*పాలీసెట్-2026 నిర్వహణకు పరకాలలో ఏర్పాట్లు పూర్తి*
*మే13న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష*
*పరకాల,నేటిధాత్రి:*
రాష్ట్రంలోని ప్రభుత్వ,ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లోని మూడు సంవత్సరాల ఇంజనీరింగ్,నాన్ ఇంజనీరింగ్ డిప్లమా కోర్సులతో పాటు వ్యవసాయ,వెటర్నరీ డిప్లమా ప్రవేశాల కోసం నిర్వహించే పాలీసెట్-2026 పరీక్షకు పరకాల పట్టణంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాలీసెట్ సమన్వయకర్త ఎస్.రవీందర్ రెడ్డి,సహాయ సమన్వయకర్త వై.కృష్ణ తెలిపారు.ఈ నెల 13వ తేదీ బుధవారం ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.పరకాల పట్టణంలో మొత్తం 776 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారనిf తెలిపారు.పరీక్ష నిర్వహణ కోసం పరకాలలోని ఎస్ఆర్ హైస్కూల్,గణపతి డిగ్రీ కాలేజ్,ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.విద్యార్థులు ఉదయం 9:30కల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 10 గంటల నుండి మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు.ఉదయం 11 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.
