హమాలి మహా గర్జన విజయవంతం చేయాలి

హమాలి మహా గర్జనను విజయవంతం చేయండి.

తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎం.ఏ. కలీం, వర్కింగ్ ప్రెసిడెంట్ శివన్న

“నేటిధాత్రి”, హైదరాబాద్.

తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ దశమ వార్షికోత్సవ మహాసభను ఘనంగా, విజయవంతంగా నిర్వహించాలని యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివన్న పిలుపునిచ్చారు.
సోమవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో “హమాలి మహా గర్జన” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎం.ఏ. కలీం నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శివన్న మాట్లాడుతూ రాష్ట్రంలో హమాలీలు అనేక కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. పగలు – రాత్రి తేడా లేకుండా శ్రమించి సమాజానికి సేవలు అందిస్తున్న హమాలీలకు ఇప్పటికీ సరైన గుర్తింపు, సామాజిక భద్రత అందకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో ప్రభుత్వం హమాలి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ అమలు కాకపోవడం హమాలీలకు తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. వెంటనే హమాలి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి హమాలీల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు పది లక్షల మంది హమాలీలు వివిధ మార్కెట్లు, గోదాములు, రవాణా కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్ యార్డులు మరియు ప్రైవేట్ సంస్థల్లో కష్టపడి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు.
కనీస భద్రతా పథకాలు, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, వృద్ధాప్య పెన్షన్, పిల్లల విద్యకు సహాయం వంటి సంక్షేమ పథకాలు సరైన స్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.హమాలీలు రోజువారీ కూలీలుగా పనిచేసే క్రమంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి సందర్భాల్లో వారికి ఎటువంటి భరోసా లేకుండా పోతుందని అన్నారు. కాబట్టి హమాలి వెల్ఫేర్ బోర్డు ద్వారా ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, వృద్ధాప్య పెన్షన్, పిల్లల విద్యా సహాయం వంటి సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.హమాలీల హక్కులు, సంక్షేమం కోసం ఈ నెల 15వ తేదీన హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “హమాలి మహా గర్జన” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శివన్న పిలుపునిచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో హమాలీలు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ విలేకరుల సమావేశంలో యూనియన్ నాయకులు రవికుమార్ (మూసాపేట రైల్వే గూడ్స్ షెడ్ అధ్యక్షులు), ఉగ్రం యాదవ్ (బోయినపల్లి మార్కెట్ అధ్యక్షులు), సంఘం సలహదారులు ఆవాల హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 12న జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయండి…

ఈనెల 12న జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయండి

భారతదేశంలో స్వతంత్రానికి పూర్వం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులు, చట్టాలను రక్షించుకుందాం. యావత్తు కార్మికుల ఐక్యతను చాటుదాం. దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి, ఫిబ్రవరి 12 తేదీ 2026 న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక జాతీయ కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని ఎఐసిసిటియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కన్నూరి దనియల్ పిలుపునిచ్చారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి.
కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కొనసాగిస్తూ అమలు చేయాలి.
8 గంటల పని విధానం షరతులు లేకుండా అమలు చేయాలి.
కార్మికులు అంటే బానిసలు కాదు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలి.
ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి పని భద్రత ఇవ్వాలి.
అభివృద్ధి అంటే కార్పొరేట్ పెట్టుబడుదారులే కాకుండా కార్మికులందరి అభివృద్ధికి ఉపయోగపడాలి. జిబి జి రామ్ జి చట్టం రద్దు చేయాలి.
జాతీయ విత్తన చట్టం రద్దు చేయాలి విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి.బిజెపి ప్రభుత్వం కార్మికుల, ప్రజా వ్యతిరేక విధనాలు ఉపసంహరించుకోవాలి. వారు డిమాండ్ చేశారు

నాలుగు లేబర్ కోడ్ల రద్దుకు కార్మికుల నిరసన

నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

ఫిబ్రవరి 12న సమ్మెను విజయవంతం చేయండి

సింగరేణి ఐక్య కార్మిక సంఘాల వేదిక (జెఎసి)

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి వాటి అమలుకు పూనుకుంది.ఈ లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా సింగరేణి ఐక్య కార్మిక సంఘాల వేదిక ఆధ్వర్యంలో నస్పూర్ మండలంలోని సీసీసీ కార్నల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ( ఎస్సిసిడబ్ల్యూ-ఐఎఫ్టియు) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి. బ్రహ్మానందం అధ్యక్షత వహించారు.ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి. శ్రీనివాస్,హెచ్ఎంఎస్ రాష్ట్ర నాయకులు కోండ్ర శంకర్, టీఎస్యూఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరటి రాజన్న, టిఎన్టియుసి రాష్ట్ర అధ్యక్షులు టి.మణిరామ్ సింగ్, ఏఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఎం.పోశమల్లు,జిఎల్బికేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కే.విశ్వనాథ్ పాల్గొని నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం మొత్తం 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను రద్దుచేసి,నాలుగు లేబర్ కోడ్ల ను తీసుకురావడం జరిగిందని మండిపడ్డారు.పారిశ్రామిక సంబంధాల కోడ్,వేతనాల కోడ్,పని భద్రత పరిస్థితుల కోడ్,సామాజిక భద్రత కోడ్ లను తెచ్చారని విమర్శించారు.ఈ కోడ్ ల వల్ల కార్మికులు అనేక హక్కులను కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన చెందారు.కేంద్ర ప్రభుత్వం ఈ కోడ్ లను తీసుకురావడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.ఈ దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి అందుట్లో పని చేసే కార్మికులకు ఎలాంటి హక్కులు,సౌకర్యాలు లేకుండా చేయడమేనని ఆరోపించారు.సమ్మె చేసే హక్కు లేకుండా సంఘం పెట్టకునే హక్కు లేకుండా చేయడం కొరకు మాత్రమే ఈ కోడ్ లను తీసుకురావడం జరిగిందన్నారు.పరిశ్రమలను ఎప్పుడైనా మూసేయవచ్చు, కార్మికులను ఎప్పుడైనా తొలగించవచ్చు,కచ్చితంగా ఇవన్నీ చేసేటటువంటి ప్రక్రియని చేపడుతున్నారని మండిపడ్డారు.రాత్రి పూట కూడా మహిళలను డ్యూటీ చేయించే పద్ధతిని కొత్త చట్టంలో తీసుకొచ్చారు.8 గంటల నుంచి 12 గంటల వరకు పని చేయించే విధానాన్ని తీసుకువస్తున్నారు.పిక్సెడ్ టర్మ్,టైంబండ్,ఎంప్లాయిమెంట్ అనేది కొత్త రూపాన్ని తీసుకొచ్చి పర్మనెంట్ ఉద్యోగం అనేది లేకుండా,ఉద్యోగానికి భద్రత లేని పరిస్థితిని చేస్తున్నారు.ఇలాంటి తరుణంలో కార్మిక వర్గం అంత పెద్ద ఎత్తున పోరాటాలు చేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేసే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హెచ్ ఎం ఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి,ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్, టీఎస్యుఎస్ రాష్ట్ర నాయకులు సమ్ము రాజన్న, ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు జి.రాయమల్లు, 200 మంది వర్కర్స్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version