త్వరలో మళ్ళీ టిఆర్‌ఎస్‌!

`బిఆర్‌ఎస్‌ నుంచి యూ టర్న్‌.

`గూగుల్‌ కూడా టిఆర్‌ఎస్సే అంటోంది.

`క్యాడర్‌ అభీష్టం మేరకే…

`అతి త్వరలో శుభవార్త.

`నాయకులు కోరుతున్నది టిఆర్‌ఎస్సే.

`ఏ లెక్కన చూసినా టిఆర్‌ఎస్సే నెం.1

`తెలంగాణ ఆత్మను నింపుకున్నది టిఆర్‌ఎస్‌.

`ఆత్మను వదులుకున్నట్లున్నది బిఆర్‌ఎస్‌.

`జనం సూచనలు చెవికెక్కించుకోండి.

`పదికాలాలపాటు ప్రజలే పార్టీని కాపాడుకుంటారు.

`కార్యకర్తలు వందేళ్లు జెండా మోస్తారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

నిజంగా ఇది బిఆర్‌ఎస్‌ శ్రేణులకు శుభవార్తే..తీయని సందేశమే… వేడుకలాంటి విశేషమే..ఎందుకంటే చాల కాలం తర్వాత మళ్లీ ఆత్మను గుండెల్లో నింపుకుంటున్నంత సంతోషం వ్యక్తమౌతున్నదే. బిఆర్‌ఎస్‌ భవిష్యత్తులో టిఆర్‌ఎస్‌గా మారనుందన్న మాటే క్యాడర్‌లో సంతోషాన్ని నింపుతుంది. ఆనందం తాండవం చేస్తుంది. టిఆర్‌ఎస్‌ అన్న పేరు క్యాడర్‌కు ఇరవై రెండేళ్ల గుండెల నిండా నిండిన జెండా బంధం…రాజకీయానుబంధం. తెలంగాణ ప్రజలతో ఆత్మరుణానుబంధం. అది ఎవరూ తెంచేది కాదు. తెంచుకునేది అంతకన్నా కాదు. ఎందుకంటే తెలంగాణ సాధన కోసం పద్నాలుగేళ్లపాటు నిరంతరంగా కొట్లాడిన పార్టీ టిఆర్‌ఎస్‌. పసి పిల్లాడి నుంచి పండు ముసలి వరకు, పూరి గుడిసె నుంచి ఎత్తైన భవంతుల వరకు, సామాన్యుడి వాహనం సైకిల్‌, సంపన్న వర్గాల కార్లపై కూడా నిరంతరం ఎగిరిన జెండా గులాబి జెండా. తెలంగాణ ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న జెండా టిఆర్‌ఎస్‌ జెండా. అదే తెలంగాణ ప్రజల అస్తిత్వం. ప్రాంత మమకారం. పిడికెలెత్తి నినదించిన నినాదం. తెలంగాణ ఆత్మగౌరవం. ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ తరంగం. అంతటి త్యాగమయ చరిత్ర టిఆర్‌ఎస్‌కు వుంది. గులాబి జెండా తెలంగాణ ప్రజల గుండెల్లో రెపరెపలాడినా, చేతిలో కర్రపై ఆకాశాన్నందుకునేంతగా ఎరుగుతున్నా, ప్రపంచానికి తెలంగాణ ఆకాంక్షను తెలిసేలా చేసిన ఏకైక జెండా టిఆర్‌ఎస్‌ జెండా..గులాబి జెండా. అయితే ఎప్పుడైతే బిఆర్‌ఎస్‌గా మారిందో అప్పుడే తెలంగాణ ఆత్మ దూరమైందన్న భావన అందరిలోనూ వ్యక్తమైంది. పేరు మారితే బంధంలో ప్రకంపనాలొస్తాయని చెప్పారు…టిఆర్‌ఎస్‌ను మార్చొద్దని తెలంగాణ సమాజమంతా సూచించిందే…కాని తెలంగాణ ఆత్మగౌరవం,తెలంగాణ నాయకత్వం డిల్లీలో సగర్వంగా నిలబడాలన్న ఆలోచనతో బిఆర్‌ఎస్‌గా మారింది. కేసిఆర్‌ ఎంత వివరణ ఇచ్చినా, క్యాడర్‌ బలవంతంగా అంగీకరించినా ప్రజలు ఒప్పుకోలేదు. పార్టీ పేరుమార్పు జనం మెచ్చలేదు.  

 తెలంగాణ ఆత్మగౌరవం గులాబీ జెండాలో కనిపించిన, బిఆర్‌ఎస్‌ గులాబీలో కనిపించడం లేదు. 

అదే పెద్ద వెలితి. అందుకే ప్రజలు కూడా టిఆర్‌ఎస్‌ను గుండెల్లో పెట్టుకున్నంతగా బిఆర్‌ఎస్‌ను పెట్టుకోలేదన్నది నిర్వివాదాంశం. ఎందుకంటే 2018 ముందస్తు ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఊహించని మెజార్టీని సొంతం చేసుకున్నది. ఉద్యమ కాలంలో సబ్బండ వర్గాలు ఎలా మద్దతు పలికాయో, 2018లో టిఆర్‌ఎస్‌కు అంతే మద్దతునిచ్చాయి. టిఆర్‌ఎస్‌ను గెలిపించాయి. తెలంగాణ ఇచ్చింది మేమే అని ఆనాడు కాంగ్రెస్‌ ఎంత ప్రచారం చేసుకున్నా, ప్రజలు వినిపించుకోలేదు. కాంగ్రెస్‌ను ఇక నమ్మం అనే తేల్చేశారు. కాంగ్రెస్‌ నాయకులకు డిపాజిట్లు కూడా రానంతగా టిఆర్‌ఎస్‌ నాయకులను బంపర్‌ మెజార్టీలతో గెలిపించారు. కాంగ్రెస్‌కు అడ్రస్‌ లేకుండా చేశారు. రెండోసారి కేసిఆర్‌ను ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో టిఆర్‌ఎస్‌ రానున్న రోజుల్లో బిఆర్‌ఎస్‌ అవుతుందని ఎవరూ అనుకోలేదు. జరిగిన రాజకీయ పరిణామాలు ఎలా వున్నా త్వరలో మళ్లీ టిఆర్‌ఎస్‌ అన్న పేరు వినిపంచనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

 ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌తోపాటు, కేటిఆర్‌, హరీష్‌రావులు ప్రజల నుంచి ఎలాంటి స్పందనవస్తుందన్న దానిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

 ముఖ్యంగా కేసిఆర్‌ ఈ విషయంలో చాల ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రజలు బిఆర్‌ఎస్‌ లో తెలంగాణ ఆత్మ లేదంటూ అప్పటి ప్రతిపాక్షాలైన కాంగ్రెస్‌, బిజేపి, బిఎస్పీలతో పాటు, యువత, విద్యార్దులు, తెలంగాణ వాదులు, కవులు, కళాకారులు హెచ్చరిస్తూనేవున్నారు. టిఆర్‌ఎస్‌ అని తెలంగాణ వాదాన్ని ముందుపెట్టుకొని, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి రాజకీయాలు చేశారంటూ కాంగ్రెస్‌,బిజేపిలుచేసిన విమర్శలను ప్రజలు కూడా నమ్మినట్లు తెలుస్తోంది. బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే కేసిఆర్‌ దేశ రాజకీయాల మీద దృష్టిపెట్టి తెలంగాణను పట్టించుకుకోకపోవచ్చన్న చర్చ కూడా సమాజంలో జోరుగానే సాగింది. అప్పటికే కేసిఆర్‌ పెద్దగా ప్రజల్లోకి వస్తున్నది లేదు. పైగా బిఆర్‌ఎస్‌ పేరుతో రాష్ట్రాలు తిరుగుతున్నాడు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఆయన చేసిన పర్యటనలు తెలంగాణ ప్రజల మీద తీవ్ర ప్రభావాన్ని చూపాయన్నది కూడా తెలుస్తోంది. టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత ఎక్కడైనా పార్టీ పోటీ చేస్తుందని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా పోటీ చేస్తామని చెప్పడం కూడా తెలంగాణ ప్రజలు మెచ్చలేదు. ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తే పద్నాలుగేళ్ల ఈ సుధీర్ఘ పోరాటానికి తెలంగాణ వాదానికి , త్యాగాలకు విలువేముందన్న అభిప్రాయంతెలంగాణ సమాజంలో వ్యక్తమైంది. తీరా ఎన్నికల సమయంలో బిఆర్‌ఎస్‌ పేరుతో తెలంగాణ వాదం వినిపించే ప్రయత్నం చేసినా, కాంగ్రెస్‌ వల్ల తెలంగాణ ఆగమౌతుందని కేసిఆర్‌ చెప్పినా ప్రజలు వినలేదు. బిఆర్‌ఎస్‌కు ప్రజలు ఓటేయలేదు. గెలిచిన కాంగ్రెస్‌కు, ఓడిపోయిన బిఆర్‌ఎస్‌కు మధ్య ఓట్ల తేడా చిన్నదే అని ఎంత చెప్పుకున్నా ఓటమి అన్నది ఐదేళ్ల పాటు తెలంగాణ ప్రజలకు పార్టీని, నాయకత్వాన్ని దూరం చేసినట్లే…అయితే బిఆర్‌ఎస్‌ ఓటమికి పూర్తిగా పేరు మాత్రమే కారణం కాదు. కాని బిఆర్‌ఎస్‌ ఓటమిలో పేరు కూడా ప్రధాన అంశమైందని చెప్పడంలో సందేహం లేదు. 

 ఇప్పటికైనా బిఆర్‌ఎస్‌ నుంచి టిఆర్‌ఎస్‌ యూటర్న్‌ కావాల్సిందే అని క్యాడర్‌ పట్టుబడుతోంది.

 లేకుంటే ప్రజల్లో చులకనౌతామని చెబుతోంది. కాంగ్రెస్‌ పార్టీ చేసిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు కేసిఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నది నిజమే…కాని కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్‌ అంటూ చేసిన ప్రచారం రేపు బిజేపి చేయకుండా వుండదు. కేంద్రంలో ఒక వేళ మళ్లీ బిజేపి అధికారంలోకి వస్తే తెలంగాణలో బిజేపి మరింత బలపడే అవకాశాలులేకపోలేదు. నిజానికి గతంలోనే బిజేపిని కేసిఆర్‌ పెంచిపోషిస్తున్నాడన్న విమర్శను కూడాఎదుర్కొన్నారు. కేంద్రలో మళ్లీ బిజేపి అధికారంలోకి వస్తే బిఆర్‌ఎస్‌ను రాజకీయంగా బిజేపి దెబ్బతీయదన్న గ్యారెంటీ లేదు. అంతే కాకుండా ఒక వేళ కాంగ్రెస్‌ను చీల్చే ప్రయత్నం బిజేపి చేస్తే, ఖచ్చితంగా బిఆర్‌ఎస్‌లో కూడా చీలిక తేకుండా వుండలేరు. అందువల్ల కేసిఆర్‌ జాగ్రత్త పడాల్సిన అవసరం వుంది. బిఆర్‌ఎస్‌ అంటూ గూగుల్‌ కూడా ఇష్టపడడం లేదు. గూగుల్‌కూడా టిఆర్‌ఎస్సే అంటోంది. క్యాడర్‌కూడా అదే కోరుకుంటోంది. ఏ లెక్కన చూసినా టిఆర్‌ఎస్సే నెంబర్‌ వన్‌. పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి ప్రతిపక్షపాత్ర పోషించిననా టిఆర్‌ఎస్‌ జనంలో నానింది. అంతే కాదు నాడు ఆంధ్ర నాయకులను భయపెట్టింది. తెలంగాణ ఉద్యమాన్ని భుజానకెత్తుకున్నది. తెలంగాణ ఆత్మను నింపుకున్నది. ఒక దశలో కాంగ్రెస్‌ పార్టీ బిఆర్‌ఎస్‌ను చూసి భయపడిరది. తెలంగాణ ఇచ్చింది. అలాంటి టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చడంతో ఆత్మను వదులుకున్నట్లున్నట్లైంది. జనం చెబుతున్నది కూడా ఇదే. ఇప్పటికీ మించిపోయిందేమీలేదు. వెంటనే టిఆర్‌ఎస్‌గా మార్చితేనే ఎంతో మేలు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆలోచిద్దాం..అని వాయిదా వస్తే పార్లమెంటు స్ధానాలు దక్కకపోతే కాంగ్రెస్‌ చేసే రాజకీయం ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. అందువల్ల టిఆర్‌ఎస్‌ అనండి. పది కాలాల పాటు ప్రజలే పార్టీని కాపాడుకుంటారు. వందేళ్లపాటు క్యాడర్‌ జెండా మోస్తారు.

ఆదాయం మిన్న…అభివృద్ధి సున్న!

https://epaper.netidhatri.com/

`మంత్రి సురేఖగారు మీరన్నా నిధులివ్వండి!

`అవినీతి ఉద్యోగులను తొలగించండి.

`ఏళ్ల తరబడి తిష్ట వేసిన వారిని సాగనంపండి.

`రాజన్నకు పూర్వ వైభవం కల్పించండి.

`వేములవాడ ఎందుకో వెనుకబడ్డది!

`దక్షిణ కాశీకే దిక్కులేకుంటున్నది.

`ఉమ్మడి రాష్ట్రంలో రాజన్నకు అన్యాయమే!

`తెలంగాణలో అభివృద్ధికి ఆమడ దూరమే!

`ఏటా వంద కోట్లన్నారు…ఏనాడో మర్చిపోయారు.

`రాజన్నకే శఠగోపం పెట్టారు.

`పాలకులు అలా…ఉద్యోగులు ఇలా!!

`దేవుని సొమ్ము ఏళ్లుగా మెక్కుతున్నారు!?

`పదేళ్లకు పైగా పదమూడు మంది తిష్ట!

`ఉద్యోగుల అవినీతిపై విచారణ.

`నిజనిర్థారణ జరిగినా చర్యలు లేవు.

`విచారణ నివేదిక బుట్ట దాఖలు చేశారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ ఉద్యమానికి వేముల వాడ రాజన్న ఆశీస్సులు వున్నాయి. తెలంగాణ ఉద్యమ ప్రస్ధానం, ఆట,పాట అంతా వేముల వాడ రాజన్న చుట్టే తిరుగాయి. అందుకే తెలంగాణ వచ్చింది. వేములవాడ రాజన్న కనికరమే తెలంగాణకు వరమైంది. తెలంగాణ ఉద్యమం ఊరూ, వాడ చేరేందుకు, రాజన్న పేరు మీద పాటలు కైగట్టి పాడని కవిగాయకులెందరో వున్నారు. అలా రాజన..ఓ రాజనా…ఎత్తుర తెలంగాణ జెండ…రాజన ఓ రాజన్నా..అంటూ పాటలు పాడారు. అసలు రాజన్న పదం లేకుండా తెలంగాణ పాటే లేదు. అంత గొప్పది రాజన్న దీవెన. ఆయన దీవెనతోనే మలి దశ తెలంగాణ సాధ్యమైంది. కాని తిరుపతి వెంకన్నకు తెలంగాణ మొక్కులు చేరాయి. విజయవాడ దుర్గమ్మకు మొక్కులు నెవరేరాయి. యాదగిరి నర్సన్నకుకొత్త కోవెల వచ్చింది. వెయియ కోట్లతో కొత్త గుడి నిర్మాణం జరిగింది. కాని తెలంగాణ ఉద్యమం మొత్తం తన పేరు చుట్టూ తిరిగిన రాజన్న ఆలయం మాత్రం అలాగే వుంది. అక్కడే వుంది. యాదగిరి గుట్ట పేరు మార్చి యాదాద్రి చేసిన తర్వాత అందరూ ప్రశ్నించడంతో నాడు కేసిఆర్‌ ఎముడాల రాజన్నకే ఏటా వంద కోట్లు ఇస్తామని మాట తప్పాడు. పదవి పోగొట్టుకొని ఇంట్లో కూర్చున్నాడు. తెలంగాణలో వేముల వాడ రాజన్న అంటే ఎంతో మహిమాన్వితమైన దేవుడు. తెలంగాణలో అత్యంత పురాతమైన దేవాయాలలో వేములవాడ రాజన్న ఆలయం ఎంతో విశిష్టమైంది. పశ్చిమ చాళుక్యుల కాలం కోనేరులో వున్నాననిచెప్పి, గుడి కట్టమని స్వయంగా శివుడే ఆదేశిస్తే గుడి నిర్మాణం జరిగింది. నాటి నుంచి రాజన్న పూజలందుకుంటున్నాడు. దక్షిణ కాశీగా వెలుగొందుతున్నాడు. నిత్యం లక్ష మందికి పైగా వేముల వాడ రాజన్నను భక్తులు దర్శించుకుంటారు. మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులకు కొంగు బంగారమైన దేవుడు రాజరాజేశ్వర స్వామి. ఇప్పుడు బస్సు సౌకార్యలు, ఇతర రవాణా సౌకర్యాలున్నాయి. ఆరోశతాబ్ధంలో నిర్మాణమైన ఆలయం చాళుక్యుల కాలం నుంచి వెలుగు వెలుగుతోంది. రాజన్న ఆలయ కోనేరులో స్నానమాచరిస్తే శారీరక రోగాలన్నీ మాయమౌతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అలా కొన్ని వందల సంవత్సరాలుగా తెలంగాణలో విరాజిల్లుతున్న గొప్ప శైవక్షేత్రం. ఉమ్మడి పాలకులు ఏనాడు వేముల వాడను పట్టించుకోలేదు. వసతుల సౌకర్యాలు కల్పించలేదు. ఇప్పటికీ వేముల వాడలో వున్న గృహ సముదాయాలు కొన్ని వందల ఏళ్ల కాలం నాడు నిర్మాణం చేసినవే తప్ప, ఉమ్మడి రాష్ట్రంలో గాని, తెలంగాణ వచ్చిన తర్వాత గాని చేసిన నిర్మాణాలు లేవు. తెలంగాణలోని కొన్ని లక్షల కుటుంబాలు ఏటా రాజన్నను దర్శించుకోకుండా వుండరు. తెలంగాణలోని అన్ని దేవాలయాలకన్నా, ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వేముల వాడ నుంచే లభిస్తుంది. అయినా పాలకులు ఏనాడు వేముల వాడ అభివృద్దిపై దృష్టిసారించలేదు. గతంలో ఏటా వంద కోట్లు ఇస్తామని గొప్పలు చెప్పిన కేసిఆర్‌ మాటలు మాత్రం అనేకం చెప్పారు. వేముల వాడ టెంపుల్‌ ఏరియా అధారిటీ ఏర్పాటుచేశారు. పురుషోత్తమ రెడ్డిని సీఈవోగా నియమించారు. తొలిసారి ప్రకటించిన వంద కోట్లలో కూడా కొంత మాత్రమే ఇచ్చారు. కొంత దేవాలయ స్ధలాన్ని చదను చేసి వదిలేశారు. ఆ తర్వాత నిధులు మంజూరు మర్చిపోయారు. తెలంగాణ వచ్చిన తర్వాత కనీసం కొత్త క్యూలైన్‌ కూడా ఏర్పాటు చేయలేదు. నిర్వహణ లోపం గతం కన్నా అద్వాహ్నం చేశారు. సానిటేషన్‌ గురించి పట్టించుకునే నాధుడు లేడు.
ఇక ఉద్యోగుల అవినీతికి లెక్కే లేదు.
అంత పెద్ద గుడికి పూర్తి స్ధాయి ఈవో ఎప్పుడూ వుండడు. ఎప్పుడూ ఇన్‌చార్జి ఈవోలే దిక్కవుతారు. ఏటా కనీసం వంద కోట్ల ఆదాయం వేముల వాడ నుంచి ప్రభుత్వానికి వెళ్తుంది. ఈ ఆలయంలో ఓ పదమూడు మంది ఉద్యోగులు దశాబ్ద కాలానికి పైగా తిష్టవేశారు. వారు చేసే అవినీతి అంతా ఇంతా కాదు. వీరి అవినీతి మీద విజిలెన్స్‌ ఎంక్వైరీ కూడా జరిగింది. సుమారు31 పేజీల నివేదిక తయారు చేశారు. విజిలెన్స్‌ అధికారులు ఒక్క రోజే రెండు లక్షల లడ్డూల రికవరీ చేసినట్లు రాశారు. రాజన్న భక్తుల కోసం కొనుగోలు చేసిన వస్తువులలో 25రూపాయలకు పైగా సరుకులు మాయమైనట్లు నిర్ధారణ చేశారు. ఇక కాళ్యాణ కట్టలో జరిగే అవినీతి, ధర్మశాల కిరాయిలలో చేతి వాటాలలకు లెక్కేలేదు. రీజినల్‌ జాయింట్‌ కమీషనర్‌ రామకృష్ణ మొత్తం ఎంక్వైరీ చేసి నివేదిక ఉన్నతాధికారులకు ఇచ్చారు. కాని అది బుట్ట దాఖలైంది. ఎలా పైనుంచి కింది దాకా రాజన్న సొమ్మును తింటున్నారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. భక్తులకు అసౌకర్యాలు సృష్టిస్తున్నారు.
ఎముడాల రాజన్న.. మా పార్టీ అధికారంలోకి రావాలని, నాయకులు ఎన్నికల్లో గెలవాలని మొక్కులు మొక్కుతారు. కోడెలు కట్టేస్తారు.
పదవుల కోసం పాహిమాం..పాహిమాం అంటారు. రాజకీయాలతో రాజ్యమేలాలని రాజన్నా, రాజన్నా అని కొలుస్తారు. తీరా కోర్కెలు తీరగానే, పదవులు రాగానే రాజన్నను మర్చిపోతారు. ఇది ఇప్పటి తరం నాయకులు పరిస్ధితి. అయినా రాజన్న అందర్నీ చల్లగానే చూస్తాడు. తప్పులు చేసిన వారిని కూడా క్షమిస్తాడు. దీవెనార్తులు ఇస్తూనే వుంటాడు. అందుకే పాలకులు తప్పు చేసినా, ఉద్యోగులు ఆలయాన్ని ఊడ్చుకుతింటున్నా ఊరుకుంటున్నాడు. ఉన్నది మేస్తున్నా కనికరిస్తున్నాడు. అవును…నిజమే..లేకుంటే దశాబ్ధాల తరబడి పూచిక పుల్ల కూడా వదిలిపెట్టకుండా దోచుకుతింటూ, దేవుని సొమ్మునే కైంకర్యంచేస్తూ, గుడికి చెందాల్సిన సొమ్మును దోచేస్తుంటే కూడా ఎవరూ ఏం చేయలేకపోతున్నారు. ఎంత మంది భక్తులు పిర్యాధులు చేసినా పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? అన్నట్లు ఎక్కడిక్కడ ఎవరికి అందినంత వారు దోచేస్తున్నారు. ఆలయానికి వచ్చిన ఆదాయానికి కన్నం పెడుతున్నారు. రాజన్న భక్తులకు చుక్కలు చూపిస్తున్నారు. దేవుని సొమ్ము స్వాహా చేస్తున్నారు. దక్షిణాదిలో వైష్ణవాలయాలు వెలిగిపోతుంటే, శివాలయాలు దీపానికి కూడా నోచుకోవడం లేదని కొత్త బాష్యాలు చెప్పిన గత ముఖ్యమంత్రి కేసిఆర్‌ వేముల వాడను అభివృద్ధి చేస్తానని మాటలు చెప్పాడు. రాజన్నను కూడా మాయ చేశాడు.
కొత్త ప్రభుత్వం వచ్చింది. తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది.
ఉమ్మడి కరీంనగర్‌ నుంచి ఇద్దరు మంత్రులున్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర సయమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజన్నను దర్శించుకున్నారు. ఆశీర్వాదం తీసుకున్నారు. దేవాదాయ, ధర్మాధాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ వున్నారు. త్వరలో సమ్మక్క`సారక్క జాతర పెద్దఎత్తున తెలంగానలో జరగనున్నది. తెలంగాణ నలు మూలలనుంచి సమ్మక్క జాతరకు వెళ్లే భక్తులు చాల వరకు ముందు వేముల వాడ రాజన్నను దర్శనం చేసుకున్న తర్వాతే సమ్మక్కతీర్ధం వెళ్తారు. అందువల్ల ఈ సమయంలో వేములవాడ అభివృద్దికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని భక్తులు ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా గత పదేళ్లకాలంలో వేములవాడలో జరిగిన అవినీతిపై కూడా మంత్రి కొండా సురేఖ దృష్టిసారించాలని కోరుతున్నారు. దశాబ్ధానికి పైగా పాతుకుపోయిన ఉద్యోగులు, ఈవోతో సహా అనేక అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్‌ ఎంకైరీలో తేలింది. రిపోర్టు కూడా సంబంధిత శాఖ వద్ద కూడా వుంది. వెంటనే ఎంతో పవిత్రమైన రాజన్న ఆలయంలో తప్పు చేసిన వారికి శిక్షలు పడాల్సిందే. దేవుని సొమ్మును దోచుకున్నవారి భరతం పట్టాల్సిందే. లేకుంటే కొత్త ప్రభుత్వం మీద కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పాలకులు మారినా రాజన్న ఆలయంలో తిష్ట వేసుకొని కూర్చున్న అవినీతి పరులను కదల్చడం ఎవరి తరం కాదన్న అహం వారిలో మరింత పెరుగుతుంది. భక్తులకు సౌకర్యాల కల్పనలో మరింత నిర్లక్ష్యం కనిపిస్తుంది. కొత్త ప్రభుత్వం వెంటనే స్పందించి, రాజన్న ఆలయానికి మంచి రోజులు, భక్తులు మెరుగైన సౌకర్యాలు, సేవలు కల్పించాలని కోరుతున్నారు.

పేదలకు విదేశీ విద్య వెలగపండే..నా?

https://epaper.netidhatri.com/

`5 లక్షలిస్తేనే సంతకం పడేనా?

`మంత్రి పొన్నం దీనిపై దృష్టి పెడతారా?

`తన టేబుల్‌ మీద వున్న ఫైలుపై సంతకం చేస్తారా?

`మంత్రికి తెలిసి జరుగుతోందా!

`తెలియకుండానే ఫైల్‌ రెడీ అయ్యిందా?

`బిసి.వెల్ఫేర్‌ డిపార్ట్మెంట్‌, ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ సెక్షన్‌ బాగోతం!

`గతంలో 2 లక్షలకు నడిచిన వ్యవహరం.

`ప్రభుత్వం మారడంతో 5 ఐదులక్షలకు పెంచిన బేరం.

హైదరబాద్‌,నేటిధాత్రి:

పేదల సంక్షేమ కోసం ప్రభుత్వాలు కేటాయించే కొన్ని నిధులు దుర్వినియోగం కావడం చూస్తూనే వుంటాం. పేదల కోసం కేటాయించిన నిధులు కొన్ని సార్లు గద్దల పాలు కావడం కూడా వింటూనే వుంటాం..ఇక్కడా అదే జరుగుతోందని సమాచారం. అది బిసి. వెల్ఫేర్‌ డిపార్టుమెంటు ఓవర్సీస్‌ సెక్షన్‌లో( మహాత్మ జ్యోతిరావ్‌ పూలే విదేశీ విద్యా నిధి) పనిచేసే ఓ ముగ్గురు ఉద్యోగుల చేతి వాటం మూలంగా నిధులు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరికీ కూడా విషయాలు తెలియకుండా అత్యంత గోప్యంగా ఈ తంతు జరుగుతున్నట్లు సమాచారం. ఆ సెక్షన్‌లో డిడిగా ఉదయ్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ నికేష్‌, పిఏ. ఔట్‌సోర్సింగ్‌ వెంకటేష్‌లు ముగ్గురు కలిసి ఈ వ్యవహారం నడుపుతున్నారని తెలిసింది. గత కొన్నేళ్లుగా వీరు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని పెద్దఎత్తున విమర్శలున్నాయి. ఇటీవల కొత్త ప్రభుత్వం రావడంతో గతంలో వసూలు చేసేదానికన్నా, ఎక్కువ మొత్తంలో విద్యార్ధుల తల్లిదండ్రులనుంచి తీసుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం.
ఇంతకీ ఏం జరుగుతోంది: మహాత్మా జ్యోతిరావు పూలే విదేశీ విద్యా నిధి అనే రాష్ట్ర ప్రభుత్వం ఏటా కొన్ని నిధులు కేటాయిస్తూ వుంటుంది. ప్రతి ఏడు తెలంగాణ నుంచి కనీసం 300 మందికి తక్కువ కాకుండా విదేశీ చదువు కోసం వెళ్లే విద్యార్ధులకు ఆర్దిక సాయం అందిస్తుంది. ఇదే కొందరు అక్రమార్కులకు ఆదాయ మార్గంగా మారింది. విద్యార్ధి దశలో ఎంతో కష్టపడి చదువుకునే పేద విద్యార్ధులకు ఆర్ధిక సమస్యలు ప్రధాన అడ్డంకిగా మారి వారి ఉన్నత చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. అలా గొప్ప స్ధాయిలో వుండాల్సిన ఎంతో మంది భవిష్యత్తు ఎక్కడో ఒక దగ్గర ముందుకు సాగకుండా ఆగిపోతోంది. వారి విజ్ఞానం సమాధి చేయబడుతోంది. సమాజానికి వారి మేధస్సు దూరమౌతోంది. నెరవేరని కలగా వారి జీవితాలు మిగిలిపోతున్నాయి. కుటుంబాల ఆర్ధిక పరిస్ధితి అంతంత మాత్రంగా వుండడం ఒక్కటే శాపమౌతుంది. కాని ఆ విద్యార్ధుల్లో ఎంతో ప్రతిభ దాగివుంటుంది. తమకు కొంత డబ్బు వుంటే అందరిలాగా విదేశీ విద్య అందేదన్న బాధ మనసును తొలుస్తూ వుంటుంది. ఇంతే మన ఖర్మ అని ఎక్కడో అక్కడ చదువు ఆపేసుకోవాల్సివస్తుంది. అలాంటి విద్యార్ధుల చదువు మధ్యలోనే ఆగిపోవద్దని వారి విజ్ఞానం వృధా కావొద్దని వారి, ఆశలు ఆడియాసలు కావొద్దని గతంలో ప్రభుత్వాలు మంచి నిర్ణయం తీసుకున్నాయి. పేదలకు కూడా పూర్తిగా ఉన్నత విద్యను ఉచితంగా అందుబాటులో వుంది. రాష్ట్రం వరకు ఎంత చదువుకున్నా అంత మేర ఉచితంగా విద్యను ఫీజు రీఎంబర్స్‌ మెంటు పేరుతో ప్రభుత్వం అందిస్తోంది. అయితే కొందరు ఎంతో చురుకైన విద్యార్థులు మరింత ఉన్నతమైన జీవితం కోసం కలలు కంటుంటారు. రాత్రింబవళ్లు శ్రమిస్తుంటారు. విజయాలు సాదిస్తుంటారు. అయినా విదేశీ విద్య అనగానే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అది ధనవంతులకు పెద్ద ఇబ్బంది కాదు. కాని పేదలకు అదే పెద్ద కష్టం. దాంతో ఆశలు చంపుకునేవారు ఎంతో మంది వున్నారు. మన జీవితాలు ఇంతేలే అని అడ్జస్ట్‌ అయ్యే వాళ్లున్నారు. కొంత మంది కుంగిపోయేవాళ్లుంటారు. అలా ఎంతో ప్రతిభ వున్నవారి చదువు ఎక్కడా ఆగిపోకుండా ఈ విద్యా నిధి దోహదపడుతుంది. పేదలలో ఎంతో మంది విజ్ఞాన వంతులున్నారు. ఎంతో మేదాశక్తి వున్నవారున్నారు. వారికి కొద్దిగా ఆర్ధిక తోడ్పాటునందిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. అధ్భుతమైన విజయాలు సాధిస్తారు. అలాంటి వారి జీవితాశయాలు మొగ్గదశలోనే వాడిపోకూడదు. స్వార్ధ పరుల మూలంగా వారి భవిష్యత్తు నాశనం కావొద్దు. అయితే తెలంగాణలో ఏటా కొన్ని వేల మంది వెళ్లాలనుకుంటారు. కాని ప్రభుత్వం అంత మందిని ప్రోత్సహించలేదు. కేవలం ఏటా 300 మందిని మాత్రమే పంపేందుకు అవకాశం కల్పించింది. ఇదే అక్రమార్కులకు రాచమార్గమైంది.
ఎవరు అర్హులు: ఈ విద్యానిధిపై ఇంకా చాలా మందిలో అవగాహన లేదు. ఈ సదుపాయం అందాలంటే విద్యార్ధులు 35 ఏళ్ల వయసు మించకూడదు. ఇంజనీరింగ్‌, అగ్రికర్చర్‌ సైన్స్‌, మెడిసిన్‌, ఇలా కొన్ని ప్రత్యేక విభాగాలైన విద్యను విదేశాలలో చదువుకునేందుకు ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుంది. ఉన్నత విద్యలో 60శాతానికి పైగా మెరిట్‌ వున్నవారికి ఈ సదుపాయం కల్పించబడుతుంది. అయితే ఆ విద్యకు సంబందించిన కొన్ని పరీక్షలు కూడా వారు ఉత్తీర్ణత సాధించాల్సి వుంటుంది. జీఆర్‌ఈ, జీమ్యాట్‌ సాధించాలి. ఐ 20 ఆహ్వానాలు వుండాలి. అందుకు వీసాలు వచ్చిన వారిని ఈ నిధి అర్హులుగా ప్రభుత్వం గుర్తిస్తుంది. అయితే ఇది అన్ని దేశాలలో ఉన్నత విద్యకోసం కాదు. కేవలం కొన్ని దేశాలకే పరిమితం. అందులో అమెరికా, ఆస్ట్రేలియా, సౌత్‌ కొరియా, జపాన్‌, రష్యా, కెనడా, జర్మనీ, యూకే. సింగపూర్‌, న్యూజిలాండ్‌ వంటి దేశాలకు మాత్రమే వర్తింపజేస్తారు. గతంలో ప్రతిభావంతులైన విద్యార్ధులను ప్రోత్సహించేందుకు రూ.10 లక్షలు ఇచ్చేవారు. కాని తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వం రూ.20 లక్షలు అందజేస్తూ వస్తోంది. ఈ అవకాశాన్ని పేద విద్యార్దులు ఉపయోగించుకోవాలి.
అవినీతి జలగలు: ఇలా బిసి విద్యార్థులకు వరమైన ఈ నిధినుంచి స్కాలర్‌షిప్‌ పొందేందుకు అర్హత సాధించాలంటే ప్రతిభ ఒక్కటే వుంటే సరిపోదన్నట్లు, ఆ నిధులు ఇవ్వాలంటే రెండు లక్షలు లంచం ఇస్తే తప్ప రూ.20 లక్షలు ఇవ్వడం లేదు. ఇలా విద్యార్ధుల ఉజ్వలమైన భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ వస్తున్నారు. ఈ మాత్రం ఇచ్చుకోలేక ఎంతో మంది అర్హులైన విద్యార్ధులు చదువులను వదిలేసుకున్నవారు వున్నారు. కొంత మంది ధనవంతులు కూడా ఇలాంటి స్కీమ్‌లను వినియోగించుకునేందుకు సెక్షన్‌లోని ఉద్యోగులు అడిగినంత ఇచ్చి, రూ.20 లక్షలు తీసుకున్నవారు కూడా వున్నారు. అసలు అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌కు తెలియకుండానే ఉదయ్‌, నికేష్‌, వెంకటేష్‌ అనే ఉద్యోగులు పైల్‌ తయారు చేస్తుంటారన్న విషయం బైటకు వచ్చింది.
తాజాగా 5లక్షలు: గతంలో రెండు లక్షలు వసూలు చేసే ఈ ఉద్యోగులు కొత్త ప్రభుత్వం వచ్చిందని, పై వారికి ముట్టజెప్పాలని చెప్పి రూ.5 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. అలా తీసుకున్న సొమ్ముతో తయారుచేసిన ఫైలు బిసి సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ టేబుల్‌ మీదకు పంపించారని తెలుస్తోంది. కొత్తగా వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ కు ఈ విషయం వెళ్లిందా? ఒక్కొక్కరి దగ్గర అంతంత వసూలు చేసి, కొత్త ప్రభుత్వాన్ని, మంత్రిని అబాసు పాలు చేసే అవకాశం వున్నాయి. అధికారులు తప్పు చేసినా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది. గత ప్రభుత్వంలో రెండు లక్షలు వసూలు చేశారన్న అపవాదు వుంది. అందుకే అధికారం కోల్పోయారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం అవినీతి అధికారుల కొమ్ముకాస్తుందన్న అపవాదు ఎదుర్కొవాల్సివస్తుంది. అందువల్ల అసలు అడ్మినిస్ట్రేవివ్‌ ఆఫీసర్‌ సంతకం లేకుండానే ఫైలు ఎలా మంత్రి వద్దకు చేరిందో తెలియాల్సిన అవసరం వుంది. ఇంత కాలం పేదల సొమ్ము అప్పనంగా తిన్న ఈ ముగ్గురు ఉద్యోగులను విధులనుంచి తొలగించి వారు తిన్నది కక్కించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

గుట్ట లోగుట్టు తేల్చుతారా?

https://epaper.netidhatri.com/

భక్తిరంజిత గుట్టనే మింగిరే!

`రేవంత్‌ రెడ్డి ఆనాడు అక్రమమనెనే!

`దాసోజు కూడా బాగానే కొట్లాడెనే?

`విజయారెడ్డి కేసు నమోదు చెసెనే!

`అయినా కోవెల కూలెనే!

`దేవుడు కొండ దిగెనే?

`అనాధగా ఓ మూలన నిలబడెనే!

`దేవుని గుడి చెదిరే..భవంతులు వెలసెనే!

`స్థలం స్వాధీనం చేసుకుంటారా?

`గుట్ట మింగిన ఘనులకు వదిలేస్తారా?

`బాధ్యులైన అధికారులను సస్పెండ్‌ చేస్తారా?

`ప్రభుత్వ భూమిని అప్పనంగా దోచిపెట్టిన వారిని జైలుకు పంపుతారా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అది ప్రకృతి రమణీయతకు ప్రతిరూపమైన పచ్చని వెండికొండలాంటి ప్రదేశం. సమాచారం మేరకు సుమారు పద్నాలుగు ఎకరాల నిర్మానుష్యమైన, అరుదైన ఆయుర్వేద మూలికలు కలిగివున్న ప్రాంతం. అభయాంజనేయ స్వామి కొలువైన వున్న స్ధలం. జాతీయ పక్షి నెమళ్లు నడయాడుతూ, నాట్యమాడే ఆహ్లాదరకమైన వాతావరణం. జీవ వైవిద్యానికి నిదర్శనం. ఏటా వేలాదిమంది హనుమాన్‌ భుక్తులు మాల ధారణతో ఆ కోవెలను నమ్ముకొని అంజన్నను కొలిచే ధ్యాన లోకం. అయితేనేం గత ప్రభుత్వం కొందరు వ్యక్తులకు అప్పనంగా కట్టుబెట్టింది. ముందూ వెనుక ఆలోచించకుండా అధికారులు చెప్పిన దానికి తలూపింది. మన మనిషే కదా? అని అంతా దోచిపెట్టింది. ఇవ్వాల్సిన దానికి లెక్కలేదు. ఇచ్చిన దానికి తెక్కలేదు. ఆక్రమించుకున్నదానికి లెక్కే లేదన్నట్లు కొండను అప్పనంగా కట్టబెట్టారు. ఆ వెంటనే వాళ్లు ఆ కొండను పిండి చేశారు. అక్కడ గుట్ట ఆనావాలు లేకుండా చేశారు. అసలు ఇచ్చిన భూమి ఎంత అంటే అధికారులు చెప్పరు? తీసుకున్నదెంత అని చెప్పడానికి ఎవరూ అందుబాటులో వుండరు. కాని అధికారులు దగ్గరుండి అందించింది కొండంత. ఇదే సందన్నట్లు ఇసంత రమ్మంటే ఇళ్లంతా నాదే అనుకున్నాడు. గుట్టే కాదు, ఆ గుట్టముందూ, వెనకవున్న భూమిని కూడా స్వాహా చేశారు. గుట్టమీద కొలువై వున్న అంజన్నను కూడా పక్కకు పొమ్మన్నారు. పాపం దేవుడు తన గోడు ఎవరికీ చెప్పుకోలేక అప్పటి నుంచి మౌన వ్రతం చేస్తున్నాడు.
కొండలెక్కినా దేవుడా ..ఆ బండలలో ఏముంది?
నువు చేసిన లోకం చూడు…అని భక్తులు పాటలు పడుతుంటే, దేవుడు ఆ పాటలు వింటుంటే, ఆ ఏమరపాటులో కొండలు కొట్టేస్తున్న ఘనులున్నారు. కొండలు, గుట్టులు మింగేస్తున్నారు. దేవున్ని నిజంగానే కొండ దించేస్తున్నారు. దేవుడికి ఆ కాస్త చోటు కూడా లేకుండా చేస్తున్నారు. ఆస్ధులు, అంతస్ధులు కావాలి దేవుడా వరాలియ్యవా? అని మొక్కుల మీద మొక్కులు మొక్కాలి. తదాస్తు అనగానే దేవుడు కొలువై వున్న కొండలనే దోచేయాలి. దేవుడా అని వేడుకున్న నోటితోనే అడ్డుగా వున్న కోవెల కూల్చేయమనాలి. వ్యాపారం చేయాలి. కొండలు తవ్వి అంతస్ధులు నిర్మించాలి. ఆ దేవుణ్ణి అనాదను చేయాలి. లోకాన్ని కాపాడే దేవుడికే శఠగోపం పెట్టాలి. పైకి బొట్టు, బోనం, భక్తి ముసుగు చూపించాలి. కాలం కలిసి రాగానే దేవుణ్ణి కూడా దూరంగా తరిమేయాలి. ఇదంతా ఎక్కడ జరిగిందనుకుంటున్నారా? హైదరాబాద్‌లోనే… జూబ్లీహిల్స్‌లోనే…
సరిగ్గా రెండేళ్లుగా నేటిధాత్రి దినపత్రిక గుట్ట`గుడి అంటూ నెత్తి, నోరు కొట్టుకొని ఎంత మొత్తుకున్నా, గుట్టను ఎవరూ కాపాడలేదు.
గుడిని మింగేకుండా అడ్డుకోలేదు. ఈ సంగతి ఆనాటి పాలకులకు తెలుసు. ఆనాటి ప్రతిపక్షనేత, నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా తెలుసు. గుట్టను కూల్చితే ఊరుకోం..ప్రభుత్వ స్ధలం దారాధత్తంచేస్తే సహించమని చెప్పిన రేవంత్‌రెడ్డి నాడు ఎంతో కంఠశోషతో చెప్పారు. నేడు అధికారంలోకి వచ్చారు. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెట్టిన వైనంపై లోతైన తవ్వకాలు జరగాలి. ఆనాడు ప్రభుత్వం గుట్టను కూల్చిన వ్యక్తులకు కట్టబెట్టింది ఎంత? అధికారులు దోచిపెట్టింది ఎంత? అసలు అక్కడున్న ప్రభుత్వ స్ధలమెంత? ఇప్పుడు ఆ స్ధల యజమానులుగా చెప్పుకుంటున్నవారు అక్రమంగా ఆక్రమించింది ఎంత? అందులో ముడుపులు ముట్టిందెంత? పుచ్చుకున్నదెంత? వాళ్లెంతమంది అన్నది కూడా తేలాలి.
అది జూబ్లీహిల్స్‌ ప్రాంతం. అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం.
కొందరి కన్ను పడిరది. ప్రభుత్వం వారికి రుణ పడి వుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏదో జరిగింది. అది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వరమైంది. అందులోనూ గత ప్రభుత్వంలో కీలకమైన నేతగా వున్న వ్యక్తికి అప్పనంగా గుట్టను కట్టబెట్టింది. అసలు ఈ విషయం తెలిసిన నేటి ధాత్రి మొదటి రోజు నుంచి జరుగుతున్న మోసాన్ని వివరిస్తూనే వున్నది. విన్నవారంతా ఆ వ్యక్తికి రాత్రికి రాత్రి చీకటి బంధవులౌయ్యారు. గుట్టను కాపాడుతామన్నవారు, మరునాడు మాయమౌతున్నారు. మేమున్నామంటూ వచ్చి చెప్పిన పెద్ద పెద్ద నాయకులు ఆ తర్వాత మౌనం పాటించారు. అంతే కాదు గుట్ట..గుడిని కాపాడేది మేమే అంటూ కొంత మంది స్వాములు కూడా ఆ సమయంలో బయలు దేరారు. యాగాలు, యజ్ఞాలు చేశారు. టెంట్లు వేసుకొని దీక్షలు చేపట్టారు. లోగుట్టు పెరుమాళు కెరుక అన్నట్లు స్వాములు కూడా సైలెంటుగా పక్కకు వెళ్లిపోయారు. అక్కడ బహుళ అంతస్ధులు సముదాయాలు నిర్మాణం చేస్తున్నవారికి సరెండరైపోయారు. ఈ విషయంపై వరుస కధనాలు రాసిన నేటిధాత్రి వార్తలను చూసిన స్వాములే బెదించే ప్రయత్నం చేశారు. తెలంగాణకు ఏ మాత్రం సంబంధం లేని గుంటూరు స్వాములెందుకొచ్చారు? గుట్ట కాపాడే ముసుగెందుకేసుకున్నారు? నేటిధాత్రిని ఎందుకు బెదిరించారు? ఇప్పటీ అర్ధం కాని శేష ప్రశ్నలివి. ఇలా ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా నేటిధాత్రి కధనాలను ఆపలేదు. గుట్ట, గుడి కథ రాష్ట్రంలో పెద్ద వార్త దావానలంగా మారింది. ఆరెస్సెస్‌ రంగలోకి దిగింది. భజరంగ్‌ ధళ్‌ ధర్నా చేసింది. బిజేపి మేమున్నామని అన్నది. స్ధానిక ఎమ్మెల్యే స్పందించాడు. స్వాహా పర్వమంతా బిఆర్‌ఎస్‌నేతదే అని తెలిసి తనకు అందాల్సింది తీసుకొని వెళ్లిపోయాడు? నగర బిజేపి ఏకైక ఎమ్మెల్యే నేనున్నాడన్నాడు. నాటి పిపిసి. అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అనేక సార్లు మీడియా ముందు ప్రస్తావించారు. ప్రభుత్వం ఆ స్ధలం తిరిగి తీసుకునేదాకా వదిలిపెట్టమని ఆనాడు రేవంత్‌ రెడ్డి అప్పటి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఆ గుట్టను స్వాహా చేయడాన్ని అడ్డుకుంటామన్నాడు. ఆ సమయంలో కాంగ్రెస్‌లో వున్న నేటి బిఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ అనేక సార్లు గుట్ట గుడి వివాదంలో వేలు పెట్టాడు. ఆనాటి ప్రభుత్వాన్ని తూర్పార పట్టాడు. అన్యాయమని మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి, నిజా నిజాలు వెల్లడిరచారు. ఈ విషయంలోనే దాసోజు కాంగ్రెస్‌నుంచి బైటకు వెళ్లాడన్న వార్తలు కూడా ఆనాడు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు అదే దాసోజు బిఆర్‌ఎస్‌లో చేరాడు. సైలెంటు అయ్యాడు. గుట్ట వ్యవహారం మర్చిపోయాడు.
అసలు అక్కడ గుడే లేదని కూడా సదరు నాయకుడి వ్యాపార భాగాస్వాములు రివర్స్‌ గేమ్‌ మొదలుపెట్టారు.
దాన్ని నేటిధాత్రి పూర్తి స్ధాయి ఆధారాలు ప్రచురించింది. జూబ్లిహిల్స్‌ కార్పోరేటర్‌ విజయారెడ్డి కూడా సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన విషయం కూడా వెలుగులోకి నేటిధాత్రి తెచ్చింది. ఈ గుట్టమీద కన్ను పడిన సదరు వ్యాపారులే గతంలో ఓసారి గుడిని కూల్చే ప్రయత్నం చేశారు అన్న ఆరోపణలు కూడా వున్నాయి. ఏకంగా అంజన్న విగ్రహాన్ని కూడా ద్వంసం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎంతో మంది హిందుత్వ వాదులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సంగతి విజయారెడ్డి దృష్టికి రావడంతో అంజన్న విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆమె పిర్యాదు చేశారు. అయితే దేవాదాయ శాఖ అప్పటికీ స్ధలాన్ని స్వాధీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఎందుకంటే గుడి కూల్చిన తర్వాత నేటిధాత్రి దేవాదాయ శాఖను కూడా ప్రశ్నించడం జరిగింది. దేవాదాయశాఖ అధికారులను కూడా కమ్మేసినట్టు సమాచారం. అప్పటి ప్రభుత్వ పెద్దలు, ఉన్నత స్ధాయి అదికారులు, రెవిన్యూ యంత్రాంగం భరితెగించి, అప్పటి బడా నాయకుడికి సహకరించారు. ప్రజలు ఎంత మొత్తుకున్నా గుట్టను తిరిగి ఫ్రభుత్వం స్వాధీనం చేయలేదు. దేవాదాయా శాఖకు అప్పగించలేదు. విచిత్రమేమిటంటే అదే జూబ్లీహిల్స్‌లో ప్రైవేటు స్ధలాన్ని కొంత మంది సినీ గద్దలకు పెట్టి, అక్కడ గుడి కట్టేందుకు సహకరించి మరింత స్ధలం ఇచ్చారు. ఆ పక్కనే గుడి వున్న గుట్టను ఓ బిఆర్‌ఎస్‌ నాయకుడికి కట్టబెట్టి, గుట్టనే లేకుండా చేశారు. గుడిని మాయం చేశారు. అభయాంజనేయ స్వామికే శఠగోపం పెట్టారు..ఇదండీ సంగతి…మరి ప్రభుత్వం మేలుకుంటుందా? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందిస్తారా? లేక మాదాకా సమాచారం లేదని చేతులు దులుపుకుంటారో చూడాలి…ఎందుకంటే గుట్ట గుడి సంగతులు రాస్తే రామాయణమంతా వున్నాయి?

కాంగ్రెస్‌ హమీలు..అరుంధతి నక్షత్రమే!

https://epaper.netidhatri.com/

నెల రోజుల కాంగ్రెస్‌ పాలనపై ‘‘మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు’’ నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న ఆసక్తికరమైన అంశాలు ఆయన మాటల్లోనే..

`పథకాలు మంగళం సమర్పయామి అనుకోవడమే!

`పట్టపగలు ప్రజలకు చుక్కలు చూపించడమే.

`మమ.. అనుకొని చేతులు దులుపుకోవడమే!

`కూర్చునేది లేదు…కుదురుకుంటున్నట్లు లేదు!

`సీటు కాపాడుకోవడం కోసం కూడా సమయం సరిపోయేట్టు లేదు.

`రెండు లక్షలు అప్పు చేసుకోమన్నారు…రాగానే మాఫీ మర్చిపోయారు.

`రైతుభరోసా ఎక్కడుందో ఎవరూ చెప్పలేరు.

`ఇప్పటికే నిరుద్యోగ భృతికి మంగళం పాడారు.

`అసెంబ్లీ సాక్షిగా ఇస్తామని ఎక్కడా చెప్పలేదని తేల్చేశారు.

`మహిళలకు అన్ని బస్సు సర్వీసులు ఫ్రీ అన్నారు…పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌కు పరిమితం చేశారు.

`హైదరాబాద్‌, డిల్లీ యాత్రలకే పుణ్య కాలం పోతోంది.

`చీమ చిటుక్కుమన్నా డిల్లీకే వెళ్లాలి.

`అడుగుముందుకేయాలన్నా అధిష్టానాన్ని అడగాలి.

`సంక్షేమం గాలికి…కాంగ్రెస్‌ నేతల పరుగులు డిల్లీకి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

గాలి వానకు గొడుకు పడితే ప్రయోజనం వుంటుందా? ముళ్లకంచెను నీటిలో నాటితే నాటుకుంటుందా? కాంగ్రెస్‌ పరిస్ధితి కూడా అంతే… కాంగ్రెస్‌ను నమ్ముకున్న తెలంగాణ అరవైఏళ్లు గోసపడిపంది. అందుకే తెలంగాణ కోసం కేసిఆర్‌ కొట్లాడిరది. తెలంగాణ తెచ్చింది. తెచ్చిన తెలంగాణలో వెలుగులు నింపింది. కొన్ని సార్లు ప్రజలు కూడా మాయలో పడిపోయే అవకాశం వుంటుంది. అయితే అది తాత్కాలికమే. ఎల్లకాలం ప్రజలను ఎవరూ మోసం చేయలేదు. కాంగ్రెస్‌ చేసిన మోసం అధికారంలోకి వచ్చిన మరునాడే తేలిపోయింది. ఎన్నికల ముందు ఏం చెప్పారు? ప్రమాణ స్వీకారం రోజే ఆరు గ్యారెంటీల మీద సంతకాలన్నారు. తెలంగాణ ప్రజలు కొంత నమ్మారు. దాంతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. అయినా కాంగ్రెస్‌లో మార్పు రాలేదు. మారు కావాలని పదే పదే తెలంగాణ ప్రజలకు చెప్పి,నమ్మించిన కాంగ్రెస్‌ పార్టీ మారిందా? అంటే మారలేదు. గతం తాలూకు బాగోతాలు మర్చిపోలేదు. అందుకే తొలి రోజు నుంచే పాలన గాలికొదిలేశారు. రాజకీయం మాత్రమే చేస్తున్నారు. అసలు అధికారంలోకి వచ్చామన్న నమ్మకం వారికే లేదు. అందుకే సంక్షేమం గాలికి వదిలేశారు. రైతులకు ఇచ్చిన హమీలు మర్చిపోయారు. బిఆర్‌ఎస్‌ అధికారంలో వున్నప్పుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌ రైతాంగ సంక్షేమం, తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం పనిచేశారు. కాని కాంగ్రెస్‌ పార్టీ తన ప్రయోజనం తప్ప ప్రజా ప్రయోజనం అన్నది మర్చిపోయింది. బిఆర్‌ఎస్‌ అధికారంలో వున్న సమయంలో నీటి పారుదల ప్రాజెక్టు గేట్లు ఎత్తితే గంగమ్మ ఉరకలెత్తి, పరుగు పరుగున పొలాలకు చేరినట్లు, రైతు బంధు వేయగానే ట్రింగ్‌, ట్రింగ్‌ మంటూ రైతుల ఖాతాలలో పెట్టుబడి సాయం పడేది. మరి ఇప్పుడు ఎవరు ఏం చెబుతున్నారో అర్ధం కావడం లేదు. ముఖ్యమంత్రి రైతు భరోసా వేశామంటాడు. మరో మంత్రి రైతు భరోసా వస్తుందంటాడు..మరో మంత్రి వేస్తామంటాడు..ఇందులో ఎవరి మాటలు నిజమో వాళ్లుకే తెలియకుండా పోయింది. తెలంగాణ రైతులకు సంకటంగా మారింది. అంటున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో నెల రోజుల కాంగ్రెస్‌ పాలనపై పంచుకున్న ఆసక్తి కరమైన విషయాలు ఆయన మాటల్లోనే…
తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి, మాయ చేసి, పదే పదే అబద్దాలు వల్లెవేసి, చెప్పిందే చెప్పి, అధికారంలోకి వచ్చారు. వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రజలను మోసం చేస్తున్నారు.
వారి చేతగాని తనం కప్పిపుచ్చుకోవడానికి బిఆర్‌ఎస్‌మీద లేని పోని అవాస్తవాలు ప్రచారం చేసుకుంటూ నెల రోజులు గడిపేశారు. ఇక ఇంకా ఎలా కాలం గడపాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. బిఆర్‌ఎస్‌ పేరు చెప్పి మరింత కాలం పబ్బం గడుపుకోవాలని మాత్రమే చూస్తున్నారు. కాని ప్రజలకు మేలు చేసే అంశం మర్చిపోయారు. ఇచ్చిన హామీలు గాలికొదిలేశారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ ప్రజలు అవకాశమిచ్చారు. ఒక్క ఛాన్స్‌..ఒక్క ఛాన్స్‌ అంటూ గత ఏడాది కాలంగా ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వేడుకుంటూ వచ్చారు. అయినా ప్రజలు కనికరించేట్లు కనిపించలేదు. నిరుద్యోగ యువతను రెచ్చగొట్టారు. ఇలా అన్ని వర్గాల ప్రజలకు లేని పోని, అలవి కాని హామీలను గుప్పించారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలనే కాపీ కొట్టి, కొత్తగా చెప్పడం మొదలుపెట్టారు. ప్రజలను ఏదో విధంగా నమ్మించారు. అధికారంలోకి వచ్చి పట్టుమని పది రోజులు కాకముందే ప్రజా గ్రహానికి గురయ్యారు. గతంలో ఇలా పది రోజలకే ప్రజల నుంచి ఇంతటి వ్యతిరేక ఎదుర్కొన్న ప్రభుత్వం ఏదీ లేదు. ఎందుకంటే ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ చెప్పిన విధానానికి, అదికారంలోకి వచ్చి అనుసరిస్తున్న ఆచరణకు పొంతన లేదు. అందుకే ప్రజలకు కూడా పది రోజులకే కాంగ్రెస్‌ పాలన ఎలా వుంటుందో అర్ధమైంది. అప్పుడు ప్రజల తిరుగుబాటు మొదలైంది. కాంగ్రెస్‌ అంటేనే కరంటు కష్టాలు, ప్రజలకు నష్టాలు..రైతులకు ఆపసోపాలు..అన్ని వర్గాల ప్రజలను అయోమయానికి గురిచేయడమే… గతంలో చూసినవే… యాభై ఏళ్లు ప్రజలు అధికారమిచ్చినా ఎలాంటి సంక్షేమాలు అమలు చేయని, కాంగ్రెస్‌, ఒక్క ఛాన్స్‌ ఒక్క ఛాన్స్‌ అని వేడుకుంటున్నప్పుడే బిఆర్‌ఎస్‌ చెప్పింది. కాంగ్రెస్‌ మాటలు నయవంచనకు రూపాలని పేర్కొనడం జరిగింది. అయినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను కనికరించి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్‌ హామీలు అరుంధతీ నక్షత్రమే.. పట్టపగలు ప్రజలకు చుక్కలు చూపించడమే అని మరోసారి రుజువైంది. కాంగ్రెస్‌ పథకాలు మంగళం సమర్పయామీ! అన్నదే ఇక వినపడేది.. ముమ్మాటికీ నిజమయ్యేది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైంది.
ఇచ్చిన హామీలలో రెండిరటిని చూపించి మమ అనిపించడం తప్ప చేసేదేమీ లేదు.
సరిగ్గా పాలనపై దృష్టిపెట్టేది లేదు. పెట్టేంత సమయం కాంగ్రెస్‌ నాయకులకు లేదు. ఎంత సేపు కుర్చీ కాపాడుకోవడం కోసం ఆరాటం మాత్రమే వుంటుంది. ప్రజలకు మేలు చేసే ఆలోచనలు కూడా వచ్చేందుకు సమయం వుండదు. కుర్చీలో కూర్చునేందుకు ఎలాంటి రాజకీయాలుచేశారో..ఎలాంటి మభ్యపెట్టే మాటలు చెప్పారో…కుర్చీ కాపాడుకోవడానికి కూడా అవే మాటలు చెబుతారు. కుర్చీలను అంటిపెట్టుకొని వుంటారు. ప్రజలకోసం ఆలోచించే తీరిక చేసుకోరు. పట్టుమని నెల రోజుల కాకముందే లుకలుకలు. కుదురుకోకముందే కుర్చీలాటలు. వాటిని కాపాడుకునేందుకు ఎత్తుగడలు. అనునిత్యం కుర్చీలకు కాపలాలు ..ఇక ప్రజల బాగోగులు ఎలా చూస్తారు.. కుర్చీలాటతో నెంబర్ల లెక్కలు వేసుకుంటున్నారు. పరిపాలన చేస్తామని వేడుకుంటే, అవకాశమిస్తే కుర్చీల కోసం అప్పుడే అంతర్గత కుమ్ములాటలను చూపిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రజల మేలు ఏనాడు పట్టించుకోరు..గతం చెప్పిన సత్యమే ఇది…గతంలోకి తొంగిచూస్తే కనిపించే నిజాలివే…
అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు ఆశలు కల్పించారు.
ఇప్పుడు మీన మేషాలు లెక్కిస్తున్నారు. ఎన్నికల సమయంలోనే తాము నిజాయితీగా చెప్పిన మాటలన్నా, కాంగ్రెస్‌ పార్టీ చెప్పిన అబద్దాలు కొంత మేర నమ్మారు. దాంతో రుణమాఫీపై ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం రైతులను ఒక రకంగా కాంగ్రెస్‌ నాయకులు ప్రజలను రెచ్చగొట్టారు. వెళ్లి బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకొమ్మని చెప్పారు. అయితే రెండులక్షల రుణం ఎలా ఇస్తారన్న సోయి కూడా లేకుండా చెప్పిన కాంగ్రెస్‌ మాటలను రైతులు నమ్మడమే పాపమైంది. నమ్మితేనే కదా! మోసం చేసేది అన్నట్లు కాంగ్రెస్‌ నాయకులు చెప్పిన మాటనే పదే పదే చెప్పి గోబెల్స్‌ ప్రచారం చేశారు. జనాన్ని బురిడీ కొట్టించారు. రెండు లక్షల రుణమాపీ సాధ్యం కాదని కాంగ్రెస్‌ నాయకులకు కూడా తెలుసు. అధికారంలోకి రావాలంటే ఇలాంటి అబద్దాలు చెబితే తప్ప తెలంగాణ ప్రజలు నమ్మేలా లేరని చెప్పారు…అమలు చేస్తామని కాంగ్రెస్‌ చెప్పినన్నీ అలవి కాని హామీలే… చేతులెత్తేసేవే అని మేం మొదటి నుంచి హెచ్చరించినవే..అయినా జనం కాంగ్రెస్‌ను నమ్మారు. ఎలా చెప్పారంటే డిసెంబర్‌ 9 నాడే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పడంతో ప్రజలు కూడా నమ్మారు. అంతే తప్ప కాంగ్రెస్‌ను పూర్తిగా విశ్వసించలేదు. గత కాంగ్రెస్‌ చరిత్రలు ప్రజలకు బాగాతెలుసు. పల్లె ప్రజానికం కొంత అమయకులు. అందుకే వారిని సులభంగా మోసం చేయగలిగారు. అదే అర్భన్‌ ప్రజలు కాంగ్రెస్‌ను అసలే నమ్మలేదు. బిఆర్‌ఎస్‌ అభివృద్ధి నమూనాను చూశారు. పదేళ్ల క్రితం తెలంగాణకు, ఇప్పటి తెలంగాణకు ఎంత తేడా వుందన్నదానిని గుర్తించారు. ఈ అభివృద్దికి బ్రేక్‌ పడొద్దని విశ్వసించారు. బిఆర్‌ఎస్‌కు అర్భన్‌ ప్రాంతాలు మద్దతుగా నిలిచాయి. కొన్ని విషయాలు తాము కూడా ప్రచారం చేసుకోలేదు. 2019 తర్వాత సుమారు 7లక్షల రేషన్‌ కార్డులు ఇవ్వడం జరిగింది. కాని కాంగ్రెస్‌ పార్టీ రేషన్‌ కార్డులు ఇవ్వలేదని చేసిన ప్రచారం బలంగా ప్రజల్లోకి వెళ్లింది. నెల గడుస్తున్నా రైతు భరోసా ఎక్కడుందో ఎవరూ చెప్పడం లేదు. ఇప్పటికే నిరుద్యోగ భృతికి మంగళం పాడారు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదని తేల్చేశారు. ఎన్నికల ముందు అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారు. రెండిరటికి పరిమితం చేశారు. తొలి పధకంలోనే కోత కోశారు. హైదరాబాద్‌ నుంచి డిల్లీకి యాత్రలకే పుణ్యకాలం గడిచిపోతుంది. చీమ చిటుక్కుమన్నా డిల్లీకి వెళ్లాలి. అడుగు ముందుకేయాలన్నా అధిష్టానాన్ని అడగాలి. సంక్షేమంగాలికి..కాంగ్రెస్‌ నాయకుల పరుగులు డిల్లీకి..ఇంతే కాంగ్రెస్‌ పాలన..ఇంతకు మించి ఒక్క అడుగు కూడా వేయలేని అబద్దాల లాలన. తెలంగాణ ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు.

దిల్‌ రాజు మీద సీ(సిని)మాంధ్ర కుట్ర!

https://epaper.netidhatri.com/

`చిరంజీవి అనని దానిని అన్నట్లు ప్రచారం.

` చిరంజీవి మనసులో పెట్టుకొని వ్యాఖ్యలు చేసినట్లు కథనాలు.

`దిల్‌ రాజుకు దిల్‌ లేదంటూ గతంలోనూ కథనాలు.

`దిల్‌ రాజు మోనోపలి అంటూ ఓ వర్గం ఆరోపణలు.

`బిఆర్‌ఎస్‌ వున్నంత కాలం వాళ్లు సైలెన్స్‌!

`కాంగ్రెస్‌ రాగానే కొత్త పైత్యం షురూ!

సినిమా అంటేనే రంగుల ప్రపంచం. పైసలతో పరాచికం. పెట్టే పెట్టుబడి రాబడి రావొచ్చు. రాకపోవచ్చు. కాని తీసిన సినిమా చూసి మురిసిపోయేవారు వున్నారు. నిండా మునిగిపోయి అడ్రస్‌ లేకుండాపోయిన వారున్నారు. అయినా సినీ తరం ఎప్పుటికీ తరంతరం..నిరంతరమే అన్నట్లు సాగుతోంది. సినిమా ఆడితే ఎంతో వైభోగం..ఆడకపోతే నిర్మాత బతుకు ఆగం.. అలా నిండా మునిగినోళ్లే అనేకం. .అయితే ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కొమని పెద్దలు చెప్పినట్లే సినిమా నిర్మాణం ఒక జూదం…సినిమా తీసేవారి దృష్టిలో కళామ తల్లి సేవనం.. ఇతరలు దృష్టిలో వ్యాపారం.. నిజంగా చెప్పాలంటే ఒక వ్యసనం…అయినా దాన్ని ఫ్యాషన్‌ అనే అనుకుంటారు..ఎందుకంటే అక్కడ గెలిస్తే గొప్ప జీవితం మిగులుతుంది. కాకపోతే తమకు తెలిసిందిన సినిమా మాత్రమే చెబుతుంటారు. ఒక్కసారి సినిమాను నమ్ముకుంటే వారికి అదే ప్రపంచం. గెలిచేవారు కొందరే…ఓడిన వారే ఎంతోమంది అయినా అదే కలల ప్రపంచం. కాసుల ప్రపంచం..కళ్ల నిండా కన్నీళ్లు కనిపిస్తున్నా, కంటి ముందు కష్టాలు కనిపిస్తున్నా, దుఖాలు వెంటాడుతున్నా, దురదృష్టం పరుగెత్తిస్తున్నా వాటిని కూడ లేక్క చేయకుండా బతికే ఏకైక ఆశా జీవి.. సీనీ జీవి…నిర్మాత..! నటులౌదామని వచ్చి దర్శకులైనవారున్నారు. నిర్మాతలైనవారు వున్నారు. ఒకప్పుడు సినిమా అంటే కళామ తల్లి. ఇప్పుడు వ్యాపారం కల్పవల్లి. కాలం మారుతోంది. సినిమా రూపం మారుతోంది. పెద్ద తెరమీద నుంచి బుల్లి తెరదాకా నిన్నటిదాకా చూసిన సినిమా నేడు అరచేతిలోకి వచ్చేస్తోంది. అయినా దాని రాజసం దానిదే…సినిమా అంటే సినిమానే…అరచేతిలో పట్టుకొని బొమ్మచూసినా, తాడి చెట్టంత బొమ్మను తెరమీద చూసినా అదో గొప్ప అనుభూతి. అది సినిమాకే చెల్లింది. అలాంటి సినీవైభవ కార్మగారాన్ని నడుపుతున్న, ఒక రకంగా చెప్పాలంటే ఏలుతున్న తెలంగాణ తేజం దిల్‌ రాజు..నిజంగా దిల్‌ వున్న సినీ మొనగాడు. తెలంగాణలోనే సీనీ మకుటం లేని నిర్మాతలకు రారాజు…
నిజం చెప్పాలంటే తెలుగు సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలంటే తెలంగాణ సినిమా! సీమాంధ్ర సినిమా!! అని ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే తెలంగాణ సినిమాను ఇప్పటికీ చిన్న చూపు చూస్తున్న సీమాంధ్ర సినీ రంగానికి తెలంగాణలో చోటు లేకుండా పోవడమే మంచిది. ఇప్పటికీ ఎప్పటికీ తెలంగాణ సినిమా, సీమాంద్ర సినిమా వేరువేరే. ఈ రెండు కలిపినట్లు కలిపి, నటించి, తెలంగాణ సినిమాను కనుమరుగు చేసి, తెలంగాణ వారిని ఎదగకుండా చేసి, మొత్తం గుండు గుత్తగా గంప గుత్తను చేసుకొని ఇప్పటికీ రాజ్యమేలుతున్న వారంతా సీమాంధ్రకు చెందినవాళ్లే… అందుకే ఎలాగూ ఇంత దూరం వచ్చిన తెలుగుసినిమాను ఒక్క మాటలో చెప్పాలంటే దిల్‌ రాజుకు ముందు..దిల్‌రాజుకు తర్వాత అని తప్పక చెప్పాలి. సీమాంద్రకు చెందిన హీరోల విషయంలో, దర్శకుల విషయంలో, ఆఖరుకు నిర్మాతల విషయంలోనూ ఈ మాట పదే పదే చెప్పుకొని వాళ్లకు వాళ్లే గొప్పలకు పోతుంటారు. ఎందుకంటే తాను పాటలు రాస్తానంటూ తెలంగాణకు చెందిన జాతీయ అవార్డు పొందిన సినీ కవిని నువ్వా..పాటలా? అంటూ హేళన చేశారు. ఎగతాలి చేసిన వారున్నారు. అందుకే తెలుగు సినిమా మీద తెలంగాణ ముద్ర లేకుండా, రాకుండా చూసుకున్నారు. వందేమాతరం శ్రీనివాస్‌ లాంటి గొప్ప సంగీత దర్శకుడు కూడా తనది తెలంగాణ అని చెప్పుకోవడానికి భయపడిని సందర్భంలో బతికాని, ఇప్పుడు హాయిగా ఊరిపి పీల్చుకుంటూ, నేను తెలంగాణ, నాది తెలంగాణ అని చెప్పుకుంటున్నానని చెప్పాడంటే ఆ సీమాంధ్ర ఆదిపత్యం ఎలా వుండేదో అర్ధంచేసుకోవచ్చు. తెలంగాణకు ఉద్యమానికి ఊపిరిపోసి, తెలంగాణ ఉద్యమం ఉరకలెత్తించిన మిట్టపల్లి సురేందర్‌ కవి గాయకుడుని కూడా మోసం చేసిన చరిత్ర సీమాంధ్రులది. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా! రక్తబంధం విలువ నీకు తెలియదురా? అంటూ తెలంగాణ ఉద్యమంలో కన్నీటి వ్యధని, గర్భశోఖాలు మిగులుతుంటే ఆ పాట విని తెలంగాణ అంతా తల్లడిల్లింది. ఆ పాట వింటూ తెలంగాణ అంతా కన్నీటి పర్యంతమైంది. అలాంటి పాటలు రాసిన మిట్టపల్లి సురేందర్‌ లాంటి కవిని కబ్బోర్డులో దాచిన దుర్మార్గపు చరిత్ర సీమాంధ్రది. అలాంటి సీమాంద్ర పెత్తనం నుంచి తెలంగాణ సినిమాను కాపాడిన ఏకైక నిర్మాత దిల్‌ రాజు..తెలుగు సినిమా పేరు చెప్పి తెలంగాణ సినిమాను ఆగం చేసిన వారికే ఇప్పుడు దిల్‌ రాజు మాతో సినిమా తీస్తే చాలు అనుకుంటున్నారు.
పెద్ద పెద్ద నిర్మాతలుగా పేరున్నవారు. ఒకప్పుడు గొప్ప గొప్ప సినిమాలు తీసినట్లు చెప్పుకునేవారు, గిన్నిస్‌ రికార్డులు సొంత చేసుకున్నవారు కూడా సినిమా తీయాలంటే గజగజ వనికిపోతున్న సమయంలో తెలుగు సినిమాను నేను ఆదుకుంటాను..నేను నిలబెడతాను అని వచ్చిన ఏకైక సినీ తేజం..తెలుగు సినిమాకు వరం..దిల్‌ రాజు ప్రొడక్షన్‌. ఒక దశలో సినిమా అంటేనే ఆడమ దూరం నిర్మాతలు పరుగెత్తుతున్న తరుణంలో వరుసగా 9 హిట్లు ఇచ్చి, తెలుగు సినిమాకు ఊపిరిపోసి, తెలుగు సినిమా దమ్ము చూపిన ఏకైక నిర్మాత దిల్‌ రాజు. అయితే పైకి సంబురం వ్యక్తం చేస్తూ, ఎప్పుడు దిల్‌ రాజు పడిపోతాడో అప్పుడు నవ్వుకుందామని చూసిన వాళ్లు కూడ చాలా మంది వున్నారు. అయితే పడి లేవడం దిల్‌ రాజుకు కొత్త కాదు. పడి లేవడం తెలిసిన దిల్‌ రాజు ఒక్కసారి పడితే పదిసార్లు లేచేంత బలం కూడదీసుకొని ముందుకు విచ్చిన సందర్భాలు కూడా వున్నాయి. నవ్విన నాప చేను పండినట్లు, దిల్‌ రాజు ఎక్కడ దొరక్కపోతాడా? అని ఎదురు చూసిన వాళ్లకు కూడా కళ్లు బైర్లు కమ్మేంత వెలుగు చూసిన నిర్మాత దిల్‌ రాజు. దిల్‌ రాజు నిజంగా దిల్‌ వున్న రాజే కాదు..ఎంతో ధైర్యం వున్న రాజు కూడా. అందుకే బలగం తీశాడు.. ఎంతో బలమైన నమ్మకం నింపిన సంకల్పంతో తీశాడు. బలగం అనే సినిమా మొత్తంగా ధియేటర్‌లోనే ఆడితే ఆ రికార్డును ప్రపంచంలో ఎవరూ అందుకోనంత వుండేది. రికార్డులను తిరగరాసేంది. సినీ ప్రభంజనాన్ని సృష్టించేది. కాసుల వర్షం కురిపించేది. అయినా డబ్బుకోసం దిల్‌ రాజు ఆలోచించలేదు. బలగం అందరూ చూడాలనుకున్నాడు. తెలంగాణలోని ప్రతి పల్లెలో ఉచిత ప్రదర్శన వేయించాడు. కాని సీమాంధ్ర బలగం సినిమాను ఆదరించలేదు. అక్కున చేర్చుకోలేదు. తెలంగాణ సంస్కృతిని కోసమైనా సీమాంధ్ర చూడలేదు. పెద్ద పెద్ద హీరోల సినిమానే మూడు రోజుల్లో చుట్టేస్తున్న సందర్భం. సూపర్‌ హిట్‌ సినిమాలంటే మూడు వారాలు ఆడితే చాలనుకుంటున్న రోజులు. కనీసం ఓటీటిలో పేరొస్తే చాలనకుంటున్న కాలం. అలాంటి దశలో ఏడాది పాటు చర్చించుకునే సినిమా తీశాడు. తెలంగాణ సంస్కృతి వున్నంత కాలం మాట్లాడుకునే సినిమా తీశాడు. పల్లెల్లో పరదాలు కట్టుకొని బలగం సినిమా చూశారు. ధియేటర్లకు బండ్లు కుట్టుకొని వెళ్లి సినిమా చూశారు. తెలంగాణ సంస్కృతే ఈ సినిమా చూసి మురిసేలా చేశాడు. ఈ సినిమాతోనే తెలంగాణ సినిమా, సీమాంధ్ర సినిమా అన్నది స్పష్టంగా రెండుగా విడిపోయినట్లు కనిపించింది. అప్పటి నుంచే సీమాంధ్ర సినీ లోకం దిల్‌ రాజు మీద లేని పోని వార్తలు వండి వారుస్తోంది. ఇటీవల చిరంజీవి దిల్‌ రాజుపై సెటైర్లు వేశారంటూ కొన్ని సీమంధ్రకు చెందిన వాళ్లు విపరీత ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి అయినా ఎంత పెద్ద సినీ జీవికైనా దిల్‌ రాజు లాంటి నిర్మాతలే కావాలి. దిల్‌రాజు లాంటి నిర్మాత లేకుంటే ఏ స్టారు లేడు…ఎవరికీ స్టార్‌ డమ్‌ నిర్మాత లేకుండా రాలేదు. అయినా రెండు రాష్ట్రాల సినిమాకు వారధిగా మిగిలింది ఒకే ఒక్కడు…ఆ ఒక్కడు దిల్‌రాజు మాత్రమే..ఎనీ డౌట్‌?

అల్లమా? అబద్దమా!?

https://epaper.netidhatri.com/

` గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఏం చేయలేదని మీ ఉద్దేశ్యమా?

`పదేళ్లు ప్రెస్‌ అకాడెమీ చైర్మన్‌గా ఏం చేయడానికి అవకాశం రాలేదని చెప్పడం ఆంతర్యమా!

`ఎన్నికల సమయంలో ఒక్క మీట్‌ ది ప్రెస్‌ ఏర్పాటు చేయలేకపోయావా?

`అన్నా..హరీషన్న అంటే ఎంతో మంది జర్నలిస్టులకు కరోనా కాలంలో సాయం చేశారు.

`ఒక్క ట్విట్‌తో కేటిఆర్‌ స్పందించేవారు.

`జర్నలిస్టుల సంక్షేమం కోసం కేసిఆర్‌ వంద కోట్ల నిధులిచ్చారు.

`పదేళ్లలో జర్నలిస్టులకు నేనిది చేశానని ఒక్కటి చెప్పు!

`అప్పటి ప్రభుత్వ పెద్దలు పెద్ద పీట వేస్తేనే చేసిందేమీ లేదు?

`ఇప్పుడు ప్రభుత్వంతో కొట్లాడతావా?

`చెప్పడానికి మీకు లేకపోయినా వినడానికి జర్నలిస్టు సమాజం సిగ్గుపడుతుంది?

`ఇప్పుడు జర్నలిస్టుల కలలు నిజం చేస్తావా?

`ఇంకా నిన్ను జర్నలిస్టులు నమ్ముతారా?

`ఇప్పుడు అసలు ప్రభుత్వ పెద్దలు మెట్లైనా ఎక్కనిస్తారా?

`ఇప్పుడు హెల్త్‌ కార్డులు గుర్తుకొచ్చాయా?

`జర్నలిస్టులకు ఇండ్లు ఇప్పిస్తావా?

`నమ్మినందుకు బిఆర్‌ఎస్‌ను నిండా ముంచావు.

`పదేళ్లలో ఒక్కనాడైనా మీడియా ముందుకు వచ్చావా?

`ఇప్పుడు ఏదో వెలగబెడతావా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అవకాశవాది అవతారం ఎత్తుతున్నావా? అల్లం నారాయణ. అల్లమా! ఇక చాలించు…ఏం చెప్పదల్చుకున్నావ్‌ అల్లం నారాయణ. నేను మంచివాడినే…పోరాట యోధుడినే కానీ మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ నా కాళ్లు, చేతులు కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టాడని చెప్పదల్చుకున్నావా? వద్దు, వద్దంటున్నా పదేళ్లు పదవి ఇచ్చి నా నోరు మూయించాడని చెప్పాలనుకుంటున్నావా? జర్నలిస్టుల సమస్యల మీద ఎన్ని సార్లు మాట్లాడాలని చూసినా అవకాశం ఇవ్వలేదని మధనపడినట్లు నిట్టూర్పు వెల్లడిరచాలని అనుకుంటున్నావా? నా పదవి కోసం మాత్రమే సమయమిచ్చారని, జర్నలిస్టుల సమస్యలు అనగానే వెళ్లగొట్టే వారని చెప్పదల్చుకున్నావా? నాకు మేలు జరిగింది.. కానీ అయ్యో మీకు మేలు చేయలేకపోయానని మొసలి కన్నీరు కార్చేందుకు చూస్తున్నావా? కుర్చీలో కూర్చున్నంత కన్నీళ్లతోనే కాలం గడిపానని మభ్యపెట్టదల్చుకున్నావా? పదవిలో పదేళ్లు వున్నా కడుపు నిండా తిన్నది లేదు, కంటి నిండా నిద్రపోయింది లేదు. జర్నలిస్టుల బాధలు నన్ను నిద్రపోనివ్వలేదని జర్నలిస్టులను పట్టుకొని ఏడవాలనుకుంటున్నావా? ఇంతకీ ఏం చెప్పాలనుకొని మీడియా ముందుకు వచ్చావ్‌…ఎవరని బద్నాం చేద్దామని నిర్ణయించుకున్నావ్‌…నాయకులమని చెప్పుకున్న వారికి తప్ప ఏనాడైనా జర్నలిస్టుల మొహం చూశావా? వారి సమస్యలు విన్నావా? విని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లావా? తిన్నింటి వాసాలు లెక్కబెట్టడానికి బయలుదేరావా? అసలు ఏ జర్నలిస్టైనా నిన్ను నమ్ముతారని అనుకుంటున్నావా? నీ వెంట నడిచేందుకు సిద్దంగా వున్నారనుకుంటున్నావా? ఎలా జర్నలిస్టు నాయకుడిని అనుకుంటున్నావ్‌ నారాయణ. తెలంగాణ పోరాట యోధుడు ఎక్కడైనా మౌనం దాల్చుతాడా? గొంతు వినపడకుండా దాచుకుంటాడా? పదేళ్ల పాటు మూగ నోము పాటిస్తాడా?

గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం జర్నలిస్టులకు ఏం చేయలేదని మీ ఉద్దేశ్యమా?
జర్నలిస్టులకు గత ప్రభుత్వం ఏ ఒక్కరికీ ఇల్లు ఇవ్వలేదని చెప్పడానికి మీడియా ముందుకు వచ్చావా? నిజంగా జర్నలిస్టుల సమస్యలను పేపర్‌ మీద రాసుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దగ్గరకో, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి దగ్గరకు వెళ్లగలవా? ఏ ముఖం పెట్టుకొని వెళ్తావు. పదేళ్లు ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా వుండి ఏం చేశావని వాళ్లు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతావు. పదవి ఇచ్చారుగాని పనులు చేయలేదని చెబుతావా? జర్నలిస్టులకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని చెబుతావా? మోసం చేసిందని చెప్పగలవా? జర్నలిస్టులకు న్యాయం చేయలేకపోయిన అసమర్థుడిని చెప్పుకుంటావా? నా తప్పేం లేదని తప్పించుకుంటావా? గత ప్రభుత్వం జర్నలిస్టు సమాజానికి ఏం చేయనప్పుడు పదవికి ఎందుకు రాజీనామా చేయలేదు. జర్నలిస్టుల గొంతక ఎందుకు కాలేదు? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం జరిగినంత కాలం జీతం తీసుకుంటూ నమస్తే తెలంగాణ లో ఉద్యోగం చేశావు. దానిని కూడా త్యాగంగా చెప్పుకున్నావు. తెలంగాణ వచ్చాక ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా పదవిని అనుభవించావు. మరి జర్నలిస్టు సమాజానికి ఏం చేశావు? చెప్పడానికి ఏమీ లేకపోవడంతో పదేళ్లు ప్రెస్‌ అకాడెమీ చైర్మన్‌గా ఏం చేయడానికి అవకాశం రాలేదని చెప్పడం అసమర్థుని జీవిత యాత్ర అని అనుకుంటున్నావా? నీకు అన్ని రకాల అవకాశాలు నిన్నటి ప్రభుత్వం కల్పించింది. కానీ నీ కాలు ఇల్లు కదలలేదు. జర్నలిస్టులకు మేలు చేయాలన్న సోయి నీకు రాలేదు. జర్నలిస్టుల సంక్షేమానికి నీకు మనసు రాలేదు. మొత్తంగా జర్నలిస్టు సమాజానికి నువ్వేమీ చేయలేదు. ఇదే తెలంగాణలో వున్న వేలాది మంది జర్నలిస్టుల అభిప్రాయం.
అన్నా..హరీషన్న అంటే ఎంతో మంది జర్నలిస్టులకు కరోనా కాలంలో సాయం చేశారు.
మంత్రులుగా ఎంతో బిజీగా వున్న హరీష్‌ రావు లాంటి వారు అనేక సార్లు స్పందించారు. ఇంత పెద్ద తెలంగాణ జర్నలిస్టు సమాజం కరోనా సమయంలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా ముందు వరుసలో నిలబడిరది. అలాంటి సమయంలో ఉద్యోగులకు ప్రత్యేక వైద్య సదుపాయాల అందాయి. కానీ జర్నలిస్టులకు ప్రైవేటు ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందించే కృషి అల్లం చేయలేదు. ఎంతో మంది జర్నలిస్టులు మృత్యువాత పడ్డారు. వారి కుటుంబాలు వీధినపడ్డాయి. ఎంతో మంది జర్నలిస్టులు కరోనా వైద్యం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకున్నారు. ఇప్పటికీ అనారోగ్యం వెంటాడుతూ, వృత్తికి దూరమైన వాళ్లు వున్నారు. అదే సందర్భంలో ఒక్క ట్విట్‌తో కేటిఆర్‌ స్పందించేవారు. కానీ అల్లం జాడ ఆ సమయంలో ఎవరికీ దొరకలేదు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కేసిఆర్‌ వంద కోట్ల నిధులిచ్చారు. ఆ సమయంలో వాటిని వెచ్చిస్తామని చెబితే కేసిఆర్‌ వద్దనే వారా? ఈ పదేళ్ల కాలంలో గొప్పలు తప్ప, జర్నలిస్టు కొన్ని తరాల వరకు మర్చిపోలేనిది ఏదైనా వుందా? జర్నలిస్టు సమాజం మొత్తం ముక్త కంఠంతో ఒప్పుకునే ఒక్కటి చెప్పు! చెప్పలేవు. ఎందుకంటే నువ్వు చేయలేదన్నది నూరుపైసల నిజం. చెప్పినా ఎవరూ నమ్మరన్నది ముమ్మాటికీ నిజం.
పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరిగినట్లు చేశావు.
గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంతో నమ్మకంతో పెద్ద పీట వేస్తేనే చేసిందేమీ లేదు? ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంతో మాట్లాడతావా? రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంతో కొట్లాడతావా? నలుగురు జర్నలిస్టులను తీసుకొని రొడ్డెక్కగలవా? నీ వెంట నడిచేందుకు నలుగురు జర్నలిస్టులు వస్తారనుకుంటున్నావా? చెప్పడానికి మీకు లేకపోయినా వినడానికి జర్నలిస్టు సమాజం సిగ్గుపడుతుంది? ముందు అది తెలుసుకో..పదేళ్ల కల నుంచి ఇప్పుడు మేలుకొని వచ్చినట్లు జర్నలిస్టుల కలలు నిజం చేస్తావా? అది జర్నలిస్టు సమాజం నమ్మమంటావా? ఇంకా నిన్ను జర్నలిస్టులు నమ్ముతారా?అసలు ప్రభుత్వ పెద్దలు మెట్లైనా ఎక్కనిస్తారా? ఇప్పుడు హెల్త్‌ కార్డులు గుర్తుకొచ్చాయా? అంటే గత ప్రభుత్వం జర్నలిస్టుల ఆరోగ్యాలను గాలికి వదిలేసిందని నువ్వు చెబుతున్నట్లేనా? అసలు గత ప్రభుత్వం జర్నలిస్టులకు హెల్త్‌ కార్డులు జారీ చేయలేదని చెప్పదల్చుకున్నావా? మరి ఆసుపత్రిలలో జర్నలిస్టుల పేరిట జరిగిన వైద్యమంతా అబద్దమని చెప్పదల్చుకున్నావా? జర్నలిస్టులకు ఇండ్లు ఇప్పిస్తావా? గత పదేళ్ల కాలంలో తెలంగాణలో జర్నలిస్టులకు ఇండ్లు ఇచ్చిన దాఖలాలు లేవని ప్రచారం చేయదల్చుకున్నావా? కొన్ని నియోజకవర్గాలలో, జిల్లాలలో జర్నలిస్టులకు అందిన ఇండ్లు నిజం కాదా? అదంతా అబద్ధమని చెబుతున్నట్లేనా? జర్నలిస్టులకు ఇండ్లు ఇచ్చినట్లు అప్పటి మంత్రులు, ఎమ్మెల్యే చెప్పిన ముచ్చట అంతా తూచ్‌ అని అల్లం నిర్థారణ చేసినట్లేనా? నిన్ను నమ్మినందుకు బిఆర్‌ఎస్‌ను నిండా ముంచావు. అది కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఏదో చేయాలనుకున్నావు. పదవిలో వున్నప్పుడు ఆరోగ్యం సహకరిస్తలేదని అనేక మందితో అన్నట్లు గుర్తు. ఇప్పుడు హటాత్తుగా మీడియా ముందుకు వచ్చేంత పవర్‌ ఒక్కసారిగా ఎలా వచ్చే…పదేళ్లలో ఒక్కనాడైనా మీడియా ముందుకు వచ్చాయా? ఇప్పుడు ఏదో వెలగబెడతావా?
ఎన్నికల ముందు ప్రతి యూనియన్‌ మీట్‌ ది ప్రెస్‌ ఏర్పాటు చేయడం అన్నది ఒక ఆనవాయితీగా మారింది.
దాదాపు అన్ని గుర్తింపు వున్న యూనియన్లు కూడా మీట్‌ ది ప్రెస్‌ ఏర్పాటు చేస్తున్నారు. 2014 నుంచి 2023 వరకు యూనియన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అల్లం నారాయణ ఎందుకు మీట్‌ ది ప్రెస్‌ ఏర్పాటు చేయలేదు. జర్నలిస్టుల సమస్యలపై ఎందుకు పార్టీల వైఖరి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అంతగా ఎన్నికల సమయంలో పొడిచేసే కార్యక్రమాలు వున్నాయి. అంతా డొల్ల. అవకాశవాదం. జర్నలిస్టుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టి, పబ్బం గడుపుకోవడం అలవాటు చేసుకున్నాడన్నది అందరూ అంటున్న మాటే!

లీడర్లను కాదు క్యాడర్‌ నమ్మండి!

https://epaper.netidhatri.com/

`బిఆర్‌ఎస్‌ సైనికులకు సముచిత స్థానం ఇవ్వండి.

`క్యాడర్‌ అభిప్రాయాలు వినండి.

`వారికి మరింత ప్రాధాన్యత కల్పించండి.

`పార్టీ నాది అని గర్వంగా చెప్పుకునేది క్యాడరే.

`గులాబీ జెండా చేతిలో పట్డుకునేది క్యాడరే.

`కండువా కూడా బరువు అనుకునే వారిని పక్కన పెట్టండి.

`పక్క చూపులు చూసే వారిని పసిగట్టండి.

`ఇప్పటికైనా సంస్థాగత నిర్మాణం చేపట్టండి.

`క్యాడర్‌కు పదవులు పంచండి.

`సీనియర్లను పరిశీలకులుగా మార్చండి.

`నాయకులు పెత్తనం మాని, ప్రేమగా మాట్లాడం నేర్చుకోండి.

`అవసరమైన శిక్షణా తరగతులు నిర్వహించండి.

`మరో వందేళ్లు మళ్ళీ పునాదులు వేయండి.

`క్యాడర్‌ త్యాగాలే లీడర్ల పదవులు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అంతర్మధనం ఎప్పుడైనా మంచిదే. ఎప్పటికీ మేలే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు జయాలు, పరాయజయాలు సహజం. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు ఎంత గొప్ప పరిపాలన అయినా సరే ఓటమి చెందడం సహజం. రాజకీయ పార్టీలు చేసే కొన్ని ప్రచారాలు కూడా ప్రజలను మాయ చేస్తుంటాయి. మభ్యపెడుతుంటాయి. గతంలో గొప్ప గొప్ప పాలకులు కూడా ఓడిన సందర్భాలున్నాయి. ఓటమిని ఎదుర్కొన్న దాఖలాలు అనేకం వున్నాయి. ఎన్టీఆర్‌ హాయాంలో ఇదే కాంగ్రెస్‌ పార్టీ సినిమాలు నిర్మించింది. ఆనాడు సోషల్‌ మీడియా లేదు. కాని సినిమారంగం ప్రభావం బాగా వుండేది. ప్రజలపై సినిమాల ప్రభావం విపతీతంగా వుండేది. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో నటుడు ఘట్టమనేని కృష్ణ పని గట్టుకొని కొన్ని సినిమాలు తీశాడు. అదే సమయంలో మండలాదీషుడు, గండిపేట రహస్యం. నా పిలుపే ప్రభంజనం. అంటూ కొన్ని సినిమాలు నిర్మించారు. ప్రజల్లో అపోహలు సృష్టించారు. అదే నటుడు కృష్ణ అనేక సార్లు ఎన్టీఆర్‌ ఎంతో నిజాయితీ పరుడు అంటూ కితాబిచ్చారు. ఒక ప్రభుత్వాన్ని అబాసు పాలు చేసి, ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తున్న పార్టీని ఓడిరచి, తర్వాత ఆయన మంచి నాయకుడు. ఆ పార్టీ గొప్పది అని చెప్పుకుంటే ఏం లాభం. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఒకప్పుడు పివి. నర్సింహారావు ప్రధానిగా వున్నప్పుడు జేఎంఎం ముడుపులు కేసు అంటూ పెద్దఎత్తున ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎంపిలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కాపాడుకున్నాడు అన్నారు. సంస్కరణలు తెచ్చి, దేశం పరువు తీశాడని అన్నారు. అంతర్జాతీయ విఫణిలో దేశాన్ని నిలబెట్టాడని అన్నారు. విదేశీ పెట్టుబడులకు ద్వరాలు తెరిచాడని ప్రచారం చేశారు. మన దేశాన్ని ఇతర దేశాలకు రుణ గ్రస్ధ దేశంగా మార్చుతున్నాడని ప్రచారం చేసి, ఆయన ప్రభను మసక చేశారు. చివరికి ఆయన చనిపోయినప్పుడు కూడా పార్ధీవ దేహానికి సముచిత గౌరవం ఇవ్వలేదు. కాని ఇప్పుడు పివిని దేశమంతా కొనియాడుతోంది. కాంగ్రెస్‌ కూడా దేశం ఈ రోజలు ఈ స్ధాయిలో వుందని చెప్పడానికి ఎంతో గర్వంగా వుందని అది కాంగ్రెస్‌ ప్రభుత్వ గొప్పదనమని చెప్పుకుంటోంది.
అలాగే పదేళ్ల కేసిఆర్‌ పాలనపై ప్రతిపక్షాలు కూడగట్టుకొని అసత్యాలను విపరీత ప్రచారం చేశారు.
విష ప్రచారం విసృతంగా చేశారు. ఇప్పుడు సినిమాల ప్రభావం తగ్గి, సోషల్‌ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగింది. దానికి తోడు మీడియా కూడా బిఆర్‌ఎస్‌ ఓటమి కోసం చేయాల్సినంత చేశాయి. ఇలా రెండు రకాల మీడియా ప్రభావం బిఆర్‌ఎస్‌ ఓటమికి కారణలాలయ్యాయి. కేసిఆర్‌ ప్రజలను కలవడంటూ, ప్రజలంటే చులనక అంటూ ప్రచారం చేశారు. అలా ప్రతిపక్షాలు విరుచుకుపుడుతుంటే బిఆర్‌ఎస్‌ నాయకులు మైనం పాటించారు. తాము కూడా అసంతృప్తిగా వున్నట్లు ప్రతిపక్షాలకు తప్పుడు సంకేతాలు బిఆర్‌ఎస్‌నేతలు కూడా కొంత మంది పంపించారు. అంతే కాకుండా నిత్యం నియోజకవర్గాలో ఓ స్దాయి నాయకులు కీచులాడుకోవడం వంటికి కూడా పార్టీకి తీరని నష్టంచేశాయి. అయితే లీడర్లు కూడా పార్టీ భ్రష్టు పట్టిండచంలో ఆరితేరిపోయారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన నాయకులు సమావేశంలో ఈ విషయం తేటతెల్లమైంది. అయితే ఈ సంగతి గతంలో తెలియంది కాదు. అధికారంలో వున్నప్పుడు తప్పులు పొరపాట్లు ఎక్కడా కనిపించవు. ఒక వేళ ఎవరైనా తప్పు జరుగుతుందని తెలిపిన వారినే గిద్దిస్తారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలంటూ వారిని పార్టీకి దూరం చేస్తారు. అంతే కాని పార్టీలో ఏం జరుగుతుందని ఏనాడైనా కార్యకర్తలను పిలిచి అడిగారా? లేదు. పదేళ్ల కాలంలో ఏనాడు కార్యకర్తలతో అటు పార్టీ అధినేత కేసిఆర్‌ కాని, అగ్రనేతలు కేటిఆర్‌, కవితలుగాని సమావేశమైంది లేదు. ఎంత సేపు లీడర్లతో మంతనాలు..వారితో సమావేశాలు. అయినా కనీసం వారి మాటలైనా విన్నట్లు కూడా ఎక్కడా విన్నది లేదు. వార్తలు వచ్చింది లేదు. రాష్ట్ర స్ధాయిలో మోనో పలి, జిల్లా స్ధాయిలో ఓ స్ధాయి నాయకుల తీరు అంతా కలిసి పార్టీని నిండా ముంచాయి. మరో వైపు ఓ స్ధాయి నాయకులు పార్టీని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని విపరీతంగా సంపాదించారన్న ఆరోపణలు వచ్చాయి. అయినా వారిని వారించిన దాఖలాలు లేవు. వారికి హెచ్చరికలు జారీ చేసింది లేదు. దాంతో అడ్డూ అదుపు లేకుండా నాయకులు సంపాదించుకున్నారు. కార్యకర్తలకు అందాల్సిన వాటిని కూడా నాయకులే ఎత్తుకెళ్లారు. క్యారడ్‌ ఎప్పుడూ నాయకుల వెంట తిరగడం తప్ప వారికి మిగిలిందేమీ లేదు. వారికి ఒరిగిందేమీ లేదు. సంపాదించుకున్నది లేదు. కాలం వృధా అయ్యింది. వయసు తరిగిపోయింది. అయినా ఎవరూ పెద్దగా కనికరించిందిలేదు. ఇప్పటికైనా క్యాడర్‌ను అదరించండి. వారికి ఓ దారి చూపండి. నాయకులుగా వారిని గుర్తించండి. అంతకన్నా పార్టీ నుంచి ఏమీ ఆశించడం లేదు.
లీడర్లను కాదు క్యాడర్‌ను నమ్మండి. బిఆర్‌ఎస్‌ సైనికులకు సముచిత స్ధానం ఇవ్వండి.
క్యాడర్‌ అభిప్రాయాలు స్వీకరించండి. వారికి తగిన ప్రాదాన్యత కల్పించండి. పార్టీ నాది అని గర్వంగా చెప్పుకునేది క్యాడరే. పార్టీని కాపాడుకునేది క్యాడరే. గులాబీ జెండా భుజం దించకుండా మోసేది క్యాడరే. కండువా కూడా బరువు అనుకునే నాయకులెవరో తెలుసుకోండి. పక్క చూపులు చూసే వారిని పసిగట్టండి. ఇప్పటికైనా పార్టీ సంస్ధాగతమైన నిర్మాణం చేపట్టండి. గ్రామ స్ధాయి నుంచి రాష్ట్ర స్ధాయి వరకు పార్టీ పదవులు ప్రకటించండి. అధికారంలో వున్నప్పుడు ఎలాగూ పదవులు ఇవ్వలేదు. రాజ్యాంగబద్దమైన పదవులు కల్పించలేదు. ఖాళీగా వుంచారే గాని, క్యాడర్‌కు ఇవ్వలేదు. కొన్ని పదవులు ఇచ్చిన వారికే మళ్లీ మళ్లీ ఇచ్చారు. కాని అవకాశం రాని వాళ్ల గోడు వినలేదు. అయినా వారు పార్టీని వదులుకోవడానికి సిద్దంగా లేదు. నాయకులు పక్క చూపులు చూస్తున్నారు. కొన్ని జిల్లాలో నాయకులు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారు. అలాంటి అవకాశవాదులను పెంచి పోషిస్తున్నారని కూడా క్యాడర్‌ గతంలో నెత్తినోరు మొత్తుకొని చెప్పిన వినలేదు. అందుకు పదువుల పంపకంలో ఇప్పటి వరకు అవకాశం రాని వారిని గుర్తించి ఇవ్వండి. సీనియర్లను పరిశీలకులుగా మార్చండి. నాయకత్వ బాధ్యతలు మళ్లీ వారి చేతుల్లో పెట్టకండి. లేకుంటే మళ్లీ వారి వ్యహరశైలి మొదటికే వస్తుంది. నాయకులు పెత్తనం మాని, క్యాడర్‌తో, ప్రజలతో ప్రేమగా మాట్లాడడం నేర్చుకోండి. అవసరమైన శిక్షణా తరగతులు నిర్వహించండి. గతంలో కేసిఆర్‌ తెలుగుదేశంలో వున్న కాలంలో శిక్షణా తరగతులు ఇచ్చేవారు. 2014లో అధికారంలోకి వచ్చాక తొలి నాళ్లులో కొన్ని సార్లు శిక్షణా తరగులు బ్రహ్మాండంగా నిర్వహించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక అసలు క్యాడర్‌నే దూరం చేసుకున్నారు. టిఆర్‌ఎస్‌ పార్టీ పెట్టిన నాడే వందేళ్ల పాటు చెక్కు చెదరని పార్టీగా ప్రజల్లో వుండేలా ముహూర్తం పెట్టినట్లు గతంలో కేసిఆర్‌ అనేక సార్లు చెప్పారు. కాని పార్టీ పేరు ఇరవైఏళ్లలో మార్చేశారు. మరి బిఆర్‌ఎస్‌ మరో వందేళ్ల పునాదులు వేయండి. అందుకు పార్టీ సంస్ధాగత నిర్మాణంతోనే సాధ్యమౌతుంది. నిజానికి ప్రజలు బిఆర్‌ఎస్‌ను ఓడిరచలేదు. బిఆర్‌ఎస్‌ నాయకులే పనిగట్టుకొని ఓడిపోయారు. ఇది ముమ్మాటికి నిజం. నూరుపైసల వాస్తవం. ప్రజల ముందుకు వెళ్లడానికి కూడా చాలా మంది నాయకులు నామోషిగా ఫీలయ్యారు. ఇతర నాయకులను కలుపుకొని పోయేందుకు సిద్దపడలేదు. అంతే కాదు వాడి దగ్గరకు నేను వెళ్లాలా? అన్న అహం నింపుకొని చేజేతులా పదవిని చేతి పార్టీలో పెట్టిన వాళ్లున్నారు. అయితే ప్రజల్లో వున్న సానుభూతిని ఇప్పుడే పాడు చేసుకోవద్దు. ప్రభుత్వం తప్పులు చేసే అవకాశం ఇంకా ఇవ్వాలి. ప్రజలకు కాంగ్రెస్‌ పాలన అర్ధం కావాలి. బిఆర్‌ఎస్‌ పాలనకు, కాంగ్రెస్‌ పాలనకు తేడా తెలియాలి. ఇప్పటికే కొంత అర్దమౌతోంది. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం క్యాడర్‌ చేసే విధంగా నాయకులు వారిని ప్రోత్సహించాలి. నాయకులు ఎప్పటికప్పుడు పరిస్ధితిని అంచనా వేసుకుంటూ వుండాలి. పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కవ సీట్లు గెలిచేందుకు ఇప్పటినుంచే కసరత్తు మొదలుపెట్టాలి.

సిట్టింగులను పక్కనపెట్టండి!

https://epaper.netidhatri.com/

`కొత్తవారికి అవకాశం ఇవ్వండి.

`కార్యకర్తల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోండి.

`ఆత్మలు ఇతర పార్టీలలో వున్న వారుకూడా వున్నారు.

`వడపోత అవసరం.

`లేకుంటే ప్రజలు మరింత నిరాశకు లోనౌతారు.

`ప్రజలు కేసిఆర్‌ వెంట వున్నారు.

`కార్యకర్తలు కోరుకునే అభ్యర్థులను నిలబెట్టండి.

`అత్యధిక సీట్లు ఖాయం చేసుకోండి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఇప్పటికైనా తేరుకోండి..జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. కార్యకర్తలు ఏం చెబుతున్నారో వినిపించుకోండి. వారి అభిప్రాయాలు స్వీకరించండి. వారి సూచనలకు విలువ ఇవ్వండి. కనీసం వారు ఏం చెప్పాలనకుంటుంటున్నారో చెప్పనీయండి. వారి మనుసలో ఏముందో మీరే అడిగి తెలుసుకోండి. లేకుంటే నాయకులు, కార్యకర్తల మనసులో వున్న తాజా అభిప్రాయాలు కూడా సమాధి అయిపోతాయి. పొగడ్తలకు ఇంకా పొంగిపోకండి. అంతా బాగుందని ఎవరైనా అంటే మురిసిపోకండి. పూర్తిగా నమ్మేయకండి. నిజనిర్ధారణ చేసుకోండి. పది మంది అభిప్రాయలను పోల్చి చూడండి. ప్రతి నియోజకవర్గం సందర్శించండి. కింది స్ధాయికార్యకర్త కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి. తోటి కార్యకర్తల మనోభావాలకు విలువనివ్వండి. ఇప్పటికైనా మన పార్టీలో కూడా మాట్లాడే స్వేచ్ఛ వుందని గర్వపడేలా చేయండి. వారు సంతోషపడేలా చూడండి. మా మాటలకు, మా సూచనలకు విలువ వుంటుందన్న నమ్మకాన్ని వారిలో కల్పించండి. ఎందుకంటే నిన్నటిదాకా అధికారంలో వున్నారు. ఏ కార్యకర్తకు అందుబాటులో లేరు. ఎంత సేపు పాలన తప్ప పార్టీకి సమయం ఇవ్వలేదు. ఈ మాట ఎన్టీఆర్‌ కాలం నుంచి, చంద్రబాబు పాలన నుంచి, ఇప్పుడు తెలంగాణలో కేసిఆర్‌ పాలనలో కూడా వింటూనే వున్నాం. ఎందుకంటే ఈ విషయాలు పూర్తిగా కేసిఆర్‌కు కూడా తెలుసు.
ఉమ్మడి రాష్ట్రంలో 1989లో ఎన్టీఆర్‌ ఓడిపోవడానికి కారణం కేవలం ఆయన నేరుగా ప్రజలను కలవకపోవడం.
పై స్ధాయి నేతలకు తప్ప, ఆయన దర్శనబాగ్యం ఎవరికీ అందకపోవడం. ఎంతో నిజాయితీగా, అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా 1989లో తెలుగుదేశం ఓడిపోయింది. తర్వాత 1994లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. కానీ అధికార మార్పిడి జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. పాలనలో విపరీతమైన సంస్కరణలు తెచ్చారు. కొత్త పరిపాలనావిధానాలు అమలు చేశారు. పాలనలో ప్రజలను భాగస్వాములు చేశారు. శ్రమ దానం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పచ్చదనం..పరిశుభ్రత అనే కార్యక్రమాలు చేపట్టారు. రైతులకు చేయూత అనే కార్యక్రమం అమలు చేశారు. ఆ రోజుల్లో రైతులకు పని ముట్లు ఉచితంగా ప్రభుత్వం ద్వారా అమలు చేశారు. హైటెక్‌ పాలనకు మొదలు పెట్టారు. నేరుగా అధికారులతో చంద్రబాబు మాట్లాడుతుండడం చేశారు. జన్మభూమి కార్యక్రమంతో ప్రజలకు బాగా చేరువయ్యారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యలు తీర్చారు. కొత్తకొత్త ఫ్లైఓర్లు నిర్మాణం చేసి, హైదరాబాద్‌కు అప్పుడున్నంత మేర కొత్త హంగులు దిద్దారు. అప్పటి ప్రజా ప్రతినిధులు ఎప్పుడూ ప్రజల్లో వుండాలంటే ఎప్పటికిప్పుడు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసేవారు. ఈ కార్యక్రమాల సృష్టివెనుక, అమలు వెనకు వున్న నాయకుడు కేసిఆర్‌. ఈ విషయం ఈతరానికి తెలియకపోవచ్చు. అంతే కాదు, 1999 ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి రావడానికి తటస్థులను రాజకీయాల్లోకి ఆహ్వానించి, కొత్త తరం రాజకీయాలకు పురుడుపోసిన చాణక్యంలో కేసిఆర్‌ పాత్ర కూడా ఎంతో కీలకమైంది. మరి అలాంటి కేసిఆర్‌ పాలకుడుగా తెలంగాణలో ఉద్యమ నేత ప్రజలకు మరింత చేరువౌతాడని అందరూ అనుకున్నారు. కాని ఆయన రానురాను జనానికి దూరమౌతూవచ్చారు. కాని జనానికి అవరమైన అన్ని పనులు చేసిపెట్టారు. ఎన్ని చేసినా మా నాయకుడు మా కళ్ల ముందుకు రావడం లేదన్న వెలితి మాత్రం ప్రజల్లో అలాగే మిగిలిపోయింది. అదే బిఆర్‌ఎస్‌ను దెబ్చతీసింది.
ఒకనాడు తెలుగుదేశం పార్టీ ప్రస్ధానం, ప్రాభవం కోసం ఎంతో కృషి చేసిన కేసిఆర్‌, తన సొంత పార్టీ విషయంలో మాత్రం పదేళ్లకే ప్రజలకు దూరమయ్యేలా కావడానికి ఆయన జనంలో లేకపోవడమే అన్నది మాత్రం అందరూ అంగీకరిస్తున్న విషయం.
తెలంగాణలో ఇప్పటికీ ఎవరి నాయకత్వం కావాలని ఏ సగటు వ్యక్తిని అడిగినా టక్కున చెప్పే సమాధానం ఒక్కటే..అది కేసిఆర్‌ …అంతలా ఆయన ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాడు. కాని ఆయన ద్వారా నేతలైన వారు మాత్రం ప్రజలకు దూరమయ్యారు. కేసిఆర్‌ తో ప్రజల్లోకి వస్తే సమస్యలు తెలుస్తాయి. నాయకుల నిజస్వరూపాలు తెలుస్తాయని అందరూ అనుకున్నారు. కాని ఆయన రాలేదు. నాయకుల పట్ల ప్రజల్లో వున్న వ్యతిరేకతను స్పష్టంగా తెలుసుకోలేకపోయారు. పైగా పదేళ్ల కాలంలో ప్రతి మూడు నెలలకోసారి పార్టీ తరుపున చేయించిన అనేక సర్వేలలో ఎమ్మెల్యేల పనితీరుపై అనేక రిపోర్టులు వచ్చాయి. వాటిని కూడా అనేక పార్టీ సమావేశాల్లో సాక్ష్యాత్తు కేసిఆరే వెల్లడిస్తూ వచ్చారు. తీరు మార్చుకోవాలని సూచిస్తూ వచ్చారు. ఒక రకంగా హెచ్చరించారు. కాని ఏం జరిగింది. కేసిఆర్‌ చర్యలు తీసుకోలేదు. అప్పటి ఎమ్మెల్యేలు తమ తీరును మార్చుకోలేదు. పద్దతులు అసలే మార్చుకోలేదు. పెద్దగా పనులు నిర్వహించిన దాఖలాలు కనిపించలేదు. తెలంగాణ వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌లో ఓ ముప్పై మంది ఎమ్మెల్యేల పనితీరుపై నిరంతరం ఆరోపణలు వచ్చాయి. మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. రాసిని జర్నలిస్టులను బెదించిన వార్తలు కూడా వచ్చాయి. కాని ఆరోపణలు వచ్చిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తమ తీరు మార్చుకోలేదు. అటు ప్రజల్లోనే కాదు, పార్టీలో కూడా నాయకులకు అందుబాటులో లేకుండా, గ్రూపులు తయారు చేసి, కార్యకర్తల్లోనే చీలిక తెచ్చిన ఎమ్మెల్యేలు కూడా వున్నారు. మనమంతా ఒక కుటుంబం అంటూనే వ్యత్యాసాలు చూపించిన నేతల పట్ల ఎన్నికల తరుణం సమీపిస్తున్నప్పుడు వారి అసంతృప్తిని భహిరంగానే వ్యక్తం చేస్తూనే వచ్చారు. వారి అభిప్రాయాలు పార్టీ పరిగణలోకి తీసుకోలేదన్నది వాస్తవం. అప్పటి ఎమ్మెల్యేల తీరును తప్పుపడుతూనే, మళ్లీ వాళ్లకే టిక్కెట్లు ఇస్తే ప్రజలు ఎలా స్వాగిస్తారనుకున్నారో గాని, మొత్తానికి పార్టీని చేజేతులా ముంచుకున్నది మాత్రం వాస్తవం.
త్వరలో పార్లమెంటు ఎన్నికలు రానున్నాయి.
ఈ పార్లమెంటు ఎన్నికల్లోనైనా సిట్టింగుల పేరుతో టిక్కెట్లు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. ప్రజా వ్యతిరేకత, నాయకుల అసంతృప్తి లేని వారికి టిక్కెట్లు ఇవ్వండి. పార్టీ శ్రేణులు ఎంత కష్టమైనా పడి, ప్రజలను ఒప్పించి, మెప్పించి గెలిపించుకుంటారు. అంతే కాని పార్టీలోనే వ్యతిరేకత వున్న వారికి మాత్రం మళ్లీ టిక్కెట్లు ఇవ్వొద్దు. మళ్లీ జాతీయ పార్టీల ముందు దిగదుడుపు కావొద్దు. ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీపై ప్రజలకు సంతోషం లేదు. మళ్లీ ప్రజలు కేసిఆర్‌ నాయకత్వం వైపే చూస్తున్నారు. తెలంగాణ విముక్తి ప్రధాతగానే, తెలంగాణ ప్రగతి దాతగా కేసిఆర్‌నే ప్రజలు కోరుకుంటున్నారు. అందువల్ల గెలుపు గుర్రాలకు అవకాశం ఇవ్వండి. ప్రజల్లో వ్యతిరేకత వున్నవారిని పక్కన పెట్టండి. అవసరమైతే కొత్త వారికి అవకాశం ఇవ్వండి. సీనియర్లను పార్టీ సేవలకు వినియోగించుకోండి. ఇంత కాలం ఎలాంటి పదవులు అందని వారిలో పార్టీలో మంచి పేరున్న నాయకులను గుర్తించండి. వారికి అవకాశం ఇవ్వండి. ప్రజలే గెలిపించుకుంటారు. శాసన సభ ఎన్నికల్లో అభ్యర్ధులకు సహరించక, వారి ఓటమికి పరోంక్షంగా సహకరించిన పార్లమెంటు సభ్యులు కూడా బిఆర్‌ఎస్‌లో వున్నారు. కొందరేమో తటస్ధంగా వుంటూ, ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొనలేదు. మరికొందరు ఎమ్మెల్యేలుగా వున్న సమయంలో తమ మాట లెక్క చేయలేదని, తమకు ప్రాధాన్యతనివ్వలేదని మనసులో పెట్టుకొని పార్టీని దగ్గరుండి ఓడిరచిన వారు కూడా వున్నారు. అలాంటి వారు ఎవరన్నది పార్టీలో అందరికీ తెలిసిందే..ఇది బహిరంగ రహస్యమే..అందువల్ల వారిని పూర్తిగా పక్కన పెట్టాల్సిన అవసరం వుంది. అలాంటి అవకావవాదులు, ఒక వేళ పార్టీ గెలిపించినా, మరో వైపు చూడకుండా వుండరన్న నమ్మకం లేదు. అలాంటివారు కూడా వున్నారు. అందుకే ప్రజలు కూడా తస్మాస్‌ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. గత శాసన సభ ఎన్నికల సమయంలోనే ప్రజలు హెచ్చరించారు. అయినా అదే నాయకులను ప్రజలమీద బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేశారు. దాంతో ప్రజలు ఆ నాయకులను తిరస్కరించారు. ఇప్పుడు కూడా పొరపాటను అదే పనిచేయొద్దు. ప్రజల్లో, పార్టీలో కూడా మంచి పేరు లేని వారికి టిక్కెట్లు ఇవ్వొదు. ఇదీ జనం మాట…పార్టీ శ్రేణులు మొత్తుకుంటున్న మాట…

ప్రతిపక్షం ముందు పాలక పక్షం వెలవెల.

https://epaper.netidhatri.com/

`హరీష్‌ రావు ముందు తేలిపోయిన మంత్రులు.

`హరీష్‌ రావు చెప్పిన వివరాలకు అసెంబ్లీ అవాక్కు.

`ప్రభుత్వ తప్పుడు లెక్కలను కడిగేసిన హరీష్‌ రావు.

`అడుగడుగునా హరీష్‌ రావును అడ్డకునేందుకు ఐదుగరు మంత్రుల అవస్థలు.

`పొంతన లేని మాటలు చెప్పలేక మంత్రుల తిప్పలు.

`ప్రభుత్వ శ్వేతపత్రం తప్పుల కుప్ప అని హరీష్‌ రావు ఎద్దేవా.

`కాగ్‌ రిపోర్ట్‌లతో కలిపి వివరిస్తూ ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకున్న హరీష్‌ రావు.

`సమాధానం చెప్పుకోలేక పాలకపక్షం చూసిన దిక్కులు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ప్రతిపక్షం దూకుడు అసెంబ్లీలో ప్రదర్శించింది. పాలక పక్షం గిలగిలలాడిరది. ఒక రకంగా చెప్పాలంటే విలవిలలాడిరది. ఒక్కడుగా మాజీ మంత్రి హరీష్‌రావు దూకుడు ముందు అధికారపక్షమంతా వెలవెలబోయింది. బుధవారం అసెంబ్లీలో ప్రతిపక్ష స్ధానంలో వుండి కూడా హరీష్‌రావు వన్‌మాన్‌ షో చేశాడు. పాలకపక్షానికి చెమటలు పట్టించారు. కాళేశ్వరం మీద కట్టుకధలు,పిట్ట కథలు చెప్పి, తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి హరీష్‌రావు అసెంబ్లీ సాక్షిగా చుక్కలు చూపించారు. తనదైన శైలిలో అధికార పక్షానికి మాట లేకుండా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని హరీష్‌రావు డిమాండ్‌ చేయడంతో పాలకపక్షం బిత్తరపోయింది. ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టి, ప్రజలు ముందు దోషిగా నిలబెడదామని అనుకున్న పాలకపక్షం తేరుకోవడానికే కొంత సమయం పట్టింది. శ్వేతపత్రాలతో ప్రతిపక్షానికి చుక్కలు చూపిస్తామనుకున్న పాలకపక్షం పట్టపగలు చుక్కలు చూడాల్సి వచ్చింది. అసలు పాలకపక్షంలో ఎవరున్నారో? ప్రతిపక్షంలో ఎవరున్నారో తేరుకోలేక, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సహా, మంత్రులు బిత్తరపోయినంత పనైంది. ఒక దశలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులాంటి వారు కూడా ఆర్ధిక మంత్రి హరీష్‌రావు అంటూ సంబోధించడం విశేషం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో బుధవారం ఆసక్తికరమైన సందర్భం చోటు చేసుకున్నది. గతంలో కూడా ఎప్పుడూ ఇలాంటి సందర్భం ఎప్పుడూ కనిపించలేదు. మొదటిసారి చట్ట సభ అసెంబ్లీలో ప్రతిపక్షం ముందు అధికార పక్షం వెలవెల బోయింది. మాజీ మంత్రి హరీష్‌రావు వాగ్ధాటికి పాలకపక్షం కకావికలమైంది. నిజానికి శ్వేతపత్రాల విడుదల అంటే ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ భపడుతుందని అధికార కాంగ్రెస్‌ ఊహించింది. కాని అందుకు భిన్నంగా అసెంబ్లీలో ఎమ్మెల్యే హరీష్‌రావు గుక్క తిప్పుకోకుండా, లెక్కల మీద ఎలాంటి షశబిషలు లేకుండా అలవోకగా పాలకపక్షం సభముందుంచిన లెక్కల లోగుట్టు విప్పుతుంటే అధికార పక్షం నోరెళ్లబెట్టి వినాల్సివచ్చింది. అంతే కాకుండా కాళేశ్వం మీద విచార చేపడతామంటూ, పదే పదే కాంగ్రెస్‌ నాయకులు బైట చేస్తున్న ప్రకటనలకు సభా వేధికగా హరీష్‌రావు పాలకపక్షం ఊహించని విధంగా దెబ్బకొట్టే ప్రయత్నంచేశారు. అలా హరీష్‌రావు స్పందించడంతో పాలపపక్షానికి పాలుపోలేదు. వెలవెల పోయి చూడడం తప్పలేదు.
సహజంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ పాలకపక్షంగా, ఓటమిపాలైన పార్టీని చెడుగుడు ఆడుకున్న సంఘనలు వుండేవి.
కాని బిఆర్‌ఎస్‌ ప్రతిపక్షంలో వున్నా, తమదే పై చేయి అని పాలకపక్షం చేయికి వాయిస్‌ లేకుండా చేయడం గమనార్హం. ఎందుకంటే నిజాలను ఎవరూ తారుమారు చేయలేరు. కట్టుకథలల్లి ఎల్లకాలం నిజాలని నమ్మించలేరు. తప్పులను చెప్పి ఒప్పులుగా మార్చలేరు. తొమ్మిదిన్నరేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ సుబిక్షంగా వుంది. సుసంపన్నమైన ప్రగతిని సాధించింది. చింతలు లేని జీవితాలు తెలంగాణ ప్రజలు అనుభవించారు. అరవైఏళ్ల గోస పోయింది. పల్లెల్లో మళ్లీ పచ్చదనం, పాడి, పంట వెల్లివిరిసింది. పల్లె ఆకుపచ్చని అందాలు అద్దుకున్నాయి. తెలంగాణ సాగులో విప్లవం సాధించింది. ఊహించని దిగుబడులతో అన్నపూర్ణగా విలసిలిల్లంది. రైతు రాజయ్యాడు. రైతు రాజ్య స్ధాపన జరిగింది. అంత గొప్పగా బంగారు తెలంగాణ తీర్చిదిద్దబడిరది. కాని అధికారమే పరమావిధిగా కాంగ్రెస్‌పార్టీ పదే పదే ఎన్నికల ముందు అబద్దాలు వల్లెవేసింది. చెప్పిందే చెప్పి, తప్పుడు ప్రచారాలు నమ్ముకొని బిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసి, అధికారంలోకి కాంగ్రెస్‌ అదికారంలోకి వచ్చింది. పది రోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం అసలు రంగు బైటపడుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి పాలనపై అవగాహన లేక, మేధావులుగా తమకు తాము చిత్రీకరించుకునే వారి మాటలు నమ్మి, అధికార పక్షం బోల్తాపడిరదన్న విషయాన్ని హరీష్‌రావు లెక్కలతో సహాబైటపెట్టారు. ప్రభుత్వం వద్ద సమాధానం లేకుండా చేశారు. సమర్ధుడైన నాయకుడు ప్రశ్నిస్తే ఎలా వుంటుందో పాలకపక్షానికి తెలిసి వచ్చింది. వెంటనే తేరుకునే ప్రయత్నం చేయాలనుకున్నారు. కాని హరీష్‌రావు వాగ్ధాటికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని అడుగుడగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అడుగడుగునా హరీష్‌రావుకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నంచేశారు.
మంత్రులు పొన్నం ప్రభాకర్‌ గత ప్రభుత్వం జీతాలు సరిగ్గా ఇవ్వలేదంటూ ఏదో చెప్పబోయి ఇరుకున పడ్డాడు. ఇదే సమయంలో ప్రభుత్వ ఖజానా అంటే బీరువా కాదు. అందులో డబ్బు దాచుకోవడం వుండదని, ప్రభుత్వ ఆర్ధిక వ్యవస్ధ ఒక ప్రవాహం లాంటిదంటూ, వచ్చే లెక్క, పోయే లెక్క వుంటుందని హరీష్‌రావు అనడంతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ కలుగజేసుకున్నారు. తాను మొదటిసారి అసెంబ్లీకి ఎన్నిక కావడం నిజమే కాని, గతంలోనే తాను పార్లమెంటు సభ్యుడినని, ప్రభుత్వ ఖజానా అంటే బీరువా కాదని తమకు తెలుసని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. దాంతో అధికార పక్షం ఎంత డిఫెన్స్‌లో వుందో అర్ధమైంది. ఆ తర్వాత మంత్రి హరీష్‌రావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్న క్రమంలో మరోసారి మంత్రి జూపల్లి కలుగజేసుకున్నారు. సందర్భంలేకుండా తలదూర్చి హరీష్‌రావు ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక విద్యుత్‌ అప్పులు, విద్యుత్‌ తయారీ సంస్ధలు, కేంద్రం ఒత్తిళ్లు, మోటార్లకుమీటర్ల అంశం ప్రస్తావనకువచ్చింది. ఈ విషయంలో హరీష్‌రావు చెబుతున్న విషయాలు అధికార పక్షానికి నచ్చలేదు. కేంద్రం ప్రభుత్వం ఎంత ఒత్తిడిచేసినా, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎట్టిపరిస్ధితుల్లోనూ మోటర్లకు మీటర్లు పెట్టమని తెగేసి చెప్పిన విషయాన్ని ఘంటాపధంగా హరీష్‌రావు మరోసారి చెప్పారు. అంతే కాకుండా తన కంఠంలో ప్రాణం వుండగా మోటార్లును ఎట్టిపరిస్ధితుల్లో కూడా అనుమతించేది లేదని తేగేసిచెప్పిన సందర్భాన్ని గుర్తుచేశారు. దాంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలుగజేసుకొని, సమర్ధించుకోబోయారు. మోటర్లకు మీటర్ల అంశపై తాను పార్లమెంటరీ కమీటీ సభ్యుడినంటూ చెప్పుకున్నాడు. హరీష్‌రావును అడ్డుకునే ప్రయత్నం చేశాడు.
ఎన్నికల సమయంలో సాక్ష్యాత్తు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పిన విషయాలను హరీష్‌రావు సభ దృష్టికి తెచ్చారు.
అంతే కాకుండా తెలంగాణలోని 70లక్షల మంది రైతుల ప్రయోజనాల కోసం, 35వేల కేంద్రం అప్పు కూడా వదులుకున్నామని చెప్పడంతో ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ సభ్యులు బల్లలు చర్చడంతో అసెంబ్లీలో అధికార పక్షం అవాక్కయింది. సహజంగా పాలకపక్షం ప్రతిపక్షం మీద దాడి చేస్తున్నప్పుడు సభ్యులు బల్లలు చరుస్తుంటారు. కాని చాలా కాలం తర్వాత పాలకపక్షంమీద ప్రతిపక్షం ఎదురుదాడి చేసి, పాలకపక్షానికి మాటలు లేకుండా చేసి బల్లలు చర్చే పరిస్దితి రావడం అంటేనే ప్రతిపక్షం పైచేయి సాధించినట్లు లెక్క. అది ఈ రోజు అనేక సార్లు అసెంబ్లీలో కనిపించింది. ఎలాగైనా మధ్యలో కలుగుజేసుకొని హరీష్‌రావును ఇరుకున పెట్టాలని ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రయత్నం చేశారు. వరంగల్‌ నడిబొడ్డును వున్న జైలు కూల్చేశారంటూ, ఆసుపత్రి ఊరు అవతల నిర్మాణం చేస్తే బాగుండేదన్నారు. వెంటనే అందుకున్న హరీష్‌రావు ప్రజలకు అత్యవసర సేవలు అందాల్సిన ఆసుపత్రి ఊరవతల నిర్మాణం చేయాలని, జైలు నగరం నడిబొడ్డున వుండాలని సురేఖ చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. దాంతో మరోసారి ప్రతిపక్ష సభ్యులు బల్లలు చర్చారు. ఎలాగైనా మంత్రి హరీష్‌రావు దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్న ఆలోచనతో మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నం చేశారు. కాని ఆయన వేసిన ఎత్తును కూడా హరీష్‌రావు చిత్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో వున్న లుకలుకలు అసెంబ్లీ సాక్షిగా బైట పెట్టి, బిఆర్‌ఎస్‌ బలమైన ప్రతిపక్షమని మరోసారి రుజువు చేశారు. అధికారంలో వున్నా, ప్రతిపక్షంలోవున్నా ప్రజల కోసం నిత్యం పాటు పడేది బిఆర్‌ఎస్సేనని మరోసారి హరీష్‌రావు నిరూపించారు. పాలకపక్షం సభ్యులనుంచి కూడా తర్వాత ప్రశంసలందుకున్నారు.

కాంగ్రెస్‌కు కర్రువాతే!

https://epaper.netidhatri.com/

`రేవంత్‌ రూపంలో పాతాలానికి కాంగ్రెస్‌ పతనమే.

`రైతుల మధ్య రేవంత్‌ చిచ్చు!

`మతాల మంటలో చలికాచుకునే కుట్ర?

`హిందూ, ముస్లిం తగవుల కోసం ప్రయత్నం?

`రేవంత్‌ చెప్పేవి పచ్చి అబద్దాలు… మోసపూరిత హామీలు.

`కౌలు రైతుకు సాయం సాధ్యం కాదని తెలుసు.

`ఓట్ల కోసం రైతుల మధ్య పేచీ చీకటికోణం.

`ధరణి తొలగించి ఆంధ్రా పెట్టుబడి దారులకు మేలు చేసే ప్రయత్నం.

`హైదరాబాదు చుట్టుపక్కల ఏ ఒక్క తెలంగాణ వ్యక్తికి భూమి లేదు.

`వారి భూముల కాపలా కోసమే…

`తెలంగాణలో ఆంద్రా భూమూలు కాపాడే ఎత్తు గడ.

`తెలంగాణ లో ఏ రైతు అందుకు ఒప్పుకోడు.

`తెలంగాణలో కొత్త పంచాయతీకి రేవంత్‌ పన్నాగం.

`కాంగ్రెస్‌ వస్తే రైతు బంధుకు రాంరాం.

`కాంగ్రెస్‌ వల్ల కుటుంబాలలో చిచ్చు.

`హిందూ ఆలయాల భూములు అమ్మకం కుదరని పని.

`హిందూ,ముస్లింల మధ్య మళ్లీ దూరానికి పునాది.

`మళ్ళీ కర్ఫూల కాలానికి నాంది.

`మైనారిటీ కోసం నాలుగు వేల కోట్ల కోసం దేవాలయాల భూములే కావాలా?

`పెన్షన్‌ పెంచే ముసుగులో ఏరివేతకు పన్నాగం.

`ఆసరా పెన్షన్ల కోతకు దారి.

`దివ్యాంగుల పెన్షన్లపైనా రేవంత్‌ నజర్‌.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌కు ఇప్పటికే రెండు సార్లు కర్రు కాల్చి వాతలు పెట్టారు. మొదటిసారి తెలంగాణ ఇస్తామని ఆలస్యం చేసినందుకు పెట్టాల్సినంత వాత పెట్టారు. అయినా మారలేదు. మళ్లీ సీమాంద్రను వెంటేసుకొని వచ్చింది. సీమాంద్ర నాయకత్వం మోచేతి నీళ్లే తాగుతామని కలిసి తెలంగాణ ఆత్మగౌరవపార్టీని బిఆర్‌ఎస్‌ దించాలని కుట్ర పన్నింది. దాంతో 2018లో మళ్లీ ప్రజలు మరింత ఎర్రగా కాచ్చిన కర్రుతోనే కాల్చారు. అయినా ఇక కాంగ్రెస్‌ మారదు. మళ్లీ ఒకసారి గతం కన్నా ఎక్కువగా వాత పెడితే గాని మారేట్టులేదు. తెలంగాణ ప్రజలకు రైతుబంధు అన్నది ఏటా అందాల్సిన సమయంలో అందాలి. అందాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్నది. రైతు బంధు అన్నది గత ఐదేళ్లుగా నిరంతరం అందుతున్న పధకం. దానిని ఎన్నికలకు ముడిపెట్టాల్సిన అవసర ంలేదు. దానిని ఎన్నికల నియమావళికి ముడిపెట్టాల్సిన అంశమే కాదు. అయినా ఆ మద్య రైతు బందును అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ కుట్రపన్నింది. అప్పుడే కాంగ్రెస్‌ నిజ స్వరూపం బిఆర్‌ఎస్‌ నాయకులు బైట పెట్టారు. మంత్రి హరీష్‌రావు ఈ విషయంలో కాంగ్రెస్‌ కుటిల నీతిని ఆనాడే ఎండగట్టాడు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమీషన్‌ను విజ్ఞప్తి చేయడంతో రైతు బంధు విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. దాంతో కాంగ్రెస్‌లో ఓటమి గుబులు మొదలైంది. ఎలాగైనా రైతు బంధు ఆపాలని చూసింది. ప్రజలు ప్రభావితమౌతారని చెప్పి, ఎన్నికల కమీషన్‌కు ఉత్తరం రాసి ఆపించింది. నిజంగా ప్రజలు కాంగ్రెస్‌ను కోరుకుంటే ఎవరు ఆపినా ఆగరు. కాని ప్రజలు ప్రభావితమౌతారని వారిని కాంగ్రెస్‌ అవమానించింది. తెలంగాణ రైతాంగం ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్‌ దెబ్బతీసింది. తెలంగాణ రైతులకు రైతు బంధు పడకుండా అడ్డుకున్నది. రైతు బంధు కోసం రైతులను బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎదరుచూసేలా చేయలేదు. కాని కాంగ్రెస్‌ ఎన్నికల నిబంధనలను అడ్డుపెట్టుకొని రైతులను ఇప్పుడే మోసం చేయడం మొదలుపెట్టింది. ఒకవేళ ఇలాంటి కాంగ్రెస్‌ను నమ్మితే రైతు బందు అన్నది ఇక ఆగిపోయినట్లే. ఒక్కసారి రైతు బందు ఆగితే ఇక రావడం కష్టమే. ఎందుకంటే కాంగ్రెస్‌ పొరపాటున అధికారంలోకి వస్తే ముందు రైతు బంధునే సమీక్షిస్తుంది.

రైతు బంధు కొందరి కుదించడం కోసం కొంత కాలం ఆపేస్తుంది.

అసలు రైతు బంధు అందుకుంటున్న భూములపై సర్వేలు అంటూ మొదలుపెడుతుంది. ధరణి పేరుతో అసలుకే రైతుబంధుకు ఎసరు తెస్తుంది. కౌలురైతుల పేరుతో రైతు బంధు పథకానికే తూట్లు పొడుస్తుంది. రైతులకు 24 గంటల కరంటు అవసరం లేదు. 3 గంటలు చాలు..అని చెప్పే కాంగ్రెస్‌ ఒకవేళ అధికారంలోకి వస్తే రైతు బంధు ముందు ముందర కాళ్ల బంధం వేస్తుంది. రేపటి పంటకు ఆటంకం కల్గిస్తుంది. రైతుకు పెట్టుబడి లేకుండా చేస్తుంది. ఇలాంటి కాంగ్రెస్‌ చేసే కుట్రలు అన్నీ ఇన్నీ కావు. కాంగ్రెస్‌ పార్టీకి రైతుల మీద ఏనాడు ప్రేమ లేదు. ఇప్పుడు కొత్తగా వస్తుందన్న నమ్మకం అసలే లేదు. ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు ఆపిన కాంగ్రెస్‌పార్టీ రేపు ధరణి తొలిగించి,కొత్తగా పాస్‌బుక్‌లు మళ్లీ మంజూరుచేసి అందులో కౌలు కాలం జేర్చితే …ఇక అంతే..భూ యజమానులు..కౌలు రైతుల మధ్య చిచ్చు మొదలైట్లే. ఇప్పుడు రైతు తాను కౌలుకు ఇవ్వను. అంటే ఇంత కాలం నేను సాగు చేయలేదా? ఇప్పుడెందుకు ఇవ్వవు అనే పంచాయితీ మొదలౌతుంది. తమకు కౌలు పడకండా అడ్డుకుంటారా? మాకు భూమిని కౌలుకు ఇవ్వవా? అన్న కక్షలు పెరుతాయి. ఒకే ఊరిలో వుండే రైతులు ఒకరికొకరు శత్రువులౌతారు. ఇలా లేని పోని చిచ్చుపెట్టి రాజకీయాలు చేద్దామని రేవంత్‌ అనుకుంటున్నాడు. అంతే కాకుండా కౌలు అమలు చేయడంలో ఎవరికి రైతు బంధు, ఇవ్వాలి..ఎవరికి ఇవ్వకూడదన్నదానిపై ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా రేవంత్‌ అన్నారు. అంటే ఒక వేళ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మందు ఆపే పధకం రైతు బంధే అవుతుందని ప్రజలు గమనించాలి.

రేవంత్‌ రాజకీయం మొత్తం భూముల చుట్టే తిప్పుతున్నాడు.

రైతులను ఆగం చేయాలనుకుంటున్నాడు. ప్రశాంతంగా వున్న పల్లెల్లో చిచ్చుపెట్టే ప్రయత్నంచేస్తున్నాడు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మైనార్టీ డిక్లరేషన్‌ అమలకోసం తెలంగాణ ఆలయ భూములను విక్రయిస్తామని చెప్పడం అంటే తెలంగాణలో ప్రశాంతతను దెబ్బతీయడమే అవుతుంది. ఇప్పటి వరకు తెలంగాణలో గంగా జమున తహజీవ్‌ అలా సాగుతోంది. ఎంతో సామర్యపూర్వకమైన వాతావరణం పల్లెలో వుంది. హిందూ ముస్లిం బాయి, బాయి అనుకునేంత అందమైన వాతావరణం వుంది. దాన్ని చెడగొట్టేందుకు రేవంత్‌ కంకణం కట్టుకున్నట్లున్నాడు. ఒక సామాజిక వర్గ అభివృద్దికి ప్రభుత్వం నిధులు కేటాయించడం పరిపాటే. అందుకు బడ్జెట్‌ రూపకల్పనలో నిధులు చేర్చాల్సివుంటుంది. అది వదిలేసి మైనార్టీల డిక్లరేషన్‌ అమలు చేస్తామని, అందుకు ఆలయ భూములు విక్రయిస్తామని చెప్పడం అంత మూర్ఖత్వం ఏమైనా వుంటుందా? రేవంత్‌ చేసిన ఈ ప్రకటనను ముస్లింలు సైతం ఖండిరచారు. రెండురన్న లక్షల బడ్జెట్‌ వున్న తెలంగాణలో ముస్లిం డిక్లరేషన్‌ కోసం కేటాయిస్తామన్న రూ.4వేల కోట్లు లేకపోతాయా? అందుకు ఆలయ భూములు అమ్మాలా? అంటేనే ఇందులో ఏదో మతలబు వుంది. ప్రశాంతంగా వున్న తెలంగాణలో అలజడి రేపడం కోసమే రేవంత్‌ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే మైనార్టీలు కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దుని తీర్మానించాయి.

నిజానికి రేవంత్‌ రెడ్డి చెప్పే మాటలన్నీ అబద్దాలే..నీటి మీద రాతలే.. కౌలు రైతుకు సాయం సాధ్యం కాదని తెలుసు.
అయినా మభ్యపెట్టాలని చూస్తున్నాడు. రైతుల మద్యే చిచ్చుపెట్టాలని ప్రయత్నంచేస్తునాడు. ముస్లిం డిక్లరేషన్‌ పేరుతో హిందువులు, ముస్లిం మధ్య అగాధం పెంచాలని చూస్తున్నాడు. థరణి తొలగించి అటు రైతులకు, ఇటు కైలు రైతులకు మధ్య కొత్త పేచీకి తెరతీయాలని చూస్తున్నాడు. అంతే కాకుండా ఆంధ్రా కబ్జాదారులకు ప్రోత్సాహం కల్పించేందుకు తెరవెనకు కుట్రలకు తెరలేపుతున్నాడు. తెలంగాణ భూములను ఆంధ్రా రియల్టర్లకు,నాయకులకు అప్పగించేకుట్ర చేస్తున్నాడు. ఆంధ్రా ప్రాంతం వారి భూముల రక్షణ కోసమే ధరణి తొలగించాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆంధ్రా పెత్తందారులు కొన్న భూముల విషయంలో ఇబ్బందులు పడాల్సివస్తుంది. ఆ భూముల విషయంలో క్రయవిక్రయాలు ఇబ్బందులౌతాయి. అందుకే కౌలు రైతుల పేరు చెప్పి, ధరణిని రధ్దు చేసి, తెలంగాణ రైతులమీద ప్రేమ వున్నట్లు నటిస్తున్నాడు.
కాంగ్రెస్‌ వస్తే కొత్త పెన్షన్లు దేవుడెరుగు? వున్న పెన్షన్లు పోవడం ఖాయం.
ఎందుకంటే బిఆర్‌ఎస్‌ సానుభూతి పరులకే పెన్షన్లు అందుతున్నాయన్న ఆరోపణ చేసి, వాటిని సమీక్షిస్తామని ప్రకటించి, పెన్షన్లు ఆపేందుకు కాంగ్రెస్‌ పార్టీ వెనుకాడదు. అంతేకాకుండా తెలంగాణలో సుమారు 5లక్షలకు పైగా దివ్యాంగులకు పెన్షన్లు అందుతున్నాయి. అయితే దివ్యాంగుల విషయంలో బిఆర్‌ఎస్‌ కొంత సానుభూతితో 40శాతానికి తక్కువ వున్నా, వారికి పెన్షన్‌ అమలు చేస్తూ వస్తోంది. గతంలో దివ్యాంగులు ఎంత మొత్తుకున్నా పెన్షన్‌ ఇచ్చిన దాఖలాలు లేవు. వారి పెన్షన్‌లను కూడా సమీక్షించే అవకాశం వుందని కాంగ్రెస్‌ నేతలే అంటున్నారు. అందువల్ల కాంగ్రెస్‌ను ఆదరిస్తే, ఆదమర్చిపోయే లోపు చుక్కలు చూపించే ప్రమాదం లేకపోలేదు. రైతు బంధు ఇప్పుడే ఆపినవారు, రేపు ఆపకుండా వుంటారా? అధికారంలోకి రాకుముందే రైతులకు మూడు గంటల కరంటు చాలన్నవారు అంతకన్నా ఎక్కువ ఇస్తారా? మొత్తం మీద రైతాంగం ఆనందంగా వుండడం కాంగ్రెస్‌కు ఇష్టంలేదు. ప్రజలకు ఈ విషయం అర్ధమైంది. మరోసారి కర్రుకాల్చి వాత పెడితేగాని కాంగ్రెస్‌సక్కగ కాదు.

కాంగ్రెసోళ్లతోని కరంటిచ్చుడు కాదు! 

https://epaper.netidhatri.com/

ములుగు బిఆర్‌ఎస్‌ ఇంచార్జ్‌,ఎమ్యెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్ట రాఘవేందర్‌ రావు’’ తో ‘‘చిట్‌ చాట్‌’’

`కాంగ్రెస్‌ కావాలా? కరంటు కావాలా!

`దీపావళి రోజున బెంగుళూరు లో కరంటు లేదు.

`కాంగ్రెసోళ్లు కరంటియ్యలేరు.

`రైతులు సల్లగుంటే కాంగ్రెస్‌ ఓర్వలేదు.

`కాంగ్రెస్‌ వస్తే మోటార్లు కాలిపోవుడు.

`ట్రాన్స్‌ ఫార్మర్లు చెడిపోవుడు.

`పొలాలు ఎండిపోవుడు.

`అర్థరాత్రి కరంటిస్తే రైతుల పానాలు పోవుడు.

`పదేండ్ల కింద కొడంగల్‌ లో ఎకరం భూమి10 వేలు.

`ఇప్పుడు కొడంగల్‌ లో ఎకరం భూమి కోటి రూపాయలు.

`పక్కనే కర్నాటక లో ఎకరం ఐదు లక్షలు.

`కొడంగల్‌ లో కరంటు 24 గంటలు.

`కర్నాటక లో కరంటు 4 గంటలు.

`పదేండ్ల కింద తెలంగాణలో గోసలు.

`కర్నాటక లో ఇప్పటికీ తిప్పలు.

`తెలంగాణ లో వెలుగులు.

`రైతు మోములో కాంతులు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఊహలు వేరు..నిజం వేరు. కాంగ్రెస్‌ కనే పగటి కలలు ఎప్పటికీ నెరవేరవు. ఇదీ జనం అనుకుంటున్న మాట. కాని కాంగ్రెస్‌ పార్టీకి లేని పోని హైప్‌ క్రియేట్‌ చేస్తున్న ఆంధ్రా మీడియా ఛానళ్లలో తప్ప ప్రచారం ఎక్కడా లేదు. జనం ఏమనుకుంటున్నారో ఆ ఛానళ్లకు అక్కర్లేదు. జనం మాట అసలే అక్కర్లేదు. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ది ఆ ఛానళ్లకు కనిపించదు. కాని పల్లెల్లో ముచ్చట్లు చెబుతుంటారు. అయితే ఆంధ్రా ఛానళ్లకు కాంగ్రెస్‌ అంటే మోజు కాదు. ప్రేమ కాదు. కేవలం చంద్రబాబు కోసం…చంద్రబాబు పరపతి కోసం..చంద్రబాబు చేసిందేమైనా వుందా? అదీ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పదిహేడు సంవత్సరాలు పాలన చేసింది. కాని తెలంగాణకు నీళ్లిచ్చిందా? ఇవ్వలేదు. కరంటు ఇచ్చిందా? లేదు. 45 ఏళ్లకు పైగా కాంగ్రెస్‌ పరిపాలించింది. కాంగ్రెస్‌ ఏమైనా చేసిందా? అంటే శూన్యం. 2004లో తెలంగాణ వాదంతో ముందుకొచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వచ్చింది. తెలంగాణలో రైతులు బోర్లు వేసుకోకుండా వాల్టా చట్టం తీసుకొచ్చింది. తెలంగాణను నమ్మించి మోసం చేసింది. తెలంగాణలో రైతులు ఇష్టం వచ్చిన రీతిలో బోర్లు వేసుకుంటే భూగర్జ జలాలు పడిపోతాయాని చెప్పి, రైతులపై కేసులు నమోదు చేసింది. అంతటి దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్‌ది. తెలంగాణలో భూగర్జ జలాల మట్టం పడిపోతే పెంచేందుకు మార్గాలు అన్వేషించాల్సిన కాంగ్రెస్‌ పార్టీ రైతులు పొలాలకు నీళ్ల వినియోగంపై ఆంక్షలు పెట్టింది. బోర్లు తవ్వుకోకుండా కేసులు నమోదు చేసింది. తెలంగాణ సాగును ఆగం చేసింది. రైతులకు అర్ధరాత్రులు కరంటు ఇచ్చి, సాగంటే రైతుకు విసుగొచ్చేలా చేసింది. తెలంగాణ సాగును చిద్రం చేసింది. అసలే నీళ్లు లేక సాగు సాగని తెలంగాణలో ఎండాకాలం ఆరంభంలో అకాల వర్షాలు, గడగండ్ల చెడగొట్టు వానలతో రైతులు మరింత మునిగేవారు. నష్టపోయేవారు. అలాంటి రైతలను నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏనాడు ఆదుకున్నది లేదు. అదే సీమాంధ్రలో చినుకు పడి పైరు నేలకొరిగినా నష్టపరిహారం ఇచ్చేది. తెలంగాణ రైతులంటే అంత చిన్న చూపు చూసేది. డిసెంబర్‌ 9 2009న ప్రకటించిన తెలంగాణను కాంగ్రెస్‌ వెనక్కి తీసుకున్నది. సీమాంధ్ర అంటే ప్రేమ కాంగ్రెస్‌కు వుండేది. తెలంగాణ మొత్తానికి చిన్న నీటి పారుదల అనే శాఖను పెట్టి, రూపాయి నిధులు ఇవ్వకుండా తెలంగాణను అపహాస్యం చేసేది. అంతే కాదు తెలంగాణను ఆగం చేస్తూనే మరో వైపు సాగు దండగ అని చంద్రబాబు నాయుడు లాంటి వారు మాట్లాడి రైతుల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతీశారు…

కాంగ్రెస్‌ గాని, తెలుగుదేశం గాని అదికారంలో వున్న నాడు ఏనాడు 24 గంటల విద్యుత్‌ ఇచ్చింది లేదు. 

ఇప్పుడు ఒక వేళ ప్రజలు దయ తలిచి అధికారమిచ్చినా ఇస్తారన్న నమ్మకం లేదు. గతంలో ఏనాడు మాట వరుసకైనా కరంటు 24 గంటలు సరఫరా అయ్యింది లేదు. కాని తెలంగాణ వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ అయిన వెంటనే మూడునెలల్లో కరంటు సమస్య శాశ్వత పరిష్కారం లభించింది. రైతాంగానికి కూడా 24 గంటల కరంటు అందుతోంది. 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అక్కడ 24 గంటల కరంటు ఇవ్వలేకపోయాడు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో కరంటు కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. మరి తెలంగాణలో ఎంతటి ఎండాకాలమైనా కరంటు కోతలు అన్న పదం వినపడలేదు. రైతులకు కోత విధించలేదు. ఏనాడు ఎకరం ఎండిరది లేదు. దేశంలోనే రైతుకు సమృద్దిగానీరు, కరంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రైతులు సంతోషంగా వుండడం చంద్రబాబుకు ఇష్టం లేదు. కాంగ్రెస్‌కు అసలే ఇష్టం లేదు. రైతు సంతోషంగా వుంటే చూసి చంద్రబాబు ఓర్వలేడు. అందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చి ప్రజల చేత చీకొట్టించుకున్నాడు. అయినా చంద్రబాబు మారలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఇక నీ రాజకీయం చాలని ఏనాడో తరిమేశారు. అక్కడ స్ధానం లేకపోయే సరికి మళ్లీ తెలంగాణ మీద పడ్డాడు. 

 తెలంగాణ రాజకీయాలను కలుషితం చేసే కుట్రలకు తెరతీశాడు.

 సీమాంధ్ర మీడియాను వాడుకుంటున్నాడు. కాంగ్రెస్‌కు లేని హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాడు. సరిగ్గా గత ముందస్తు ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఇదే చేశాడు. తెలంగాణ అంటే పీకల దాకా అక్కసు వున్న ఆంద్రా ఆక్టోపస్‌ లగడపాటి రాజగోపాల్‌ గత ఎన్నికల్లో కేసిఆర్‌ పని అయిపోయిందని ప్రచారం చేశాడు. కాంగ్రెస్‌ గెలుస్తుందని ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయాలని చూశాడు. కాని ఏం జరిగింది. తెలంగాణ సమాజం మొత్తం ముఖ్యమంత్రి కేసిఆర్‌ వైపు నిలిచింది. కాంగ్రెస్‌ను , తెలుగుదేశం పార్టీలను తెలంగాణ తరిమేసింది. ఇప్పుడు సరిగ్గా అదే జరగబోతోంది. బిఆర్‌ఎస్‌ మళ్లీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాబోతోంది. తెలంగాణను అణిచి వేసి, తెలంగాణ చైతన్యాన్ని హేళన చేసిన చంద్రబాబును తెలంగాణ సమజం ఏనాడు నమ్మదు. చంద్రబాబు సాయం తీసుకుంటున్న రేవంత్‌ రెడ్డిని అసలే తెలంగాణ ప్రజలు నమ్మరు. రేవంత్‌రెడ్డి ఎప్పుడైతే చంద్రబాబు ముసుగు తొడుక్కున్నాడో అప్పటి నుంచే ఆయన పతనం మొదలైంది. తెలంగాణ సమాజం చీ కొట్టింది. తెలంగాణ వాదులు వుండే కొడంగల్‌లో ఓడిరచారు. సీమాంధ్రుల ప్రభావం వుండే చోట గెలిచి, ఇప్పుడు అదే రాజకీయం చేయాలని రేవంత్‌ చూస్తున్నాడు. 

పదేళ్ల క్రితం కొడంగల్‌లో ఎకరం భూమి కనీసం పది వేలు కూడా పలకేది కాదు. 

కాని నేడు కొడంగల్‌ నియోజకవర్గంలో ఎకరం కోటి రూపాయలు ధర పలుకుతోంది. ఇరవై నాలుగు గంట కరంటు వస్తోంది.. సాగుకు అవసరమైన నీరు అందుతోంది. ఒకనాడు ఎడారి లాంటి కొడంగల్‌ నేడు నీటితో కళకళలాడుతోంది. ఎక్కడ చూసినా కొడంగల్‌ పచ్చగా మారింది. మరి ఆ పక్కనే వున్న కర్నాటక భూములు ఎండిపోతున్నాయి. అక్కడ కరంటు లేక పంటలు ఎండిపోతున్నాయి. నీళ్లు లేక కర్నాటక భూములు బీళ్లు వారుతున్నాయి. కొడంగల్‌ బాగు పడడం రేవంత్‌కు ఇష్టం లేదు. చంద్రబాబుకు అసలే ఇష్టం లేదు. అందుకే మళ్లీ దొంగలంతా కలిసి వచ్చారు. తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్నారు. నిజం చెప్పాలంటే కరంటు ఇచ్చుడు కాంగ్రెస్‌ వాళ్ల వల్ల కాదు. చంద్రబాబు వల్ల అసలే కాదు. కాలేదు. అందుకే బిఆర్‌ఎస్‌ పార్టీ కరంటు కావాలో..కాంగ్రెస్‌ కావాలో తేల్చుకోమని ప్రజలను కోరితే మాకు కేసిఆరే కావాలి అంటున్నారు. దీపావళి రోజున కర్నాకటలో కరంటు లేదు. బెంగుళూరు చీకట్లో దీపావళి చేసుకున్నది. కాంగ్రెస్‌ కరంటు ఇయ్యలేదని తేలిపోయింది. అసలు తెలంగాణలో ఎన్ని గంటల కరంటు వస్తుందో కర్నాటక రాష్ట్ర నేతలకు తెలిస్తే బాగుండేది. తెలంగాణకు వచ్చి రైతులకు 5 గంటల కరంటు ఇస్తున్నామని చెబుతుంటే, తెలంగాణ రైతులు నవ్వుకున్నారు. కాంగ్రెస్‌నేతల తెలివిని చూసి తిట్టుకున్నారు. కాంగ్రెస్‌ పాలన చూసిన తెలంగాణ ప్రజలకు గుర్తుకువస్తే ఆ పార్టీకి ఓటు కూడా వేయరు. అర్ధరాత్రిళ్లు కరంటు ఇచ్చి, రైతులన అరిగోస పెట్టిన కాంగ్రెస్‌కు తెలంగాణలో చోటు లేదు. ఆదరణ అసలే లేదు. పైకి కనిపిస్తున్న ్పప్రచారమంతా హంబక్‌…ఆంద్రా మీడియా సృష్టిస్తున్న కృత్రిమ హైప్‌…అంతే!

గెలుపు కారుదే! జనం కారు వెంటే.

https://epaper.netidhatri.com/

గులాబీ పరిమళం గుభాలింపే

సారు సర్కారు కావాల్సిందే.

ముచ్చటగా మూడోసారి సిఎం అవుతున్నారంతే.

రైతులంతా కేసిఆర్‌ వైపే.

పింఛన్‌ దారులకు కేసిఆర్‌ పెద్దకొడుకే

అన్ని వర్గాలు కోరుకుంటోంది కేసిఆర్‌ నే.

కోరికోరి కష్టాలు తెచ్చుకోలేమంతే…

కాంగ్రెస్‌ కు పాలన చేత కాదు.

కొట్లాటలకే కాలం సరిపోదంతే.

జనం నాడీ ఇది…కేసిఆర్‌కు జై కొడుతుంది.

సర్వేలన్ని చెబుతున్నది ఇదే…

తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బిఆర్‌ఎస్‌ పార్టీయే అధికారంలోకి వస్తుందని తెలుస్తోంది. తెలంగాణలోని ఎవరిని కదలించినా ఇదే మాట..తెలంగాణలో ఎన్నికలపై డిప్యాక్‌. నేటిధాత్రితో సహా కనీసం ఓ యాభై సర్వేలు జరిగి వుంటాయి. వాటన్నింటిలో వచ్చింది..జనం చెప్పింది ఒకటే మాట. ఈసారి కూడా అధికారం బిఆర్‌ఎస్‌దే. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వం మీద ప్రజలకు అపారమైన నమ్మకం వుంది. తెలంగాణ కోసం కొట్లాడి సాధించిన నాయకుడు కేసిఆర్‌కు వున్న చిత్తశుద్ది తెలంగాణ మీద ఎవరికీ వుండదన్నది ప్రజలు చెబుతున్న మాట. తెలంగాణ పల్లెల్లో ఏ వ్యక్తిని కదిలించినా చెప్పే మాట ఒకటే పదేళ్ల కింద తెలంగాణ ఎలావుంది? ఇప్పుడు ఎలా వుంది? హైదరాబాద్‌ లాంటి నగరంలో పదేళ్ల క్రితం ఎలా వుంది? ఇప్పుడు ఎలా వుంది? పాత బస్తీలోకూడా ఇదే మాట! పదేళ్ల క్రితం ఎప్పుడూ కర్ఫ్యూ తప్ప, ప్రగతిని చూసింది లేదు. విన్నది లేదని ప్రజలే చెబుతున్నారు. అంతే కాదు బిజేపి మత రాజకీయాలు, కాంగ్రెస్‌ కుటిల రాజకీయాలు చూసిన మైనార్టీ ప్రజలు తమను గౌరవిస్తున్న ఏకైక పార్టీ బిఆర్‌ఎస్‌ అంటున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ వల్ల ఎంతో సంతోషంగా బతుకుతున్నామంటున్నారు. గతంలో ఎక్కడ ఏ అలజడి జరిగినా ముస్లిం మైనార్టీలు బిక్కు బిక్కు మంటూ బతకాల్సివచ్చేది. కాని పదేళ్లుగా కర్ప్యూ వాతావరణం లేని పాతబస్తీలో ప్రశాంతతో బతుకుతున్నామంటున్నారు. ఇంతకన్నా ప్రజలు ఏం కోరుకుంటారు. ఇక పల్లె విషయానికి వస్తే ఒకనాడు పల్లె ఎలా వుందో గుర్తు చేసుకుంటే గుండె ఆవిరౌతుంది. అంతటి కష్టం రైతులు ఎదుర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో బోర్ల రాంరెడ్డి అనే వ్యక్తి వ్యవసాయం మీద వున్న మక్కువతో రైతుగానే బతకాలన్న కోరితో 100 బోర్లు వేసి వ్యవసాయం చేశాడు. కాని చుక్కనీరు రాకపోతే కన్నీటి సాగు చేశాడు. అటువంటి తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లే..కన్నీళ్లకు తావులేని ఊళ్లే…రైతు మోములో సంతోషమే…ఇదంతా కాంగ్రెస్‌ వల్ల సాద్యమయ్యేదా? అసలు కేసిఆర్‌ లేకుంటే తెలంగాణ ఉద్యమం జరిగేదా? ఇంకా వందేళ్లయినా తెలంగాణ రాకపోయేది. కాంగ్రెస్‌ ఇవ్వకపోయేది. తెలంగాణ బాగుపడకపోయేది. ఎడారిగా మారిన తెలంగాణ తప్ప, సస్యశ్యమల తెలంగాణ కనిపించేది కాదు.  

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీక ముఖ్యమంత్రి కేసిఆర్‌. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే తెలంగాణ కష్టం కరంటుతో తీరుతుందన గుర్తించారు. తెలంగాణ రైతాంగానికి ముఖ్యంగా సాగు కావాల్సింది కరంటు. ఆ కరంటు కష్టాలే తెలంగాణ రైతును చిద్రం చేశాయి. తెలంగాన సాగును చిన్నాభిన్నం చేశాయి. సీమాంధ్ర పాలకుల దాష్టికానికి తెలంగాణ చెరువులు ఆగమయ్యాయి. వారి నిర్లక్ష్యానికి చెరువులు మామయ్యాయి. మొత్తంగా తెలంగాణ సాగును, రైతును చెరపట్టించారు. అలాంటి కాలం నుంచి బంగారు తెలంగాణ సాధ్యమైందంటే కారణం ముఖ్యమంత్రి కేసిఆర్‌ అన్న భావన ప్రతి తెలంగాణ వ్యక్తిలోనూ వుంది. ఎందుకుంటే ఒకనాడు తెలంగాణలోని ఏ పల్లెకు వెళ్లి బాట లేదు. బాట పక్కన ఒక్క చెట్టు లేదు. చుట్టూ బీడు భూములు. పల్లెర్లు మెలిచిన పొలాలు. ఎటు చూసినా చుక్క నీరు లేదు. బాట సారులకు కూడా మంచినీటికి దిక్కులేదు. కాని ఇప్పుడు దారి మధ్యలో కనిపించే చెరువులన్నీ నిండుగా వుంటున్నాయి. చెరువులు నింపే కాలువలు ఎప్పుడూ నీటితో కళకళలాడుతున్నాయి. రోడ్డు కిరువైపులా పచ్చని పొలాలు, పాడి పంటలు దర్శమిస్తున్నాయి. బాటసారుల దాహర్తిని కూడా బోర్లు తీరుస్తున్నాయి. ఇరవై నాలుగు గంట కరంటుతో ఎటు చూసిన బోర్లనుంచి గంగమ్మ దుంకుతోంది. బంగారు పంటలు పండుతున్నాయి. ఇంతకాన్న సంతోషం ఏముంటుంది? ఇంతకన్నా ఆనందం ఏముంటుంది. సరిగ్గా పదేళ్ల క్రితం రైతు మీద కనికరంలో చినుకు చుక్క ఆకాశం నుంచి జారినా పెట్టుబడి లేక సాగు వదిలేసుకునేవారు. ఒక వేళ ధైర్యం చేసి అప్పు చేసి, సాగు మొదలుపెట్టినా సరైన సమయానికి చినుకు మొహం చాటేస్తే మొలకెత్తని విత్తనాలు పురుగుల పాలౌతుంటే చూసి రైతు వలవల ఏడ్చిన సందర్భాలే ఎక్కువ. విత్తిన నాడు చినుకు కురిసినా మొక్క భూమిని చీల్చుకొని బైటకు వచ్చినా తర్వాత చినుకు జాడ లేకున్నా రైతు పరిస్ధితి ఆగమ్య గోచరమే…ఇలా అడుగడుగు కష్టమే..దిన దిన గండంగా సాగు సాగించిన రైతు కడుపు నిండా ఏనాడు తిన్నది లేదు. కంటినిండా నిద్ర తీసింది లేదు. కడుపారా నవ్వింది లేదు. గుక్కెడు నీటితో దాహం తీర్చుకున్నది. ఎటు చూసినా అప్పుడు..ఆర్తనాదాలు..ఆకలి కేకలు…వేధింపులు…కష్టాలు ఒకదాని వెంటఒకటి పడి తరిమేస్తుంటే ముళ్లె సదురుకొని రాత్రికి రాత్రి దొంగల్లా ఊరు వదిలి వెళ్లిపోయిన రైతులు ఎంతో మంది. కాని ఆనాడు ఊరు విడిచి, ఇల్లు విడిచి వెళ్లిన వాళ్లంతా మళ్లీ తెలంగాణకు వచ్చారు. దర్జాగా వ్యవసాయం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధుతో సాగువాటు సాగిస్తున్నారు. చినుకు కోసం ఎదరుచూడాల్సిన పని లేదు. కాలమౌతుందా? అన్న దిగులు లేదు. ఒక పంట చేతికి రాగానే మరో పంట..ఇలా మొదలుపెడుతున్నాడు. ఏడాదికి ఒక్కొ రైతు మూడు పంటలు కూడా తీస్తున్నాడు. ఇదీ కదా తెలంగాణ…

అందుకే తెలంగాణలో ఈసారి కూడ కారే గెలవాలని, కారునే గెలిపించుకుంటామని ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు. తెలంగాణ వచ్చిన తార్వత కనిపిస్తున్న అభివృద్దిని కొనియాడని వారు లేరు. తెలంగాణ ఎంతో అభివృద్ది చెందినా,ఇంకా కొంత జరగాల్సి వుంది. అభివృద్ది అనేది నిరంతర ప్రక్రియ. అది కేసిఆర్‌ వల్లనే సాద్యమౌతుందని తెలంగాణ ప్రజల ప్రగాఢ విశ్వాసం. తెలంగాణ ప్రజలు బిజేపి, కాంగ్రెస్‌ను నమ్మేందుకు సిద్దంగా లేరు. తాజాగా జరిగిన కర్నాకట ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం చేస్తున్నదేమిటో ఆ మంత్రులే వచ్చి చెబితే, తెలంగాణ ప్రజలు చీ కొడుతున్నారు. తెలంగాణలో 24గంటల కరంటు ఇస్తుంటే, కర్నాకటలో 5 గంటలే ఇస్తున్నామని చెప్పి, కాంగ్రెస్‌ ఓట్లు అడగాన్ని ప్రజలు చీ కొడుతున్నారు. ఇటీవల పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కూడా తెలంగాణ ప్రభుత్వ పరపతిని పెంచాయనే చెప్పాలి. రోజుకు ఇరవై నాలుగు గంటల కరంటు రైతులకు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎందుకు ఇస్తుందన్నది కూడా కాంగ్రెస్‌ నాయకులు అవగాహన లేదు. తెలంగాణలో సుమారు 30లక్షలకు పైగా వ్యవసాయ పంపుసెట్లు వున్నాయి. కరంటు రాగానే ఒకే సారి అన్ని పంపు సెట్లు ఏక కాలంలో మోటార్లు మొదలైతే కరంటు ట్రిప్‌ అవుతుంది. పదే పదే కరంటు పోతుంది. నాణ్యమైన కరంటు రైతులకు అందదు. దాని ద్వారా మోటార్లు కాలిపోవడం వంటివి జరుగుతాయి. దాంతో రైతుల మీద అదనపు బారం పడుతుంది. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో కరంటు కష్టాలతో అష్టకష్టాలు పడిన రైతులు ఇంకా కష్టాల పాలు కావొద్దు. ఖర్చుల పాలు కావొద్దు. నాణ్యమైన విద్యుత్‌తో తిప్పలు లేని సాగు చేసుకోవాలి. మోటర్‌ కాలిపోతే దాన్ని బైటకు తీసి, రిపేర్‌కు పంపించి, తిరిగి తెచ్చుకోవడానికి రెండు రోజులు పడుతుంది. రెండు రోజులు నీళ్లు లేకపోతే పొలం ఎండిపోతుంది. తర్వాత నీళ్లు అందనా కష్టమౌతుంది. అదే 24 గంటల కరంటు ఇస్తే, రైతులంతా ఒకేసారి విద్యుత్‌ వినియోగించుకోరు. ఎవరికి ఎప్పుడు వీలైతే అప్పుడు మోటార్లు ఆన్‌ చేసుకుంటారు. పొలం పారించుకుంటారు. ఇదీ అసలు కధ. ఈ సంగతి ఒక్క కాంగ్రెస్‌ నాయకుడికి కూడా తెలియకపోవడం విడ్డూరం. ఒకవేళ తెలిసినా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఖండిరచకపోవం అన్యాయం. ఇలాంటి కాంగ్రెస్‌ నాయకులను నమ్మి తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని వారి చేతుల్లో పెట్టేందుకు ఏ ఒక్కరూ సిద్దంగా లేదు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసేందుకు సుముఖంగా లేరు.

బిఆర్‌ఎస్‌ కే జై కొట్టిన తెలంగాణ.

https://epaper.netidhatri.com/

` మూడోసారి బిఆర్‌ఎస్‌ అధికారం ఖాయం.

` దక్షిణాదిన హాట్రిక్‌ సిఎం. కేసిఆర్‌.

` బిఆర్‌ఎస్‌ కు 70-74.

` కాంగ్రెస్‌ కు 37-38

`బీజేపీ 3-1

`మజ్లీస్‌ కు 7-6

` ఇతరులు 0-1

` డి.ప్యాక్‌, నేటిధాత్రి సంయుక్త సర్వేలో వెల్లడి.

`కర్ణాటక ఎన్నికలలో కచ్చితమైన లెక్క చెప్పింది డి. ప్యాక్‌ మాత్రమే.

` మహారాష్ట్ర, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌,ఎన్నికలలో కూడా డి.ప్యాక్‌ సర్వేనే నిజమైంది.

`మునుగోడు లో మెజారిటీతో సహా చెప్పింది డి.ప్యాకే.

` రైతులంతా బిఆర్‌ఎస్‌ వైపే.

`కాంగ్రెస్‌ ను రైతులు నమ్మడం లేదు.

`మార్పు కోరుకోవాలని ప్రజలు అనుకోవడం లేదు.

`బిఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలపైనే జనం ఆసక్తి.

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ పరిపాలన మీద మెజారిటీ ప్రజల సంతృప్తి.

` సోషల్‌ మీడియా లో కనిపించేదంతా హంబక్‌…

`పార్టీలు తయారు చేస్తున్న బోగస్‌ వీడియోలు.

`కాంగ్రెస్‌, బిజేపి రెండు, మూడు స్థానాల కోసం కొట్లాట.

హైదరబాద్‌,నేటిధాత్రి :

తెలంగాణ మళ్లీ బిఆర్‌ఎస్‌కే జై కొడుతోంది. ముచ్చటగా మూడోసారి బిఆర్‌ఎస్సే అధికారంలోకి రాబోతోంది. దక్షిణాదిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. మూడోసారి వరుసగా ముఖ్యమంత్రి అయిన వారు దక్షిణాదిలోనే లేరు. తొలిసారి కేసిఆర్‌ వరుసగా మూడోసారి పార్టీని అధికారంలోకి తేనున్నారు. హాట్రిక్‌ సిఎంగా కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టనున్నారు. గత ఎన్నికల్లో ముందస్తుకు వెళ్లి విజయం సాధించారు. అంతకు ముందు దేశంలోనే ఏ నాయకుడు ముందస్తుకు వెళ్లి పార్టీని గెలిపించుకున్న సందర్భం లేదు. అది కేంద్రమైనా, రాష్ట్రమైనా ముందస్తు ఎవరికీ కలిసిరాలేదు. కాని ఒక్క కేసిఆర్‌కు మాత్రమే ముందస్తు కలిసొచ్చింది. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్ర్రంలో ఎన్టీఆర్‌, చంద్రబాబులు ప్రయోగాలు చేశారు. ఓడిపోయారు. తమిళనాడులో జయలలిత ప్రయోగం చేసింది. కాని ఓడపోయింది. కేంద్రంలో వాజ్‌పాయ్‌ కూడా ముందస్తు ప్రయోగం చేశారు. కుదరలేదు. కాని వారికి ఎవరికీ సాధ్యపడని విజయం కేసిఆర్‌ సొంతమైంది. ముందస్తుకు కొత్త చరిత్ర లిఖించారు. ఇప్పుడు మూడోసారి వరుసగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మరో చరిత్ర సృష్టించనున్నారు. తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో మూడోసారి కేసిఆరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అన్నం ఉడికిందా? లేదా? అన్నంత సులువు కాదు. ప్రజాభిప్రాయ సేకరణ. ఇటీవల చాలా సర్వే సంస్ధలు తూతూ మంత్రంగా వివరాలు వెల్లడిస్తున్నాయి. జనం నాడి తెలుసుకోవాలంటే రాత్రికి రాత్రి అయ్యేది కాదు. జనం తమ అభిప్రాయాలను అంత సులువుగా చెప్పరు. కొన్ని యూటూబ్‌ ఛానళ్లు తమ సొంత మనుషులతో చేయించే వీడియోల ద్వారా అధికార పార్టీకి వ్యతిరేక ప్రచారం చేయడం కోసం విడుదల చేస్తున్న సర్వే ఫలితాలు ఒక హంబక్‌. సర్వే సంస్ధలకు గతం తాలూకు అనుభవాలు కూడా కావాలి. నాటి ఫలితాలు కూడా ఇప్పుడు పోల్చుకోవాలి. గతంలో ఎంత కరక్టుగా ఫలితాలు వెల్లడిరచాయన్నది కూడా ఎంతో ముఖ్యం. అంతేకాని ప్రజలను ప్రభావితం చేస్తున్నట్లుగా సర్వే సంస్థలు తమ ఇష్టాను సారం వివరాలు వెల్లడిరచడం వల్ల ప్రజలు మారుతారనుకోవడం కూడా సరైంది కాదు. ప్రజలపై ఎవరి ప్రభావం వుండదు. వారి నిర్ణయాన్ని ఎవరూ ప్రభావితం చేయలేరు. వారి నిర్ణయం తెలుసుకోవడం కూడా కష్టం. అంతే! సర్వేలంటే రాత్రికి రాత్రి రాసేసే వివరాలు కాదు. తెలంగాణ ప్రజల మనోభావాలు తెలిసిన వారు ఎవరూ కాంగ్రెస్‌ వైపు ప్రజలు చూస్తున్నారన్న లెక్కలు చెప్పలేరు. ఎందుకంటే తెలంగాణ మొత్తం బిఆర్‌ఎస్‌కే జైకొడుతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనే మళ్లీ, మళ్లీ కోరుకుంటోంది. తెలంగాణ ఈ రోజు వచ్చిందటే అందుకు కారణం కేసిఆర్‌. తెచ్చిన తెలంగాణను సస్యశ్యామలం చేసింది కేసిఆర్‌. రైతు బంధు ఇచ్చి పేద రైతులను ఆదుకున్నది కేసిఆర్‌. ఇరవై నాలుగు గంటల ఉచిత కరంటు ఇచ్చి రైతులకు అండగా వున్నది కేసిఆర్‌. రూ.200లున్న పించన్‌ను, రూ.2000 చేసి, కుటంబ పెద్దలకు భరోసా ఇచ్చింది కేసిఆర్‌. ఇలా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసింది కేసిఆర్‌. ఇదీ తెలంగాణ క్షేత్రస్ధాయిలో జనం చెప్పే మాట. తెలంగాణ ప్రజలు కేసిఆర్‌ ఎందుకు కోరుకుంటున్నారో తెలియజేసే అంశాలు. అయితే కాంగ్రెస్‌పార్టీకి గత ఎన్నికల కన్నా కొన్ని సీట్లు పెరిగే ఛాన్సు వుంది. గత ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనుకున్నన్ని సీట్లు సాధించలేకపోయింది. కాని ఈసారి బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ అవతరించే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని సీట్లు పెరిగే సూచనలు, అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. కొన్ని సీట్లలో కాంగ్రెస్‌ బలంగా వుండడం కూడా గమనార్హం. అయినా బిఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఖాయం.

డిప్యాక్‌ ముంబైకి చెందిన సర్వే సంస్ధ. డిప్యాక్‌తో కలిసి నేటిధాత్రి కొన్ని నెలలుగా తెలంగాణలో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది.
సర్వేను ఎంతో పడ్భందీగా నిర్వహించి, తెలంగాణ ప్రజల మనోగతాన్ని ఆవిష్కరిస్తోంది. ఈసారి ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు పూర్తి మెజార్టీ రావడం ఖాయం. బిఆర్‌ఎస్‌కు కచ్చితంగా 70 నుంచి 74 సీట్లు వచ్చే అవకాశం వుంది. కాంగ్రెస్‌కు 37 నుంచి 38 సీట్లకే పరిమితం కానున్నది. బిజేపి 1 నుంచి 3 సీట్లు సాధించే అవకాశం వుంది. ఎంఐఎం. 6 నుంచి 7 సీట్లు గెల్చుకోవచ్చు. ఇతరులకు సీట్లు వచ్చినా అవి కాంగ్రెస్‌ సీట్లు తగ్గొచ్చు. ఇది డిప్యాక్‌ , నేటి ధాత్రి సంయుక్త సర్వే లెక్క. ఇప్పటి వరకు డిప్యాక్‌, నేటిధాత్రి లెక్క ఎప్పుడూ తప్పలేదు. గత ఐదేళ్లుగా డిప్యాక్‌. నేటిధాత్రి సర్వేలు నిజమయ్యాయి. మహరాష్ట్ర ఎన్నికల్లో డిప్యాక్‌ సర్వే ఫలితాలే నిజమయ్యాయి. గుజరాత్‌ ఎన్నికల్లో మళ్లీ బిజేపి వస్తుందని గతం కంటే మెజార్టీ పెగుతుందని లెక్కలతో సహా డిప్యాక్‌ చెప్పింది. అదే రుజువైంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ గెలుస్తుందిన డిప్యాక్‌ చెప్పింది. అదే వాస్తవమైంది. ఆ మధ్య జరిగిన కర్నాటక ఎన్నికల్లో నెల రోజుల మందే కర్నాకట ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని చెప్పడమే కాదు ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్న వివరాలు ముందే చెప్పింది. కర్నాటక పలితాలు కాంగ్రెస్‌, బిజేపి, జేడిఎస్‌లకు డిప్యాక్‌. నేటిధాత్రి చెప్పిన సంఖ్యనే వచ్చింది. ఒక్కసీటు కూడా అటూ, ఇటు కాలేదు. అంతలా ప్రజల నాడిని పట్టుకొని చెప్పిన సంస్ధ డిప్యాక్‌. కర్నాటక ఎన్నికల్లో మళ్లీ బిజేపియే అంటూ చాలా సర్వేలు చెప్పాయి. కాంగ్రెస్‌కు తక్కువ మెజార్టీ వస్తుందని కొన్ని చెప్పాయి. కాని డి. ప్యాక్‌ మాత్రం కాంగ్రెస్‌కు 135 సీట్లు వస్తాయని చెప్పింది. సరిగ్గా అదే సంఖ్య వచ్చింది. అలా నిబద్దతకు మారుపేరుగా డిప్యాక్‌ సర్వే సంస్థ పనిచేస్తుంది. ఇక మునుగోడు విషయంలో కూడా బిఆర్‌ఎస్‌ గెలుస్తుందని, మెజార్టీతో సహా చెప్పిన ఏకైక సర్వే సంస్ధ డిప్యాక్‌. మునుగోడులో రాజగోపాల్‌ రెడ్డి ఓడిపోవడం ఖాయమని చెప్పడం జరిగింది. మునుగోడులో బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ఖచ్చితంగా 10వేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని చెప్పడం జరిగింది. ఇలా నేటిధాత్రి, డిప్యాక్‌ల సర్వేలు సంచలనం సృష్టించాయి. ఈసారి తెలంగాణలో మళ్లీ బిఆర్‌ఎస్‌కే ప్రజలు పట్టం కట్టనున్నారు.
తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న పాలన సంక్షేమ పాలన.
అది కేవలం ముఖ్యమంత్రి కేసిఆర్‌తోనే సాధ్యమౌతుందని మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు. కాంగ్రెస్‌ రూపంలో వస్తున్న చంద్రబాబు గురించి కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి వల్ల కాంగ్రెస్‌ పెరిగిందమీ లేదన్నది కూడా తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి ఎవరు? అన్న ప్రశ్నకు గ్రామీణ ప్రాంతాలలో సమాధానం లేదు. స్వయంగా ఒక దశలో రేవంత్‌రెడ్డి నేనెరో తెలుసా? అంటే తెలియదని ఆయనతోనే ప్రజలు చెప్పారు. అంటే రాజకీయాల్లో పైకి కనిపించినంతగా నాయకులు ప్రజలకు తెలియాలన్నది కూడా ఏమీ లేదు. కాంగ్రెస్‌లో పెద్ద నాయకులు ఎవరు? అని ప్రజలు నుంచి సమాధానం తెలుసుకోవాలనుకుంటే వారి నుంచి ఏమో? అన్న సమాధానాలే వినిపించాయి. బిజేపి విషయంలో కూడా అదే విధమైన స్పందన కనిపించింది. ఇతర ప్రతిపక్షాల విషయంలో ప్రజలకు కనీసం చాలా మంది నేతల పేర్లు కూడా తెలియకపోవడం విశేషం. రోజూ సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేసే నాయకుల గురించి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కనీస అవగాహన లేదు. అంటే వాళ్లు కూడా జనంలోకి వెళ్లలేదన్నది స్పష్టమౌతోంది. బిఆర్‌ఎస్‌ విషయంలోనే ప్రజలు ఒక సిర్ధనిర్ణయంతో వున్నారన్నది మాత్రం స్పష్టమౌతోంది. కాంగ్రెస్‌,బిజేపిలను కేవలం పట్టణ ప్రాంతాల ప్రజలు ఆదరించేలా కనిపిస్తోంది. అయినా అక్కడ కూడా గెలిచేంతగా ప్రజల్లో వారి స్ధానం కనిపించలేదు. పట్టణ ప్రాంతాలలో చిరు వ్యాపారులనుంచి మొదలుపెద్ద పెద్ద వ్యాపార సంస్ధలకు కూడా కరంటు ఎంతో అవసరం. కాంగ్రెస్‌ వస్తే కరంటు కోతలు మొదలైతే అప్పుడు లబోదిబో అనడం కన్నా, ఇరవై నాలుగు గంటల కరంటు ఇస్తున్న కేసిఆర్‌ను దూరం చేసుకోవడం ఎందుకు? అన్న మాటలే వినిపించాయి. రైతుల సంగతి సరేసరి. వాళ్లు ముఖ్యమంత్రికేసిఆర్‌ తప్ప మరెవరినీ అంగీకరించే పరిస్ధితి లేదు. సాగు విషయంలో, కరంటు విషయంలో , పెన్షన్ల విషయంలో బిఆర్‌ఎస్‌కు తిరుగులేదు. కాని యువతలో కొంత అసహనం మాత్రం కనిపించింది. అది బిఆర్‌ఎస్‌కు కొద్ది పాటి మైనస్‌ కావొచ్చు. అందుకే కొన్ని సీట్లు తగ్గొచ్చు. 2018లో మెజార్టీలలో కోత పడొచ్చు. కాని బిఆర్‌ఎస్‌ విజయానికి ఢోకా లేదు.

సిరుల సింగారం..అభివృద్ధి బంగారం.

https://epaper.netidhatri.com/

`సిద్దిపేట ప్రగతి ఒక అధ్బుతం.

`హరీష్‌ నాయకత్వం ఒక వరం.

`ప్రతి ఇంటికీ అందిన సంక్షేమం.

`అవార్డులలో దేశంలోనే సిద్దిపేట మేటి.

`అభివృద్ధి లో సిద్దిపేట కు లేదు సాటి.

`ప్రగతికి సిద్దిపేట ప్రయోగశాల.

`సమాజాభివృద్దికి ఒక పాఠశాల.

`నాడు సిద్దిపేట అభివృద్ధి కలలు.

`ఆ కలలు నేడు నిజాలు.

`కళ్ల ముందు ఆవిష్కరణలు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ALSO READ: https://netidhatri.com/sirisilla-sirulu-ktrs-hard-work-is-a-blessinggiven-employment-to-handloom-workers/

ఊరును పాల వెల్లి చేశాడు. సిద్దిపేటను సిరుల పేట చేశాడు. చెరువును కల్పవల్లి చేశాడు. మిషన్‌ కాకతీయతో తెలంగాణ బంగారు పంటల మయం చేశాడు. తెలంగాణ తల రాత మార్చడు. ఆరోగ్య మంత్రిగా అందిరికీ వైద్యం అందేందుకు వైద్య యజ్ఞం సాగిస్తున్నాడు. సిద్దిపేటకు వైద్య కళాశాల తెచ్చాడు. ఆర్ధిక మంత్రిగా రాష్ట్ర ప్రగతిని నిర్ధేశిస్తున్నాడు. సిద్దిపేట ప్రజల జీవితాలలో నింపిన నాయకుడు మంత్రి హరీష్‌రావు. సిద్దిపేటను అభివృద్ది పథంలో నిలిపాడు. ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడు సిద్దిపేట ఎలా వుండేది. ఇప్పుడు ఎలా వుంది. నిజానికి ముఖ్యమంత్రి కేసిఆర్‌ సిద్దిపేట ఎమ్మెల్యే అయినప్పటినుంచే సిద్ధిపేట అభివృద్దికి బాటలు వేస్తూ వచ్చారు. అయినా ఉమ్మడి పాలకులు పూర్తిగా సహకరించలేదు. తర్వాత తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మంత్రి హరీష్‌రావు ఎమ్మెల్యేగా వున్నారు. నాటి పాలకులు అభివృద్దికి సహకరించకపోయినా శ్రమదానంతో సిద్దిపేటను అభివృద్ది చేసిన స్పూర్తి దాత హరీష్‌రావు. ప్రజలంటే అటు ముఖ్యమంత్రి కేసిఆర్‌కు, ఇటు మంత్రి హరీష్‌రావుకు ఎనలేని ప్రేమ. సిద్దిపేట అంటే ఎనలేని మమకారం. వారి కృషివల్లనే నేడు ఒకప్పటి సిద్దిపేట పట్టణం, నగరంగా మారిపోయింది. ఒకప్పుడు సిద్దిపేటకు గాని, పరిసర ప్రాంతాలకు గాని ఇతర జిల్లానుంచి ఆడపిల్లను ఇవ్వాలంటే భయపడేవారు. అంతటి భయంకరమైన కరువు పరిస్ధితులు వుండేవి. కనీసం తాగేందుకు కూడా మంచినీళ్లు సరిపడేలా వుండేవి కాదు. ఇక పల్లెలో ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని మైళ్ల దూరం వెళ్లి, బావుల దగ్గర నీళ్లు తెచ్చుకునేవారు. దాంతో ఆడబిడ్డల కష్టం చూడలేక చలించిన కేసిఆర్‌ అప్పటి ప్రభుత్వంతో కొట్లాడి సిద్దిపేటకు మంచినీళ్లు తెచ్చాడు. అయినా పల్లెలకు నీటి గోస తప్పలేదు. సాగు నీరు లేక రైతులు విలవిలాడుతుంటే కన్నీళ్లు పెట్టుకున్న కేసిఆర్‌ తెలంగాణ వస్తేగాని బతుకులు బాగుపడవని తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారు. ఆ అడుగులో అడుగు వేసుకుంటూ కేసిఆర్‌తో మొదట నడిచింది హరీష్‌రావు.
అభివృద్ది మా జన్మ హక్కు…తెలంగాణ మా ప్రాంత హక్కు.అంటూ హరీష్‌రావు తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించారు.
ఉమ్మడి రాష్ట్ర పాలకులు సహకరించకపోయినా శ్రమదానంతో ఆనాడే ఎన్నో చెరువులు బాగు చేయించారు. అనేక చెరువుల్లో పూడికలు తీసి, రైతులకు అండగా నిలిచారు. ఎండా కాలంలో పశుగ్రాసం లేక మూగ జీవాలు మలమల మాడిపోతుంటే రైతుల కన్నీళ్లు పెట్టుకునేవారు. మూగ జీవాలకు సరైన గడ్డి లేక, తాగేందుకు నీరుకూడా లేకపోయేది. ఆసమయంలో ఆంధ్రా నుంచి పశుగ్రాసం తెప్పించి, ఉచితంగా రైతులకు అందజేసిన మానవతా మూర్తి హరీష్‌రావు. ఇలా తన మానవత్వాన్ని పదర్శిస్తూ, ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న నాయకుడు హరీష్‌రావు. తెలంగాణ సాధించుకున్నాక సిద్దిపేటకు సోయగాలు అద్దారు. అంతకు ముందే వీలైనంత మేర సిద్దిపేటను సుందరంగా మలిచినా, తెలంగాణ వచ్చాక సిద్దిపేటకు అనేక అందాలు అద్ది అందమైన సిద్దిపేటను చేశారు. సిద్దిపేట నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశాడు. ఒకనాడు ఎడారిగా మిగిలిపోయిన సిద్దిపేటను సిరుల మాగాణ చేశాడు. పేద గుండెలకు దగ్గరగా చేరి , వారి గుండె తడిగా మారారు. నియోజవర్గంలోని ప్రతి కుటుంబానికి దగ్గరయ్యాడు. వారి ఇంటిలో పెద్ద కొడుకయ్యాడు. ఆపదలో వున్నవారికి అండగా నిలిస్తూ వచ్చాడు. ప్రతి వ్యక్తికి తోడుగా గుండె ధైర్యమయ్యాడు. అందిరికీ భరోసానిచ్చే ఆప్తుడయ్యాడు. ఆపన్నులకు సేవ చేసే మానవతా మూర్తి అయ్యాడు. ఒక్క సిద్దిపేటలోనే కాదు, తెలంగాణలోని రైతన్న మోములో చిరునవ్వుగా గెలుతున్న నాయకుడు హరీష్‌రావు. పచ్చని పొలాలో సిరివెలుగు హరీష్‌రావు. పల్లెల్లో వెండి వెలుగు హరీష్‌రావు. ప్రతి గుండెలో ఆరని తడి హరీష్‌రావు.

వైద్యవికాసం..సిద్దిపేటకే తలమానికం.

నేను రాను బిడ్డో సర్కారు దవఖానకు అన్న పాట తెలంగాణ సమాజం కొన్ని దశాబ్దాల పాటు విన్నది. తెలంగాణ వచ్చిన తర్వాతా ఆ పాట కనుమరుగైంది. నేను వస్త బిడ్డో మన సర్కారు దవఖానకే అని పాడుకోవాల్సివస్తుంది. మంత్రి హరీష్‌రావు చేయి పడితే చాలు ఏ శాఖనైనా గొప్ప ఫలితాలు ఇవ్వాల్సిందే. తెలంగాణ వచ్చిన తర్వాత సాగు నీటి మంత్రిగా చేసి తెలంగాణకు కరువు కష్టం తీర్చాడు. తెలంగాణలో ప్రాజెక్టులు దగ్గరుండి కట్టించాడు. చెరువులు దగ్గరుండి బాగు చేయించాడు. తెలంగాణను నీటి గంగాళం చేశాడు. అపర భగీరథ ప్రయత్నం చేసి, గంగమ్మను తెలంగాణ గడ్డమీదకు తెచ్చాడు. కరువును తెలంగాణ పొలిమేర నుంచి తరిమేశారు. దటీజ్‌ హరీష్‌రావు. ఇప్పుడు తెలంగాణకు వైద్యం చేస్తున్నాడు. సిద్ధిపేట ఆసుపత్రిని ఎవరూ ఊహించనంత గొప్పగా అభివృద్ది చేశాడు. పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందిస్తున్నాడు. సిద్ధిపేట జిల్లా కల నెరవేర్చాడు. సిద్దిపేటకు ప్రభుత్వ వైద్య కళాశాల తెచ్చాడు. ఎక్కడా లేని విధంగా 1500 పడకలతో సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం చేయించాడు. వైద్య కళాశాలతోపాటు, నిర్సింగ్‌ కళాశాల కూడాతెచ్చాడు. దానికి తోడు సిద్ధిపేటకు బిఫార్మసీ కాలేజీ కూడా బహుమానంగా ఇచ్చాడు. తన ప్రజల ఆరోగ్యానికి అంత ప్రాధాన్యతనిస్తున్నాడు. భవిష్యత్తులో వైద్యం కోసం సిద్దిపేట నుంచి ఎవరూ హైదరాబాద్‌ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నాడు. తెలంగాణలో వైద్య విప్లవం సృష్టిస్తున్నాడు.
వరంగల్‌లో 2500 పడకల ప్రభుత్వాసుపత్రిని శరవేగంగా నిర్మాణం చేయిస్తున్నాడు.
నిమ్స్‌లో కొత్తగా మరో ఆసుపత్రి నిర్మాణం చేయిస్తున్నాడు. హైదరాబాద్‌కు చుట్టుపక్కల నాలుగు అతి పెద్ద ప్రభుత్వాసు పత్రులు నిర్మాణం పూర్తి కావొస్తున్నాయి. మంత్రి హరీష్‌ సారద్యంలో తెలంగాణలో 33 జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేయించాడు. వైద్యరంగంలోనే తెలంగాణను తలమానికం చేశాడు. వైద్య రంగానికే కొత్త భాష్యం చెప్పాడు. ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూశాడు. తల్లిబిడ్డల క్షేమం ప్రభుత్వమే బాధ్యత తీసుకునేలా చర్యలు చేపట్టారు. ఒకప్పుడు ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు జరిగేవి కాదు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు వున్నా, వాళ్లు తమ ప్రైవేటు ఆసుపత్రులలో డెలివరీ చేసేవారు. ప్రైవేటు ఆసుపత్రులు దోచుకునేవి. కాని తెలంగాణలో ఆ పరిస్ధితులు పోయాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవాలు జరడం లేదు. అందరూ ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవాలు చేయించుకుంటున్నారు. కేసిఆర్‌ కిట్‌ అందుకుంటున్నారు. ప్రసవానికి ప్రభుత్వమే ఆసుపత్రికి చేర్చి, తల్లీ బిడ్డలను క్షేమంగా ఇంటికి పంపించే బాధ్యత కూడా తీసుకున్నారు. ఇంతటి గొప్ప వైద్యం దేశంలో ఒక్క తెలంగాణలోనే జరుగుతోంది. అది మంత్రి హరీష్‌రావు వచ్చిన తర్వాతే అమలౌతోంది. దేశ చిరిత్రలోనే ఇంతటి మహోన్నతమైన వైద్య సేవలు ఒక్క తెలంగాణలోనే అందుతున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిని హరీష్‌రావు నిజం చేశాడు. తెలంగాణ వైద్యుడుగా కీర్తింపబడుతున్నాడు. అటు సిద్దిపేటను సిరుల పేటగా మార్చడు. తెలంగాణను నీటి గంగాలం చేసి సస్యశ్యామలం చేశాడు. ఎడారి లాంటి తెలంగాణను అన్న పూర్ణగా మార్చాడు. ఆర్ధిక మంత్రిగా తెలంగాణను సరిపడ ఆదాయం సమకూర్చుతున్నాడు. వైద్య మంత్రిగా ఆరోగ్యవంతమైన తెలంగాణను ఆవిష్కరిస్తున్నాడు.

సిరిసిల్ల సిరులు…కేటిఆర్‌ కృషి వరాలు.

https://epaper.netidhatri.com/

`సిరిసిల్లను కోనసీమను మించిన మాగాణ చేసిండు.

`చేనేత కార్మికులకు ఉపాధి కల్పించిండు.

`హాండ్లూమ్‌ క్లస్టర్‌ తో నేతన్నల కష్టాలు తీర్చిండు.

`వలసల సిరిసిల్లను ఉపాధి ఖిల్లాగా మార్చిండు.

`సిరిసిల్ల ను జిల్లా చేసి, అభివృద్ధికి బాటలు వేసిండు.

`ఆకలి కేకలతో అల్లాడిన సిరిసిల్లను అన్నపూర్ణ చేసిండు.

`నేతన్నల జీవితాలలో వెలుగులు నింపిండు.

`మహారాష్ట్ర నుంచి సిరిసిల్లకు వలసలొస్తున్రు.

`ఒకనాడు సిరిసిల్ల ఎడారి…ఇప్పుడు నిండుగా పారే గోదారి.

`ఎటు చూసినా పచ్చదనమే…పాడి పంటల పసిడితనమే.

`కేటిఆర్‌ గెలుపు.. సిరిసిల్లకు మలుపు.

`సిరిసిల్ల వెలుగులు స్థిరం…కేటిఆర్‌ తోనే సమృద్ధి పదిలం.

`కళ్లముందు కనిపిస్తున్న సిరిసిల్ల నిజం.

`కాంగ్రెస్‌ ను నమ్మితే మళ్ళీ ఆగమాగం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

మాటల్లో చాతుర్యం…చేతల్లో కర్తవం చూపించే సవ్యసాచి మంత్రి కేటిఆర్‌. ఉరిసిల్ల లాంటి సిరిసిల్లను సిరుల సిల్ల చేసిన నాయకుడు కేటిఆర్‌. మోమోలు ఎప్పుడూ చెదరని చిరునవ్వుతో ఆప్యాయత కురిపించే పలకరింపుతో, ఆత్మీయత కురించే నాయకుడు కేటిఆర్‌. పేదల ఆప్తుడు. అన్ని వర్గాల అభ్యున్నతిని కోరుకునే అందరివాడు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన నాయకుడు కేటిఆర్‌. తెలంగాణ ఆర్తిని ప్రపంచం ముందు నిలిపి, పెట్టుబడులు తెచ్చి, పారిశ్రామిక ప్రగతిలో తెలంగాణను నెంబర్‌వన్‌ చేసిన నాయకుడు కేటిఆర్‌. తెలంగాణకు అభివృద్ధి ఫలాలు అందించి, ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నా నాయకుడు కేటిఆర్‌. కేటిఆర్‌ లాంటి నాయకుడు మాకు లేడంటూ చాలా రాష్ట్రాలు ఎదురుచూసేంత స్పూర్తిని నింపిన నాయకుడు. తెలంగాణను అన్ని రంగాలలో ముందుకు నడిపిస్తున్న మార్గదర్శి కేటిఆర్‌. అందమైన తెలంగాణ నిర్మాణంలో కీలకభూమిక కేటిఆర్‌. హైదరాబాద్‌ను సుందర నగరం చేసిన నాయకుడు కేటిఆర్‌. ట్రాఫిక్‌ సమస్యలు లేని హైదరాబాద్‌ను రూపొందించిన నాయకుడు కేటిఆర్‌. మున్సిపల్‌ శాఖతో అందమైన తెలంగాణ, ఐటి, పరిశ్రమల మంత్రిగా పెట్టుబడుల స్వర్గధామం చేసిన నాయకుడు కేటిఆర్‌? అభివృద్ది రూపశిల్పి కేటిఆర్‌. ప్రపంచస్ధాయి సంస్ధల కేరాఫ్‌ అడ్రస్‌గా హైదరాబాద్‌ను మార్చిన నాయకుడు కేటిఆర్‌. అభివృద్ది వికేంద్రీకరణతో తెలంగాణ అంతటా ఐటిని విస్తరింపజేసిన నాయకుడు కేటిఆర్‌. కేటిఆర్‌ లాంటి డైనమిక్‌ లీడర్‌ దేశంలోనే లేడంటే అతిశయోక్తి కాదు. అనర్గళమైన వాక్చ్యాతుర్యం ఆయన సొంతం. ప్రతి విషయంపై అవగాహన ఆయన నేర్చుకున్న విజ్ఞానం. ప్రజల ఆలోచనలు పసిగట్టేంత నేర్పరితనం ఆయనకు ప్రత్యేకం. యువతకు ఆయన ఐకాన్‌. యువత భవిష్యత్తుకు బాటలు వేయగలిగిన మార్గదర్శనం. అలాంటి నేత మాకు వుంటే బాగుండు అన్నంతగా తెలంగాణ మొత్తం కోరుకుంటున్న సందర్భం. సిరిసిల్ల చేసుకున్న అదృష్టం. ప్రతి క్షణం సిరిసిల్ల గురించే ఆలోచించే ప్రజాప్రతినిధిగా ఆయన గొప్పదనం. ఒకనాడు సిరిసిల్ల అంటే కష్టాలతో సావాసం…కన్ళీళ్లతో జీవితం. పదేళ్ల కింద సాగు లేదు. ఉపాది లేదు. కూలి లేదు. ఎద్దు లేదు. ఎవుసం లేదు. నేతలన్నలకు పనిలేదు. ఉపాది కరువుతో అల్లాడిరది. ఎటు చూసినా సిరిసిల్ల ఎడారే…ఉమ్మడి రాష్ట్రంలో సిరిసిల్ల ప్రజలు ఎంత మందిని నాయకులను చేసినా వాళ్లు చేసిందేమీలేదు. ప్రజల జీవితాల గురించి ఆలోచించింది లేదు. కరువును పారద్రోలే తీరిక లేదు. పదవులు కాపాడుకోవడం తప్ప నాటి కాంగ్రెస్‌ నాయకులకు మరో యావ లేదు. ప్రజల గోస పట్టింది లేదు. ప్రజల కష్టం తీర్చింది లేదు. సరిగ్గా అదే సమయంలో సిరిసిల్లను కాపాడేందుకు మంత్రి కేటిఆర్‌ వచ్చాడు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమయ్యాడు. సిరిసిల్ల ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు. సిరిసిల్ల వరాల సిల్ల చేయడం ఆనాటి నుంచే మొదలుపెట్టాడు. అటు తెలంగాన కోసం కొట్లాడాడు. ఇటు సిరిసిల్ల అభివృద్దికి బాటలు వేస్తూ వచ్చాడు. తెలంగాణ వచ్చాక సిరిసిల్ల తలరాతనే మార్చాడు. సిరిసిల్ల రూపురేఖల్లో కొత్త వెలుగులు నింపాడు. సుందరమైన సిరిసిల్ల చేశాడు. అందమైన సిరిసిల్లను ముస్తాబు చేశాడు. సమస్యలను పారద్రోలాడు. ప్రజల కష్టాలను దూరం చేశాడు. నేతన్నలకు అండగా నిలిచాడు.
అది కోనసీమ కాదు..సిరిసిల్ల. మన సిరిసిల్ల పొలాలు. వరిచేలు. మంత్రి కేటిఆర్‌ కృషివరాలు.
అటు నీళ్లు. ఇటు పొలాలు. రైతన్న మోములో ఆనందాలు. సిరిసిల్ల నేతన్నల జీవితాలలో వెలుగులు. ఒకనాడు సిరిసిల్ల కరువు నేల. ఒకనాడు చినుకు కోసం నిత్యం ఆశగా ఆకాశం వైపు చూసిన సిరిసిల్ల రైతన్న ఆకాశాన్ని ఆర్తిగా చూడడం ఏనాడో మానేశాడు. ఒకనాడు పల్లెర్లు మెలిచిన పొలాన్ని చూసి దిగులు చెందుతూ, కన్నీళ్లు కార్చాడు. కాని నేడు ఆ పొలం నిండా నీళ్లుచూస్తున్నాడు. ఆ పక్కనే వుండే ఊరు చెరువును చూసి కళ్ల నిండా నీళ్లు తీసుకున్న రైతన్న నేడు ఆ చెరువు మూడు కాలాలు నీళ్లతో నిండి వుండడాన్ని చూసి మురిసిపోతున్నాడు. ఇది ఒకనాటి సిరిసిల్లనేనా అని ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నాడు. సిరిసిల్లలో కరువు మాయమైంది. ఎటు చూసినా పచ్చని గడ్డి కూడా కనిపించని చోట, పచ్చని పొలాలు కనువిందు చేస్తున్నాయి. రోడ్డు పక్క ఎప్పుడూ వాగులు పరుగులు తీస్తున్నాయి. వానా కాలంలో కూడా పారని వాగులు కాలంతో సంబంధం లేకుండా పరుగులు పెడుతున్నాయి. పరవళ్లు తొక్కుతున్నాయి. ముఖ్యమంత్రి కేసిఆర్‌ సంకల్పం…మంత్రి కేటిఆర్‌ ఆచరణతోనే ఇదంతా సాధ్యమైంది. ఒకనాడు అన్నమో రామచంద్రా అన్న సిరిసిల్ల… నేడు బంగారు పంటలు పండిస్తున్న మాగాణ. ఒకనాడు ఆకలి కేకల సిరిసిల్ల. నేడు పుష్కలమైన ధాన్యపు రాసుల అన్న పూర్ణ. సిరిసిల్ల అప్పుడు నేతన్నల కష్టాల కొలువు. ఇప్పుడు హాండ్లూమ్‌ క్లస్టర్లతో ఉపాధికి నెలవు. నేతన్న జీవితాలకు వేసిన వెలుగు దారులు. అటు సిరుల సాగు..ఇటు నేతన్నలకు ఉపాధి మార్గాలు చూపిన నాయకుడు కేటిఆర్‌. ఇప్పుడు సిరిసిల్ల ఇంత పచ్చగా వుండడానికి కారణం కేటిఆర్‌. సిరిసిల్లలో సిరుల సాగు సాగుతుండడం, తెలంగాణ నేల తల్లిలో కనిపిస్తున్న పరవశం…బలగం సినిమాల చూస్తున్న వాస్తవ దృష్యం. ప్రపంచమంతా చూసిన బలగం సినిమాలో కనిపించిన పచ్చదనమంతా సిరిసిల్లదే. పసిడి పంటల పొలాలన్నీ సిరిసిల్లవే. ఒకనాడు ఎండిన బిడులు, నోళ్లు తెరిచిన పొలాలు..ఎడారి చిత్రాలు. కాని నేడు కోనసీమను మించిన పచ్చటి అందాలు. కోనసీమల పండే పంటలకు రెట్టింపు పంటలు. కోనసీమలోనైనా కరువొస్తుందేమో! కాని సిరిసిల్లలో ఇక కరువు రాదు. మంత్రి కేటిఆర్‌ సిరిసిల్లకు అండగా వుండగా…కరువు దరి చేరదు. ప్రజలకు ఏ కష్టం సిరిసిల్ల పొలిమేర దాటి రాదు. ఎందుకంటే సిరిసిల్ల లాంటి కరువు నేలన నేడు సిరుల సాగు సాగుతుండడం అంటే మాటల కాదు. ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలంటే పాలకులకు చిత్తశుద్ది వుండాలి. మన ప్రాంతం మీద మమకారం వుండాలి. మన ప్రజల జీవితాలలో మార్పు తీసుకురావాలన్న అంకితభావం వుండాలి. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఆలోచన వుండాలి. వారి ఆనందమే పాలకులు సంతోషం కావాలి. అలాంటి నాయకుడే ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఆయన వారసుడైన కేటిఆర్‌ తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల ధాన్యపు భంఢాగారం చేశారు. అందుకే సిరిసిల్ల భూగర్భజాన్ని జలభాండాగారం చేశారు. గత పాలకులకు ఇది సాద్యం కాలేదు. ప్రజల బాధలు వారికి పట్టలేదు. పజల గోస వారు చూడలేదు. ప్రజలు ఏమైపోతే ఏముంది? మాకు పదవులున్నాయా? లేదా? అన్నవే ఆనాడు ఆలోచించారు. ఉమ్మడి పాలకులకు పల్లకిలు మోశారు. తెలంగాణ ప్రజల జీవితాలను గాలికి వదిలేశారు. దాంతో చీకట్లలో మగ్గుతున్న తెలంగాణను వెలుగులోకి తెచ్చిన నాయకుడు కేసిఆర్‌. సిరిసిల్లను వెలుగులు సిల్ల చేసింది కేటిఆర్‌. ఇప్పుడు సిరిసిల్ల ఎంత అందంగా వుందో ఒక్కసారి బలగం సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఆ ప్రకృతి అందాలన్నీ సిరిసిల్లవే. ఆ ప్రకృతి రమణీయంతా సిరిసిల్లదే. ఆయన జలలా సవ్వడి సిరిసిల్లదే. ఆ పచ్చదనమంతా సిరిసిల్లదే. అంత గొప్పగా సిరిసిల్లను తీర్చిదిద్దిన నాయకుడు కేటిఆర్‌. సిరిసిల్లను ఇలా తీర్చిదిద్దిన కేటిఆరే తెలంగాణను అందంగా రూపుదిద్దారు. హైదరాబాద్‌ను మరింత సుందరం చేశాడు. మున్సిపల్‌ మంత్రిగా హైదరాబాద్‌లో సరికొత్త నగరానికి రూపకల్పన చేశాడు. అవి ఒకటో, రెండో అయితే చెప్పొచ్చు. ఈ పదేళ్లలో ఆయన చేసిన అభివృద్దికి అంతులేదు. ఆయన తెచ్చిన పరిశ్రమలకు లెక్కలేదు. ప్రైవేటు రంగంలో పెట్టుబడుల వెల్లువకు హద్దులులేవు. యువత ఉపాధికి కొదువ లేదు. సాప్ట్‌వేర్‌ రంగంలో హైదారాబాద్‌లో అవధులు లేదు. దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రం చేసిన ఘనత కేటిఆర్‌ది. యువతకు మార్గదర్శి కేటిఆర్‌…రేపటి తరానికి ఆదర్శమూర్తి కేటిఆర్‌.

మీరు మీటర్లు పెట్టలే…మేం నిధులియ్యలే!

https://epaper.netidhatri.com/

`ఇంతకాలం కేసిఆర్‌ చెబుతున్నదే నిజమైంది.

`నిర్మలా సీతారామన్‌ మాటలతో తేటతెల్లమైంది.

` రైతులపై కేంద్రం కపట నాటకం బయటపడిరది.

` కేంద్ర ఆర్థిక మంత్రే స్వయంగా చెప్పేసింది.

`మీటర్లు పెడితేనే రుణాలన్నది నిజమే…అని ఒప్పుకున్నది.

`మీటర్లు పెట్డమని తెగేసి చెప్పిన కేసిఆర్‌.

`అప్పులు ఆపిన నరేంద్ర మోడీ సర్కార్‌.

`దేశమంతా మీటర్లు పెట్టింది కనిపించడం లేదా?

`తెలంగాణ ఏమైనా ప్రత్యేకమా?

` నిర్మలా సీతారామన్‌ తెలంగాణపై అక్కసు వ్యాఖ్యలు.

`బిజేపి కథ ఇట్లుంటే కాంగ్రెస్‌ కథ మూడు గంటలు.

`కర్ణాటకలో ఐదు గంటలిస్తున్నాం…తెలంగాణ లో మూడు గంటలు చాలంటరు.

`డిల్లీ పార్టీలను నమ్మితే నిండా ముంచుతరు.

`తెలంగాణ ను గోస పెడతరు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

బిజేపి డొల్లతనమంతా తేటతెల్లమైంది. బిజేపి నేతలు మాటల గారడి బైటపడిరది. ఇంత కాలం ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెప్పిందే నిజమైంది. ప్రజలను మభ్యపెట్టాలని చూసిన రాష్ట్ర బిజేపి నేతల బండారం బైటపడిరది. వ్యవసాయ మీటర్లకు మోటార్లు పెడితేనే రుణాలిస్తామని తెగేసి చెప్పిన కేంద్ర ప్రభుత్వ మోసం ఎట్టకేలకు బైటపడిరది. ఇక ఇదిలా వుంటే దొంగే దొంగ అన్నట్లు కరీంనగర్‌లో బిజేపి అభ్యర్ధి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్‌ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసున్నారు. కరీంనగర్‌ ప్రచారంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ మళ్లీ కేసిఆర్‌ వస్తే వ్యవసాయ బోర్లకు మీటర్లు పెడతుడు అన్నాడు. ఇంతకన్నా నీతి మాలిన ప్రచారం ఎక్కడైనా వుంటుందా? ఓ వైపు సాక్ష్యాత్తు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ మేం చెప్పినట్లు కేసిఆర్‌ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టలేదని చెబుతున్నారు. అందుకే మేం డబ్బులు ఇవ్వలేదని కూడా తేల్చేశారు. మీ ఇష్టం వచ్చినట్లు రైతులకు ఉచిత కరంటు ఇస్తే ఎలా? సంస్కరణలు ఎలా అమలు జరగాలి? అంటూ నిర్మలా సీతారామన్‌ ముఖ్యమంత్రి కేసిఆర్‌ను ప్రశ్నించింది. అంతే కాదు తెలంగాణ ప్రభుత్వం సాగు మోటార్లకు మీటర్లు పెట్టకపోవడం వల్లనే రుణాలు ఇవ్వలేదని కూడా తేల్చిచెప్పారు. రైతుల బోర్లుకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశించిన వెంటనే దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేశాయి. తెలంగాణ ఏమైనా ప్రత్యేకమా? ఎందుకు మీటర్లు పెట్టలేదని నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించారు. కాని బండి సంజయ్‌ ఎప్పటిలాగే అబద్దాలను నమ్ముకున్నాడు. అబద్దాలు ప్రచారం చేస్తున్నాడు. మళ్లీ బిఆర్‌ఎస్‌ వస్తే రైతులు నష్టపోతారని అనడం అంత దుర్మార్గం ఏమైనా వుంటుందా? కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్లకు మోటార్లు పెట్టమని తేగేసి చెప్పడాన్ని కేంద్రం ఒప్పుకోలేదు. అందుకే ఏటా ఇవ్వాల్సిన రుణాలు కేంద్రం ఇవ్వలేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌ అనేక సందార్భలలో చెబుతూనే వున్నారు. కేసిఆర్‌ బతికుండగా రైతులకు నష్టం జరగనివ్వని చెప్పారు. ఎట్టిపరిస్ధితుల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. అది కేంద్రానికి నచ్చలేదు. అలాంటి బిజేపి రైతులకు మేలు చేస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? గతంలో నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తున్న ఒత్తిడిపై ప్రకటన చేశారు. అది ఎంత మాత్రం నిజం కాదని ఎమ్మెల్యే రఘునందన్‌, ఎంపి. అరవింద్‌ చెప్పారు. ఇప్పుడు వాళ్లు తెలంగాణ రైతులకు ఏం సమాధానం చెబుతారో చెప్పాల్సిన అవసరం వుంది. ఇంత జరుగుతున్నా బిజేపి నేతలు తెలంగాణ ప్రజలను ఎలా మోసం చేయాలనే చూస్తున్నారు. తెలంగాణ ప్రజల మీద ఎలాంటి ప్రేమ రాష్ట్ర నేతలకు కూడా లేదని తేలిపోయింది. పొరపాటున బిజేపికి ఓటు పడితే, రైతులు మోటార్లు పెట్టుకోవడానికి సిద్దమని ఒప్పుకున్నట్లే అని కూడా బిజేపి ప్రచారానికి వెనుకాడదు. సరిగ్గా ఎన్నికల ముందు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్లకు మోటార్లు పెట్టడం లేదని చెప్పినా, బిజేపికీ ఓట్లు వేశారంటే రైతులు మా పక్షానే వున్నారని, మోటార్లు పెట్టాలని కూడ కోరుతారు.
కేవలం వ్యవసాయ కనెక్షన్లకు మోటార్లు ఏర్పాటు చేయలేదన్న కోపంతో కేంద్ర ప్రభుత్వం రూ.35వేల కోట్లు ఆపడం జరిగినట్లు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్‌రావు వెల్లడిరచారు.
అంటే తెలంగాణ మీద బిజేపికి ఎంత కక్ష వుందో అర్దం చేసుకోవచ్చు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం. అరవైఏళ్లు రైతులు గోసపడిన ప్రాంతం. వలసలు పోయి, కుటుంబాలు ఆగమైన ప్రాంతం. చుక్క నీరు లేక ఎండిపోయిన ప్రాంతం ఇప్పుడిప్పుడో కోలుకుంటోంది. తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసిఆర్‌ కృషి చేస్తుంటే, కేంద్రం సహకరించాల్సిందిపోయి, మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లు రైతులను బిజేపి గోస పెట్టాలని చూడడం భావ్యమా? కేంద్రం ఇచ్చే రూ.35వేల కోట్లకన్నా, మాకు 68లక్షల తెలంగాణ రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీటర్లు పెట్టలేదు. అదే పొరుగు రాష్ట్రం ఆంద్రప్రదేశ్‌లో ఏర్పాటు చేశారు. తమిళనాడులో, కార్నాకట, కేరళ, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌లలో కూడా ఏర్పాటు చేశారు. దేశంలోనే రైతుల కోసం మీటర్లు పెట్టని ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్‌. కేంద్రం ఒత్తిడిని కూడా లెక్క చేయలేదు. కేంద్రం రుణాలు ఆపేసినా పరవాలేదనుకున్నాడు. తమకు తెలంగాణ రైతులు ప్రయోజనాలే ముఖ్యమనుకున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌.
ఇదిలా వుంటే కాంగ్రెస్‌ కధ మరోలా వుంది.
ఓవైపు తెలంగాణవచ్చిన నాటినుంచి రైతులకు పూర్తి ఉచితంగా నాణ్యమైన 24గంటల కరంటు ఇస్తున్నారు. ఈ సంగతి పొరుగును వున్న కర్నాటక కాంగ్రెస్‌ నాయకులకు తెలియదు. ఎన్నికల ప్రచారం అని ఎగేసుకుంటూ వచ్చి, తెలంగాణలో అధికారంలోకి వస్తే తాము రైతులకు ఐదు గంటల కరంటు ఇస్తామని ప్రకటించగానే రైతాంగం కాంగ్రెస్‌ మీద భగ్గుమన్నది. కర్నాకటలో రైతులకు ఏడు గంటలు ఇస్తామని చెప్పడం జరిగింది. కాని కరువు మూలంగా ఐదు గంటలే ఇస్తున్నాం. ఇక్కడ కూడా అలాగే ఐదుగంటలు ఇస్తామని చెప్పి,కాంగ్రెస్‌ తన పరువును తాను తీసుకున్నది. మరో వైపు రైతులు 10హెచ్‌పి మోటార్లు ఏర్పాటు చేసుకుంటే మూడు గంటల కరంటు చాలని రేవంత్‌రెడ్డి చెబుతున్నాడు. రైతులకు 24గంటల కరంటు అవసరం లేదని బాష్యం చెబుతున్నాడు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో , మేమూ 24 గంటలు ఇస్తామంటూ కొత్త రాగం అందుకున్నారు. తెలంగాణలో గత తొమ్మిదేళ్లుగా 24 గంటల కరంటు చూస్తూనే, రైతులకు మూడు గంటలు కరంటు చాలనే కాంగ్రెస్‌ను ప్రజలు నమ్ముతారా? వారిని ఆదరిస్తారా? కాంగ్రెస్‌, బిజేపిలు రైతుల పట్ల ఎంత చిత్తశుద్దితో వున్నారో తేలిపోయింది. ఆ పార్టీల నిజస్వరూపం తెలిసిపోయింది. రైతుల గురించి ఆలోచించేది కేవలం బిఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమే అన్నది రుజువైంది. రైతులకు అహర్నిషలు మేలు చేసేది కేవలం కేసిఆర్‌ మాత్రమే అన్నది రైతులకు కూడా పూర్తిగా అవగతమైంది.
దేశమంతా విద్యుత్‌ సంస్కరణలు తెచ్చే ప్రయత్నంలో భాగంగా తెలంగాణలో కూడా రైతుల వద్ద విద్యుత్‌ ఫీజులు వసూలు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన.
అయితే తెలంగాణ ఆ పనికి గండికొట్టింది. దాంతో కేంద్రం అప్పులు ఇవ్వడం లేదు. పైగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని బిజేపి పెద్దలు ఆరోపిస్తున్నారు. దేశంలో వున్న 28 రాష్ట్రాలలో తెలంగాణ అప్పులు కింది నుంచి ఆరో రాష్ట్రంగా మాత్రమే వుంది. కాని బిజేపి మసిబూసి మారేడు కాయ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేసే అప్పులలో సాగునీటి ప్రాజెక్టులు, రైతులకు ఉచిత విద్యుత్‌, రైతు బంధు వంటి పధకాలు, ఇతర అభివృద్ది పనులు, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తోంది. కాని కేంద్రం పేద ప్రజలకు సేవ చేయాల్సిన అవసరాన్ని వదిలేసి, వ్యాపారులకు పదిలక్షల కోట్ల అప్పులు మాఫీ చేయడం గమనార్హం. ఆ పది లక్షల కోట్లతో దేశంలోని పేదలందరి జీవితాలు మారిపోయేవి. వారికి మౌలిక సదుపాయల కల్పన మరింత జరిగిదే. దేశంలో అందరికీ ఇండ్లు వచ్చేవి. ఇలా చెప్పుకుంటూ పోతే సామాన్యులు కూడా లక్షాధికారులయ్యేవారు. రైతులకు మేలు చేస్తే మరింత పంటల దిగుబుడుల పెరిగేవి. మన వ్యవసాయ ఉత్పత్తులు విదేశాలకు కూడా చేరేవి. కాని కేంద్రం ఆ పని చేయలేదు. పేరు మోసిన వ్యాపారులకు వారి అప్పులు మాఫీ చేసింది. దేశానికి అన్నం పెట్టే రైతున్నల నుంబి బిల్లులు వసూలు చేయాలనుకుంటోంది. ఇదీ కేంద్ర ప్రభుత్వానికి, బిజేపి పెద్దలకు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు తేడా…కేసిఆర్‌ పేదల పక్షపాతి. రైతుల సంక్షేమ వాది. రైతులను గుండెల్లో పెట్టుకొని చూసుకునే నాయకుడు, పాలకుడు. మరి బిజేపి… వాళ్లే సమాదానం చెప్పాలి.

రైతు బాంధవుడు కేసీఆర్‌

https://epaper.netidhatri.com/

విజయం ఖాయమైంది మెజారిటీ కోసమే ప్రయత్నం
60 ఏళ్ల అంధకారంపై…అభివృద్ధి సూర్యుడై పొడిచిన పాలకుడు కేసీఆర్‌
ఎడారిగా మారిన తెలంగాణను సిరుల తెలంగాణ గా మార్చిన అధిపతి..రైతు సంక్షేమ వారధి.
రైతు రాజ్యాన…కేసిఆర్‌ నజరాన!

`రైతు వరదాత కేసిఆర్‌…

`రుణ విముక్తి జరిగింది.

` రైతు బాంధువుడు…అపర భగీరధుడు.

స్వతంత్ర భారతాన రైతు కన్నీరు తుడిచిన ఏకైక నాయకుడు ‘‘కేసిఆర్‌’’ అని అంటున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ’’నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న అంశాలు…ఆయన మాటల్లోనే.
`తెలంగాణ రైతులందరి పక్షాన కృతజ్ఞతలు.

`కేసిఆర్‌ మాటంటే మాటే…

`ఎంత కష్టమైనా నెరవేర్చుడే!

`రైతంటే ఎనలేని ప్రేమ వుండేది ఒక్క కేసిఆర్‌ కే!

` రైతు దిగులు తీరె…

`రైతు ఇంట ఆనందమే.

` రంది తీరిన రైతుకు సంబరమే.

`సంక్షేమ తెలంగాణ… పురోగతి గ్రామ, గ్రామాన.

` 31 లక్షల మంది రైతులకు లబ్ధి.

` 19 వేల కోట్ల సర్థుబాటు.

`అనూహ్యమైన నిర్ణయం.

` తెలంగాణ రైతుకు వరాల మూటలు.

` గత పదేళ్లలో రైతు కోసం ఊహకందని పథకాలు.

హైదరబాద్‌,నేటిధాత్రి:

రైతు మనసు తెలిసిన నాయకుడు పాలకుడౌతే ఆ రాష్ట్రం ఎంత సుభిక్షంగా, ఎంత సుసంపన్నంగా వుంటుందో తెలంగాణను చూస్తే ఎవరికైనా అర్ధమౌతుంది. ఎందుకంటే కేసిఆర్‌ స్వతహాగా రైతు. ఆయనకు రైతు కష్టాలు తెలుసు. రైతు కన్నీళ్లు తెలుసు. సాగు కోసం ఎంత రైతు కష్టడతాడో తెలుసు. ఆరు గాలం శ్రమించినా, ఫలితం దక్కని నాడు రైతు వేదన ఏమిటో తెలుసు. దేశానికి అన్నం పెట్టే రైతన్న కన్నీళ్లు కార్చే రోజులు ఎలా వుంటాయో తెలుసు. బంగారు పంటలు పండిద్దామనుకుంటే నీళ్లు లేకపోతే ఎంత కన్నీటి పర్యంతమౌతాడో తెలుసు. సాగు చేసేందుకు రొక్కం లేక ఎన్ని అవస్ధలు పడతాడో తెలుసు. అందుకే తెలంగాణ వస్తే గాని రైతు దుఖం తీరదని నిర్ణయం తీసుకున్న గొప్ప దార్శనికుడు కేసిఆర్‌. పట్టుదలకు మారు పేరుగా ఆయన పట్టిన పట్టు విడవలేవు. తెలంగాణ సాధించేదాకా విశ్రమించలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రైతు పక్షపాతి. ఆయనకు రైతులంటే వల్లమాలిన ప్రేమ. గౌరవం. రాష్ట్రం సస్యశ్యామలం కావాలని జలయజ్ఞం చేసిన గొప్ప మహర్షి కేసిఆర్‌. ఆయనను వేనోళ్ల పొగిడినా సరిపోదు. దేశమంతా ఆయన పేరు నినాదమైనా సరిపోదు. అంత గొప్ప గుణం వున్న నాయకుడు దేశంలోనే మరొకరు లేదు. కేవలం రైతు కోసం ఆలోచించే ఏకైక నాయకుడు కేసిఆర్‌. పరిస్ధితులు అనుకూలించినప్పుడు ఎవరైనా పనులు చేస్తారు. కాని ప్రజల కోసం ఎంతటి ఇబ్బందులైనా ఎదుర్కొని పనులు పూర్తి చేయడం అన్నది ఎంతో గొప్పది. అందుకోసం కొన్ని దశాబ్ధాలుగా శ్రమ పడడడం అన్నది అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. అది కేవలం ఒక్క కేసిఆర్‌ వల్లనే సాధ్యమైంది. నీటికెడ్చిన తెలంగాణ గోసను చూసి దుఖం తన్నుకొచ్చిన రోజులు చూసిన నాడు నా తెలంగాణ అంటూ కంటి తడిపెట్టుకున్నది కేసిఆర్‌. అసలే అరకొర వ్యవసాయం అనుకుంటే విద్యుత్‌ చార్జీల మోతతో తెలంగాణను ఎడారిగా మార్చే ఉమ్మడి పాలకుల కుట్రను ఎదుర్కొన్నది కేసిఆర్‌. అందుకే తెగించి 2001లో తెలంగాణ కోసం బయలు దేరి తెలంగాణ సాధించేవరకు అలుపెరగని పోరాటంచేశాడు. మాట తప్పలేదు. మడమ తిప్పలేదు. ఎత్తిన పడికిలి దించలేదు. ఇప్పుడు పాలకుడిగాకూడా ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలోనే తీసుకున్న నిర్ణయాలను వరసగా అమలు చేస్తున్నాడు. రైతు లోకం తెలంగాణలో సృష్టిస్తున్నాడు. ఒకనాడు ఎక్కడ చూసినా నెర్రెలు పారి, పడావు పడ్డ భూములు. మరి నేడు ఎక్కడ చూసినా పచ్చని పొలాలు. పండుతున్న బంగారు పంటలు. పదేళ్లలో ఎంత అధ్భుతం. ఎంత ఆశ్చర్యం. ఇలాంటి తెలంగాణ ఆవిష్కణ ఇంత తక్కువ సమయంలో జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. అన్ని రకాలుగా తెలంగాణ ప్రగతి పరుగులు ఎవరూ కలగనలేదు. కాని కేసిఆర్‌ మాత్రమే కలగన్నాడు. ఆ కలను నిజం చేసి చూపిస్తున్నాడు. అంటున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి , నేటిదాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ వెలుబుచ్చిన విషయాలు. ఆయన మాటల్లోనే…
ఎన్నికల సమయంలో రైతు రుణ మాఫీ గురించి ప్రజలకు ఇచ్చిన హమీని ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిలబెట్టుకున్నారు.
తెలంగాణలో రైతు, సాగు గురించి ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారని మరోసారి నిరూపించారు. రైతు రుణమాఫీ మూలంగా తెలంగాణలోని సుమారు 31లక్షల మంది రైతులకు ఊరట కల్గుతుంది. అందుకోసం అవసరమైన రూ.19వేల కోట్ల రూపాయాలు సర్ధుబాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజునుంచే రుణమాఫీ అమలు చేస్తున్నారు. రైతు రుణ మాఫీ ఎప్పుడో జరిగిపోయేది. కాని మధ్యలో కరోనా కాలంలో రెండేళ్లపాటు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా రైతు బంధు ఆగలేదు. ప్రాజెక్టుల పనులు నిలిచిపోలేదు. అందుకే కొంత కాలయాపన జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే కాకుండా, ఎవరూ ఊహించని అనేక పనులు, పధకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ తలరాతనే మర్చేశాడు. తెలంగాణను బంగారు నేలగా తీర్చిదిద్దారు. తెలంగాణ వస్తే నీళ్లొస్తాయంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు వస్తుందని ఎవరూ ఊహించలేదు. దానితో ముడిపడినటువంటి అనేక రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతుందని అనుకోలేదు. తెలంగాణ నిండు కుండలా కరువులొచ్చినా సాగుకు కష్టం రాకుండా నీటి నిల్వలతో కళకళలాడుతుందని కలగనలేదు. చెరువు బాగు గురించి ఎవరికీ అవగాహన కూడా లేదు. కాని అవన్నీ నెరవేరాయి. తెలంగాణలోని సుమారు 46వేల చెరువులు పూర్వకళను సంతరించుకున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఎండిపోయిన చెరువులు మళ్లీ పురుడు పోసుకున్నాయి. నేనున్నానని గుర్తు చేస్తున్నాయి. చెరువే ఊరికి ఆదరువు అని పెద్దలు ఎందుకన్నారో ఇప్పుడు మళ్లీ చూస్తున్నాం. తెలంగాణ పల్లెలో పొలాలకు నీళ్లందిస్తున్నాయి. కుల వృత్తులకు ఆధారంగా నిలుస్తున్నాయి. చెరువులే మత్య్స సంపదకు ఆలవాలంగా మారిపోయాయి. తెలంగాణలో నీలి విప్లవానికి కూడా శ్రీకారం జరిగింది. రైతు బంధుతో రైతుకు భరోసా కలుగుతోంది. పండిన పంటలు పొలం గట్టునే ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. తెలంగాణ రైతు కాలు మీద కాలేసుకొని పాగు చేసుకునే పరిస్ధితి వచ్చింది. తెలంగాణలో ఇప్పుడు ఎకరం భూమి వున్న రైతు జీవితానికి ఢోకా లేదు. ఐదెకరాల రైతు నేడు కోటిశ్వరుడౌతానని కలలో కూడా కలగనలేదు. అలా తెలంగాణ తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు రైతుల పక్షాన వేల వేల ధన్యవాదాలు.
నిన్నటి నా తెలంగాణ గుర్తుచేసుకుంటే కలలో గగుర్భాటు పడుతుంది.
దేశమంతా పచ్చగా తెలంగాణ మాత్రం ఎందుకు ఇలా ఎండిపోతోందని అనుకునేవాళ్లం. మధన పడేవాళ్లం. ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరుకు అనంతపురం లాంటి జిల్లాలో పంటలు పండుతున్న తరుణంలో తెలంగాణలో ఎందుకు పంటలెందుకు లేదు? కనీసం తాగడానికి మంచినీళ్లు ఎందుకు లేవు? అరవై తెలంగాణ గోస పడిరది. నీటి చుక్కకు తండ్లాడిరది. గొంత తడవక తల్లడిల్లింది. సాగు లేక భూమి తల్లి విలవిలలాడిరది. రైతు బతుకు చిద్రమైంది. వానలు పడితే సాగు. అది కూడా ఆకాశం వైపు నిత్యం చూసుకుంటూ కన్నీళ్లతో సాలు తడిపిన కాలం. తొలకరిని చూసి మురిసిపోయి చేసుకునేసాగు. ఆ తర్వాత చినుకు జాడ లేకపోతే ఎండిపోతున్న సాలును కన్నీరొలికే సాగు. నీరు లేక వేసిన విత్తనం పురుగు తింటుంటే మోడు వారిని బతుకు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతు కష్టం పగవాడికి కూడా రాకూడదనంత దుర్భరంగా వుండేది. ప్రజలకు తినడానికి తిండి లేక, చేయడానికి పనులు లేక, దేశాలు పట్టిపోయిన కాలం గుర్తు చేసుకుంటే తెలంగాణను సస్యశ్యామలం చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ యుగపురుషుడుగానే చూడాలి. తెలంగాణ సాగును చూసి ఆయన పాలన స్వర్ణయుగంగా చెప్పుకోవాలి. గతంలో రాజుల కాలంలో గుప్తు కాలం స్వర్ణయుగమని చదువున్నాం. అదెలా వుంటుందో ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనలో చూస్తున్నాం. బంగారు తెలంగాణలో చూసి తరిస్తున్నాం. మురుస్తున్నాం. రైతు రాజుగా చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తుంటే ఇది నా తెలంగాణ అని సంబరపడుతున్నాం. నా తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ను రైతులోకం కొలుస్తోంది. కేసిఆర్‌ నామస్మరణ చేస్తోంది.

అభివృద్ధి అంటే హైదరాబద్‌

https://epaper.netidhatri.com/

ప్రజలు మెచ్చిన పాలన ప్రగతి పథంలో ముందున్న పాలన కెసిఆర్‌ సుపరిపాలన

పెట్టుబడుల స్వర్గదామం తెలంగాణ!
పదేళ్ల లో తెలంగాణ అభివృద్ధి పై పారిశ్రామిక ప్రగతి గురించిఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు… ఆయన మాటల్లోనే…

` హైదరాబాద్‌ చుట్టూ అద్భుతమైన ప్రగతి.

`తెలంగాణలో పారిశ్రామిక విస్తరణ.

`ఐటిలో మేటి తెలంగాణ.

`తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగు రెట్లు పెరిగిన ఐటి ఎగుమతులు.

`ఫార్మాహబ్‌ గా తెలంగాణ.

`హైదరాబాద్‌ లో మరిన్ని సొగసులు.

`కొత్త కట్టడాలు.

`మహానగరంగా…విశ్వ నగరంగా

`పేరుమోసిన వ్యాపార సముదాలన్నీ హైదరాబాద్‌ లోనే.

`బిజినెస్‌ సమ్మిట్ల వేధిక.

`ప్రపంచ స్థాయి కంపెనీల మూల సంస్థలు హైదరాబాద్‌ లో..

`రజనీకాంత్‌ లాంటి వారు ఆశ్చర్యపోయామన్నారు.

`లండన్‌ లో వున్నానా అని చెప్పిన సినీ నటి లయ. Continue reading అభివృద్ధి అంటే హైదరాబద్‌

కాంగ్రెస్‌ అంటే కరువు, కష్టం, చీకటి!?

https://epaper.netidhatri.com/

`కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాదు…నిండా ముంచిన పార్టీ.

`తెలంగాణ ను అరిగోస పెట్టిన పార్టీ.

`తెలంగాణను ఆగం చేసిన పార్టీ.

`తెలంగాణ ను ఎడారి చేసిందే కాంగ్రెస్‌.

`పెనం మీద నుంచి పొయ్యిలో వేసిందే కాంగ్రెస్‌.

`భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో కలిపిందే కాంగ్రెస్‌.

కాంగ్రెస్‌ పార్టీ వల్ల తెలంగాణ సమాజం ఎంతో నష్టపోయింది. కొన్ని తరాలు కష్టాలు అనుభించింది. అరవై ఏళ్లు తెలంగాణ చీకట్లలో మగ్గాల్సివచ్చింది. నమ్మితే మళ్ళీ పాత రోజులే అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న విషయాలు.. ఆయన మాటల్లోనే

`ఇప్పుడు ఇచ్చామంటూ మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నది.

`పచ్చి తెలంగాణ వ్యతిరేకి రేవంత్‌.

`తెలంగాణ ఉద్యమకారులను గన్‌ తో బెదిరించిందే రేవంత్‌.

`తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలని చూసిందే రేవంత్‌.

`తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బ తీసిందే రేవంత్‌.

`రేవంత్‌ ను నమ్మేందుకు ప్రజలు సిద్దంగా లేరు.

`తెలంగాణ లో కాంగ్రెస్‌ కు చోటు లేదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌ అంటేనే కష్టాలు, కన్నీళ్లు, ఆకలిబాధలు, కరువులు, చీకట్లు…కాంగ్రెస్‌ పాలనలో ఇవన్నీ చూసింది తెలంగాణ సమాజం. అన్ని బాధలు అనుభవించింది తెలంగాణ. కాంగ్రెస్‌ పెట్టింది ఒక్క బాధైతే చెప్పుకోవచ్చు. కాని ప్రతి క్షణం బాధలే..ప్రతి రోజు గోసలే… దాని పాలనంతా కష్టాలే..ప్రజలకు నష్టాలే..మిగిలినవి చేదు జ్ఞాపకాలే..ఆకలి కేకలే…ఇక రేవంత్‌న నమ్మితే తెలంగాణకు మరోసారి మోసమే…మళ్లీ ఆగమే…ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ. తెలంగాణ సమాజం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మళ్లీ ఆగం చేయాలని చూసిన దుర్మార్గుడు. తెలంగాణను మళ్లీ పొయ్యిలో తోసేయాలని చూసిన ద్రోహి. ఇప్పటికే ఉమ్మడి పాలనే బాగుందంటున్న ద్రోహిని తెలంగాణ ప్రజలు అసలే క్షమించరు. వందల మంది యువత ప్రాణాలు త్యాగాలు చేసి, తెలంగాణ సాధించుకున్నాం. ఆ సాధించుకున్న తెలంగాణలో అమరవీరుల త్యాగాలను అవమానించిన రేవంత్‌కు మన గడ్డమీద వుండే అర్హత లేదు. తెలంగాణలో రాజకీయాలు చేసే నైతికత లేదు. తెలంగాణలో ఓట్లడిగి రాజకీయం చేసే హక్కేలేదు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి సమజానికి ఒక ప్రత్యేకమైన ఆత్మగౌరవం వుంది. ఆత్మాభిమానం వుంది. సీమాంధ్రకు, తెలంగాణకు కొన్ని వైరుధ్యాలున్నాయి. ఆచార వ్యవహారాలలో తేడాలున్నాయి. బాషలో, యాసలు ప్రత్యేకంగా వున్నాయి. పండుగలు ప్రత్యేకతను సంతరించుకొని వున్నాయి. తెలంగాణ బతుకమ్మ స్వరూపం. తెలంగాణ బతుకమ్మ జీవన విధానం. తెలంగాణ పండగల బతుకమ్మ మన జీవనశైలికి నిదర్శనం. కాని ఆంధ్రుకు బతుకమ్మ లేదు. తెలంగాణ బతుకమ్మను అవరవై ఏళ్లలో సీమాంధ్రులు గౌరవించింది లేదు. పూజించింది లేదు. పూలను కొలిచిందిలేదు. పూలతో ప్రకృతికి దగ్గరైంది లేదు. తెలంగాణకు పూలంటే దైవం. తెలంగాణకు పూలంటే ఒక జీవితం. సమాజాన్ని కాపాడే కల్పతరువుకు సంకేతం. తెలంగాణ బాషలో కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఏ సమాజానికి సంస్కృతే ఆ వ్యవస్ధకు గొప్పది. అలాంటి వ్యవస్ధను ఆ సమాజంలో నివసించే రేవంత్‌ లాంటి వ్యక్తి నాశనం చేయాలని చూస్తే, ఆ ప్రజానికాన్ని మోసం చేయాలని చూస్తే తెలంగాణ గాలి కూడా క్షమించదు. అలాగే తెలంగాణ రేవంత్‌ చేసే రాజకీయాన్ని ఆహ్వానించదు. రేవంత్‌ రెడ్డి లాంటి తెలంగాణ ద్రోహిని ముందు పెట్టుకొని రాజకీయం చేస్తామంటూ కాంగ్రెస్‌పార్టీని ప్రజలు అసలే క్షమించరు. తెలంగాణ పిసిసి. అధ్యక్షుడయ్యాక ఇప్పటికే తెలంగాణలో అనేక చిచ్చులు పెట్టే ప్రయత్నం రేవంత్‌రెడ్డి చేశాడు. రైతులకు మూడు గంటల కరంటు చాలంటూ మొదలుపెట్టి, ఉమ్మడి పాలనే బాగుందనేదాకా అనేక నీతిమాలిన వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ ఆలయ భూములు అమ్మి, మైనార్టీ డిక్లరేషన్‌ అమలు చేస్తానని చెప్పి, సమజాంలో చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్‌ అంటే హైదరాబాద్‌లో కర్ఫ్యూ. హైదరాబాద్‌లో హిందువులు, ముస్లింలు కలిసి వుంటే కాంగ్రెస్‌ రాజకీయం చెల్లదు. అలా కలిసి వుండడం కాంగ్రెస్‌ నచ్చదు. కొన్ని వందల సంవత్సరాలుగా కలిసి బుతుకుతున్న తెలంగాణ సమాజంలో చిచ్చుపెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణ వచ్చిన తర్వాత గడచిన తొమ్మిదేళ్ల కాలంలో మళ్లీ మంచి రోజులను చూస్తున్నాం. తెలంగాణలో హిందూ ముస్లింల సఖ్యతను మళ్లీ కల్లారా చూస్తున్నాం. అలాంటి ప్రశాంతమైన వాతావారణాన్ని చెడగొట్టాలని చూసే రేవంత్‌రెడ్డి లాంటి వ్యక్తిని తెలంగాణ సమాజం తరిమేయాలి. అతన్ని నమ్మిన పార్టీని హుస్సేన్‌సాగర్‌లో ముంచేయాలి. అప్పుడుగాని తెలంగాణకు పట్టిన శనిపోదంటున్న చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్‌, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో కాంగ్రెస్‌ను కడిగిపారేశారు. కాంగ్రెస్‌ అసలు స్వరూపం వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…
ఈ తరానికి కాంగ్రెస్‌ అంటే ఏమిటి?
ఆ పార్టీ ఎంత దుర్మార్గమైంది. రేవంత్‌ రెడ్డి లాంటి నాయకుడు తెలంగాణకు ఎంతో మోసకారి అన్నది తెలంగాణ సమాజానికి తెలియాల్సిన అవసరం వుంది. తెలంగాణ ఒకనాడు కోటి తరనాల వీణ. అలాంటి తెలంగాణను చెరపట్టినంత పనిచేసి, ఆంధ్రలో విలీనం చేసిన పార్టీయే కాంగ్రెస్‌పార్టీ. స్వాతంత్య్రం వచ్చిన తర్వత విముక్తికోసం తెలంగాణ సమాజం కోరుకుంటుంటే, దేశంలో విలీనం చేసినట్లే చేసి, ఆంధ్రాలో కలిపేసింది. నిజాం రాజ్యంలో పెనం మీద వున్న తెలంగాణ సమాజాన్ని ఆంధ్రతో కలిపి పొయ్యిలో వేసింది. తెలంగాణను ఆగం చేసింది. పైగా గడుసు పెల్లోడు లాంటి ఆంధ్రా చేతిలో,అమాయక అమ్మాయి తెలంగాణను పెడుతున్నాము. అంటూ సన్నాయి నొక్కులు నొక్కిన నెహ్రో చేసిన తొలి మోసం తెలంగాణకు శాపంగా మారింది. ఆనాటి నుంచి తెలంగాణ సమాజం అరిగోసడిరది. హైదరాబాద్‌ రాష్ట్రంగా వెలుగొందాల్సిన ప్రాంతాన్ని చీల్చి, సాంస్కృతిక విద్వంసం చేసిందే కాంగ్రెస్‌ పార్టీ. ఆంధ్రాతో ఎప్పుడూ తెలంగాణకు జీవన వైవిద్యమే..ఇప్పటికీ మహారాష్ట్రలోని మన పూర్వ ప్రాంతాలు, కర్నాకటలోని కొన్ని జిల్లాలలో తెలంగాణ సంస్కృతి కాపాడబడుతోంది. అక్కడి సమాజం ఇంకా తెలంగాణ యాసను, సంస్కృతిని కాపాడుకుంటున్నారు. కాని అరవైఏళ్లపాటు తెలంగాణతో కలిసిసాగి, తెలంగాణను విధ్వసం చేశారు. అందుకు ముఖ్య కారణం కాంగ్రెస్‌పార్టీ. ఇప్పుడు తగుదునమ్మా అని తెలంగాణ ఇచ్చింది మేమే..అని కొందరు..తెచ్చింది మేమే…అని చెప్పుకోవడానికి కూడా కాంగ్రెస్‌ నేతలు సిగ్గుపడడం లేదు. తెలంగాణ ద్రోహిని పార్టీ అధ్యక్షుడిని చేసుకొని, ఒకనాడు సోనియాగాంధీని అనరాని మాటలు అన్న రేవంత్‌ను నెత్తినపెట్టుకున్న కాంగ్రెస్‌ను ప్రజలు చీ కొడుతున్నారు. బాషా ప్రయుక్త రాష్ట్రాల కుట్రలో తెలంగాణను బలి చేసిందే కాంగ్రెస్‌పార్టీ. ఆంద్ర ప్రాంత నాయకులు తెలంగాణను దోచుకుంటుంటే సహకరించిందే కాంగ్రెస్‌ పార్టీ. కేవలం పదవుల కోసం చేతగాని దద్దమ్మల్లాగా చేతులు కట్టుకొని, పదవుల ఎర కోసం ఎదురుచూసిన తెలంగాణ నాయకులను లెక్కలోకి తీసుకోకుండా, సీమాంధ్రకు దోచిపెట్టినపార్టీయే కాంగ్రెస్‌. ఒకనాడు గొలుసు కట్టు చెరువులతో దేశంలోనే గొప్పగా సాగు సంపదను కలిగి వున్న ప్రాంతం తెలంగాణ. ప్రపంచంలోనే నైజాం ధనవంతుడుగా మారడానికి కూడా తెలంగాణసాగుసంపదే. అలాంటి తెలంగాణను , ఆంధ్రాలో విలీనం చేయడంతో తెలంగాణ సాగు ఆగమైంది. చెరువులు చెల్లాచెదురయ్యాయి. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం తెలంగాణ సాగు చిన్నాభిన్నమైంది. నీటి వసతులు కరువై, తెలంగాణ ఎడారిగా మారింది. దీనంతటికీ కారణం కాంగ్రెస్‌ పార్టీ. ఒక ప్రాంతాన్ని గొప్పగా, మరో ప్రాంతంపై సీత కన్నేసి చెరబట్టినంత పనిచేసింది కాంగ్రెస్‌పార్టీ. రెండు తెలుగు రాష్ట్రాల విలీనానికి ముందు, మూడుకోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌తో వున్న తెలంగాణ, రెండు కోట్ల లోటుతో ఏర్పాటైన ఆంధ్రలో కలిపారు. తెలంగాణకు ఆకలి కేకలు చూపించారు.
ఇప్పుడు తెలంగాణ పచ్చి వ్యతిరేకి రేవంత్‌రెడ్డిని ముందు పెట్టుకొని మళ్లీ శిఖండి రాజకీయం చేస్తోంది కాంగ్రెస్‌పార్టీ.
కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. వాళ్ల తెలివి తెల్లారినట్లే వుందని తిట్టుకుంటున్నారు. 24గంటల ఉచిత కరంటు ఇస్తున్న తెలంగాణకు వచ్చి, కర్నాటక కాంగ్రెస్‌ నేతలు ఐదుగంటల కరంటు ఇస్తామంటుంటే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తెల్లమొహం వేయాల్సివస్తోంది. అంటే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నది నిజమే అని నమ్మాల్సి వస్తోంది. తాజాగా నిజామాబాద్‌ లో ప్రచారం చేసిన షబ్బీర్‌ అలీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అంటే ఒక బల్బు, ఒక ప్యాన్‌, ఒక టివి. వుంటేనే ఇస్తామని, అంతకంటే ఎక్కువ వుంటే ఇవ్వమని తేల్చేశారు. ఎన్నికలు కాకముందే ఇన్ని అబద్దాలు ఆడుతున్న కాంగ్రెస్‌ను నమ్మితే నట్టెట ముంచడం ఖాయం. అయినా జాతీయ పార్టీలకు దేశమంతా ఒకే విధానం వుండాలి. కాని పూటకో వేషం వేసినట్లు, రాష్ట్రానికో విధానం అంటేనే కాంగ్రెస్‌ డొల్లతనం ఏమిటో అర్ధమౌతోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version