షాలకు రాష్ట్ర రాజకీయాలలో స్థానం లేకుండా చేసింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ రాజకీయ చాణక్యం ఎంతో పనిచేసింది. కాంగ్రెస్‌ కకావికలమైపోయింది. కాంగ్రెస్‌ లో హేమాహేమీలు చెల్లాచెదురైపోయారు. చాలా మంది టిఆర్‌ఎస్‌ లో జాయిన్‌ అయ్యారు. ఇక్కడే టిఆర్‌ఎస్‌ పొరపాటు కూడా వుంది. బిజేపికి బలం లేదు, బలగం లేదు. కానీ టిఆర్‌ఎస్‌ నిర్లిప్తత కూడా బిజేపికి అనుకూలంగా మారింది. 

కలబడి నిపబడతామని బిజేపి అంటోంది.

 అసలు స్వంతంగా ఒక్క ఎమ్మెల్యే సీట్ల కూడా అదనంగా సాధించలేదు. బలమైన అభ్యర్థుల మూలంగా గెలిచిన సీట్లు. కాకపోతే పార్లమెంటు ఎన్నికలలో బిజేపి నాలుగు సీట్లు సంపాదించడంతో ఆ పార్టీకి కొండంత ఉత్సాహంగా చేకూరింది. తర్వాత బోనస్‌ గా లభించిన రెండు అసెంబ్లీ సీట్లు, జిహెచ్‌ఎంసి కార్పోరేటర్లు అదనపు బలంగా మారింది. 

 ఇదే కాంగ్రెస్‌ ఎక్కడున్నదో కూడా తెలియకుండా పోయింది.

 ఓ వైపు వరుస ఓటములు. మరో వైపు గెలిచిన వాళ్లు కారెక్కడం. ఇదే తరుణంలో రేవంత్‌ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావడం ఆ పార్టీకి ఆశనిపాతంలా మారింది. ప్రజల్లో కాంగ్రెస్‌ మీద నమ్మకం లేదు. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మీద నాయకులకు విశ్వాసం లేదు. ఏ ముహూర్తాన రేవంత్‌ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాడో గాని పార్టీ ఖాళీ అవుతోంది. అదే సమయంలో దాని స్థానాన్ని బిజేపి భర్తీ చేస్తోంది. రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీ వుంటే బిజేపికి ఆ అవకాశం వుండేది కాదు. తెలంగాణ లో టిఆర్‌ఎస్‌ బలమైన పార్టీ. ఆ పార్టీని ఎదుర్కొనే శక్తి యుక్తులు ఎవరికీ లేవు. అలా అని బలమైన ప్రతిపక్షం కూడా లేదు. మొదట్లో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఏది చెప్పినా విన్న ప్రజలు, ఇటీవల కాలంలో బిజేపి రాజకీయాలను కూడా ఆసక్తిగా గమనిస్తున్నారన్నది తెలిసిపోతోంది. 

టిఆర్‌ఎస్‌ను నేరుగా రాజకీయంగా ఎదుర్కోలేక బిజేపి కేంద్ర ప్రభుత్వ సంస్థలను అడ్డం పెట్టుకొని టిఆర్‌ఎస్‌ ను, తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలని చూస్తోందన్నది వినిపిస్తున్న మాట.ఐటి, ఈడి దాడులతో టిఆర్‌ఎస్‌ లో గందరగోళం నెలకొనేలా రాజకీయ వాతావరణం సృష్టిస్తున్నారు. వరుస దాడులతో టిఆర్‌ఎస్‌ నాయకులను బెంబేలెత్తిపోయేలా చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కాదు.

ఇదిలా ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంతో బిజేపిలో కలవరం మొదలైంది.

 దేశ వ్యాప్తంగా తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు. ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎక్కడా తగ్గడం లేదు. ఎంత దూరమైనా వెళ్లేందుకు రెడీగానే వున్నాడు. అదే బిజేపి పెద్దలకు మింగుడు పడడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో పాలన అస్థిరపర్చే కుయుక్తులకు బిజేపి తెరతీసిందనేది ప్రధానంగా సాగుతున్న చర్చ. దేశంలో అనేక చోట్ల బిజేపి ఇదే తరహా ప్రభుత్వాల ఏర్పాటు చేపడుతూవస్తోంది. డిల్లీలో కూడా ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలు ఆప్‌ ప్రభుత్వం పసిగట్టింది. జాగ్రత్త పడిరది. బిజేపి చేస్తున్నది తప్పని చెప్పింది. అనైతిక రాజకీయాలతో బిజేపి పాలన సాగించాలని చూస్తోందని ఆప్‌ దుమ్మెత్తిపోసింది. తెలంగాణ విషయంలో ఏకంగా రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిపోయారు. మింగలేక, కక్కలేక చతికిల పడ్డారు. ఆనాటి నుంచి బిజేపి నేతలు రకరకాల విన్యాసాలు వేస్తూ వస్తున్నారు. అయినా ప్రజలు నమ్మడం లేదు. దుర్మార్గం, దౌర్జన్యం ఎల్ల కాలం సాగదని ఇంకా బిజేపి నేతలు తెలుసుకోలేకపోతున్నారు.

రాష్ట్రంలో బిజేపి రాకుండా టిఆర్‌ఎస్‌ కు ఎర్రసైన్యం తోడయ్యింది.

 తెలంగాణలో వామపక్షాల బలం పూర్తిగా తీసిపారేయాల్సిన అంశం కాదు. క్షేత్ర స్థాయిలో బిజేపి కన్నా బలంగా వామపక్షాలున్నాయి. ఒకప్పుడు తెలంగాణలో వామపక్షాల ప్రభావం చాలా వుండేది. తెలంగాణ ఉద్యమం మూలంగా రెండు కమ్యూనిస్టు పార్టీలకు ఎడం పెరిగింది. బలం తగ్గింది. జై తెలంగాణ అనని పార్టీలు తెలంగాణలో లేకుండా పోయాయి. తెలంగాణ నినాదం ఎత్తుకున్న పార్టీలే మనుగడ సాగించాయి. అయితే సిపిఐ జై తెలంగాణ అన్నది. కానీ సిపిఎం నై తెలంగాణ అన్నది. దాంతో సిపిఎం క్షేత్ర స్థాయిలో వున్నా ప్రజల మద్దతు లేకుండా పోయింది. అంతే కాకుండా వామపక్షాలు ఉద్యమాలు కూడా చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. తెలంగాణ అమలౌతున్న అనేక సంక్షేమ పథకాల అమలుతో వామపక్షాలకు ప్రశ్నించే అవసరం రాలేదు. కాలం గిర్రున తిరిగింది. దేశంలో కూడా వామపక్షాల జాడ కనపడనంతగా మారిపోతోంది. ఎలాగైనా బిజేపిని నిలువరిస్తే తప్ప, వామపక్షాల రాజకీయాలకు ప్రజా క్షేత్రంలో చోటు దొరకదు. అందుకే టిఆర్‌ఎస్‌ అక్కున చేర్చుకుంటామనగానే మళ్ళీ వామపక్షాలకు ఊపిరొచ్చింది. టిఆర్‌ఎస్‌ తో కలిసి బిజేపిని ఎదుర్కొనేందుకు వామపక్షాలు నడుంబించాయి.

అయ్యవారు కయ్యానికే వస్తారు…కుంపటి పెట్టిపోతారు!?

` అటు ముప్పెట దాడి…

` ప్రభుత్వాన్ని అస్థిర పర్చడమేనా బిజేపి పని?

`ఇప్పుడు తప్పితే తెలంగాణ ను వశం చేసుకోవడం కుదరదని కుయుక్తులు?

` కేటిఆర్‌ సీఎం అయితే మరో పదేళ్ళ పాటు బిజేపి పాగా వేయడం కష్టం!

` అందుకే ఈ తొందరపాటు గందరగోళం…

`ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే పన్నాగం…

`ఎనిమిదేళ్ళలో ఏమిచ్చారని ఆదరించాలి?

`ఐటిఐఆర్‌ ఎందుకు లాక్కెల్లారు?

`కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ గుజరాత్‌ కు ఎందుకు తరలించారు.

`వీలు చిక్కినప్పుడల్లా తెలంగాణను అవహేళన చేస్తూనే వుంటారు.

`తెలంగాణ లో అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూనే వున్నారు.

`ఉత్తరాదికి మూటలు….దక్షిణాదికి మాటలు…

` అక్కడ కోట్ల పెట్టుడులు..

`ఇక్కడ రెచ్చగొట్టే ప్రసంగాలు…

`మభ్యపెట్టడం,మాయ చేయడం తప్ప తెలంగాణను ఇచ్చిందేమీ లేదు.

`తెలంగాణ సంపద ప్రైవేటు వ్యక్తుల వశం చేసేందుకే కపట నాటకాలు?

`అధికారంలో వుంటే అమ్మకాలకు అడ్డుందనే ఈ వేషాలు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ. అరవైఏళ్ల గోసలో మగ్గిన తెలంగాణ. ఆత్మగౌరవం కోసం ఆరాటపడిన తెలంగాణ. అస్దిత్వం కోసం ఎదురు చూసిన తెలంగాణ. ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణీ పౌరులుగా బతికిన తెలంగాణ. అలాంటి పరిస్దితుల నుంచి విముక్తి కోసం, స్వపరి పాలన కోసం, ప్రగతి కోసం మలి దశలో పద్నాలుగేళ్ల కొట్లాతో వచ్చిన తెలంగాణ. తెలంగాణ వచ్చి పట్టుమని పదేళ్లుకాలం కూడా కాలేదు. తెలంగాణ వచ్చిన నాటి నుంచే గద్దల్లా మళ్లీ తెలంగాణను అన్యాయం చేసేందుకు చూసిన చరిత్ర మన కళ్ల ముందే వుంది. తెలంగాణ వచ్చాక ఉద్యమ పార్టీని టిఆర్‌ఎస్‌ను ప్రజలు ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ అయ్యారు. అలా ప్రభుత్వం ఏర్పాటైందో లేదో తెలంగాణను ఎలా ఆగం చేయాలని చూసిన సందర్భాలు తెలియంది కాదు. తెలంగాణ ప్రజలు 2014 ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ఇచ్చిన సీట్లు 63. ఆ మెజార్టీని ఎలాగైనా దెబ్బతీయాలని, తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలని చంద్రబాబు చేసిన ప్రయత్నం చేశారు. అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, నేటి టిపిసిసి ప్రెసిడెంటు రేవంత్‌రెడ్డితో నోట్లకట్టలు పంపారు. కేసు ఇంకా కొనసాగుతూనేవుంది. దాంతో అప్పడు తెలంగాణ వచ్చినా, టిఆర్‌ఎస్‌ గెటిచినా, ఎదురు దెబ్బలు ఎన్ని తిన్నా నిలబడిన తెలంగాణ కావాలి అన్నదే కేసిఆర్‌ ఆశయం ప్రగతి సాధించిన తెలంగాణ ఆవిష్కారం కావాలని ఇతర పార్టీల నాయకులను టిఆర్‌ఎస్‌ పార్టీ వారి ఇష్టపూర్వకంగా వచ్చిన వారిని అక్కున చేర్చుకున్నది.అదే సమయంలో తెలంగాణ నిలబడానికి ఉపయోగపడిరది. ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లోనూ తెలంగాణను అన్యాయం చేసేందుకు ప్రతిపక్షాలన్నీ బయలుదేరాయి. ఇవన్నీ కేంద్రంలో వున్న బిజేపికి తెలుసు. ఆ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తెలంగాణను కాపాడేది, అభివృద్ధి చేసేది, ఆత్మగౌరవం నింపేది కేసిఆరే అని టిఆర్‌ఎస్‌కు ఎవరూ ఊహించని మెజార్టీ వచ్చింది. ఆ ఎన్నికల్లో 88 సీట్లు టిఆర్‌ఎస్‌ గెలిచింది. అయినా తెలంగాణను ఆగం చేద్దామని చూసే వాళ్లు చూస్తూనేవున్నారు. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం బిజేపి ఒక అడుగు ముందుకేసి దించేస్తామన్నంత దోరణి వ్యక్తం చేస్తోంది. సాక్ష్యాత్తు ప్రధాన మంత్రి నేరేంద్ర మోడీ ఇందుకు సహకరిస్తున్నాడన్న ఆరోపణలు కూడా టిఆర్‌ఎస్‌ చేస్తూనే వుంది. తెలంగాణ ప్రగతి చూసి ఓర్వులేని రాజకీయ పార్టీలు ఎలాగైనా తెలంగాణలో రాజకీయం చేయాలని చూస్తున్నారు. పొత్తిళ్లకాలం దాటకముందే తెలంగాణను మింగేద్దామని చూస్తున్నారు. రాజకీయ రాబంధులు కాచుకొని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాయి. అదును చూసి తెలంగాణ గొంతును నులిమేయాలని చూస్తున్నాయి. తెలంగాణ ఉనికి కూడా సరిగ్గా తెలియని బిజేపి నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వం మీద రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ మీద పెత్తనం కోసం పాకులాడుతున్నారు. 

నిజానికి ఏ రకంగా చూసిన రాష్ట్ర బిజేపి నేతలకు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. మలి తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్న సమయంలో ఆనాడు కేంద్రంలోవున్నది ఎన్డీయే( బిజేపి) ప్రభుత్వం. ఆనాటి ఉప ప్రధాని ఎల్‌కే. అద్వానీ తెలంగాణ ఉద్యమాన్ని ఎద్దేవా చేశాడు. ఇప్పుడు ఆయన శిష్యుడైన ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ఏర్పాటునే ఎగతాళి చేస్తున్నాడు. తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారన్నాడు. తల్లిని చంపి బిడ్డను రక్షించారన్నాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రధానికి తెలంగాణ అంటే ప్రేమ వుంటుందని ఎవరైనా అనుకుంటారా? ఎనమిదేళ్ల బిజేపి కేంద్ర పాలనలో తెలంగాణకు ఇంత వరకు ఒక్క ప్రాజెక్టు ఇచ్చింది లేదు. కనీసం విజభన హామీలు అమలు చేసింది. లేదు. కాని తెలంగాణ మీద పెత్తనం కావాలి. అధికారం కావాలి. అది కూడా ప్రజల మద్దతుతో ఎన్నికైన ప్రభుత్వాన్ని దింపి, బిజేపి ప్రభుత్వం ఏర్పాటుచేయాలి? ఇదేనే ప్రజాస్వామ్య స్పూర్తి. ఇదిలా వుంటే రాజ్‌భవన్‌ కూడా రాజకీయాలకు వేధిక చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా రాజ్‌భవన్‌ను రాజకీయ వేధిక చేసిన సందర్భాలున్నాయి. ఎన్టీఆర్‌ను దించేసేందుక రాంలాల్‌ ఏం చేశాడో తెలుసు. ఆ తర్వాత వచ్చిన కుముద్‌బిన్‌ జోషి కూడా ఆనాడు ఎన్టీఆర్‌ ఫ్రభుత్వానికి ఇబ్బందులకు గురిచేసిన చరిత్ర కూడా వుంది. ఇప్పుడూ అదే జరుగుతోందనేది టిఆర్‌ఎస్‌ ప్రధాన ఆరోపణ.. ఇదిలా వుంటే ఈ మధ్య టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అంశం ఎంత సంచలనం సృష్టించింది. 

  దేశంలోనే రెండో బలమైన ప్రభుత్వంగా వున్న టిఆర్‌ఎస్‌ను గద్దెదించాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదా? 

మునుగోడు ఉప ఎన్నిక తెచ్చి, తెలంగాణ ప్రభుత్వాన్ని అస్దిరపర్చుదామనుకున్నారు. కాని ప్రజలు బిజేపిని పక్కన పెట్టారు. ఇక ఇప్పుడు తప్పితే తెలంగాణను వశం చేసుకోవడం తర్వాత కాలంలో కలిసిరాకపోవచ్చు. అదును దొరక్కపోవచ్చు. కేంద్రంలో మళ్లీ బిజేపి అధికారంలోకి రాకపోవచ్చు. అప్పుడు మళ్లీ కష్టపడి ప్రజల మెప్పు పొందడం కష్టం కావొచ్చు. ప్రజలు బిజేపిని ఆదరిస్తారన్న నమ్మకం లేదు. ఇక మళ్లీ వచ్చే ఎన్నికల దాకా ఆగితే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చి, కేటిఆర్‌ సిఎం అయితే ఇక బిజేపి తెలంగాణలో భవిష్యత్తుఅన్నది వుండదు. కనీసం ఓ దశాబ్ధం పాటు బిజేపికి పని వుండదు. ప్రజల్లో వుండదు. అందుకే ఈ తొందరపాటు గందరగోళం. నిజానికి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆగం చేద్దామన్న ఆలోచనలో తామే దిగజారిపోతున్నామన్న సంగతి మర్చిపోతున్నారు. పైగా నిండా మునిగినవారికి చలేం చేస్తుందన్నట్లు ప్రజల మద్దతు లేకుండానే కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన దుర్మార్గపు ఘనతను బిజేపి సొంతం చేసుకున్నది. అదే ఎత్తుగడ ఇక్కడా వేయాలనిచూసింది. బొక్కాబోర్లా పడిరది. 

 ఇప్పుడు తాజాగా పిల్లపుట్టి పెరిగిపెద్దదైనంక బార సాల చేసినట్లు, రామంగుడం ఎరువుల ఫ్యాకర్టీని జాతికి అంకితం చేసే పని పెట్టుకొని ప్రధాని తెలంగాణకు వస్తున్నారు.

 పైకి కనిపించే పని ఎరువుల ఫ్యాక్టరీ అయినా, తెలంగాణలో పాగా వేయడమే ఇందులో ఆంతర్యమన్నది కనిపిస్తోంది. తెలంగాణకు ఈ ఎనమిదేళ్లకాలంలో కేంద్రం చేసిన అన్యాయాలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సివుంది. తెలంగాణకు విభజన చట్టంలో అప్పటి ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదు. కనీసం ఇప్పటికీ నదీ జలాల వాటాల లెక్కలు కూడా తేల్చలేదు. ఐటిఐఆర్‌ అనేది తెలంగాణకు విభజన చట్టంలో భాగంగా ఇచ్చారు. దాన్ని పునరుద్దరించమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సార్లు అడిగినా చడీ చప్పుడులేదు. తెలంగాణలో గత కొంత కాలంగా కోరుతున్న తెలంగాణ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్కులు కేటాయించడం లేదు. ఇప్పటికే ఐటిలో దూసుకుపోతున్న తెలంగాణకు సాఫ్ట్‌వేర్‌ పార్కులతో బలపడడం బిజేపికి ఇష్టం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెడికల్‌ కాలేజీలు లేవు. నవోదయ పాఠశాలలు లేవు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులోనూ కిరికిరే. ఉత్తరాధికి మూటలు, దక్షిణాదికి మాటలు చెప్పడం బిజేపి అలవాటు చేసుకున్నది. దానికి తోడు రెచ్చగొట్టే ప్రసంగాలుచేయడం నేర్చుకున్నారు. మభ్యపెట్టడం , మాయ చేయడం, ప్రజలను తమ మాటలతో సానుభూతి పొందాలని చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేసి, ప్రజల దృష్టిని మళ్లించాని పదేపదే చూస్తున్నారు. ఎందుకంటే ఒక అబద్దాన్ని పది సార్లు చెబితే అదే నిజమని నమ్మే ప్రమాదముంది. అలా తెలంగాణ ప్రజలను నమ్మించేందుకు శతవిధాల ప్రయత్నిస్తూనే వున్నారు. ఇవన్నీ తెలంగాణ మీద ప్రేమతోకాదు. తెలంగాణలో వున్న ఆర్ధిక వనరులను కొల్లగొట్టడం కోసం, ఉత్తరాధికి చెందిన వ్యాపారులకు కట్టబెట్టడం కోసమే తప్ప, ప్రజా శ్రేయస్సు కోసం కాదు…అందుకే టిఆర్‌ఎస్‌ మోడీ గో బ్యాక్‌ అంటోంది….తెలంగాణకు రావొద్దంటోంది!!

బడుగులను బలిచేసే బిజేపి అరాజకీయం!?

`బడుగులు బాడుగ పనులే చేయాలా?

`వ్యాపారాలు చేయొద్దా? 

`బడుగులు ఎదిగితే ఓర్చుకోలేరా?

`రాజకీయాలలో రాణించొద్దా?

`బడుగులను లను అణచివేసే కుట్ర?

`తెలంగాణలో గ్రానైట్‌ వ్యాపారాలపై ఈడీ దాడులు

`మంత్రి గంగుల, ఎంపి. రవిచంద్ర టార్గెట్‌..

`కరీంనగర్‌ జిల్లాలో గంగుల బలమైన నాయకుడు.

`జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగలడు.

`రవిచంద్ర మూడు జిల్లాల్లో పట్టున్న నాయకుడు.

`మున్నూరు కాపు రాష్ట్ర నాయకుడు.

`కష్టపడి పైకొచ్చారు…వ్యాపారం సాగించారు.

`పెద్ద ఎత్తున పేద వర్గాలకు అండగా నిలిచారు.

`పేదవారి కష్టాలు తెలిసిన నాయకులుగా సాయం కోసం వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపరు.

`అలాంటి బహుజన నాయకులు ఎదగడం బిజేపికి ఇష్టం లేదా?

 `రేపటి రోజు బిజేపిలో వున్న వారికీ అదే పరిస్థితి రానుందా?

`బిసి నాయకుల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడంపై బిసి సంఘాల మండిపాటు.

`పేరుకే బిజేపి బిసిలకు అనుకూలమా?

`బిజేపి నుంచి బయటకు వస్తున్న నేతలు కూడా బడుగులే…

`బలమైన బడుగు నేతలను భయపెట్టే రాజకీయం సరైంది కాదు!

`ఎంతో కష్టపడి ఎదిగిన బిసిలను అణచివేసి వేయడాన్ని తప్పు పడుతున్న బహుజన సంఘాలు.

`అణగారిన వర్గాలు ఉన్నత స్థాయికి చేరుకోవొద్దా?

`రేపటి రోజున ఆర్‌.ప్రవీణ్‌ కుమార్‌ లాంటి వాళ్లకు ఎదురుకావచ్చు?

`బహుజన సంఘాలు మేల్కొనాల్సిన తరుణం!

`బిసిలు ఎదిగి వ్యాపారాలు వేయడమే నేరమా?

`రూపాయి, రూపాయి కూడబెట్టి వ్యాపారం చేసి బాగుపడితే టార్గెట్‌ చేస్తారా?

`చెరపుకురా చెడేవు అన్న సామెత నిజం చేసుకోనుందా బిజేపి?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాజకీయం దారి తప్పుతోంది. దుర్మార్గం రాజ్యమేలుతోంది. దౌర్జన్యం వెంట పడుతోంది. ధనరాజకీయాలు ప్రజా సేవను కలుషితం చేస్తున్నాయి. పెత్తనాలు పెద్దవారి వైపు చూడకుండా, ఎదిగిన బడుగు నేతలను వారిని టార్గెట్‌ చేస్తున్నాయి. ఒక్కసారి సమాజాన్ని చూడండి. ఏ కాలం చూసినా, గత ఓ ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్లినా ఎక్కడా ఎదిగిన బడుగుల నాయకులు కనిపించరు. రాజకీయంగా రిజర్వేషన్ల పరంగా నాయకులైనా, వారు ఆర్ధికంగా ఎదిగింది లేదు. పెత్తందారులతో సమానంగా నిలబడిరది లేదు. ఇప్పుడు ఎదిగిన ఏ బడుగుల నేతైనా సరే ఎంతో కష్టపడి, జీవితాన్ని రంగరించుకొని విజయం సాదించిన వారే…తమ తెలివితేటలతో ధైర్యంగా తన ఆలోచనలకు పదునుపెట్టి ఒక్కొరూపాయి కూడబెట్టుకొని ఎదిగిన వాళ్లే కనిపిస్తారు. ఇప్పుడు సమాజంలో కొంత మార్పు కనిపిస్తున్నా, గతంలో బడుగులకు భూమలులేవు. ఎకరాలకు ఎకరాలు సాగు లేదు. కూలీలుగానే జీవనం. కౌలు రైతు జీవితం. కూలీ పనితో వెల్లబుచ్చుకున్న కాలం. కడుపు నిండా తిన్న రోజు లేదు. ఆ కసితో కష్టపడి ఎదిగిన వారు ఈ రోజు కొంత బలంగా కనిపిస్తున్నారు. వారు ఎదగడం ఉన్నత వర్గాలకు ఇష్టం లేదు. వుండదు కూడా…రాజకీయ పార్టీలను శాసించే ఉన్నత వర్గాలకు బడగులు ఎదిగితే చూడలేదు. ఓర్చుకోలేరు. అది రాజకీయాలకు ముడిపెట్టి, వారిని భయపెట్టి, వారి ఆర్ధిక మూలాలు దెబ్బతీసే కుట్ర చేయడం దుర్మార్గం. వారిని మానసికాందోళనకు గురిచేసి, అనారోగ్యాలు పాలు చేసి, ఆర్ధికంగా వారిని దెబ్బతీసి, ఆ కుటుంబాలలో కల్లోలం రేపడం తప్ప సాధించేదేమీ వుండదు. అయినా ఒత్తిడి చేయాలి. వారిని అణచి వేయాలన్న దోరణి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. బడుగులు బలమైన సామాజిక వర్గాలతో సమానంగా ఎదిగితే ఏం లాభం? వారి నిచ్చెన నుంచి లాగేయడం అన్యాయం కాదా? అది అక్రమం కాదా? బలమైన బడుగుల నేతలు బిజేపిలో కాకుండా ఇతర పార్టీలలో వుంటే నేరమా? వ్యవస్ధలను వాడుకుంటూ బిజేపి సాగిస్తున్న అరాచక కాండకు నిదర్శనం కాదా? ఇలాంటి అన్యాయాలు గతంలో ఎన్నడైనా చూశామా? 

ధర్మం నాలుగు పాదాల మీద నడవాలని నీతులు చెప్పిన వాళ్లే అధర్మం ఆచరిస్తున్నారు.

 రాజకీయ అవసరాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. రాజకీయాలలో పెడధోరణలు సృష్టిస్తున్నారు. వ్యవస్ధలను భ్రష్టుపట్టిస్తున్నారు. నీతికి, న్యాయానికి పట్టుగొమ్మలు కావాల్సిన ఈడీ. ఐడిలను స్వార్ధం కోసం వాడుకుంటున్నారు. బిజేపికి అననుకూలల రాజకీయ నాయకులను టార్గెట్‌ చేస్తున్నారు. వారిని భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు. వారి ఆర్ధిక మూలాలపై దెబ్బకొడుతున్నారు. వారి రాజకీయ జీవితాలను చిదిమేయాలని చూస్తున్నారు. రాజకీయాలకు వారిని దూరం చేయాలని చూస్తున్నారు. లేకుంటే లోబర్చుకొని బిజేపిలో చేరేలా చేస్తున్నారు. లేకుంటే వేధింపులకు గురిచేసేందుకు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు. ఇది బిజేపికి ఎంత మాత్రం మంచిది కాదు. పార్టీలపై నమ్మకంతో ఆయా పార్టీలలో నాయకులు చేరాలే గాని, భయంతో కాదు. పెత్తనం చేసిన రాజకీయం ఎప్పుడూ అరాజకీయమే అవుతుంది. కీచకమే తాండవిస్తుంది. ధర్మం వల్లె వేసిన నోటతోనే బిజేపి ధర్మం చెరబడుతున్నారన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. చేజేతులా మునిగిపోతామని తెలిసి కూడా నావకు చిల్లు పెట్టుకుంటున్నారు. రాష్ట్రాలలో కయ్యాలు పెట్టుకుంటున్నారు. చికాకులు సృష్టిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలనులో లోబర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా పార్టీలలో వున్న నాయకులను బిజేపిలో చేర్చుకునే కుట్రలు చేస్తున్నారు. 

తెలంగాణలో ఇప్పుడిప్పుడే బడుగులు కొందరు ఎదుగుతున్నారు.

 అలా ఎదిగేవారు రాజకీయాల్లో కీలకమౌతున్నారు. రాజకీయాలలో వారికంటూ ఓ స్ధానాన్ని, స్ధాయిని సృష్టించుకుంటున్నారు. రేపటి తరం బడుగులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కాని వారు టిఆర్‌ఎస్‌లో వుండడమే నేరమైపోయిందా? బిజేపిలో చేరకపోడమే తప్పైపోయిందా? బడుగు నేతలు రాజకీయాలు చేయొద్దా? స్వేచ్చాపూరితమైన నిర్ణయాలు చేయొద్దా? వారికి ఇష్టమైన పార్టీలను ఎంచుకొని సేవ చేయొద్దా? వుంటే బిజేపిలోనే వుండాలి? లేకుంటే రాజకీయాలలో వుండొద్దా? ఇదెక్కడి రాజకీయమో బిజేపి నేతలే చెప్పాలి. బడుగులు ఎప్పుడూ బాగుడ పనులు చేసుకుంటూనే బతకాలా? వారికి ఉన్నతమైన ఆలోచనలు రావొద్దా? వారు కూడా ఎదిగి వ్యాపారాలను శాసించొద్దా? రాజకీయాలలో క్రియాశీలకం కావొద్దా? దేశంలో 80శాతం వున్న బడుగులలో ఎంత మంది బలమైన నేతలున్నారు. ఎంత మంది వ్యాపారాలలో చెప్పుకునే స్ధాయిలో వున్నారు. కనీసం ఓ ఐదు శాతం కూడా కనిపించరు. అదే ఉన్నత వర్గాలు దేశంలో ఐదు శాతం వుంటే అందులో మొత్తం ఏదో ఒక రంగంలో కీలకమైనవారే కనిపిస్తారు. మొత్తం వ్యాపారాల్లో వారి పేరే వినిపిస్తుంది. తెలంగాణలో కూడా బిసిలలో వ్యాపారాలు చేసి, రాజకీయంగా ఎదిగిన వాళ్లను వేళ్లమీద లెక్కబెట్టొచ్చు. అంతే అంతకన్నా ఎక్కువ కూడా లేరు. అలాంటి బడుగుల నేతలు బాగు పడడం చూడలేరా? వారి రాజకీయ ప్రస్ధానాన్ని తుంచేస్తారా? బడుగులను కేంద్రంలో వున్న బిజేపి అణచివేసే కుట్ర కాదా? తెలంగాణలో బిసిలలో సామాజికంగా చైతన్యం వున్న వారు మున్నూరు కాపు. ఆ సామాజికవర్గంలో ప్రజల్లో వినిపించే పేర్లలలో మంత్రి గంగుల కమలాకర్‌, ఎం.పి వద్దిరాజు రవిచంద్ర వున్నారు. రాజకీయాల్లో వారికి ఎంత పేరుందో..సామాజిక సేవలోనూ వారికి అంతే పేరుంది. పేదిరికం వారికి తెలుసు. పేదల కష్టాలు తెలుసు , కన్నీళ్లు తెలుసు. వారి వేదన తెలుసు. జీవితాలు ఎంత అరణ్య రోధన అనుభవిస్తాయో తెలుసు. ఎంత ఎదిగినా, వారు ఆర్జించినదానిలో ఎంతో మంది పేదలను ఆదుకునే మనస్తత్వం ఇద్దరిదీ…అలాంటి నేతలు టిఆర్‌ఎస్‌లోవుండడం నేరమా? బిజేపిలో అలా పేదలకు అండగా నిలచే నాయకులు ఒక్కరైనా వున్నారో చూపించండి? ఒక్కరు కూడా కనిపించరు. బిజేపి నేతలు సేవ చేయలేరు. చేసే వారిని చూసి ఓర్వలేరు. ఇంత దౌర్భాగ్యమైన రాజకీయలు చేసిన పార్టీ ప్రపంచంలోనే ఎక్కడా కనిపించదేమో!

 గంగుల కమలాకర్‌ కరీంనగర్‌ రాజకీయాల్లో కీలకమైన నేత.

 ఏ పార్టీలో వున్నా తనదైన రాజకీయం చేసిన నాయకుడు. వ్యాపార పరంగా కూడా ప్రత్యేకతను సంతరించుకున్న నాయకుడు. అలాంటి నాయకుడు ఉత్తర తెలంగాణలోని కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల రాజకీయాలను ప్రభావితం చేయగల సమర్ధవంతమైన నాయకుడు. ముఖ్యంగా కరీంనగర్‌ రాజకీయాల్లో ఆయనది పై చేయి. అలాంటి నేతను ఇబ్బందులకు గురిచేస్తే, టిఆర్‌ఎస్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వీక్‌ చేయొచ్చు. అయితే రాజకీయాలను పక్కన పెడితే ఓ బడుగు నేతను ఇబ్బందిపెడుతున్నామన్న సంగతి బిజేపి తెలుసుకోకపోతే ఎలా? అలాగే ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ జిల్లాల రాజకీయాలను నిర్ధేశించే స్ధాయిలో వున్న ఎంపి. వద్దిరాజు రవిచంద్రను కూడా ఇబ్బందులకు గురిచేయడం అన్నది బిసి సంఘాలు, బహుజన సంఘాలు కూడా తప్పుపడుతున్నాయి. ఈ మధ్య జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు క్రియాశీలకంగా పనిచేశారు. మునుగోడులో బిజేపిని దెబ్బతీయడంలో ఈ ఇద్దరు కృతకృత్తులయ్యారు. ఇది బిజేపి తెలుసుకున్న నిజం. దాంతో ఎలాగైనా ఈ ఇద్దరు నేతల ఆర్ధిక మూలాలపై దెబ్బకొడితే టిఆర్‌ఎస్‌ను ఇబ్బందులకు గురిచేయొచ్చని బిజేపి నీచ రాజకీయానికి దిగిందనేది చాలా మంది వాదన. పేరుకే బిజేపి బిసిలకు అనుకూలంగా వుందన్న వాదన శుద్ద అబద్దమని తేలిపోయింది. ఆ మధ్య బిజేపిలో చేరి, ఇటీవల బిజేపి నుంచి బైటకు వచ్చిన నేతలు కూడా బడుగులే కావడం విశేషం. తెలంగాణ తొలి మండలి చైర్మన్‌గా పనిచేసినటువంటి స్వామీ గౌడ్‌కు బిజేపిలో ఎలాంటి గౌరవం, గుర్తింపు లేకుండాపోయింది. ఆయనను కనీసం నాయకుడిగా కూడా పార్టీ చూడలేదన్నది తేలిపొయింది. అందుకే ఆయన బైటకు వచ్చాడు. అలాగే ప్రజా గొంతుకగా ఉద్యమ కాలం నుంచి గుర్తింపు పొందిన దాసోజు శ్రవణ్‌ లాంటి నాయకుడిని కూడా ఆ పార్టీలో నిలబడనీయలేదు. ఇదే ఒకవడి కొనసాగితే రాష్ట్రంలో బహుజన సమాజ్‌పార్టీకి కన్వీనర్‌గా వున్న ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ లాంటి వారికి కూడా భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవేమో! కొన్ని కారణాల వల్ల బిజేపిలో చేరిన ఈటెలరాజేందర్‌, మాజీఎంపి వివేక్‌ లాంటివారు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చే రోజులు కూడా రొవొచ్చేమో! అందుకు బడుగులుకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే సమాజం ముందుండాలి. బడుగులంతా ఏకం కావాలి. ఎదుగుతున్న బడుగు నేతలను వ్యాపారాల పేరుతో ఇబ్బందులకు గురిచేసినా ఎదుర్కొనేందుకు అందరూ ఏకం కావాలి. బడుగులంతా ఒక్కటే అని నిరూపించాలి.

లబ్ధి దారులకున్న నీతి నాయకులకు లేకపాయే!

`జనానికి పంచమంటే మీరే పంచుకుతింటిరి!

`చిత్తశుద్ధి లేని నాయకుల బండారమిది.

`పంపకాలలో చేతి వాటం చూపించితిరి.

`లక్షలు దాచేసుకునిరి

`పంచమంటే నొక్కేశిరి?

`ఓటు వేసి వచ్చాక ఇస్తామనిరి…టోకరా ఇచ్చిరి?

`బిజేపి ఇచ్చిన దానికంటే తక్కువ ఇచ్చి ఓట్లు పడకుండా చేస్తిరి?

`పక్క వాళ్లకు ఎక్కువ, మాకెందుకు తక్కువ… అని లొల్లి తయారు చేపిస్తిరి?

`ప్రజలను గందరగోళంలో పడేస్తిరి.

`ప్రచారం తక్కువ, పైసలు నొక్కుడు ఎక్కువ చేస్తిరి!

`పార్టీని తిట్టిపిస్తిరి!

`జరిగిన లోపాలపై నేటిధాత్రి లోతైన సర్వే…

`ఏ గ్రామాలలో ఎంత నొక్కారన్నదానిపై నేటిధాత్రి ఆరా…

`లెక్కలు పక్కగా వెలికితీత…

`నేటిధాత్రి అందిస్తున్న సంచలన నిజాలు.

`ఇంకా మునుగోడులోనే నేటిధాత్రి బృందాలు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

మునుగోడు ఉప ఎన్నిక సాక్షిగా తెలంగాణ రాష్ట్ర సమితి చెందిన కొందరు నాయకుల కక్కుర్తి బైటపడిరది. ఉప ఎన్నికల ప్రచారమే అదునుగా అందిన కాడికి నొక్కేశారు. ఓట్ల కోసం ప్రజలకు అందాల్సిన సంతర్పణలు నాయకార్పణం చేశారు. ఎక్కడిక్కడ నొక్కేశారు. ఓటర్లకు అందించాల్సిన సొమ్ము దారి మళ్లించారు. మాయం చేశారు. చేతులెత్తేశారు. ఎంతో నమ్మకంతో పార్టీ వారికి పెత్తనం అప్పగిస్తే, నమ్మితేనే కదా! మోసం చేయొచ్చన్నది అక్షరాల నిజం చేశారు. గ్రామాలలో ప్రజలకు టోకరా ఇచ్చారు. పార్టీని మోసం చేశారు. మొత్తంగా మునుగోడు సాక్షిగా పార్టీని ముంచేదాకా తెచ్చారు. అసలు పార్టీ గెలవదనుకున్నారా? లేక? ఇవ్వకపోయినా లెక్కలడిగేవారు ఎవరు వుంటారనుకున్నారా? మేం ఒక్కరం ఇవ్వకపోతే… జనం ఓట్లేయరా? అనుకున్నారో ఏమో గాని చాలా గ్రామాల్లో నేతలు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వలేదు. రాజుగారి పుట్టిన రోజుకు ఊరంతా తెచ్చి పాలు పోయాలంటే, అందరూ తెచ్చి నీళ్లతో గంగాలం నింపినట్లు, ప్రజలకు పంచమని పైసలిస్తే, నేనొక్కడినే అనుకుంటూ అందరూ కలిసి నొక్కెశారు. జనానికి చెందకుండా చేశారు. కొన్ని ఓట్లు పడకుండా చేశారు. ప్రజలు ఓట్లేయలేదని అనొచ్చని పనికిరాని తెలివి చూపించారు…దీనిపై నేటిధాత్రికి అందిన వివరాలు, నేతలే స్వయంగా చెప్పిన మాటలు, గ్రామాల ప్రజల ఆక్రోశానికి చెందిన నిజాలు మీ ముందు వుంచుతున్నాం. ఇదీ కొందరు టిఆర్‌ఎస్‌ నాయకుల నీతి లేని తీరు…పని చేయకుండా తప్పించుకోవడమే కాకుండా, పంచాల్సి సొమ్ము నొక్కేసి చల్లగా జారుకున్నారు..దిగాజారిపోవడంలో మేమేం తక్కువ కాదని నిరూపించుకున్నారు.

 రాను రాను ఎన్నికలంటే పూర్తిగా డబ్బు మూటలతో ముడిపోతోంది.

 గతంలో ఎక్కడో డబ్బులు పంచారట అన్న పదం వినేవారు. రాను రాను అన్ని నియోజకవర్గాలలో పంపకాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ, ఆ పార్టీ నాయకుడైనా సరే ఎంతో కొంత ముట్ట జెప్పకపోతే జనానికి కూడా సంతృప్తి లేకుండాపోతోంది. ఇది ప్రజల తప్పు కాదు. ప్రజలకు ఆ అలవాటు చేసి, వారి నోరు మూయించాలని చూసి నాయకులది. గత రెండు దశాబ్ధాలుగా దేశంలో ఎక్కడైనా ఎన్నికలంటే డబ్బుల మూట లేకుండా కష్టమన్నది తేలిపోయింది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే కూడా ఎంత ఖర్చు చేయాలన్నదానిపై కూడా పక్కా లెక్కలున్నాయి. గెలుపు గుర్రాల జాబితాలో చేరాలంటే ఎన్ని కోట్లు ఖర్చు చేయగలరో ముందే చెప్పగలగాలి. అంత దూరం వెళ్లింది రాజకీయం. అయితే ఉప ఎన్నికలు అంటే మరీ ఖరీదైపోయాయి. ఇదంతా భహిరంగ రహస్యమే…ఉప ఎన్నిక వస్తుందని తెలిస్తే చాలు…ఆ రోజు నుంచే ఇక ఊళ్లల్లో జాతరలు మొదలు కావాల్సిందే. పుసుక్కున పోటీ చేయాలనుకుంటున్న అనే మాట ఏ నాయకుడిని నోటి నుంచి వినపడినా సరే…ఆ మాట మూటను ముందు పెట్టుకొని చెప్పాలిందే..లేకుంటే చిక్కులే. ముఖ్యంగా హుజూరాబాద్‌ ఉప ఎన్నికతో ఈ రకమైన దోరణి మరీ ఎక్కువైంది. హుజూరాబాద్‌లో ఓటుకు ఇంత అని కవర్లలో పెట్టి మరీ అందరూ పంచారు. మునుగోడులో కూడా అదే చేశారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు అందరూ చేసిందే..అందులో ఏ ఒక్కరూ అతీతులు కాదు. కాకపోతే పార్టీలు ఇక్కడ న్యాయంగా జనానికి అందించాలన్న ఆలోచనతో పంపిన డబ్బులు మధ్యలో నాయకులు మాయం చేయడమే పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

ఎన్నికల రోజునే మీడియాలో అనేక కథనాలు వచ్చాయి.

 లైవ్‌ లో కూడా కొన్ని గ్రామాలలో మాకు డబ్బులు అందలేదని ప్రజలు చెప్పిన విషయాలు కూడా విన్నాం. అంతే కాకుండా ఆయా గ్రామాలకు చెందిన నేతలకు డబ్బులు చేరినా, మాకు పంచడం లేదని ప్రజలు చెప్పడం జరిగింది. మునుగోడులో టిఆర్‌ఎస్‌ పార్టీ, బిజేపిలు పోటీ పడి మరీ డబ్బులు పంచాయన్నదానిలో ఎలాంటి వివాదం లేదు. కాకపోతే ఎన్నికలకు రెండు రోజుల ముందు ఓటుకు మూడు వేలు, ఇచ్చి రేపు పోలింగ్‌ అనగా మరో రెండు వేలు టిఆర్‌ఎస్‌ పంపించిందనేది ఓ లెక్క. మొత్తంగా ఓటుకు ఐదు వేల రూపాయలు చేరాలి. కాని ముందు ఇచ్చిన మూడు వేలు గ్రామాలల్లో నాయకులు, ప్రచారానికి వెళ్లిన నాయకులు పంచారు. అయితే ఇక్కడ కూడా కొందరికి పంచలేదన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇక తర్వాత పంచాల్సిన రెండు వేలు పంచకపోవడంతో, పక్కాగా నాలుగు వేలు పంచిన బిజేపికి పెద్దఎత్తున ఓటు పడిరదని తెలుస్తోంది. బిజేపి నేతలు ఎక్కడా ఇలా డబ్బులు మాయం చేశారన్న అపవాదు ఒక్కటి కూడా లేదు. కాని టిఆర్‌ఎస్‌లోనే ఎందుకు వస్తుంది? అంటే నాయకులకు పార్టీ గెలుపుపై నమ్మకం లేక చేశారా? లేక ఎలాగైనా గెలుస్తామన్న అతి విశ్వాసంతో చేశారా? మేజర్‌ గ్రామాల్లో కొంత వరకు పంచినా, మారు మూల గ్రామాలలో పంచాల్సిన డబ్బులన్నీ నేతలే నొక్కేశారు. 

బిజేపికి ఎక్కువ ఓట్లు పోలైన గ్రామాలన్నింటిలోనూ ఇదే వాదన వినిపిస్తోంది.నేటిధాత్రి బృందం మునుగోడులో రెండు నెలల పాటు గ్రామస్ధాయి నుంచి సర్వే చేయడం మొదలు పెట్టింది. బృందాలుగా అన్ని గ్రామాల ప్రజల ఆలోచనలు సేకరించింది. పార్టీల బలాబలాపై ఖచ్చితమైన లెక్కలు వేసింది. కాని ఆఖరు రోజున పంచాల్సిన సొమ్ములు జేబుల్లో నుంచి తీయక నేతలు చేసిన తప్పుల వల్ల మునుగోడులో రావాల్సింత మెజార్టీ టిఆర్‌ఎస్‌కు రాలేదు. ఎందుకంటే బిజేపికి మునుగోడులో చోటు లేదు. ఆపార్టీకి క్యాడర్‌లేదు. కాని ఓటు పెద్దఎత్తున నమోదైంది. కారణం కేవలం టిఆర్‌ఎస్‌ నేతలు చేసిన ఇలాంటి పని మూలంగానే ఓటు రాజగోపాల్‌కు పడిరదనేది వెల్లడౌతున్న పచ్చి నిజాలు. ఎక్కడైతే రాజగోపాల్‌ రెడ్డి కంటే ఎక్కువ డబ్బులు అందాయో అక్కడ టిఆర్‌ఎస్‌కు ఓటు పడిరది. బిజేపికన్నా, టిఆర్‌ఎస్‌ డబ్బులు తక్కువయ్యాయో! అక్కడ బిజేపికి ఓటు పెరిగింది. ఇదిలా వుంటే హైదరాబాద్‌లోని ఓ కార్పోరేటర్‌ భర్త, టిఆర్‌ఎస్‌ క్రియాశీల నాయకుడి స్వగ్రామం మునుగోడు నియోజకవర్గంలో వుంటుంది. ఆ గ్రామంలో డబ్బులు అందలేదని ఆ నాయకుడికి ప్రజలు ఫోన్‌ చేసి అక్కడ జరుగుతున్న తంతు వివరించారట. చివరికి ఆయన చెప్పినా నాయకులు ప్రజలకు డబ్బులు పంచలేదని ఆ నాయకుడు విచారం వ్యక్తం చేశాడు. అంతే కాకుండా మునుగోడు నియోజవకర్గ ఓటర్లు చాలా మంది హైదరాబాద్‌లో బతుకుతెరువ కోసం వుంటారు. వారిలో తమ గ్రామానికి చెందిన వారిని సదరు నాయకుడు పోలింగ్‌ రోజు ఆ గ్రామానికి పంపించారు. కాని పోలింగ్‌ రోజు వెళ్లిన వారికి కూడా గ్రామాల్లో నాయకులు డబ్బులు ఇవ్వలేదని, తాను ఫోన్‌ చేసి చెప్పినా పట్టించుకోలేదని ఆ నాయకుడు వాపోయాడు. అంటే ఓటర్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తప్పు చేసినా, సంక్షేమ పధకాల లబ్దిదారులైన ఓటర్లు మాత్రం ఓట్లేశారు. టిఆర్‌ఎస్‌ను గెలిపించారు. 

ఇలాంటి నాయకులతో ఎప్పటికైనా ఇబ్బందే…

డబ్బులు నొక్కేశారన్న అపవాదులు ఎదుర్కొంటున్న వారిలో ఎమ్మెల్యేలు కూడా వుండడం గమనార్హం. వీటిపై నేటిధాత్రి వద్ద కూడా లేక్కలున్నాయి. ముఖ్యమంత్రి కేసిఆర్‌ దృష్టికి కూడా ఈ సమచారం వెళ్లింది. అందుకే ఆయన అసలేం జరిగింది. మెజార్టీ ఎలా తగ్గిందనేదానిపై పార్టీ పరిశీలన బృందాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన ఇన్‌చార్జిగా వున్న గ్రామాలలో రెండో దఫా అందలేదన్న ఆరోపణలు ఎక్కువ వినిపిస్తున్నాయి. అంతేకుండా కొందరు ఎంపిలు, ఎమ్మెల్యేలు కూడా ఇదే దారిలో నడిచారని తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే సదరు నాయకులకు అందజేసినా, వాళ్లు పంచలేదన్నది కూడా కొంత తెలుస్తోంది. ఇలా సరైన పర్యవేక్షణ లేక, చిత్త శుద్ది, అంకితభావం లేని నాయకుల మూలంగా మునుగోడులో మునిగిపోయే పరిస్ధితి తెచ్చారు. కాకపోతే సంక్షేమ పథకాలపై ప్రజల్లో వున్న నమ్మకం, ముఖ్యమంత్రి కేసిఆర్‌పై కృతజ్ఞతే టిఆర్‌ఎస్‌ను గట్టెక్కించిందని చెప్పక తప్పదు.

పాలిత రాష్ట్రాల్లోనే బిజేపి గెలిచింది…మిగతా చోట్ల ఓడింది!

దేశ వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలలో బిజేపికి షాక్ తగిలింది. బిజేపి పాలిత రాష్ట్రాలలో తప్ప, ప్రాంతీయ పార్టీలను తట్టుకొని మిగతా చోట్ల చతికిలపడింది. గెలుపు అందుకోలేకపోయింది. ఆయా రాష్ట్రాలలో గెలుపు అంత సులువు కాదని తేలిపోయింది. గెలుపు కోసం బిజేపి సర్వ శక్తులు ఒడ్డినా గెలవలేకపోయింది. ఇవి బిజేపికి ఈ నెల 3న జరిగిన ఉప ఎన్నికలతో 6న వెలువడిన ఫలితాల గుణపాఠం. బిజేపి పాలిత రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలలో మాత్రమే గెలిచింది. కానీ తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలలో ఓటమి పాలైంది. అంటే బిజేపి అధికారంలో వున్న రాష్ట్రాలలో గెలవడం అన్నదానిపై కూడా రకరకాల విశ్లేషణలున్నాయి. అయితే ఈ ఉప ఎన్నికలు బిజేపికి రాజకీయంగా ఆశనిపాతమనే చెప్పాలి. మహారాష్ట్ర లోని అంథేరీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో ఉద్దవ్ ఠాక్రేకు చెందిన శివసేన ఘన విజయం సాధించింది. మహారాష్ట్ర గత ఎన్నికలలో ప్రజలు తీర్పును అనుసరించి అక్కడ శివసేన, ఎన్సీపిల ప్రభుత్వం ఏర్పాటైంది. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆ ప్రభుత్వాన్ని బిజేపి కూలదోసింది. శవసేనను చీల్చింది. ఏక్ నాధ్ షిండేను సిఎం చేసింది. డమ్మీ ముఖ్యమంత్రి అయిన షిండేను ముందు పెట్టుకొని బిజేపి పెత్తనం చేస్తోంది. పాలన బిజేపి కనుసన్నల్లో సాగుతోంది. గతంలో కూడా ఇలాగే చేసింది. 2014 ఎన్నికలలో గెలిచి శివసేన పొత్తుతో బిజేపి అధికారంలోకి వచ్చింది. శివసేనను నిండా ముంచింది. నిజానికి శివసేన నీడలో బిజేపి ఎదిగింది. పెరిగింది. హిందుత్వ వాదానికి, ఆకాంక్షలకు శివసేన ప్రతీక. అయినా ఆ పార్టీ నీడలో చిగురించి, శివసేననే మింగేయాలని చూస్తోంది. కానీ ప్రజలు బిజేపి నిర్ణయాన్ని ఈ ఉప ఎన్నికతో తిప్పికొట్టారు. శివసేన ను గెలిపించి బిజేపి కి బుద్ధి చెప్పారు. ఇక తెలంగాణలోనూ టిఆర్ఎస్ ను ఖతం చేయాలని సంకల్పించారు. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, కర్ణాటక తరహాలో తెలంగాణ రాజకీయాలను‌ అస్థిర పర్చాలనుకున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వాన్ని దెబ్బ తీయాలనుకున్నారు. ఆ మధ్య ఏకంగా ‌ఎమ్మెల్యేల కొనుగోలుకు బరితెగించారు. అడ్డంగా దొరికిపోయింది.‌ అంతే కాకుండా ఈడీ పేరుతో దాడులకు ప్రయత్నం జరిగింది. లిక్కర్ స్కాం అంటూ టిఆర్ఎస్ పార్టీని‌ ఇబ్బంది పెట్టాలని చూసింది. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆత్మవిశ్వాసం దెబ్బ తీయాలని చూసింది. కాని‌ నేను గోకితే ఎలా వుంటుందో చూపిస్తా, అని ముఖ్యమంత్రి కేసిఆర్ బిజేపికి మునుగోడు ద్వారా చుక్కలు చూపించాడు. మునుగోడులో ఉప ఎన్నిక తెచ్చి టిఆర్ఎస్ ను ఖళీ చేయాలని చూసిన బిజేపి తెలంగాణలో స్థానం‌ లేదని తెలుసుకున్నది. అద్దె నాయకుల బలం మీద ఆధారపడి రాజకీయం చేస్తే వున్న పరువు గంగపాలౌతుందని తెలుసుకున్నది. కేసిఆర్ ను ఎదుర్కోవడం అంటే అంత ఆషామాషీ కాదని తెలుసుకున్నది. ముఖ్యమంత్రి కేసిఆర్ ను జాతీయ రాజకీయాల దరిదాపుల్లోకి రాకుండా చేయాలని చూసి బిజేపి బొక్కబోర్లా పడింది. మునుగోడు గెలుపుతో దేశ రాజకీయాలలో బిఆర్ఎస్ రూపంలో టిఆర్ఎస్ రాజకీయాలకు నాంది జరిగింది. ఇక కేసిఆర్ నాయకత్వానికి తెలంగాణలో ఎదురేలేదని తేలిపోయింది. మరో సారి బిజేపి కవ్వింపులకు తెలంగాణలో పప్పులుడకవని తెలుసుకున్నది. ఒక రకంగా చెరపకురా చెడేవు…అన్నట్లు టిఆర్ఎస్ ను ఆగం చేద్దామని చూసి, బిజేపి గందరగోళంలో పడింది. తెలంగాణ రాజకీయ సుడిగుండం ఈదడం డిల్లీ రాజకీయాలు నెరిపినంత ఈజీ కాదని తెలుసుకున్నది. ఇక బీహార్ లోని మొకామా నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి నీలం దేవి గెలుపొందింది. గతంలో ఆర్జేడితో కలిసి ఎన్నికల పోరును దాటి, ఆఖరుకు ఆర్జేడి ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూసింది. ‌బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చాణక్యం ముందు బిజేపి ఆటలు చెల్లలేదు. ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికలో బిజేపి గెలవలేదు. బిజేపి ఎక్కడైనా ఓడి గెలవాలనుకుంటుంది. తెలంగాణలో బలం లేకున్నా బలగం పెంచుకోవాలని చూసింది. ముఖ్యమంత్రి కేసిఆర్ అప్రమత్తతతో బిజేపి బిత్తరపోయింది. తెలంగాణ రాజకీయాల జోలికి వెళ్లాలంటే మన బలం సరిపోదని ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని‌ తెలంగాణ వాదులంటున్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు హితవు పలుకుతున్నారు.

ఆ మంత్రుల పనితనం కనిపించలే!

పేరుకే ఆ మంత్రులది దూకుడు. మాటలు కోటలు దాటిస్తారు. మునుగోడు విషయంలో ముగ్గురు మంత్రుల ప్రచారంలో వార్తల్లో వ్యక్తులయ్యారు. ఫలితాల నాడు వారి పని తనమేమిటో తెలిసి అలా కూడా విమర్శల పాలయ్యారు. వారు ప్రచారం చేసిన గ్రామాలలో బిజేపికి ఓట్లు పడేలా అతి చేశారు. ఎన్నికల ప్రచారంలో మరీ ఓవర్ యాక్షన్ చేసిన మంత్రులలో మల్లారెడ్డి ముందు వరుసలో వున్నారు. ఆయన ప్రచారానికి వెళ్ళిన తొలి రోజే మందు విందు ఏర్పాటు చేశారు. వివాదాలు మూటగట్డుకున్నారు. తాను ప్రచారం చేసిన గ్రామంలో బంధువులున్నారంటూ అసత్యాలు చెప్పారు‌. తర్వాత మల్లారెడ్డి ఇచ్చిన దావత్ లో కూర్చున్న వాళ్లే ఆయనతో బంధుత్వం లేదన్నారు. ఒక మంత్రి స్థాయిలో వుండి, మద్య సేవనంలో కూర్చోవడమే పొరపాటు. దానిని సమర్థించుకోవడం గ్రహపాటు. అంతిమంగా టిఆర్ఎస్ పార్టీకి పోటు…కారుకు పాడాల్సింది కమలానికి పడింది ఓటు. మంత్రి మల్లారెడ్డి ఇచ్చిన మందు విందు ఫోటోలు బైట పెట్టింది… టిఆర్ఎస్ వాళ్లే…ప్రతిపక్షాలను తిట్డి మళ్ళీ మల్లారెడ్డి తప్పు చేశారు. ప్రచారం చేసి రమ్మంటే మల్లారెడ్డి వివాదాలు మూటగట్టుకొని వచ్చారు. ఓటు బ్యాంకుకు తూట్లు పొడిచారు…పోటుగాడు ప్రచారం చేసే పోటీయే వుండదన్నంత రేంజ్ లో మాటలు చెప్పి, తుస్సుమనిపించాడు. ఇళ్లిళ్లు తిరిగి ప్రజలను ఒప్పించి, మెప్పించి ఓట్లు సంపాదించాల్సింది పోయి, మీడియాలో ప్రచారంలో కనిపించి అదే గొప్ప అన్నట్లు చేశారు. ఆఖరుకు టిఆర్ఎస్ కు ఓట్లు లేకుండా చేశారు. ఇది పార్టీ సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం. ఇక వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్. అటు తన నియోజకవర్గంలో వివాదాలే…మునుగోడు ప్రచారంలో ఆయనతో లాభం జరగకపాయే. ఆయన ప్రచారం చేసిన గ్రామాల్లో బిజేపి ఓట్లు కొల్లగొట్టుకుపోయింది. మునుగోడు ముఖ్యంగా గౌడ సామాజిక వర్గం ఓట్లను శ్రీనివాస్ గౌడ్ ఎంతో చాకచక్యంగా టిఆర్ఎస్ వైపు మళ్లిస్తాడని అనుకున్నారు. కానీ ఆయన ఏం ప్రచారం చేశాడో, ఎంత తీవ్రంగా ప్రయత్నం చేశాడో ఇక్కడే అర్థమౌతుంది. ఇక మరో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆయన ప్రచారం చేసిన గ్రామంలో కూడా బిజేపికి ఓట్లు పడ్డాయి. అంటే మంత్రుల స్థాయిలో వుండి, ఒకటి రెండు గ్రామ ప్రజలను వాళ్లు ఒప్పించలేకపోయారు. మెప్పించలేకపోయారు. టిఆర్ఎస్ కు ఓట్లేయించలేకపోయారు. సుమారు నెలన్నర కాలం పాటు ప్రచారం చేసిన మంత్రులు తమకు అప్పగించిన పనిని తూతూ మంత్రంగానే నిర్వర్తించారనేది స్పష్టమైంది. ఇలాంటి మంత్రులతో టిఆర్ఎస్ భవిష్యత్తును ఊహించుకోవడం ఎంత నష్టదాయకమో పార్టీ ఆలోచించుకోవాలి. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరించలేకపోయారు. కనీసం లబ్ది దారులందరి చేత ఓట్లు వేయించలేకపోయారు. ఇది ముమ్మాటికీ ఆ మంత్రుల వైఫల్యమే!

తుప్రాన్ పేటలో పలువురు నాయకులు బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరిక

ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ల నాయకత్వాన బీజేపీకి గుడ్ బై చెప్పిన స్థానిక నాయకులు

వాడవాడలా,గడప గడపకు వెళ్లి టీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు కూడగట్టిన రవిచంద్ర, పూల రవీందర్

తుప్రాన్ పేట: చౌటుప్పల్ మండలం తుప్రాన్ పేటలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్,

ఎమ్మెల్సీ పూల రవీందర్ ల నాయకత్వాన బీజేపీకి చెందిన స్థానిక నాయకులు పలువురు టీఆర్ఎస్ లో చేరారు.తుప్రాన్ పేట రచ్చబండ వద్ద ఆదివారం ఉదయం ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్యే

మల్లయ్య, మాజీ ఎమ్మెల్సీ రవీందర్ లు స్థానికులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు.ఈ సందర్భంగా అక్కడే ఉన్న గంధం

సత్యనారాయణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన తాను బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు.ఎంపీ రవిచంద్ర వెంటనే ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా

ఆహ్వానించారు.ఆ తర్వాత వద్దిరాజు, రవీందర్ లు గ్రామంలో కాలినడకన వాడవాడలా తిరిగి మున్నూరుకాపుల గడప గడపకు వెళ్లి అందరిని ఆత్మీయంగా పలకరించారు.అనారోగ్యానికి గురైన వర్కూరి బాలకృష్ణను పరామర్శించారు,ఈ సందర్భంగా ఆయన సోదరులు మల్లేష్,రాజేందర్ లు బీజేపీకి గుడ్ బై చెప్పి గులాబీ కండువాలు కప్పుకున్నారు.అదేవిధంగా కాంగ్రెస్ నాయకుడు కేశెట్టి సత్తయ్య, బీజేపీకి చెందిన కేశెట్టి జంగయ్య,కంకణాల వెంకటయ్య, పగడాల చిన్న మల్లయ్య, పగడాల కృష్ణ, పగడాల శ్రీనివాస్,వర్కూరి జంగయ్య,ఆయన కుమారులు భానుచందర్,భరత్ కుమార్,సిపిఎంకు చెందిన పగడాల భిక్షపతి తదితరులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ఈ సందర్భాలలో ఎంపీ రవిచంద్ర వెంట తుప్రాన్ పేట,ఇనుగుర్తి సర్పంచ్ లు చక్రం జంగయ్య, రాంమూర్తి, మున్నూరుకాపు ప్రముఖులు ఆర్.వి.మహేదర్,కేశెట్టి మహేష్,గుండ్లపల్లి శేషగిరిరావు,జెన్నాయికోడే జగన్మోహన్ తదితరులు ఉన్నారు.ఈ సందర్భంగా “వర్థిల్లాలి వర్థిల్లాలి టీఆర్ఎస్ వర్థిల్లాలి”, “జిందాబాద్ జిందాబాద్ కేసీఆర్ నాయకత్వం జిందాబాద్”,”జై మున్నూరుకాపు జై జై మున్నూరుకాపు”,”కారు గుర్తుకే మన ఓటు” అనే నినాదాలు హోరెత్తాయి.

బిజేపి మైండ్‌ గేమ్‌ మాయాజాలం…! అబ్రదకబ్ర అబద్దాల ప్రచారం??

`నిజాలు చెప్పలేక అసత్యాలను నమ్ముకున్న కుటిల రాజకీయాలు

`ఫేక్‌ న్యూస్‌ సృష్టించి, నమ్మించేందుకు ఎంచుకున్న బిల్డప్‌ బాబాయిలు.

` అధికారంలో లేకున్నా అవీ ఇవీ అంటూ అచ్చికబుచ్చిక హామీలు….

`వచ్చేది మేమే అంటూ బచ్చకాయల ప్రసంగాలు…

`కాంగ్రెస్‌కు కాసుల కష్టమంటూ చూసినట్లు గందరగోళాలు…

`టిఆర్‌ఎస్‌ కు కమ్యూనిస్టులు దూరమంటూ గోబెల్స్‌ ను మించిన కోతల కూతలు…

` ఇవన్నీ వింటున్న జనం నవ్వుకుంటున్నారు….

`రాజగోపాల్‌ రెడ్డి అత్యాశను ఎండగడుతున్న ప్రజలు….

`బహిరంగంగానే గ్రామాల్లో తిడుతున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

అబద్దాలతో రాజకీయాలు చేయొచ్చని, అసత్యాలు ప్రచారం చేయొచ్చని, గెబెల్స్‌ను మించిన అర్ధసత్యాలు ఎన్నికల నాడు విసృతంగా వాడుకోవచ్చని బిజేపి నిరూపిస్తోంది. అదే పంధాను దేశమంతా అమలు చేస్తున్నట్లు వుంది. ఆ మధ్య ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల సమయంలో తెలంగాణ మోడల్‌ను చూపించి ప్రచారం చేసుకున్న సంగతి చూసిందే…శ్రీశైలం ప్రాజెక్టును చూపించి ఉత్తర ప్రదేశ్‌లో ప్రాజెక్టులంటూ ప్రచారం చేసుకున్నారు…సాక్ష్యాత్తు ప్రధాని మోడీ కూడా తెలంగాణలో మిషన్‌ కాకతీయ మూలంగా మళ్లీ కళకళలాడుతున్న వరంగల్‌ చెరువును తామే బాగు చేశామనేలా అర్ధమొచ్చేలా చెప్పుకున్న విషయంకూడా విధితమే…ఇలా ఏడాది పొడవునా అన్నీ ఫేక్‌ వార్తలు సృషించి, ఎన్నికల నాడు విచ్చలవడిగా వాటిని వాడుకోవడం బిజేపికి అలవాటైనట్లుంది. అందుకే మునుగోడు ఉప ఎన్నికల్లో ఏంచెప్పాలో అర్ధం కాక, అబ్రకదబ్ర విద్యలు ప్రదర్శిస్తూ రాజకీయం చేస్తున్నట్లుంది. మీడియాను ఎన్నికల సమయంలో తన ఇష్టాను రీతిన వాడుకుంటూ మైండ్‌ గేమ్‌ రాజకీయాలు సాగిస్తోంది. ఇది టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు అంటున్న మాటలే కాదు ప్రజలు కూడా చెప్పుకుంటున్న మాట. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాసుల లేమితో కొట్టుమిట్టాడుతున్నదన్న ప్రచారం సాగిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల్లో నిస్తేజం నిండేలా చేస్తోంది. నాయకులు, కార్యకర్తలు తమ సమయాన్ని వృధా చేసుకోవడం ఎందుకని, పార్టీ ప్రచారానికి దూరమయ్యే ఎత్తుగడలు బిజేపి వేస్తోంది. నాయకులు, కార్యకర్తలే ప్రచారానికి దూరమైతే, ప్రజలు కూడా ముందుకు వచ్చేందుకు వెనకాడుతారన్నది బిజేపి అంచనా…! కాంగ్రెస్‌పార్టీని డిఫెన్స్‌లో పడేస్తే తప్ప, ప్రజల ఆలోచన దోరణి మారదన్నది బిజేపి కుటిల ప్రయత్నంగా తెలుస్తోంది. ఇదిలా వుంటే ఫేక్‌ వార్తలు సృష్టించి టిఆర్‌ఎస్‌కు వామపక్షాలకు దూరం పెరిగినట్లు కొత్త అసత్య వార్తలు సృష్టిస్తున్నారు. గురువారం మునుగోడులో నామినేషన్‌ వేసిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా సాగిన ర్యాలీలో మంత్రులు కేటిఆర్‌, జగదీశ్‌రెడ్డి, కర్నె ప్రభాకర్‌లతోపాటు, జీపుపై సిపిఐ, సిపింఎం నాయకులు కూడా వున్నారు. అయినా బిజేపి అబద్దాలైనా ప్రచారం చేసి గెలవాలన్న ఆలోచనతో, ఫేక్‌ స్టోరీలు సృష్టించి, సోషల్‌ మీడియా వేధికగా ఇలాంటి అబద్దాలను నమ్ముకొని ప్రచారం చేస్తోంది. ఎన్నికల వేళ గెలిచామా? లేదా? అన్నదే ముఖ్యమనుకునే రాజకీయాలు నడుస్తున్న రోజులు. అసలు రాజగోపాల్‌రెడ్డి ఎందుకు రాజీనామా చేసినట్లు? అన్నదానిపై జరగాల్సిన చర్చను పక్కదారి పట్టించి, ఉప ఎన్నిక తెచ్చి తన బలం పెంచుకోవడం కోసం బిజేపి వేసిన ఎత్తులను ప్రజలు బాగానే గమనిస్తున్నారు. మూడేళ్ల కిందట రాజగోపాల్‌ ఏం మాట్లాడాడు?

ఏం చెప్పి ఎన్నికల్లో పోటీ చేశాడు? అన్నది ఓసారి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం వుంది. 2018 ఎన్నికల సమయంలో మునుగోడు నియోజవర్గంలోని చండూరు మండల అభివృద్ధి కోసం ఇచ్చిన ఎన్నికల హామీలను ఓసారి పరిశీలిద్దాం…గట్టుప్పల్‌ను ప్రత్యేకంగా మండలం చేయిస్తానన్నాడు. కాని నాలుగేళ్లలో ఆయన చేసిన పోరాటం లేదు. ఉద్యమం లేదు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది లేదు. కాని ప్రజలు చేసిన ఉద్యమం మూలంగా ప్రభుత్వం ఇటీవల ఆ మండలాన్ని ప్రకటించింది. ప్రజల కోరిక నెరవేర్చింది. దానిని తన ఖాతాలో వేసుకునేందుకు కూడా రాజగోపాల్‌రెడ్డి వెనుకాడడం లేదు. ఇక చండూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు, నిర్మాణం, మోడల్‌ స్కూలు నిర్మాణం అన్నాడు. కాని అదీ చేయలేదు. చండూరు మండలంలో జూనియర్‌ కాలేజీ ఏర్పాటు చేయిస్తానన్నాడు. కాని ఆ వైపు అడుగులు వేయలేదు. ప్రభుత్వం దృష్టికి తేలేదు. ఎన్నికల నాడు ఇచ్చిన హామీని ఎప్పుడో మర్చిపోయాడు…వ్యాపారాలు మాత్రం పెంచకుంటూ వెళ్లాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. బెండలమ్మ చెరువు మరమ్మత్తులుపూర్తి చేయించి, గొల్ల గూడెం, పుల్లం, బంగారిగడ్డ, తాస్కాని గూడేలంకు సాగునీరు అందిస్తానన్నాడు. కాని వాటి కోసం ప్రభుత్వాన్ని కలిసింది లేదు. వాటి గురించి కొట్లాడిరదిలేదు. ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెట్టింది లేదు. వెంకన్న గూడెం నుంచి కొండా పురం వరకు ఫీడర్‌ చానల్‌ పూర్తి చేసి, కొండాపురం, పుల్లం, బోడంగిపర్తి గ్రామాలకు సాగునీరందిస్తానన్నాడు. శభిలేటి వాగునుంచి కస్తాల చెరువులోకి ఫీడర్‌ చానల్‌ ద్వారా నీరు అందేలా చూస్తానాన్నాడు. గెలిచి తానిచ్చన హమీలు రాజగోపాల్‌రెడ్డి విస్మరించాడు. పనులు గాలికి వదిలేశాడు. ప్రతిపాదనలు ఏనాడు సిద్దం చేసింది లేదు. కనీసం అధికారుల దృష్టికైనా తీసుకెళ్లలేదు. ప్రభుత్వానికి విన్నవించింది లేదు. ఎన్నికల సమయంలో ప్రజలు తాను ఇచ్చిన హామీలను ప్రభుత్వం ముందు వుంచింది లేదు. తన వ్యాపార సామ్రాజ్య వి స్తరణ కోసం మాత్రం పనిచేసుకుంటూ వెళ్లాడన్నది చుండూరు ప్రజల మనోగతం. ఇదిలా వుంటే కొత్తగా ఏర్పాటైన చుండూరు మున్సిపాలిటీని సుందరీకరణ చేస్తానంటూ చెప్పిన మాటలు కూడా ఆయన నిలబెట్టుకోలేదు. చండూరు నుంచి తమ్ముల పల్లి రామలింగేశ్వర స్వామి దేవాలయం వరకు రోడ్డు నిర్మాణం జరిపిస్తానన్నారు. కాని అది దిక్కులేదు.దేవుడి మీద కూడా ప్రేమ లేదు. పుల్లెమల నుంచి బోడంగిపర్తి, పుల్లెంనుంచి తస్యానిగూడెం, బోరంగి పర్తి, నుంచి శిర్ధేపల్లి, దోని పాముల నుంచి జోగి గూడెం, అక్కడినుంచి తిమ్మారెడ్డి గూడెం, నెర్మట నుంచి శేరి గూడెం వరకు, ఉడుతల పల్లి నుంచి దుబ్బ గూడెం, రెగట్టే వరకు రోడ్డు నిర్మానం చేస్తానాన్నాడు. అంతే కాకుండా కస్తాల నుంచి, చొప్పది గూడెం, పోచంపల్లి వరకు కూడా రోడ్డు నిర్మాణం చుండూరు మండలానికి రాజగోపాల్‌రెడ్డి ఇచ్చిన హామీలు. సొంత నిధులు వెచ్చించైనా పూర్తి చేస్తానని చెప్పిన మాట. ఈ హమీలలో కొన్ని తాను సొంత నిధులతో చేపడతానని కూడా రాజగోపాల్‌రెడ్డి హామీ ఇచ్చారు.

ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా తన సొంత నిధులతో పనులు చేసే బాద్యత నాది…ఇదీ నా విజన్‌ అని చెప్పి చేతులెత్తేసిన ఘనత రాజగోపాల్‌రెడ్డిది. అచ్చం నిజామాబాద్‌ ఎంపి అరవింద్‌ కూడా పసుపు బోర్డు ఏర్పాటు గురించి ప్రజలకు బాండ్‌పేపర్‌ రాసిచ్చినట్లే ఇక్కడ కూడా రాజగోపాల్‌రెడ్డి ప్రజలకు తన సొంత నిధులతో మునుగోడు అభివృద్ధి చేస్తానంటూ ప్రచారం చేశారు. ప్రజలచేత ఓట్లేయించుకున్నాడు. గెలిచాడు. ఇప్పుడు తన వల్ల కావడం లేదని, ప్రభుత్వం సహకరించడం లేదన్న అపవాదును టిఆర్‌ఎస్‌ మీదకు తోసేసి, 18వేల కోట్ల కాంట్రాక్టు కోసం బిజేపిలో చేరాడు…స్యయంగా ఆయన కూడా ఇటీవల చెప్పుకున్న మాట…ఆయనతోపాటు ప్రజలు చెప్పుకుంటున్న మాట…ఛీ…ఛీ అంటున్న మాట!మునుగోడు ప్రజలను నమ్మించి, బుట్టలో వేసుకొని 2018 ఎన్నికల్లో గెలిచి, కారు జోరులోనూ, బలంగా వీచిన టిఆర్‌ఎస్‌ గాలిని తట్టుకొని గెలుస్తూ వస్తున్నానని చెప్పాడు. తాను బలమైన నాయకుడినని నమ్మించాడు. పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన అనుభవంతో డిల్లీ పరిచయాలను ఆసరా చేసుకొని బిజేపికి అనుకూలమైపోయాడు. మూడేళ్లుగా బిజేపి వైపు చూస్తున్నాడు. కాంట్రాక్టు ఓకే అయితే గోడ దుంకేందుకు సిద్ధమన్నాడు…అన్నీ కుదిరాయి…కాంట్రాక్టు సొంతమై బిజేపిలో చేరాడన్నది కంటి ముందు కనిపిస్తున్న నిజం. దాంతో మునుగోడు అభివృద్ధి పట్టించుకోలేదు. కాని ప్రభుత్వం సహకరించలేదు. అన్న మాట చెప్పి ప్రజలను మరోసారి ఏమార్చేందుకు, నమ్మించేందుకు, వంచించేందుకు మరో ప్రయత్నం చేస్తున్నాడు. కాని మరి ఇప్పుడు గెలిచి ఏం చేస్తానన్న మాట మాత్రం రాజగోపాల్‌రెడ్డి చెప్పడం లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బిజేపి అన్న ఒక్క మాట తప్ప మరో మాట చెప్పుకోవడానికి ఏమీ లేదు…ఇదేనా ప్రచారమంటే..ఇంతేనా ఎన్నికలంటే…తాను గెలిచేందుకేనా రాజకీయాలంటే అని ప్రజలు నిలదీస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డిని కడిగేస్తున్నారు. తాజాగా ఓ గ్రామ ప్రజలు రాజగోపాల్‌ రెడ్డి రావొద్దని నినాదాలు చేసిన వార్తలు కూడా సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున ప్రచారంలో వున్నాయి.

పేదల దేవుడు కేసిఆర్‌: మాలోతు కవిత

`మాలోతు కవితతో కట్టా మాట…మంతి.

`అన్ని వర్గాల అభ్యున్నతి అనేది ఒక్క కేసిఆర్‌ హయాంలోనే చూస్తున్నాం

`ఒక రకంగా చెప్పాలంటే కేసిఆర్‌ పాలన స్వర్ణ యుగం.

`గిరిజన ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలౌతున్నాయి.

`పోడు సాగుకు కూడా రైతు బంధు అనేది విప్లవాత్మక నిర్ణయం

`గిరిజన ప్రజలకు గిరిజన బంధు అమలుతో ఆ వర్గాల జీవితాలలో వెలుగులు నిండుతాయి.

`రిజర్వేషన్లు పెంచితే విద్య, ఉద్యోగ రంగాలలో అనేక అవకాశాలు వస్తాయి.

`ఒక్క తెలంగాణే కాదు దేశమంతా గిరిజన ప్రజల జీవితాలలో మార్పులు రావాలి.

`అందుకు కేసిఆర్‌ జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర కావాలి.

`కేసిఆర్‌ ప్రధాని అయితే దేశ రాజకీయాలలో కూడా మార్పులొస్తాయి.

`దేశమంతా తెలంగాణలో అమలౌతున్న పథకాలు అందుబాటులోకి వస్తాయి.

`ఒక్క మాటలో చెప్పాలంటే దేశం సుభిక్షమౌతుంది.

`అన్ని రంగాలలో అభ్యున్నతి సాధిస్తుంది.

`గుప్తుల కాలం మర్చిపోయి కేసిఆర్‌ కాలం స్వర్ణ యుగమని చెప్పుకుంటారు.

`సమాజం గురించి కేసిఆర్‌ అంత తపన పడే నాయకుడిని ఎక్కడా చూడలేదు.

`దేశం కోసం ఇంతలా ఆలోచిస్తున్న నాయకుడు ఈ తరంలో లేడు…

`అందుకే కేసిఆర్‌ గ్రేట్‌ లీడర్‌…

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ముఖ్యమంత్రి కేసిఆర్‌ లాంటి ఉదాత్తమైన నాయకుడు దేశ రాజకీయాల్లోనే లేరు. ఆయన లాంటి ఉత్తమైన నాయకుడు మరొకరు కనిపించరు. ఇది అతిశయోక్తికాదు. ఎంతో దూరదృష్టి వుంటే తప్ప అంతటి నాయకుడు ఎవరూ కాలేరు. సంపూర్ణమైన నాయకుడు అంటే కేసిఆర్‌. ఆయనను చూసి భవిష్యత్తు తరం రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. ఒక నాయకుడికి ప్రజలంటే ప్రేమ వుండాలి. ప్రజలకు ఏం కావాలో తెలియాలి. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో అంచనా వేయగలగాలి. ప్రజలు నాయకులనుంచి ఏ ఆశిస్తారన్నది బాగా తెలిసి వుండాలి. నిత్యం ప్రజలకు అందుబాటులో వుండాలి. నిత్యం ప్రజల గురించే నాయకుడు ఆలోచిస్తూ వుండాలి. ఇలాంటి ఉత్తమైన గుణగణాలన్నీ కేసిఆర్‌లో వున్నాయి. అందుకే ఆయన తెలంగాణ సాధించగలిగారు. అసలు తెలంగాణ ఉద్యమమంటే అందరూ చేసేదేలే…ఇప్పుడు కొత్తగా ఏముంటుందిలే…అన్నవాళ్లే చాలా మంది. కాని తెలంగాణ జెండా ఎత్తి, కొత్త తరం రాజకీయ ఉద్యమ పోరాటాన్ని మిలితం చేసిన కేసిఆర్‌ తెలంగాణ సాధించడం అన్నది ఎవరూ ఊహించింది కాదు…..అందుకే తెలంగాణ ఉద్యమం అన్నది చరిత్రలో ఒక సువర్ణాక్షరమైతే…కేసిఆర్‌ ఉద్యమ జీవితం ఒక సువర్ణాధ్యాయం. అంటున్న మహాబూబాబాద్‌ ఎంపి. మాలోతు కవితతో ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు మాటా…మంతి! తెలంగాణ ఉద్యమం మొదలైన నాడు అందరూ తెలంగాణ వస్తే చాలు అనుకున్నారు. ఎందుకంటే ఆనాడు ఆత్మగౌరవం మాత్రమే వినపడేది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతున్నారన్న భావన సర్వత్రా వ్యక్తమయ్యేది. అలా సామాన్య ప్రజలైనా, నాయకులైనా అంతే…సీమాంధ్ర నాయకత్వం ఏదైనా సరే…అందరూ తలూపాల్సిందే…తలొంచాల్సిందే.. తెలంగాణలో వారిని ఎదిరించి మాట్లాడే శక్తి వున్న నాయకులే లేని రోజులవి. అలాంటి సమయంలో తెలంగాణ అనే పదమే మాట్లాడేందుకు వీలు లేని పరిస్ధితి. అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్నే నిషేదించారు. వెనుకబడిన ప్రాంతం అనాల్సివచ్చేది. అయితే ఇది కూడా తెలంగాణ ఉద్యమానికి ఎంతో దోహదం చేసింది. తెలంగాణ అనొద్దన్న ఉమ్మడి రాష్ట్ర పాలకులే వెనుకబడిన ప్రాంతం అనొచ్చన్నారు. తెలంగాణ వెనుకబడిన ప్రాంతం అంటే తెలంగాణ ప్రజల దృష్టిలో వెనక్కి నేట్టేబడిన ప్రాంతంగా మనసుల్లో ముద్రపడిపోయింది. సరిగ్గా అదే సమయంలో తెలంగాణ జెండా ఎత్తిన కేసిఆర్‌ ప్రజలను కదలించిన విధం మాత్రం అపురూమనే చెప్పాలి. తెలంగాణ ఉద్యమం అంటే చాలు..ముందు నిట్టూర్చేవాళ్లే ఎక్కువ. తర్వాత భయపడేవారు కూడా ఎక్కువే. జై తెలంగాణ అంటే నక్సలైట్‌ అనే ముద్ర వేసే రోజులవి. అలాంటి సమయంలో దిక్సూచీలా మారి, తెలంగాణను ఒక దివిటీగా మారి, చైతన్య దీప్తిగా మారి వెలుగు వైపు ప్రజలను నడిపించిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ ఉద్యమం నడిచినంత కాలం తెలంగాణ వస్తే చాలనుకున్నాం. 

మన నిధులు మనకే అంటే సరే ఎంతో కొంత మన అభివృద్ధి మనమే చేసుకోవచ్చు అనుకున్నాం. కాని తెలంగాణ వస్తే ఇంత ప్రగతి సాధిస్తుందని కలలో కూడా ఊహించలేదు. తెలంగాణ వస్తే ఇంత తక్కువ సమయంలో తెలంగాణ రూపు రేఖలు ఇంత గొప్పగా ఆవిషృతమౌతాయని ఎవరూ అనుకోలేదు. తెలంగాణ చరిత్ర తెసిన వారు కూడా ఊహించలేకపోయారు. తెలంగాణ వచ్చిన ఇంత అతి తక్కువ కాలంలో కోటి ఎకరాల మాగాణ అవుతుందని అనుకున్నామా? తెలంగాణ సస్యశ్యామలం కావాలనుకున్నాం. అందుకు కనీసం ఓ ఇరవై ముప్పై ఏళ్లు పడుతుందేమో అనే అందరూ అనుకున్నారు. కాని ముఖ్యమంత్రి కేసిఆర్‌ అధ్భుతాలు సృష్టించారు. అన్ని వర్గాల అభ్యున్నతి సాధించింది. కేవలం ఆరు నెలల్లో చిమ్మ చీకట్ల నుంచి తెలంగాణలో వెండివెలుగులు ఆవిష్కారమాయ్యయి. ఒకనాటి తెలంగాణ పరిస్ధితి గుర్తు చేసుకుంటే, ఇప్పటికీ అప్పటికి ఎంత తేడా అన్నది తెలిసిపోతుంది. సహజంగా ఒక ముఖ్యమంత్రి ప్రజలకు ఏం చేయాలన్నదానిపై కొన్ని పమితులలోనే ఆలోచన చేశారు. అంతటితో అవే గొప్ప పధకాలు అని ప్రచారం చేసుకున్నారు. కీర్తించుకున్నారు. కాని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఏక కాలంలో ఇన్ని రకాల పధకాలు అమలు చేసి, తెలంగాణలో సమస్యలు లేని కాలాన్ని సృష్టిస్తాడని ఎవరూ అనుకోలేదు. అసలు దేశంలో తెలంగాణలో అమలు జరుగుతున్న పథకాలలో కనీసం ఒక్క శాతం కూడా అమలు కావడం లేదు.గత కొన్ని దశాబ్ధాలుగా దేశమంతా అమలౌతున్న రేషన్‌ బియ్యం, వృద్థులకు పెన్షన్‌ ఇవి తప్ప మరే పథకాలు ఇతర రాష్ట్రాలలో లేవు. అయితే ఇక్కడ కూడా తెలంగాణ ప్రత్యేకమే. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంతటి ప్రజా నాయకుడో అర్ధం చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో సీలింగ్‌ లేని రేషన్‌ అందిస్తున్నాం. పైగా ప్రతి వ్యక్తికి ఆరు కిలోలు ఇవ్వడం జరుగుతోంది. వీటికి తోడు చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా? అసలు కళ్యాణ లక్ష్మి అనే పథకం పేదింటి ఆడపిల్ల జీవితానికి ఒక వరంగా మారింది. ఆడ పిల్ల పెళ్లి చేయడం అంటే సగటు తండ్రికి ఎంత కష్టమో! కళ్లారా చూసిన ముఖ్యమర్రతి కేసిఆర్‌ అధికారంలోకి రాగానే ప్రకటించారు. అంటే ఆయన తెలంగాణ వస్తే, అందులోనూ అధికారంలోకి వస్తే ఎలాంటి పధకాలు అమలు చేసుకోవచ్చో అన్నవి ముందే నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఇంత ముందుచూపు వున్న నాయకుడు ప్రపంచంలో ఎవరైనా వున్నారా? ఒక్క కేసిఆర్‌ తప్ప మరెవరూ కనిపించరు. అంత గొప్ప నాయకుడు కేసిఆర్‌.తెలంగాణ ప్రజలు గత ఎనమిది సంవత్సరాల కాలంలో అనుభవిస్తున్న అనేక సంక్షేమ పథకాలు దేశం మొత్తం అమలు కావాలి.

ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు, కేంద్రంలో అధికారంలోవున్న బిజేపి, అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీల నాయకులు ముఖ్యమంత్రి కేసిఆర్‌లా ఆలోచించలేదు. పనులు అమలు చేయలేరు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన నుంచి తెలంగాణలో ఏమేమి అమలౌతున్నాయో! కేంద్రంలోపాటు, అన్ని రాష్ట్రాలూ చూస్తున్నవే…కాని మన రాష్ట్రాల్లో అమలు చేయాలని ఆయా రాష్ట్రాలు అనుకోవడం లేదు. దేశం మొత్తం అమలు చేయొచ్చని కేంద్రం అనుకోవడం లేదు. ఈ పార్టీలు అధికారంలో వున్నంత కాలం తెలంగాణ పధకాలు దేశంలో అమలుకావు. అందుకే దేశమంతా తెలంగాణలాగా ప్రగతిని సాధించాంటే, దేశమంతా సస్యశ్యామలం కావాలంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌ దేశ నాయకుడు కావాల్సిందే. కేసిఆర్‌ దేశానికి ప్రధాని కావాల్సిందే…! ఇది నా ఒక్కదాని ఆలోచన కాదు..దేశంలోని కోట్లాది మంది ప్రజలు, వేలాది మంది నాయకులు కోరుకుంటున్న మాట. బిజేపి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఎంత సేపు పన్నులెలా వేయాలి. ప్రభుత్వ ఆస్ధులెలా అమ్మాలి. ప్రైవేటు వ్యక్తులకు ఎలా దోచిపెట్టాలి. సామాన్యుడి నడ్డి ఎలా విరువాలి. ఎన్ని రకాలుగా ప్రజల నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేయాలి. నల్ల దనం పేరు చెప్పి, నోట్ల రద్దు చేసి దేశాన్ని అతలాకుతలం చేశారు…నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలను ఆగం చేస్తున్నారు. ఎంతో గొప్ప పని చేసినట్లు అర్ధరాత్రి పార్లమెంటులో జిఎస్టీ అమలు చేస్తున్నట్లు చెప్పి, ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తెస్తాయని నమ్మించారు. ఇప్పుడు పాలు, పెరుగు మీద కూడ పన్నులేసి ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. అసలు బిజేపి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక చెప్పుకోవడానికి ఒక్కంటే ఒక్క పధకమైనా ప్రారంభించారా? అమలు చేశారా? ఒక్క సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం జరిగిందా? పాత పధకాలకు పేర్లు మార్చుడం, కొత్త పన్నులు వేయడం తప్ప మోడీ ప్రభుత్వం చేసిందేమీ లేదు…మత రాజకీయాలు తప్ప, మానవత్వాన్ని ప్రదర్శించింది లేదు. పేదలను ఆదుకున్నది లేదు. ఆ పరిస్ధితి పోవాలి. కొత్త తరం నాయకత్వం దేశానికి కావాలి. అందుకు కేసిఆర్‌ నాయకత్వం కావాలి. దేశమంతా సాగునీటితో కళకళలాడాలి. దేశమంతా సస్యశ్యామలం కావాలి. దేశంలో అవకాశం వున్న ప్రతీ చోట కాళేశ్వరం ఆలాంటి ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. నదుల నీటిని ఒడిసిపట్టాలి. పొలాలకు మళ్లించాలి. అందుకోసం అనేక రిజర్వాయర్ల నిర్మాణం జరగాలి. చెరువులు పునరుద్దరన సాగాలి. దేశంలోని ప్రతి ఊరికి సురక్షితమైన మంచినీరు అందాలి. తెలంగాణలో విజయవంతమైన మిషన్‌ భగీరధ కార్యాక్రమం దేశమంతా అమలు కావాలి. ప్రతి గడపకు మంచినీరు చేరాలి. ఇలా అనేక సంక్షేమకార్యక్రమాలు దేశమంతా అమలుకావాలి. అందుకు కేసిఆర్‌ దేశ ప్రధాని కావాలి. దేశానికి దిశా నిర్ధేకుడై స్వర్ణ యుగం తేవాలి. గుప్తుల కాలం స్వర్ణయుగమని ఇంకా చెప్పుకుంటున్న మనం…కేసిఆర్‌ కాలం మరో స్వర్ణయుగమని చెప్పుకునే రోజులని భవిష్యత్తులో తరతరాలు చెప్పుకోవాలి. కేసిఆర్‌ హయాంలోని అందే దీర్ఘకాలిక ప్రణాళికల ప్రయోజనాలు తరతరాలు అందాలి. దేశం సగర్వంగా తలెత్తుకోవాలి.

కదిలిస్తున్న కేసిఆర్‌ రగిలిస్తున్న రాహుల్‌

`రాజకీయ పార్టీల ఐక్యం కోసం కేసిఆర్‌

`ప్రజల్లో చైతన్యం కోసం రాహుల్‌…

`సామాన్య బాగోగుల కోసం కేసిఆర్‌..

`యువ నాయకత్వం కోసం రాహుల్‌…

`దేశమంతా తెలంగాణ పథకాల అమలు చేయాలని కేసిఆర్‌

`ధరల భారం తగ్గిస్తామంటున్న రాహుల్‌…

`కొత్త రాజకీయ శక్తిగా కేసిఆర్‌…

`త్యాగాలను గుర్తు చేస్తూ రాహుల్‌…

`సంక్షేమ రాజ్య నిర్మాణం కోసం కేసిఆర్‌….

`పాదయాత్ర ను నమ్ముకుంటున్న రాహుల్‌.

`ఇద్దరి రాజకీయం ఒకటే…

`దారులు వేరు…

`కారు, కాంగ్రెస్‌ కలిస్తే ఎప్పటికైనా తిరుగుండదు.

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఒకరు ఉత్తరాదినుంచి రాజకీయ పార్టీలను కదిలిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి కేసిఆర్‌. మరొకరు దక్షిణాదినుంచి ప్రజల్లో రాజకీయం చైతన్యం కోసం పాదయాత్ర చేపట్టారు. ఆయన రాహుల్‌ గాంధీ. ఇద్దరూ కలిసి బిజేపి ముక్త్‌ భారత్‌ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ గత ఎన్నికల ముందే దేశంలో ప్రత్నామ్నాయ రాజకీయ శక్తి కావాలన్నారు. అందుకు అవసరమైన ప్రణాళిక తానే మొదలు పెడతా! అన్నారు. అన్నట్లుగానే ఆయన ఇప్పటికే దేశమంతా తిరుగుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా దేశంలో క్రియాశీలక పాత్ర వహిస్తున్న నాయకులను కలుస్తున్నారు. దేశ రాజకీయాలపై చర్చిస్తున్నారు. బిజేపి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువుపెడుతున్నాడు. బిజేపి తప్పులను ఎత్తు చూపుతున్నాడు. ప్రజల్లోనే ఎండగడుతున్నాడు. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్నట్లు బిజేపి కేంద్ర ప్రభుత్వం ప్రజల మేలు కన్నా, ప్రధాని మోడీ అనుయాలకు దేశాన్ని దోచి పెడుతున్నారని విరుచుకుపడుతున్నాడు. దేశం నుంచి బిజేపిని పారద్రోలితే గాని ప్రజలకు విముక్తి కాదని కేసిఆర్‌ చెబుతున్నాడు. పేద ప్రజల నుంచి ముక్కు పిండి జిఎస్టీల పేరుతో ఉప్పు , పప్పు, పాలు, పెరుగు మీద, ఆఖరుకు స్మశాన వాటికల వినియోగం మీద కూడా పన్నుల మీద పన్నులేసి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని విరుచుకుపడుతున్నాడు. అలా వసూలు చేస్తున్న సొమ్మును షావుకార్లు పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. పేద ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు దేశానికి భారం అంటూ, షారుకార్లు రుణపడిన బ్యాంకు రుణాలు మాఫీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ప్రజలపై మోయలేని బారాన్ని మోపుతున్న బిజేపి సర్కారును గద్దెదించితే తప్ప ప్రజలకు మోక్షం లేదని అంటున్నాడు. దేశంలో బిజేపి వివక్షపూరితమైన రాజకీయాలు చేస్తోందని కేసిఆర్‌ మండిపడుతున్నాడు. విషం చిమ్మే కుయుక్తులను నమ్ముకొని, ప్రజల బలహీనతలను ఆసరా చేసుకొని బిజేపి రాజకీయాలు చేస్తోందంటున్నాడు. ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని దుయ్యబడుతున్నాడు. బిజేపి మతం చుట్టు రాజకీయాలను పరిభ్రమింపజేస్తోందని, అది దేశానికి ఏమాత్రం మంచిది కాదని హితవు పలుకుతున్నాడు. బిజేపి ధర్మం వల్లిస్తూ పేదలను వంచిస్తున్న బేజేపి ముక్త్‌ భారత్‌ జరగాలని, దేశంలో సంక్షేమ రాజ్య స్ధాపన జరగాలని కేసిఆర్‌ కోరుకుంటున్నారు. రైతు రాజ్యం రావాలని రాజకీయ పార్టీలను ఏకం చేస్తున్నాడు. ప్రభుత్వ రంగ సంస్ధలు, ఆస్ధులను అమ్ముతూ, ప్రాంతీయ పార్టీల మనుగడును చిదిమిస్తే, మిధ్యగా వుండాల్సిన కేంద్రం పెత్తనం పేరుతో బీజేపీ దేశ రాజకీయాలను భ్రష్టుపట్టిస్తోందని కేసిఆర్‌ రాష్ట్రాలు తిరిగి పార్టీలకు ప్రజలకు వివరిస్తున్నారు.

రైతు జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వాలు మనుగడ సాధించలేదని చెబుతున్నాడు. రైతుకు అన్యాయం చేసిన వారు చరిత్ర హీనులౌతారని హెచ్చరిస్తున్నాడు. రైతుక్షేమం కాంక్షిన వారికే ఈదేశంలో, భారత చరిత్రలో చోటు అని గుర్తు చేస్తున్నాడు. ప్రజావ్యతిరేక, పేదల వ్యతిరేక బిజేపిని తరిమికొట్టడమే కాదు, మళ్లీ దేశంలో సంక్షేమ రాజ్య నిర్మాణంకోసం ప్రాంతీయ పార్టీలు ఏకమైన రాష్ట్రాల హక్కులను కాపాడుకోవాలని కోరుకుంటున్నారు. ఆ దిశగా కేసిఆర్‌ అడుగులు వేస్తున్నాడు. అంతే కాదు తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, విజయవంతంగా పూర్తి చేసిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు, మంచినీటి సౌకర్యాలు, చెరవుల పునరుద్దరణ, పేదింటి అమ్మాయిల పెళ్లికి భరోసా, పెద్దలకు పెద్దకొడుకుగా అండగా నిలిచే ఆసరా వంటి పధకాలన్నీ దేశం మొత్తం అమలు కావాలని కోరుకుంటున్నారు. ఆకలి కేకలు లేని సమాజ నిర్మాణం జరగాలి. పేద, పెద్ద అన్న ఆర్ధిక అంతరం తొలగాలి. రైతు రాజు కావాలి. పాడి, పంట మళ్లీ పూర్వపు రోజులు చూడాలి. రైతు సంతోషంగా వర్ధిల్లాలి. ప్రజలకు ఆహార భద్రత కలగాలి. సాగుకు అనుబంధ రంగాలన్నీ మళ్లీ పుంజుకోవాలి. ఆహార ఉత్పత్తులో స్వయం సమృద్ధి సాధించాలి. విద్య, వైద్య రంగాల్లో వినూత్నమైన మార్పులు రావాలి. ప్రతి పేద వారికి మెరుగైన ఉచిత వైద్యం అందుబాటులోకి రావాలి. రైతుకు రైతు బంధు వంటి చేయూత అందాలి. మెరుగైన సమాజామే కాదు, ఉన్నతమైన సమాజం నిర్మాణం కావాలి. ఇది కేసిఆర్‌ లక్ష్యం. అందుకోసం జాతీయ రాజకీయాలలోకి కేసిఆర్‌ ఆగమనం…అందులో భాగంగా ఆయన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో రెండు సార్లు సమావేశమయ్యారు. రాజకీయాలు చర్చించారు. ఏకతాటిపైకి ప్రాంతీయ పార్టీల రాజకీయాలు రావాలని కోరారు. అలాగే బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ను కలిశారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ తాఖరేతోపాటు, రాజకీయ కురువృద్దుడైన శరద్‌ పవార్‌తోను కూడా సిఎం. కేసిఆర్‌ కలిశారు. అలాగే కర్నాటకకు చెందిన మాజీ సింఎం. కుమార స్వామితో పలు మార్లు చర్చలు జరిపారు. బెంగుళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవేగౌడతో కూడా సమావేశమయ్యారు. తమిళనాడు సిఎం. స్టాలిన్‌తో అనేక దఫాల చర్చలు జరిపారు. ఉత్తర ప్రదేశ్‌ మాజీ సిఎం. అఖిలేష్‌ యాదవ్‌తో అనేక సార్లు బేటీ జరిగింది. దేశంలో ఏడాదిన్న కాలం పాటు ఉద్యమాలు చేసి, ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు పంజాబ్‌ వెళ్లారు. వారికి తెలంగాణ ప్రభుత్వం తరుపున ఆర్ధిక సాయం అందించారు. రైతు నాయకులతో మాట్లాడారు. వారిని తెలంగాణకు ఆహ్వానించి, మూడు రోజుల పాటు ప్రగతి భవన్‌లో చర్చలు జరిపి, రైతుల కోసం ఏం చేస్తే బాగుంటుందన్నదానిపై బ్లూప్రింట్‌ తయారు చేశారు. ఇలా కేసిఆర్‌ తన జాతీయ రాజకీయాల రూట్‌ మ్యాప్‌ తయారు చేస్తున్నారు. దసరా తర్వాత కొత్త రాజకీయ పార్టీ ప్రకటించేందుకు కూడా సన్నద్దమౌతున్నారు. దక్షిణాధి నుంచి పాదయాత్ర మొదలు పెట్టిన రాహుల్‌గాంధీ ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం మొదలు పెట్టారు.

ప్రజలంటే ఆయనకు, ఆయన కుటుంబానికి ఎంత ప్రేమో ఆయన చెరగని చిరునవ్వులో చూపిస్తున్నారు. ప్రజలందరి చెంతకు వెళ్తున్నారు. పాదయాత్రలో అందరితోనూ కలుపుగోలుగా వుంటున్నారు. పాదయాత్ర అన్నది దేశ రాజకీయాల్లో ఒక క్రియాశీలకమైన ఘట్టమనే చెప్పాలి. దేశ స్వాతంత్య్రం కోసం మొదలైన పోరాటంలో ఉప్పు సత్యాగ్రహగంతో పాదయాత్రల పర్వం మొదలైందనే చెప్పాలి. గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం నుంచి దండి వరకు సుమారు నెల రోజులకు పైగా మహాత్మాగాంధీ సాగించిన ఉప్పు సత్యాగ్రహం పాదయాత్ర దండికి చేరుకునే సరికి జన ఉప్పెనగా మారింది. ఎక్కడిక్కడ ఉప్పు తయారీ జరిగింది. అదీ పాదయాత్ర పవర్‌ అని ఆనాడే తేలిపోయింది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర పవరేమిటో తెలిసింది. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మొదలుపెట్టిన పాదయాత్రతో రాజకీయాలను పూర్తిగా ప్రభావితం చేయొచ్చని తెలిసింది. అయితే ప్రజాసమస్యల పరిష్కారానికి మాత్రమే పాదయాత్రలు గతంలో జరిగేవి. కాని రాజకీయాల మార్పు, ప్రభుత్వాల మార్పు కు కూడా పాదయాత్ర తోడ్పడుతుందని తేలింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్‌, ఆయన సోదరి షర్మిల, ప్రస్తుతం బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్‌ సాగిస్తున్న పాదయాత్రలు కూడా చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణలో కృష్ణానదీ జాలల కోసం అందరికంటే ముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాదయాత్ర చేసిన సందర్భం తెలంగాణలో వుంది. ఇప్పుడు అదే స్పూర్తితో రాహుల్‌ గాంధీ కన్యా కుమారి నుంచి కాశ్మీర్‌ వరకు సాగనున్న జోడో యాత్ర మాత్రం కాంగ్రెస్‌కు మళ్లీ పునరుజ్జీవం కల్పిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మన దేశ మీడియా రాహుల్‌ గాంధీ పాదయాత్రను పట్టించుకోకపోయినా, ప్రజలు పట్టించుకుంటున్నారు. రాహుల్‌ పాదయాత్రకు ప్రజలు తండోప తండాలుగా తరలివస్తున్నారు. ఎంతో సింపుల్‌గా వుండే రాహుల్‌ గాంధీ ఆహార్యం, ప్రజల్లో ఆయన మమేకమౌతున్న విధానం, పాదయాత్రల్లో హడావుడి కాకుండా, కంటైనర్లలో బస చేయడం వంటి సింప్లీ సిటీ వ్యవహారం ప్రజలను ఎంతో ఆకర్షిస్తోంది. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు రాహుల్‌ గాంధీ పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్‌కు ఎంతో ప్రయోజనం చేకూర్చుతుంది. పార్టీ బలోపేతానికి తోడ్పడుతుంది. చరిత్రలో రహాల్‌ గాంధీకి కూడా చోటు దొరినట్లే అన్నది తేలిపోతోంది. ఎందుకంటే దేశ రాజకీయాల పరంగా చూస్తే పాదయాత్ర అన్నది ప్రస్తావిస్తే రాహుల్‌ గాంధీ గుర్తుకొస్తారని చెప్పడంలో సందేహం లేదు. దేశమంతా పాదయాత్ర అన్నది అంత ఆషామాషీ వ్యవహరం కాదు. కాంగ్రెస్‌లో కొత్త రక్తం, యువ రక్తం రాబోతోందని చెప్పడానికి ఇదే సంకేతం…భవిష్యత్తు కాంగ్రెస్‌దే అని చెప్పడానికి కూడా ఇదొక నిర్వచనం. ..మళ్లీ కాంగ్రెస్‌ పునర్వైభవానికి శ్రీకారం.

పచ్చి అవకాశవాది..!

`రవీందర్‌ సింగ్‌కు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య!

`ఏకంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ పైనే గతంలో చేయకూడని వ్యాఖ్యలు చేశాడు.

`కవితకు పదవికేం తొందరొచ్చిందన్నాడు?

`వినోద్‌ కుమార్‌ పదవి లేకుండా మూడు నెలలు కూడా వుండలేడా? అని రవీందర్‌ సింగ్‌ ప్రశ్నించాడు.

`పార్టీ ముఖ్యులను తేలిక చేసి మాట్లాడాడు!

`గత ఎన్నికలలో మంత్రి గంగుల కమలాకర్‌ ఓటమికి శత విధాల కృషి చేశాడు?

`తన అనుచరుల ప్రాంతాలలో బిజేపికి మెజారిటీ?

`ఆది నుంచి గంగుల మీద విషం చిమ్ముతూనే వున్నాడు?

`ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలంగాణలో కుటుంబ పాలన అన్నాడు?

 `కేసిఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశాడు?

`నమ్మించి మోసం చేయడం టిఆర్‌ఎస్‌ అధినేతకు అలవాటే అని కూడా అన్నాడు?

`హుజూరాబాద్‌ లో ఈటెలకు సపోర్ట్‌ చేసినట్లు అనేక ఆరోపణలు!

`రవీందర్‌ సింగ్‌కు పదవీ కాంక్ష తప్ప ప్రజాశ్రేయస్సు పట్టదు?

`మేయర్‌గా వున్నంత కాలం స్మార్ట్‌ సిటీ పనులు చేపట్టలేదు?

`కాంట్రాక్టర్‌ను ఎందుకు బెదిరించాడు?

 

`ఈ మధ్య మరీ శృతిమించుతోన్న రవీందర్‌ సింగ్‌ ఆగడాలు?

`పార్టీకి తీరని నష్టం చేసేలా రవీందర్‌ సింగ్‌ వ్యవహారం?

`గంగులను అడుగడుగునా అప్రదిష్ట పాలు చేయాలని చూస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది!

`రవీందర్‌ సింగ్‌ ను పార్టీ నుండి బహిష్కరించాలని టిఆర్‌ఎస్‌ శ్రేణుల పిర్యాధులు?

`అర్హతకు మించి ఆశలు పెట్డుకొని, పార్టీ పరువు బజారుకీడుస్తున్నాడంటూ విమర్శలు!

`రవీందర్‌ సింగ్‌ వంటి చీడ పురుగులను ఏరేయాల్సిందే అంటున్న శ్రేణులు!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఆశావహులు వేరు. అవకాశ వాదులు వేరు. ప్రతి రాజకీయ పార్టీలోనూ ఆశావహులు చాలా మందే వుంటారు.

కాని వారు అవకాశవాదులైనప్పుడే పార్టీలకు ఇబ్బందులు. తలవంతపులు కూడా…అంతే కాదు వారి వ్యక్తిగత రాజకీయ జీవితానికి కూడా తిప్పలే…అయినా కోరికోరి కష్టాలు తెచ్చుకుంటుంటారు.

అనుకున్నదే తడువుగా అందలమెక్కాలని అనుకుంటుంటారు. ఓపిక అన్నది లేకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కుంటారు. కొన్ని సార్లు పార్టీకి తీరని నష్టం తెచ్చిపెడుతుంటారు. నీడనిచ్చ చెట్టును కొట్టేయాలనుకుంటారు?

అలాంటి వారి పట్ల వ్యక్తులైనా, వ్యవస్ధలైనా అప్రమత్తంగా వుండడం అవసరం. ఎందుకంటే నైరాశ్యం పేరుతో అవకాశవాదులెప్పుడూ పార్టీ నాశనాన్ని కోరుకుంటుంటారు. స్వయంగా పార్టీని ముంచే పనిలో నిమగ్నమై వుంటారు. పైకి ఎంతో తియ్యగా కనిపిస్తున్నా,

లోలోన చేదేక్కి వ్యవహరిస్తుంటారు. విషం చిమ్ముతుంటారు. గూడు కట్టుకొని వున్న అసంతృప్తిని ఎప్పుడు వెళ్లగక్కుదామా? అని ఎదురుచూస్తుంటారు. పార్టీ ఎంత నిలబెట్టినా, పార్టీనే తాను నిలబెట్టానని చెప్పుకుంటారు. అతి విశ్వాసం ప్రదర్శిస్తుంటారు. అక్కసును వ్యక్తం చేస్తూ వుంటారు. లేని కయ్యాలు సృష్టించి పార్టీని కూల్చే పనిలో పడతారు…పైకి అమాయకులుగా, లోన అపరిచితులుగా వ్యవహరిస్తుంటారు. కరీంనగర్‌ టిఆర్‌ఎస్‌లో అలాంటి నేత మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌ అంటున్నారు. పార్టీని అదును చూసి, ప్రతీసారి ఇరుకున పెట్టే ప్రయత్నం శతవిధాల ప్రయత్నం చేయడమే ఆయన రాజకీయం అంటూ పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. తాజాగా ఆయన అనుచరులు మంత్రి గంగుల కమలాకర్‌ను అప్రదిష్టపాలు చేయడానికి పన్నిన కుటిల ప్రయత్నం వెలుగులోకి వచ్చింది. అంటే వెనకటి గుణమేల మాను వినరా సుమతి! అనే పద్యాన్ని నిజం చేస్తున్నారు. పార్టీకి తీరని ద్రోహం చేస్తున్నారు. మంత్రిని ఇరుకున పెట్టడమే కాదు, ఇబ్బందుల పాలు చేస్తున్నామంటూ టిఆర్‌ఎస్‌లోని రవీందర్‌ సింగ్‌ వర్గం ఫోన్‌ సంబాషణలు ఇప్పుడు సంచనలమయ్యాయి. రవీందర్‌సింగ్‌కు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య అని టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులే చెబుతున్నారు. 

తనకు పదవుల యావ తప్ప , ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశ్యమే ఆయనకు లేదని వారు అంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలోనే రవీందర్‌ సింగ్‌ ఎమ్మెల్సీ ఆశలు పెట్టుకున్నారు. ఉద్యమంలో పాల్గొనడం వేరు…రాజకీయాల్లో ప్రభావం వేరు…అన్నది తెలుసుకోకుండా తనను తాను అతిగా ఊహించుకోవడం రవీందర్‌ సింగ్‌కు అలావటే అని పార్టీ నేతలే అంటున్నారు. ఎమ్మెల్సీ ఆశ తీరలేదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ 2014లో రవీందర్‌ సింగ్‌ను కరీంనగర్‌ మేయర్‌ను చేశారు. అయినా ఆశ తీరలేదు. పదవుల మీద మోజు తీరలేదు. మేయర్‌ పదవి అన్నది ఆయనకు చాల చిన్న పదవిలా కనిపించింది. ఒకే నాయకుడికి పదే పదే అవకాశాలు ఇస్తూ, పోతే ఇతర నాయకులకు ఎప్పుడు పదవులు అందుతాయన్న కనీస సోయి కూడా లేకుండా రవీందర్‌ సింగ్‌ రాజకీయాలు చేయడం కొత్త కాదన్నది పార్టీ నేతల మాట. అందుకే తాజాగా రవీందర్‌ సింగ్‌పై కరీంనగర్‌ కు చెందిన అనేక మంది కార్పోరేటర్లు పార్టీకి పిర్యాధులు చేశారు. రవీందర్‌ సింగ్‌ అవకాశ వాద రాజకీయాలు పార్టీకి తీరని నష్టమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన మేయర్‌గా వున్న సమయంలోనే కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ పనులు చేపట్టలేదు. కాంట్రాక్టర్‌ తాను అడిగింత ఇస్తేనే పనులు చేయనిస్తానని అనడంతో, పనులు అక్కడే ఆగిపోయానని అంటున్నారు. అంటే కరీంనగర్‌ స్మార్టు సిటీ కావడం కూడా రవీందర్‌కు ఇష్టం లేదని, ఆ పనులు చేస్తే పార్టీకి మంచి పేరు రావడం ఇష్టంలేకనే రవీందర్‌ సింగ్‌ పనులు జరగన్విలేదన్నది ఓ వాదన. గంగుల కమలాకర్‌ టిఆర్‌ఎస్‌లోకి రాకముందే కరీంనగర్‌ ఎమ్మెల్యే. 

ఆయనను తానే పార్టీలోకి తీసుకొచ్చానని రవీందర్‌ సింగ్‌ చెప్పుకోవడంలోనే డొల్లతనం వుంది. ఒక ఎమ్మెల్యే స్ధాయి వ్యక్తిని కార్పోరేటర్‌ స్ధాయి నాయకుడు పార్టీలోకి తేవడం అన్నదే ఆలోచించడానికి వీలులేనిది. పార్టీ పరంగా, పార్టీ ఆదేశాల మేరకు తాను కూడా కృషి చేశానని చెప్పడంలో తప్పులేదు. ఒక వేళ పార్టీ మీద అంత ప్రేమ, ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద అంత గౌరవం వుంటే, గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి గంగుల కమలాకర్‌ ఓటమికోసం రవీందర్‌ సింగ్‌ ప్రయత్నాలు చేశారన్నది ఎందుకు తెరమీదకు వచ్చింది. కరీంనగర్‌ మొత్తం మెజార్టీ వచ్చి, రవీందర్‌ సింగ్‌కు చెందిన అనుయాయులు, ఆయన వర్గీయులు, బంధువులు వున్న ప్రాంతాల్లో బిజేపికి ఎందుకు మెజార్టీ వచ్చిందనేది కూడా రవీందర్‌ సింగ్‌ సమాధానం చెప్పాలని గతంలోనే పార్టీ నేతలు ప్రశ్నించారు. అయినా గంగుల కమలాకర్‌ వాటిని పట్టించుకోకుండా అందర్నీ కలుపుకుపోతూనే వున్నారు. కాకపోతే ప్రతి సారి గంగుల కమలాకర్‌ను అప్రదిష్టపాలు చేయడానికి పదే పదే రవీందర్‌ సింగ్‌ అనేక రకాల వ్యూహాలు పన్నుతూనే వున్నారన్నది అందరికీ తెలిసిందే అంటున్నారు. తాజాగా ఓ ప్రాంతంలో ఎలుకలు, పందికొక్కుల పేరు చెప్పి, మంత్రిని అప్రదిష్టపాలు చేయడానికి, మంత్రి ఏం పట్టించుకోవడం లేదని అబాసుపాలు చేయడానికి రవీందర్‌ సింగ్‌ అనుచురులు డ్రైనేజీలు తవ్వడం ఏమిటి? జేసిబిలు తెచ్చి, రాత్రికి రాత్రిరోడ్లు తవ్వేయడం ఏమిటి? తిరిగి వాటిని వెంటనే పూర్తి చేయాలని కమీషనర్‌ను బెదిరించడం ఏమిటి? కలెక్టర్‌కు పిర్యాధు చేస్తామని కమీషనర్‌కు చెప్పడమేమటి? ఏకంగా మంత్రి పరవు తీయాలని గణేష్‌ నిమజ్జనం తర్వాత కలెక్టరేట్‌ ముందు ధర్నాలు చేస్తామని చెప్పడమేమిటి? ఇదేనా సొంత పార్టీ నేతలు చేయాల్సిన పని? ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన నాయకులే , ప్రభుత్వాన్ని,మంత్రిని ఇబ్బందులకు గురిచేసి, ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేలా చేయడమేమిటి? గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రవీందర్‌ సింగ్‌ చేసిన హడావుడి..హంగామా అంతా ఇంతా కాదు…

ఏకంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ను సైతం రవీందర్‌ సింగ్‌ ఎలా వ్యాఖ్యానించారో ప్రజలందరికీ తెలుసు. ఏకంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇచ్చిన మాట మీద నిలబడడు అంటూ, అందరికీ ఆశ చూపి, వంచిస్తాడన్న మాటలు కూడా మాట్లాడాడు. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తానే గెలిచి, పార్టీకి బుద్ది చెబుతాన్నారు. అంతంత మాటలు మాట్లాడినా కేవలం ఉద్యమ సమయంలో కలిసి పనిచేశాడన్న కారణంతోనే రవీందర్‌ సింగ్‌ను పార్టీలో కొనసాగనిచ్చారు. టిఆర్‌ఎస్‌ కార్పోరేటర్‌గా వుంటూనే, బిజేపిలో చేరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాడు. ఇది పార్టీ నియమావళికి విరుద్దం. అయినా పార్టీ ఆయనను క్షమించింది. ఓ దశలో తాను మేయర్‌గా పనిచేసి, మళ్లీ కార్పోరేటర్‌గా పోటీ చేయడం నామోషీగా ఫీలైన నాయకుడు రవీందర్‌ సింగ్‌…..మహారాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవేంద్రఫడ్నవీస్‌, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. అంతే కాని రవీందర్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు ఎంత అహాంకారపూరితమైనవో చెప్పకకనే చెప్పొచ్చు. అంతే కాదు గతంలో నిజామాబాద్‌ ఎంపిగా కల్వకుంట్ల కవిత ఓడిపోయిన కొద్ది కాలానికే మళ్లీ ఎమ్మెల్సీ అయ్యింది. ఆమెకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా? అని అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వ్యక్తి రవీందర్‌ సింగ్‌. ఇక ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ మీద కూడా ఆయన అనేక సార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. పదవి పోయి పట్టుమని మూడు నెలలు కూడా వినోద్‌ కుమార్‌ వుండలేకపోయాడంటూ రవీందర్‌ సింగ్‌ విమర్శించాడు. తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి నిలబడడం మూలంగానే ఎంపిటిసీలకు నిధులొచ్చాయని కూడా చెప్పుకున్నాడు. ప్రభుత్వం ఎన్ని వందలకోట్ల రూపాయలు ఖర్చు చేసినా, హుజూరాబాద్‌ ఎన్నికల్లో ఏం జరిగిందని ప్రశ్నించారు. పరోక్షంగా ఈటెల రాజేందర్‌కు ప్రచారం చేశారన్న అపవాదును ఎదుర్కొన్నారు. అసలు టిఆర్‌ఎస్‌లో వుండి, టిఆర్‌ఎస్‌ అభ్యర్ధికి సపోర్టు చేయకుండా, పార్టీ నుంచి బైటకు పంపించబడ్డ ఈటెల రాజేందర్‌ గెలుపును పదే పదే గుర్తు చేస్తూ, అనేక సార్లు పార్టీని కించపర్చిన ఘనత రవీందర్‌ సింగ్‌ది. అయినా ఆయన అనేక సార్లు క్షమించి వదిలేసింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా అవన్నీ కడుపులో పెట్టుకొని వదిలేశాడు. తాజాగా ముఖ్యమంత్రి డల్లీ, బీహార్‌, పంజాబ్‌ పర్యటనలో ఆయనను వెంట బెట్టుకొని వెళ్లారు. అయినా ఆయనలో మార్పు రాలేదు. పార్టీకి నష్టం చేకూర్చే పనులు మానుకోలేదుని పార్టీ నాయకులే అంటున్నారు. ఇదిలా వుంటే ఆయన అనుచరులు మంత్రి గంగుల కమలాకర్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన ఆడియో బైటకు రావడంతో తనకు ఏమీ తెలియదన్నట్లు, బిజేపి ఎంపి. బండి సంజయ్‌కుమార్‌ మీద ప్రెస్‌ మీట్‌ పెట్టినంత మాత్రాన చేసిన తప్పులు మాఫ్‌ అయిపోతాయనుకుంటున్నాడు. 

నానాటికీ రవీందర్‌ సింగ్‌ ఆగడాలు శృతి మించిపోతున్నాయని గ్రహించిన టిఆర్‌ఎస్‌ నాయకులు, కార్పోరేటర్లు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు కల్వకుంట్ల తారకరామారావు, కరీంగనగర్‌ జిల్లా మంత్రి గంగుల కమలాకర్‌కు పిర్యాధులు చేశారు. పార్టీ నుంచి రవీందర్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేయాలని కోరారు. అంతేకాదు రవీందర్‌ వ్యహార శైలిని వెంటనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయిన పల్లి వినోద్‌కుమార్‌కు కూడా పార్టీ నాయకులు పిర్యాధు చేశారు. ఇక రోడ్డును తవ్వి, కార్పోరేషన్‌కు నష్టం కల్గించిన వారిపై పోలీసు కేసు కూడా నమోదైంది. మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధికారుల పిర్యాధు మేరకు రోడ్డు, డ్రైనేజీని తవ్వి, మంత్రిని అప్రదిష్టపాలు చేయడానికి చూసిన వారిపై కూడా పోలీసు కేసు నమోదైంది. రవీందర్‌ సింగ్‌, ఆయన అనుచరుల ఆగడాల మూలంగా పార్టీకీ తీరని నష్టం కల్గుతోందని, వెంటనే ఆయనను పార్టీనుంచి సస్పెండ్‌ చేయాలని పార్టీ శ్రేణులు పెద్దఎత్తున డిమాండ్‌ చేస్తున్నాయి.

విమోచనమా!..విలీనమా!!

విమోచనమే అయితే నిజాంను రాజ్‌ ప్రముఖ్‌ ఎలా అయ్యారు?

`సెప్టెంబరు17న విలీనం జరగడం మూలంగానే తెలంగాణ ఇండియాలో కలిసింది!

`తెలంగాణ సాయుధ పోరాటం ముస్లిం వ్యతిరేక పోరాటం కాదు!

`నిజాం కు వ్యతిరేకంగా ఎంతో మంది ముస్లింలు పోరాటం సాగించారు.

`తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఒక దశలో అప్పటి ఇండియన్‌ ఆర్మీతో కూడా పోరాడారు!

`బిజేపి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముస్లిం, హిందూ పోరాటంగా అర్థమొచ్చే ప్రచారం చేయొద్దు!

`నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో షోయాబుల్లా ఖాన్‌ వంటి జర్నలిస్టు వున్నాడు!

`తొలి అమరుడు షేక్‌ బందగీ ముస్లిమే!

`తెలంగాణ ప్రజలు ఆకలితో అల్లాడుతుంటే, నిజాం ప్రపంచ కుభేరుడెలా అయ్యాడు!

`సర్థార్‌ వల్లభ్‌ భాయ్‌ తెలంగాణ విమోచనమే చేయిస్తే నిజాంను శిక్షించాలి కదా!

`ఏడాదికి లక్ష రూపాయల భరణంతో రాజ్‌ ప్రముఖ్‌ గా గౌరవించారు?

`ప్రజలను గందరగోళ పర్చకండి!

`చరిత్రకు మరకలద్దకండి!

`ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఒక కీలక ఘట్టం!

`ప్రపంచానికి ఒక చైతన్యం నింపిన ఘట్టం.. దోపిడీ వ్యవస్థకు గుణపాఠం!

`తెలంగాణలో మువ్వన్నెల జాతీయ జెండా ఎగిరిన రోజు….దేశ సమైక్యతలో, సమగ్రతలో తెలంగాణ భాగమైన రోజు…?

హైదరాబాద్‌,నేటిధాత్రి: విత్తు ముందా…చెట్టు ముందా? అన్నదానికి ఇప్పటికీ సమాధానం లేనట్లే, తెలంగాణ విషయంలోనూ సెప్టెంబర్‌ 17 అనేది విలీనమా? విమోచనమా? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఏ రకంగా అన్వయించినా ఏదో లోపం కనిపిస్తూనే వుంటుంది. విమోచనం అని నిర్ధారిస్తే వందల ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి. విలీనమంటే కూడా అనేక ప్రశ్నలు కళ్ల ముందు మెదులుతాయి. హైదరాబాద్‌ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ సందిగ్ధతను నివృత్తి చేసిన వారు లేరు. ఎందుకంటే హైదరాబాద్‌ రాష్ట్రం ఏర్పాటైనా 1952 తొలి ఎన్నికలు జరిగేదాకా కూడా జరిగిన సైనిక పాలన, పౌర పాలనల్లో కూడా అనేక వివాదాలున్నాయి. మేజర్‌ జనరల్‌ జేఎస్‌. చౌదరి నేతృత్వ సైనిక పాలన తెలంగాణ ప్రజలను అనేక రకాల ఇబ్బందులకు గురిచేసిందనేది కూడా ఓ చరిత్ర. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్పటి గవర్నరైన ఎంకే. వెల్లోడి నేతృత్వంలో పౌర ప్రభుత్వం ఏర్పాటు చేశాక తెలంగాణలో పోలీసు చర్యలు తగ్గాయి. హైదరాబాద్‌ రాష్ట్రానికి ఎన్నికలకు ముందు సాగించిన సైనిక పాలన తెలంగాణలో 40 వేల మంది రైతుల మరణానికి కారణమైనట్లు అప్పట్లో పెద్దఎత్తున ఆరోపణలు రావడంతోనే ఎంకే. వెల్లోడి పాలన వచ్చింది. ఎం.కే. వెల్లోడి కేరళకు చెందిన ఓ ఐపిఎస్‌ అధికారి. ఆయనను హైదరాబాద్‌ రాష్ట్ర పౌర ప్రభుత్వంలో నలుగురు మంత్రులు పనిచేస్తే అందులో బూర్గులు రామకృష్ణారావు వున్నారు. 1952 ఎన్నికల తర్వాత బూర్గుల ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అప్పుడు కూడా సెప్టెంబర్‌ 17ను విమోచన దినంగా చేసుకున్నట్లు ఆధారాలు లేవు. ప్రభుత్వం కుదురుకోకముందే అప్పటి కేంద్ర ప్రభుత్వం బాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో తెలంగాణ 9 జిల్లాలుగా, మరో 5 జిల్లాలు మహారాష్ట్రలో, 3 జిల్లాలు కర్ణాటకలో కలపడంతో అసలు హైదరాబాద్‌ రాష్ట్ర ఉనికే లేకుండాపోయింది. కాకపోతే మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు 1957 నుంచి హైదరాబాద్‌ విలీన దినోత్సవాలను నిర్వహిస్తున్నాయి. కాని ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్‌ 17ను గుర్తించడానికి కూడా ఇష్టపడలేదు. ఆనాటి నుంచి కమ్మూనిస్టు పార్టీలు ఎంత పోరాటం చేసినా అధికారికంగా తెలంగాణ విలీన దినోత్సవాన్ని నిర్వహించలేదు. అప్పటికీ నైజాం రాజ్యం ఇండియాలో కలపడం అన్నది విలీనమా? నైజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి కావడం విమోచనమా? అన్నదానిని కూడా ప్రభుత్వాలు క్లారిటీ ఇవ్వలేకపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి నవంబర్‌ 1నే రాష్ట్రావతణ దినోత్సవంగా జరుపుకోవడం ఆనాయితీగా వచ్చింది. 

                             తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్‌ఎస్‌ పార్టీ సెప్టెంబర్‌ 17 విలీన దినోత్సవాన్ని నిర్వహించాలని కోరింది. కాని విమోచనం అన్నదానిపై ఆ పార్టీ కూడా విముక్తి దినోత్సవంగా జరపాలనే కోరింది. తెలంగాణ వచ్చాక మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం విముక్తి దినోత్సవాన్ని నిర్వహించేలేదు. ప్రతిపక్షాలు ఎంత అడిగినా ముఖ్యమంత్రి కేసిఆర్‌ పార్టీ పరంగా చేసుకోవడానికి అనుమతినిచ్చాడే గాని, ప్రభుత్వం తరుపున జరపలేదు. ఉద్యమ కాలంలో మాత్రం సెప్టెంబర్‌ 17ను ఒక రాజకీయ అస్త్రంగా టిఆర్‌ఎస్‌ మల్చుకుందని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పుడు బిజేపి అదే దారిలో నడుస్తోంది. 

                            బిజేపిలో తెలంగాణ విమోచనం అంటున్నా , ప్రజల్లో గందరగోళం ఇప్పటికీ వుంది. దానిని నివృత్తి చేయడం గత డెబ్బై ఏళ్లుగా ఎవరికీ సాధ్యం కాలేదు. ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూస్తే, దేశ స్వాతంత్య్రం వచ్చే నాటికి 612 చిన్న చిన్న సంస్ధానాలు స్వపరిపాన సాగిస్తున్నాయి. అందులో కొన్ని పెద్ద రాజ్యాలు కూడ వున్నాయి. వాటిలో హైదరాబాద్‌ రాజ్యమనేది అన్నింటికన్నా పెద్దది. చిన్న చిన్న సంస్ధానాలన్నీ స్వాతంత్య్రం రాగానే దేశంలో విలీనమయ్యాయి. కాని హైదరాబాద్‌ నిజాం రాజ్యం మాత్రం విలీనం కాలేదు. ఇండియాలో విలీనం కావడాని నిజాం ససేమిరా? అన్నాడు. దాంతో ఆపరేషన్‌ పోలో అనేది నిర్వహించి, హైదరాబాద్‌ను కేవలం 5 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం స్వాదీనం చేసుకున్నది. లొంగిపోయిన నిజాంను అప్పటినుంచి 1964 వరకు రాజ్‌ ప్రముఖ్‌గా( ప్రస్తుతం గవర్నర్‌) నియమించింది. ప్రతి ఏటా లక్ష రూపాయల భరణం కూడా ఇస్తూ వచ్చింది. ఒక వేళ ఆనాడు కేంద్ర ప్రభుత్వం అప్పటి హైదరాబాద్‌ను నిజాం నుంచి విముక్తి చేశారనుకుంటే ఆయనకు రాజ్‌ ప్రముఖ్‌గా పదవి ఇచ్చేవారు కాదు. విలీనం చేసుకున్నామన్న భావనతో, లొంగిపోయిన నిజాం రాజుకు గౌరవం ఇచ్చి సత్కరించినట్లే లెక్క. అంతే కాదు నిజాం లొంగిపోయినా, తెలంగాణలో భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేస్తున్న ఆనాటి రైతాంగం మీద సైనిక చర్యలు ఆగలేదు. హైదరాబాద్‌ రాష్ట్రంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమయంలో నిజాం, రజాకార్ల మూలంగా 10 వేల మంది రైతులు మరణిస్తే, కేంద్ర ప్రభుత్వం అణిచివేత వల్ల సుమారు 40 వేల మంది రైతులు మరణించారని చరిత్ర లెక్కలు చెబుతోంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పటి హైదరాబాద్‌ ప్రజలకు విలీనమే బహుమతిగా ఇచ్చినట్లు లెక్క. కేంద్రం విమోచనమే బహుమతి చేస్తే 40 వేల మంది రైతులు మరణించేవారు కాదు. కేంద్ర సైనిక చర్యల్లో భాగంగా రజాకార్ల నాయకుడు కాశిం రజ్వీని బంధించి అప్పటి వరంగల్‌ జైలుకు తరలించిన కేంద్ర ప్రభుత్వం నిజాం సూచన మేరకు ఆయనను విడుదల చేసింది. కాశిం రిజ్వి పాకిస్తాన్‌ వెళ్లేందుకు అనుమతినిచ్చింది. అంటే ఈ సంఘటన కూడా తెలంగాణ విమోచనమని చెప్పడానికి కూడా వీలు లేకుండాచేసింది. 

                       సరే మంచో చెడో ఇన్నేళ్లకైనా ఒక అడుగు ముందుకు పడిరదనే అనుకుందాం…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమైకత్యా దినోత్సవం అంటోంది. బిజేపి విమోచన దినోత్సవం అంటోంది. ఈ రెండు ప్రభుత్వాలలో బలమైన కేంద్రంలో అధికారంలో వుండి నిర్ణయాత్మక శక్తిగా వున్న బిజేపి తెలంగాణ ఏర్పాటు సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కలిపిసి ఏడు మండలలాను తిరిగి మళ్లీ తెలంగాణకు ఇస్తామని చెప్పగలరా? అంతే కాకుండా ఇప్పటికీ అటు కర్నాటకలోనూ, ఇటు మహారాష్ట్రలోనూ విలీన దినోత్సవాలు జరుపుకుంటున్న ఎనమిది జిల్లాలను తిరిగి తెలంగాణలో కలిపే ప్రకటన ఏదైనా చేస్తారా? అదే జరిగితే నిజంగా బిజేపి చిత్తశుద్ధిని తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తారు. కాని కేవలం రాజకీయాల కోసం మాత్రమే సెప్టెంబర్‌ 17ను వాడుకుంటామంటే ప్రజలు స్వాగతిస్తారని అనుకోలేం. ఎందుకంటే బిజేపి చెబుతున్న విషయాలు అన్నీ వాస్తవాలు కావు. రజకార్ల దాష్టికాలనే ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లాలని చూస్తే, ఇప్పటి వరకు గ్రామాల్లో వున్న ముస్లిం, హిందువుల ఐక్యతకు బీటలు వారుతుంది. ఇది తెలంగాణ సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకుంటే హైదరాబాద్‌ రాష్ట్రంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో హిందువులే కాదు, ముస్లింలు కూడా వున్నారు. నిజాం బాధితుల్లో అనేక మంది ముస్లింలు కూడా వున్నారు. అందులో తొలి అమరుడుగా చెప్పుకోవాల్సిన వారిలో షేక్‌ బందగీ వున్నాడు. కలాన్ని ఖడ్గంగా చేసి నిజాం ప్రభుత్వం మీద అక్షరాలను సంధించిన షోయబుల్లా ఖాన్‌ కూడా ముస్లిమే. ఆయనను చాదర్‌ఘాట్‌ వద్ద చేతులు, కాళ్లు నరికి అత్యంత కిరాతకంగా చంపింది నిజాం ప్రభుత్వమే…అంతే కాదు నిజాం కు వ్యతిరేకంగా కామ్రేడ్స్‌ అసోసియేషన్‌ అనే సంస్ధ స్ధాపించిన ముగ్ధుం మొహినుద్దీన్‌ కూడా ముస్లిమే…ఇలా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో ముస్లింలు వున్నారు. అంతే కాదు నిజాం రాజ్యంలో హిందువులకు తీరని అన్యాయం జరిగిందనో, చేశారని చెప్పడానికి కూడా వీలు లేదు. ఆనాటి ఉస్మానియా యూనివర్సిటీలో రామానంద తీర్ధ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి జన్మదిన వేడుకలకు అనుమతినిచ్చింది కూడా నిజామే…! అందువల్ల తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్‌ 17 అన్నది ఒక చారిత్మ్రాక ఘట్టమే…కాదని ఎవరూ అనలేరు. కాని దాన్ని ఓ వర్గానికి ముడిపెట్టడమే సరైంది కాదు. పైగా అది విమోచనం అనడానికి కూడా వీలు లేదు. తెలంగాణ సాయుధ పోరాటంలో సుమారు పది లక్షల ఎకరాలు నాటి భూస్వాముల చెర నుంచి రైతులు విడిపించుకున్నారు. మరి భూములు సైనిక పాలన కాలంలో మళ్లీ భూస్వాముల చేతుల్లోకి వెళ్లాయి. ఏ విస్నూర్‌ దొర మీద తెలంగాణ ప్రజలు పోరాటం చేసి, జనగామ రైల్వే స్టేషన్‌లో అంతమొందించారో…ఆయన కుమారుడినే తెలంగాణ ప్రజలు అసెంబ్లీకి పంపారు. మరి దీన్నే మంటారు…! అందువల్ల తెలంగాణ ఇండియాలో విలీనమైన రోజుగానే సెప్టెంబర్‌ 17ను భావించాలే గాని, విమోచన అనడానికి ఎలాంటి ప్రాతిపదిక లేదు. ఏది ఏమైనా ఆనాటి నుంచి సెప్టెంబర్‌ 17 తెలంగాణ రాజకీయాలకు వేధికగానే వుంది. ఇప్పుడూ అదే వేధికగా రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారుతోంది.

ప్లీజ్‌ …ప్లీజ్‌…అంటే ఓట్లు పడతాయా!

`అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నరో చెప్పరా!

`అధికారంలోకి వస్తామని మీకు మీరు ప్రచారం చేసుకుంటే సరిపోతుందా?

`రైతులకు ఇప్పటికన్నా మెరుగైన పథకాలు ఏమిస్తారు?

`పెన్షన్లు ఎంతకు పెంచుతారు?

`అనేక సంక్షేమ పథకాలు అమలౌతున్నాయి….వాటిని కొనసాగిస్తారా? కోత పెడతారా?

`ఆంద్రప్రదేశ్‌ లో జగన్మోహన్‌ రెడ్డి కూడా ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అన్నాడు.

`నవరత్నాలు ప్రకటించి విసృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, ఒక్క ఛాన్సివ్వండి అని వేడుకున్నాడు.

`ఆఖరుకు కాంగ్రెస్‌ వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రకటించింది.

`బిజేపి ప్లీజ్‌…ప్లీజ్‌ తప్ప మరేం చెప్పింది?

`పేదల దేవుడు మోడీ అని చెప్పగానే సరిపోతుందా? ధరలు తగ్గిస్తామని చెప్పగలరా?

`గ్యాస్‌ ధర తగ్గుతుందని చెప్పే ధైర్యముందా?

`రాష్ట్రానికి అప్పులెక్కువున్నాయని సంక్షేమాలకు కోతపెడతారా?

`బిజేపిని ఎందుకు గెలిపించాలో చెప్పకపోతే ఎలా?

`కేసిఆర్‌ కుటుంబ పాలన ఆరోపణ ఒక్కటే నమ్ముకుంటే గెలుస్తారా?

`పేద ప్రజలకు ఇచ్చే సంక్షేమాలను ఉచితాలంటే, వ్యాపారుల రుణాల మాఫీపై సమాధానం చెప్పరా?

రాజకీయ పార్టీ అన్న తర్వాత అధికారం కోరుకోవడం తప్పు కాదు. అధికారంలోకి రావాలనుకోవడం ఆశ కాదు. ప్రజలకు మరింత సేవ చేయాలన్నా అధికారం కావాలి. ఆయా పార్టీలు అనుకున్న తీరిలో సమాజ నిర్మాణం జరగాలన్నా అధికారంలో వుండాలి. ఉన్నతమైన ఆశయాలతో సమాజంలో కొత్త ఒరవడి తీసుకురావాలన్నా అధికారంలోకి రావాలి. ప్రజలకు మేలైన పాలన అందించాలి. వారి సంక్షేమం కోసం నిరంతరం తపన పడాలి. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ రాజ్య నిర్మాణం జరగాలి. ప్రజల గుండెల్లో రాజకీయ పార్టీలు పదిలంగా వుండాలి. కొన్ని దశాబ్ధాలైనా సరే ప్రజలకు మేలు చేసిన నాయకులను మర్చిపోని పాలన అందించాలి. అందుకు పార్టీలు ఎంతో కృషి చేయాలి. ప్రజలకు చేరువ కావాలి. ప్రజల కోరిక మేరకు పని చేయాలి. ప్రజా పోరాటాలు చేయాలి. ప్రజల హక్కుల రక్షణకు పాటు పడాలి. అభివృద్దిలో రాజీలేని పోరాటం చేయాలి. ప్రజల మన్ననలు పొందాలి. ఇవీ సహజంగా రాజకీయ పార్టీలు ఆలోచించేవి. నిర్ణయాత్మక ఆలోచనలతో, నిర్మాణాత్మక విధానాలతో ముందడుగు వేయాలి. అంతే కాని ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌…ప్లీజ్‌…ప్లీజ్‌ అంటే సరిపోతుందా? ప్రజలు ఓట్లేస్తారా? కేంద్రంలో ఎనమిదేళ్లుగా అధికారంలో వున్న బిజేపి, 19 రాష్ట్రాల్లో అధికారంలో వుండి అక్కడ ఎలాంటి పాలన సాగిస్తున్నారన్నది ప్రజలు గమనించరా? తెలంగాణలో అమలౌతున్న సంక్షేమ పధకాలు మరే రాష్ట్రంలోనైనా అమలౌతున్నాయా? 

తెలంగాణ కంటే మరింత మెరుగైన పథకాలు మరెక్కడైనా వున్నాయా? అందులోనూ బిజేపి పాలిత రాష్ట్రాల్లో అమలౌతున్నాయా? కనీసం గుజారాత్‌లోనైనా అమలౌతున్నాయా. గుజరాత్‌లో తెలంగాణలో ఇస్తున్న రూ.2116 పెన్షన్‌ ఇస్తున్నారా? అక్కడ కేవలం రూ.500 ఇస్తున్నారు. ఉత్తరాధి రాష్ట్రాల్లో ఎక్కడా తెలంగాణలో ఇచ్చినంత పెన్షన్‌ ఇవ్వడం లేదు. అక్కడెక్కడా ప్రాజెఉ్టలు కట్టింది లేదు. రిజర్వాయర్ల నిర్మాణం లేదు. కళ్యాణ లక్ష్మి వంటి వినూత్నమైన పధకం లేదు. అలాంటి పధకాలు అమలు చేయాలన్న ఆలోచన లేదు. రైతు బంధు వంటి కార్యాక్రమాలు లేనే లేవు. అయినా మేం గెలుస్తాం…గెలుస్తున్నాం…టిఆర్‌ఎస్‌ను ఓడిస్తాం…డబుల్‌ ఇంజన్‌ తెస్తాం…తెచ్చి ఏం చేస్తారు? గెలిచి ఏం చేస్తారో ఇప్పటికి కూడా చెప్పకపోతే ఎలా? అధికారంలోకి వస్తే తెలంగాణలోనూ అమలు చేస్తామనే ప్రత్యేకమైన పధకాలు బిజేపి వద్ద వున్నాయా? వుంటే అవి కదా? బిజేపి చెప్పాల్సింది. ఒక్క ఛాన్సు ప్లీజ్‌..అంటూ ప్రతి సభలోనూ చెప్పుకుంటూ పోతే ప్రజలు ఆదరిస్తారా? యూపిఏ 2 హయాంలో పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతోపాటు, నాడు నరేంద్రమోడీ గుజరాత్‌ మోడల్‌ అభివృద్ధిని దేశమంతా అమలు చేస్తాడని ప్రజలు ఎంతో నమ్మారు. అప్పటికి గుజరాత్‌ అన్ని రంగాల్లో పెద్దఎత్తున ప్రగతిలో దూసుకుపోతోందన్న ప్రచారం విసృతంగా వుంది. పైగా బిజేపి ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడీని పార్టీ గుర్తించి ప్రకటించిన తర్వాత నరేంద్రమోడీ ప్రజలకు చేసిన వాగ్ధానాలు ప్రజలను పెద్ద ఎత్తున కదించించాయి. అప్పటికే పడిపోతున్న రూపాయి విలువను మళ్లీ నిలబెడతానమన్నారు. ద్రవ్యోల్భనం తగ్గిస్తామన్నారు. ధరలు అదుపు చేస్తామన్నారు. పేద ప్రజలకు అందుబాటులో వుండేలా అన్ని రకాల ధరలు నియంత్రిస్తామన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పెట్రోల్‌ ధరలు తగ్గిస్తామన్నారు. గ్యాస్‌ ధరలు దించుతామన్నారు. పెద్దఎత్తున పారిశ్రామిక రంగాన్ని విసృతం చేస్తామన్నారు. యువతకు ఉపాది కల్పిస్తామన్నారు. పారిశ్రామిక రంగంలో పరుగులు తీయిస్తామన్నారు. వ్యవసాయం పండగ చేస్తామన్నారు. సరిగ్గా ఎన్నికల ముందు మహిళళపై దాడులు జరక్కుంగా కఠినమైన చట్టాలు తెస్తామన్నారు. విదేశాల్లో వున్న నల్ల డబ్బును తెస్తామన్నారు. ప్రతి అకౌంట్లో 15లక్షలు వేస్తామన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ రద్దు చేస్తామన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు చేస్తామన్నారు. బిజేపి తొలి నినాదమైన రామమందిర నిర్మాణం చేస్తామన్నారు. దేశమంతా ఒకే పన్ను విధానం అమలు చేస్తామన్నారు. ఇలా అనేక రకాల వాగ్ధానాలు చేశారు. దాంతో బిజేపి దేశ ప్రజలు నమ్మారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని విశ్వసించారు. దేశమంతా బిజేపి ప్రభజంనంలా గెలిపించారు. మరి అదే బిజేపి తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఏం చెబుతారు? 

ఏదీ చెప్పకుండా ఎలా అధికారంలోకి వస్తారు? రాష్ట్రంలో బిజేపి ఒంటరిగా పోటీ చేసే శక్తిని పెంపొందించుకోవడం నిజంగా శుభపరిణామమే…తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తుతో 5 సీట్లు గెలిచిన బిజేపి, 2018 ఎన్నికల్లో ఒంటరి పోరుతో ఒక్కసీటుకు పరిమితమైంది. కాకపోతే మధ్యలో వచ్చిన దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు కలిసొచ్చాయి.ఊపు ను తెచ్చిపెట్టాయి. అయితే ఆ రెండు సీట్లు కూడా బిజేపి బలంతో గెలిచాయని చెప్పడం కన్నా, ఆయా అభ్యర్ధుల మీద ప్రజల్లో వున్న నమ్మకం గెలిపించిందని చెప్పకతప్పదు. కాకపోతే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో మాత్రం బిజేపి మానియా పనిచేసింది. ఆ ఎన్నికల్లో కూడా చేయరాని వాగ్ధానాలు చేస్తే తప్ప, ప్రజలు ఓట్లేయలేదు. మరి మర్చిపోయినట్లున్నారు. ప్రజా సంగ్రామయాత్రతో బిజేపి రాష్ట్ర ఛీఫ్‌ బండి సంజయ్‌ పాదయాత్ర వరకు బాగానే వుంది. కాని ఒక్క ఛాన్స్‌ అనే మాటనే జనం వింతగా తీసుకుంటున్నారు. ఈ ఒక్క ప్లీజ్‌ అన్న పదం తప్ప మరేం లేదా? అన్న ప్రశ్న కూడా జనం నుంచే వస్తోంది. ఆ మధ్య బీజేపీ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ ముందు రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్‌ పేదల దేవుడు అన్నా…మన మోడీ అంటూ చెప్పుకొచ్చారు. 

మరి పేదల దేవుడైతే పెరుగుతున్న ధరలేంది? అన్న ప్రశ్న ప్రజలు వేసుకుంటారని, సమయం వచ్చినప్పుడు ప్రశ్నిస్తారని, నిలదీస్తారని బండి సంజయ్‌కు తెలియందా? ఆ మధ్య ప్రజా సంగ్రామ యాత్రలో ఓసారి ఈ ధరలేంది? అని మహిళలు నిలదీసిన సంఘటన మర్చిపోయారా? ఎంత సేపు ముఖ్యమంత్రి కేసిఆర్‌ కుటుంబ పాలన…అవినీతి పాలన అంటూ చెప్పడం బాగానే వుంది. ఆ పాలనకు ప్రజలు చరమగీతం పాడితే… తెలంగాణ ప్రజలకు బిజేపి ఏం చేయాలనుకుంటుంది? అన్నది చెప్పరా? చెప్పాల్సిన అవసరం లేదా? టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలే బిజేపికి వరాలా? సరే…బిజేపిని ప్రజలు నమ్మి గెలిపిస్తే దేశంలో ఎక్కడా లేని అనేక సంక్షేమ పధకాల అమలౌతున్న ఆ పధకాలు అమలు చేస్తారా? లేక వదిలేస్తారా? ప్రజలకు వచ్చే ప్రధానమైన అనుమానల్లో ఇవి కూడా వున్నాయి. అసలే రాష్ట్ర్రం అప్పుల్లో వుందంటున్నారు. అప్పులు చేస్తే తప్ప రాష్ట్రానికి పూట గడవడదంటున్నారు. ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని పరిస్ధితి వుందంటున్నారు. అప్పులు తేకుండా, ఉద్యోగస్తుల జీతాలు ఆపకుండా వుండాలంటే సంక్షేమ పథకాలకు కోత పెడతారా? పెన్షన్లు దేశంలో ఇతర రాష్ట్రాలలో ఇచ్చిన వాటికి సమానం చేస్తారా? వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం లేదా? గత ఎన్నికల్లో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా పాదయాత్ర చేశారు. పనిలో పనిగా నవరత్నాలే తమ మ్యానిఫెస్టో అని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. వివిధ రకాల పెన్షన్లు సంఖ్య పెంచుతామన్నారు. ఇచ్చే నగదు కూడా పెంచుతామన్నారు. ఇలా కొత్త కొత్త పథకాలకు శ్రీకారంచుట్టారు. అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కన్నా మెరుగైన పథకాలు అమలు చేస్తామన్నారు. మరి తెలంగాణలో బీజేసీ ఏం చెప్పదల్చుకుంది?

పొరుగున వున్న కర్నాటకలో రైతులకు ఇరవై నాలుగు గంటల కరంటు లేదు. రూ.2116 పెన్షన్‌ లేదు. తెలంగాణలో అమలౌతున్న ఏ ఒక్క పధకం అమలులో లేదు. గురుకులాలు లేవు. ఫీజు రీఎంబర్స్‌ మెంటు లేదు. ఆరోగ్యశ్రీ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో సంక్షేమ పధకాలకు లెక్కే లేదు. మరి వాటన్నింటినీ ఆపకుండా అమలు చేస్తామని, ఇంకా మెరుగైన పధకాలు సృష్టిస్తామని, అమలు చేస్తామని బ్లూ ప్రింట్‌ ఏదైనా ప్రకటిస్తారా? ఎన్నికల నాడు ఏదో తూతూ మంత్రంగా మ్యానిఫెస్టో అని ఏవో నాలుగు ప్రకటించి, గెలిచి తూచ్‌ అంటారా? ఇది కూడా ప్రజల నమ్మకం మీద ఆధారపడి వుంటుంది? ప్లీజ్‌…ప్లీజ్‌ మీద ఆధారపడి సాగేది కాదు…ఆలోచించుకోండి!!

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version