*లింకు విధానాలతో డీలర్లు,రైతులు తీవ్ర ఇబ్బందులు*
*లింకు విధానం రద్దు చేయాలని డీలర్ల సంఘం డిమాండ్*
*పరకాల,నేటిధాత్రి*
ఎరువుల కంపెనీలు అమలు చేస్తున్న లింకు విధానాలు రిటైల్ డీలర్లతో పాటు రైతులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పరకాల మండల ఫర్టిలైజర్స్,పెస్టిసైడ్స్ మరియు డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గందె వెంకటేశ్వర్లు ఆరోపించారు.సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ రైతులకు అత్యవసరమైన యూరియా ఎరువులు ఇవ్వాలంటే డిమాండ్ లేని ఇతర ఉత్పత్తులను బలవంతంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని కంపెనీలు సృష్టిస్తున్నాయని విమర్శించారు.గత రెండేళ్లుగా రిటైల్ డీలర్ల మార్జిన్లు భారీగా తగ్గిపోవడంతో రవాణా,గోడౌన్,విద్యుత్ వంటి నిర్వహణ ఖర్చులు కూడా రావడం లేదన్నారు.హోల్సేల్ వ్యాపారులు నేరుగా ఎంఆర్పీ ధరలకే విక్రయాలు చేయడంతో చిన్న డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.దీంతో అనేక ఎరువుల దుకాణాలు మూతపడే పరిస్థితి ఏర్పడిందన్నారు.అదేవిధంగా సాగు సీజన్ ప్రారంభ సమయంలో కంపెనీలు ఉద్దేశపూర్వకంగా యూరియా,డీఏపీ ఎరువుల కొరత సృష్టిస్తున్నాయని ఆరోపించారు.పాత స్టాక్ను వదిలించుకునేందుకు డీలర్లపై ఒత్తిడి తెస్తూ రైతులకు సకాలంలో ఎరువులు అందకుండా చేస్తున్నారని పేర్కొన్నారు.దీని ప్రభావంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు.‘లింకు’ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని,రిటైల్ డీలర్లకు కనీసం 8 నుంచి 10 శాతం వరకు న్యాయమైన మార్జిన్ కల్పించాలని,జిల్లాలు మరియు మండలాల వారీగా ఎరువుల సరఫరా వివరాలను ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.ఇది కేవలం డీలర్ల సమస్య మాత్రమే కాకుండా రైతు బతుకు,గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశమని గందె వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
