ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో కోడిగుడ్ల..

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో కోడిగుడ్ల సరఫరా టెండర్ల పర్యవేక్షణకు కమిటీ

వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలలో ఏడాదిపాటు కోడి గుడ్ల సరఫరా టెండర్ల పర్యవేక్షణకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.కోడిగుడ్ల సరఫరా టెండర్ల పై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చైర్మెన్ గా, జిల్లా విద్యాధికారి, ఆయా రెసిడెన్షియల్ విద్యాలయాలు బాధ్యులు, పశుసంవర్ధక శాఖ అధికారులు సభ్యులుగా ఈ కమిటీ లో ఉంటారని వెల్లడించారు.
ప్రభుత్వ వసతి గృహాల నుండి కోడిగుడ్డుల ఇండెంట్ వివరాలు జిల్లా కలెక్టరేట్ కు సమర్పించాలని జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుండి నేరుగా సప్లయర్ కు అవసరమైన కోడిగుడ్ల ఇండెంట్ ను సమర్పించడం జరుగుతుందని, గత సంవత్సరం అడ్మిషన్లకు అదనముగా 10% విద్యార్థుల సంఖ్యను పెంచి ఇండెంట్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు కోడిగుడ్డు బరువు 45 గ్రాముల నుంచి 52 గ్రాములు ఉండాలని, ప్రతి మాసము రెండుసార్లు సప్లై చేయాలని, అర్హత, అనుభవం వారికి నిబంధనల ప్రకారం కోడిగుడ్లు సరఫరా చేసే హక్కులు అందజేస్తామని, కోడిగుడ్ల సరఫరాలో ఆలస్యం చేస్తే పెనాల్టీలు విధిస్తామని కలెక్టర్ తెలిపారు. టెండర్ల విధానం, టెండర్లు ఆహ్వానం, తెరవడం తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. సమీక్ష సమావేశంలో జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్ రావు, ఆయా విద్యాలయాల కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version