జడ్పీ వైస్‌చైర్మన్‌గా ఆకుల శ్రీనివాస్‌ ..

జడ్పీ వైస్‌చైర్మన్‌గా ఆకుల శ్రీనివాస్‌ ..

వరంగల్‌ రూరల్‌ జిల్లా జడ్పీ వైస్‌చైర్మన్‌గా దుగ్గొండి మండల జడ్పీటీసీ సభ్యులు ఆకుల శ్రీనివాస్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. జిల్లా పరిషత్‌ వరంగల్‌ రూరల్‌ జిల్లా ఫ్లోర్‌లీడర్‌గా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి, నల్లబెల్లి మండల జడ్పిటిసి సభ్యురాలు పెద్ది స్వప్న ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

ఆటోడ్రైవర్‌ నుంచి జడ్పీ వైస్‌చైర్మన్‌ వరకు..

ఆటోడ్రైవర్‌గా తన జీవితాన్ని ప్రారంభం చేసిన ఆకుల శ్రీనివాస్‌ నేడు జిల్లా పరిషత్‌ వైస్‌చైర్మన్‌గా ఎదిగాడు. 2014లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి ఆనాటి నుండి టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడిగా తన బాధ్యతలు నెరవేరుస్తూ ఇటీవల జరిగిన జడ్పిటిసి ఎన్నికల్లో డివిజన్లోనే అత్యధిక మెజార్టీతో జడ్పిటిసిగా ఎన్నికైనారు.

ఉద్యమరాలుగా మొదలై జడ్పి ఫ్లోర్‌లీడర్‌గా….

మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిని విభాగంలో క్రియాశీలకంగా పనిచేసిన పెద్ది స్వప్న అనేక పోరాటాలలో పాల్గొన్నది. అనేకమార్లు తెలంగాణ సాధన ఉద్యమ పోరాటంలో లాఠీదెబ్బలకు బలై, జైలు జీవితం అనుభవించింది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులు రాజకీయంలో క్రియాశీలకంగా మారాలని పిలుపుతో నేడు నల్లబెల్లి మండలం నుండి టీఆర్‌ఎస్‌ పార్టీ జడ్పిటిసి అభ్యర్థిగా గెలుపొంది వరంగల్‌ రూరల్‌ జిల్లా జిల్లా పరిషత్‌ ఫ్లోర్‌లీడర్‌గా ఎన్నికైనారు.

ఆనాడు భర్త…ఈనాడు భార్య….

తెలంగాణ ఉద్యమ పోరాటం గల్లీ నుండి ఢిల్లీ వరకు చేరే విధంగా ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ప్రజాప్రతినిధులుగా ఎన్నికై తమ గళాన్ని వినిపించారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ ఇంచార్జీగా బాధ్యతలు నిర్వహిస్తూ ఆనాడు జరిగిన జడ్పీటిసి ఎన్నికల్లో నల్లబెల్లి మండలం నుండి జెడ్పీటీసి సభ్యుడిగా ఎన్నికైనా ప్రస్తుత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి జిల్లా పరిషత్‌ ఫ్లోర్‌లీడర్‌గా ఎన్నికై తన సత్తాను చాటారు. నేడు అదేబాటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న పెద్ది స్వప్న నేడు నల్లబెల్లి జడ్పీటీసీ సభ్యురాలుగా ఎన్నికై వరంగల్‌ రూరల్‌ జిల్లా జడ్పీ ఫ్లోర్‌లీడర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

దుగ్గొండి, నల్లబెల్లి మండల ప్రజల హర్షం వ్యక్తం

వరంగల్‌ రూరల్‌ జిల్లా జడ్పీ వైస్‌చైర్మన్‌గా ఆకుల శ్రీనివాస్‌, జిల్లా పరిషత్‌ ఫ్లోర్‌లీడర్‌గా పెద్ది స్వప్న సుదర్శన్‌రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల దుగ్గొండి, నల్లబెల్లి మండలాలతోపాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు, టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా పేలుస్తూ, మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *