బాధలో భరోసా..తెల్లదుస్తుల్లో సేవా దేవతలు..
రోగుల ప్రాణాలను కాపడుతూ సేవభావంతో ముందుకు సాగుతున్న నర్సులు
పరకాల,నేటిధాత్రి
అనారోగ్యంతో ఆసుపత్రికి చేరిన ప్రతి రోగికి ముందుగా కనిపించే ఆత్మీయ ముఖం నర్సులదే.బాధలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం,రాత్రింబవళ్లు సేవలందించడం,అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం వంటి బాధ్యతలను నర్సులు నిబద్ధతతో నిర్వహిస్తున్నారు.వైద్య రంగంలో డాక్టర్లతో సమానంగా నర్సుల పాత్ర కూడా అత్యంత కీలకమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.ప్రతి సంవత్సరం మే 12న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ నర్సింగ్ సేవలను స్మరించుకుంటారు.ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు పునాది వేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.ప్రభుత్వ,ప్రైవేట్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న నర్సులు రోగుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వైద్యుల సూచనల మేరకు చికిత్స అందిస్తున్నారు.మందులు ఇవ్వడం,ఇంజెక్షన్లు చేయడం, పరీక్షల కోసం రోగులను సిద్ధం చేయడం,అత్యవసర సమయాల్లో వెంటనే స్పందించడం వంటి అనేక బాధ్యతలను నిర్వహిస్తున్నారు.చిన్నారుల వార్డుల నుంచి ఐసీయూ వరకు ప్రతి విభాగంలోనూ నర్సుల సేవలు కీలకంగా మారాయి.

కరోనా మహమ్మారి సమయంలో నర్సులు చేసిన సేవలను సమాజం ఇప్పటికీ గుర్తుచేసుకుంటోంది.కుటుంబాలకు దూరంగా ఉంటూ కరోనా బాధితులకు సేవలందించిన నర్సులు నిజమైన యోధులుగా నిలిచారు.ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ విధులను వదలకుండా పని చేసి ఎన్నో కుటుంబాలకు ధైర్యం ఇచ్చారు.ఆ సమయంలో అనేక మంది నర్సులు తమ ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి సేవలందించారని వైద్యాధికారులు గుర్తు చేస్తున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆరోగ్య సేవలను ప్రజలకు చేరవేయడంలో నర్సులు కీలక పాత్ర పోషిస్తున్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీల సంరక్షణ,చిన్నారుల టీకాలు,ఆరోగ్య అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.మహిళలు, వృద్ధులు,చిన్నారులకు అవసరమైన వైద్య సేవలు అందించడంలో నర్సింగ్ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు.నర్సింగ్ అనేది కేవలం ఉద్యోగం కాదని,అది మానవతా సేవకు ప్రతీక అని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు.రోగి బాధను అర్థం చేసుకుని సేవ చేయగలిగే మనసు ఉన్నవారే మంచి నర్సులుగా నిలుస్తారని పేర్కొన్నారు.ఒత్తిడి,సమయాభావం,సిబ్బంది కొరత వంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ నర్సులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు.రోగి కోలుకుని చిరునవ్వుతో ఇంటికి వెళ్లడమే మాకు నిజమైన సంతోషం అని పలువురు నర్సులు పేర్కొన్నారు.సేవా భావం,సహనం,మానవత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్న నర్సులకు సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

నర్సుల సేవలు వైద్య రంగానికి వెన్నెముక
అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నర్సుల సేవలు ఎంతో కీలకమని డాక్టర్ రోహిత్ సాదు అన్నారు.అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన నర్సింగ్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగుల సంరక్షణలో నర్సులు చూపుతున్న సేవాభావం అభినందనీయమన్నారు.పగలు,రాత్రి తేడా లేకుండా విధులు నిర్వహిస్తూ రోగులకు ధైర్యం చెప్పడం,చికిత్సలో భాగస్వామ్యం కావడం నర్సుల గొప్పతనమని పేర్కొన్నారు.ఆసుపత్రుల్లో వైద్యుల తర్వాత అత్యంత బాధ్యతాయుతమైన పాత్రను నర్సులే నిర్వహిస్తున్నారని తెలిపారు.కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నర్సులు సేవలందించారని గుర్తు చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను ప్రజలకు చేరవేయడంలోనూ నర్సుల పాత్ర కీలకమని అన్నారు.రోగి కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి వెళ్లడమే నర్సులకు నిజమైన సంతోషమని తెలిపారు.సేవాభావం,సహనం,మానవత్వంతో పనిచేస్తున్న ప్రతి నర్సుకు సమాజం రుణపడి ఉంటుందని డాక్టర్ రోహిత్ సాదు కొనియాడారు.
డాక్టర్ రోహిత్ సాదు
