Man Dies of Heatstroke
వడదెబ్బతో వ్యక్తి మృతి: పరామర్శించిన కౌన్సిలర్
నర్సంపేట, నేటిధాత్రి:
నర్సంపేట మున్సిపాలిటీ 16వ వార్డు పరిధిలోని నాగర్లపల్లి గ్రామానికి చెందిన మెంతుల ఐలయ్య (53) శనివారం వడదెబ్బతో మృతి చెందారు.స్థానిక కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్,మృతుని కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఐలయ్య మధ్యాహ్నం 3 గంటల సమయంలో బయట పనులు ముగించుకుని బర్లను కాస్తుండగా తీవ్ర ఎండ వేడికి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు.విషయం తెలుసుకున్న 16వ వార్డు కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్ గ్రామస్తులతో కలిసి మృతుని నివాసానికి చేరుకుని భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం నుంచి అందే సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్న సమయాల్లో బయటకు రావొద్దని కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్ విజ్ఞప్తి చేశారు.
