మల్లక్కపేట గ్రామాన్ని సందర్శించిన ఇంచార్జ్ ఎంపిడిఓ రామకృష్ణ
పారిశుద్ధ్యం పాటించాలి, ఉపాధి హామీ పనులకు తప్పక హాజరుకావాలి
పరకాల,నేటిధాత్రి
పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామాన్ని శుక్రవారం ఇంచార్జ్ ఎంపిడిఓ రామకృష్ణ సందర్శించారు.గ్రామంలోని పలు కాలనీలు,ప్రధాన వీధులు,పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించిన ఆయన గ్రామ ప్రజలతో సమావేశమై గ్రామ సమస్యలు,అభివృద్ధి పనులపై ఆరా తీశారు.గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల అమలు,ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవల గురించి స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.ఇంటి పరిసరాలు,రహదారులు,కాలనీలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చని తెలిపారు.

చెత్తను రోడ్లపై వేయకుండా గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచాలని సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు.అలాగే ప్రభుత్వం చేపడుతున్న ఉపాధి హామీ పనులకు గ్రామ ప్రజలు తప్పనిసరిగా హాజరై ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.గ్రామ అభివృద్ధితో పాటు కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు ఈ పనులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి కుటుంబం ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు.గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు,డ్రైనేజీ,రహదారులు, విద్యుత్,పారిశుద్ధ్యం తదితర సమస్యలను నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.సమస్యల పరిష్కారానికి అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.ఇటీవల నిర్వహిస్తున్న సెన్సెస్ కార్యక్రమంపై కూడా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించిన ఆయన ప్రతి కుటుంబం సరైన వివరాలు అందించి అధికారులకు సహకరించాలని సూచించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు జనగణన వివరాలు కీలకమని తెలిపారు.గ్రామ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు,గ్రామ ప్రజలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దొమ్మటి కవిత మధు,పంచాయతీ కార్యదర్శి సుమలత,కారోబార్ అనందరావు,గ్రామస్థులు పాల్గొన్నారు.
