MCPi Protest Over Women Bill
ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న మోడీ ప్రభుత్వం
33 శాతం మహిళా రిజర్వేషన్లు బేషరతుగా అమలు చేయాలి
వరంగల్లో ఎంసిపిఐ(యు) నిరసన ర్యాలీ
నర్సంపేట/వరంగల్,నేటిధాత్రి :
దేశ సమైక్యత, సమగ్రతకు భంగం కలిగించే విధంగా రాజ్యాంగ సవరణలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేపడుతోందని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఆందోళన వ్యక్తం చేశారు. 2023లో తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లును బేషరతుగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కమిటీ పిలుపుతో పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన తపాలా కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమం జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన గాదగోని రవి మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత రాజ్యాంగాన్ని బలహీనపరచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. అశాస్త్రీయ పద్ధతుల్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు రాజ్యాంగ సవరణలకు కేంద్రం తెరలేపిందని ఆరోపించారు.మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయకుండా, దాన్ని నియోజకవర్గాల పునర్విభజనతో అనుసంధానం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దక్షిణ భారత రాష్ట్రాలకు నష్టం కలిగించే విధంగా తీసుకొస్తున్న విధానాలపై ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వం మహిళల పట్ల గౌరవం ఉంటే ఎలాంటి షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా విధానాలు రూపొందించాలని, లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గోనె కుమారస్వామి, ఎన్ రెడ్డి హంసారెడ్డి, నర్ర ప్రతాప్, మాలోత్ సాగర్, కర్ర రాజిరెడ్డి, ముక్కెర రామస్వామి, చుంచు జగదీశ్వర్, మహమ్మద్ మహబూబ్ పాషా, ఎగ్గని మల్లికార్జున్, చీపురు ఓదెలు, మాలి ప్రభాకర్, అప్పనపురి నరసయ్య, బాబు రామస్వామి, జట్టి రాజు, అడపా యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
