rakthadana shibiram, రక్తదాన శిబిరం

రక్తదాన శిబిరం

రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న సందర్భాలలో క్షతగాత్రులకు సరైన సమయంలో రక్తం అందుబాటులో లేక చాలామంది మరణిస్తున్నారని, అలాగే ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు శరీరంలో ఉండాల్సిన రక్తం కంటే తక్కువగా ఉన్నప్పుడు అనేక జబ్బులకు గురికావల్సి వస్తుందని వీరికి రక్తం అందించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ రక్తం బ్లడ్‌ బ్యాంక్‌లలో ఒక్కొక్కసారి అందుబాటులో ఉండటం లేదని, దీనికంతటికి కారణం దాతలు రక్తదానాలు చేయకపోవడమే ప్రధాన కారణమని కాజీపేట ఏసీపీ నర్సింగరావు అన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలకేంద్రానికి చెందిన చిలుక మేఘన స్వేరో తన శరీరంలో ఉండాల్సిన రక్తం కంటే తక్కువ ఉండి బ్రెయిన్‌ ట్యూమర్‌కు గురై మరణించడం జరిగింది. ఇలాంటి మరణాలు నివారించడానికి ఆమె జ్ఞాపకార్థంగా ధర్మసాగర్‌ మండలకేంద్రంలో అంబేద్కర్‌ విజ్ఞాన మందిరం ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సంఘం అధ్యక్షుడు బొడ్డు ధనుంజయరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ గురుకులాల ప్రిన్సిపాల్‌ సెక్రటరీ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ రక్తదాన శిబిరం గురువారం వరంగల్‌ ఎంజిఎం బ్లడ్‌బ్యాంక్‌ సిబ్బంది ఆధ్వర్యంలో జరుగుతుందని యువకులు ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరానికి సంబంధించిన పోస్టర్‌ను కాజీపేట ఏసీపీ నర్సింగరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంజిఎం వైద్యులు డాక్టర్‌ బి.రాజమోహన్‌, డాక్టర్‌ జి.వేణు, డాక్టర్‌ మల్లిఖార్జున్‌, డాక్టర్‌ కొమురయ్య, మడికొండ సీఐ జాన్‌నర్సింహులు, స్థానిక సీఐ శ్రీలక్ష్మీ, ఎస్సై విజయ్‌రామ్‌కుమార్‌, బొడ్డు ప్రసాద్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *