నామినేషన్ల స్వీకరణలో గడువు సమయాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి
జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో సమయపాలన కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.అన్వేష్,కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్ లతో కలిసి సందర్శించి నామినేషన్ల ప్రక్రియ తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని,నామినేషన్ల స్వీకరణలో సమయపాలన ఖచ్చితంగా పాటించాలని, సాయంత్రం 5 గంటలకు గేటు మూసివేయాలని,గేటు లోపల ఉన్నవారికి టోకెన్లు అందజేసి వరుస క్రమంలో నామినేషన్లు స్వీకరించాలని,రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల స్వీకరణలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.నామినేషన్ల స్వీకరణ కొరకు టేబుళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని,నామినేషన్ దరఖాస్తులు నింపడం,జతపరచవలసిన పత్రాలు,ఇతర వివరాల కొరకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.నామినేషన్ దరఖాస్తులు పూర్తి చేసిన అభ్యర్థులు హెల్ప్ డెస్క్ వద్ద పరిశీలించుకుని సరైన నామినేషన్లు దాఖలు చేయాలని తెలిపారు.31వ తేదీన నామినేషన్లు పరిశీలించి అర్హత గల అభ్యర్థుల జాబితా ప్రకటన,ఫిబ్రవరి 1వ తేదీన నామినేషన్లపై అభ్యంతరాలు,ఫిర్యాదుల స్వీకరణ,2వ తేదీన అభ్యంతరాలు,ఫిర్యాదుల పరిష్కారం,3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటన జరుగుతుందని తెలిపారు.ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్,12వ తేదీన రీపోలింగ్ (ఏమైనా ఉన్నట్లయితే), 13వ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి గెలుపొందిన అభ్యర్థుల ప్రకటన జరుగుతుందని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ నం.08736-250501 ఏర్పాటు చేయడం జరిగిందని,ఎన్నికల సంబంధించిన సమాచారం,ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన పై ఫిర్యాదుల కొరకు సంప్రదించవచ్చని తెలిపారు.జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
