పదిలో ఫెయిలైన విద్యార్థులకు సమ్మర్ క్యాంపులు ప్రారంభం
నరేంద్రనగర్లో క్యాంపును ప్రారంభించిన కలెక్టర్ సత్య శారద
జూన్ 3 వరకు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు ప్రత్యేక బోధన
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:
పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జిల్లాలో ప్రత్యేక సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. సోమవారం వరంగల్ జీహెచ్ఎస్ నరేంద్రనగర్ పాఠశాలలో క్యాంపును ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పదిలో ఫెయిల్ అవడం జీవితంలో ఓటమి కాదని, మరింత బలంగా ముందుకు సాగేందుకు ఒక అవకాశమని పేర్కొన్నారు. విద్యార్థులు నిరుత్సాహానికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో తిరిగి పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో చదువులోని లోపాలను సరిదిద్దుకోవాలని, మానసిక స్థైర్యం పెంపొందించేందుకు కౌన్సెలింగ్, సబ్జెక్టు వారీగా రెమిడీయల్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు.అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో భయాలను తొలగించి చదువుపై ఆసక్తి పెంచేందుకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన అందిస్తామన్నారు. తల్లిదండ్రులు పిల్లలను క్రమం తప్పకుండా క్యాంపులకు పంపించాలని కోరారు.డీఈఓ రంగయ్యనాయుడు మాట్లాడుతూ.. మోడల్ పరీక్షలు, డౌట్ క్లారిఫికేషన్ సెషన్లు నిర్వహిస్తామని, విద్యార్థులందరూ పాస్ అయ్యేలా శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.జీహెచ్ఎస్ నరేంద్రనగర్తో పాటు జెడ్పీహెచ్ఎస్ (బాలికలు) నర్సంపేటలో క్యాంపులు ఏర్పాటు చేశారు. తొలిరోజు గీసుగొండ, రాయపర్తి, వర్ధన్నపేట, సంగెం, వరంగల్, ఖిలా వరంగల్ మండలాల నుంచి 70 మంది విద్యార్థులు నరేంద్రనగర్ క్యాంపునకు హాజరయ్యారు. ఈ క్యాంపులు మే 12 నుంచి జూన్ 3 వరకు ప్రతిరోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు.
ఈకార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఉండ్రాతి సుజన్ తేజ, డీడబ్ల్యూఓ రాజమణి, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
