రాష్ట్రంలో విద్య వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత…

రాష్ట్రంలో విద్య వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

బుధవారం జంగేడు గ్రామంలోని కస్తూరి బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణం మౌలిక వసతుల కల్పన కోసం రూ.38 లక్షల వ్యయంతో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేయడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని పేర్కొన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని జంగేడు, ఘనపూర్, రేగొండ, టేకుమట్ల మండలాలలో ఉన్న కస్తూరిబా గాంధీ గురుకులాల అభివృద్ధికి రూ.2 కోట్ల 38 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఈ నిధులతో గురుకులాల్లో ప్రహరీ గోడల నిర్మాణం, లైటింగ్ సదుపాయాల ఏర్పాటు, గ్రౌండ్ లెవలింగ్, వాటర్ ప్లాంట్ల ఏర్పాటు, మరమ్మతులు తదితర పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఈ పనులన్నీ వేసవి సెలవుల్లో పూర్తిచేసి పున ప్రారంభం నాటికి పాఠశాలలు మరింత సదుపాయాలతో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరానికి జూన్ 12 నాటికి విద్యార్థులకు యూనిఫామ్‌లు, షూస్, పుస్తకాలు అందజేస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం ద్వారా ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. 14–15 సంవత్సరాల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం హెచ్‌పీవీ టీకాలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ మెనూ ప్రకారం ప్రతిరోజూ నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్‌లు, పుస్తకాలు, షూస్ అందజేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో
స్థానిక అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్ శ్వేత ప్రభాకర్ కస్తూరిబా పాఠశాల ప్రత్యేక అధికారి ఈశ్వరి కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version