inter re-varificationku sahakaristam, ఇంటర్‌ రీ-వెరిఫికేషన్‌కు సహకరిస్తాం

ఇంటర్‌ రీ-వెరిఫికేషన్‌కు సహకరిస్తాం

రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌కు ఉచితంగా అనుమతించి ఫెయిలైన 3లక్షల మంది ఇంటర్‌ విద్యార్థులకు బాసటగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు ఇంటర్‌ అధ్యాపకుల జెఎసి కతజ్ఞతలు తెలిపింది. అద్యాపకుల జెఎసితో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి సమావేశమై రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌ ఏర్పాట్లపై చర్చించారు. సమావేశం అనంతరం అధ్యాపకుల జెఎసి అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడారు. వేసవి సెలవులతో సంబంధం లేకుండా విద్యాశాఖలోని 25వేల మంది అధ్యాపకులు ఈ ప్రక్రియకు సహకరించాలని జనార్దన్‌రెడ్డి కోరారని, దానికి తాము సమ్మతించామని ఆయన చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం అవసరమైతే అదనపు గంటలు పనిచేయాలని కోరారన్నారు. సరైన ప్రమాణాలు లేని గ్లోబరీనా సంస్థ వల్లే ఈ సమస్యలన్నీ ఉత్పన్నమయ్యాయని మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. ఫలితాల్లో తప్పులు వస్తాయని మూడునెలల ముందే చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఈ పరిణామాలకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ బాధ్యత వహించాలని జెఎసి నేతలు పరోక్షంగా ఆరోపించారు. రీ-వెరిఫికేషన్‌ ప్రక్రియ బాధ్యతలను విద్యాశాఖ కార్యదర్శికి అప్పగించడం మంచి నిర్ణయమన్నారు. ఇంటర్‌ బోర్డు రద్దు చేస్తారని తాము అనుకోవడం లేదని, ముఖ్యమంత్రి అన్ని అంశాలను పరిశీలిస్తారని భావిస్తున్నట్లు మధుసూదన్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *