Friendship Meetings for Girls
గీసుగొండలో కిశోర బాలికలకు స్నేహ సమావేశాలు
గీసుగొండ,నేటిధాత్రి:
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ప్రగతి మండల సమైక్య సహకారంతో మండలంలోని అన్ని గ్రామాల్లో 14 నుంచి 18 ఏళ్ల బాలికలకు ప్రత్యేక స్నేహ సంఘాలు ఏర్పాటు చేసినట్లు మండల ప్రాజెక్టు మేనేజర్ ముక్కెర ఈశ్వర్ తెలిపారు. వేసవి సెలవుల్లో భాగంగా స్నేహ సంఘాల సమావేశాల ద్వారా కిశోర బాలికలకు భద్రత, విద్య, పౌష్టికాహారం, ఆరోగ్యం అంశాలపై శిక్షణలు, సమావేశాలు నిర్వహిస్తున్నామని వివరించారు.శుక్రవారం జరిగిన సమావేశంలో పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ సతీమణి శోభవతి చరవాణి ద్వారా బాలికలతో మాట్లాడారు.

వేసవి సెలవులను ప్రణాళిక ప్రకారం వినియోగించుకోవాలని, తల్లిదండ్రులకు సాయపడాలని, మిగిలిన సమయంలో గొప్పవారి జీవిత చరిత్రలు చదవాలని, శారీరక దృఢత్వం ఇచ్చే ఆటలు ఆడాలని సూచించారు. అవసరానికి మాత్రమే మొబైల్ వాడాలని, అనవసర కాలక్షేపానికి దూరంగా ఉండాలని చెప్పారు.డాక్టర్ రేవతి మాట్లాడుతూ రక్తహీనత వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. మంచి ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా రక్తహీనతను నివారించవచ్చని, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు విరివిగా తీసుకోవాలని, హిమోగ్లోబిన్ 12 శాతం ఉండేలా చూసుకోవాలని సూచించారు.ఈసమావేశంలో సర్పంచులు వీరగోని రాజ్కుమార్, పోగుల వనిత తమ బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో సీసీలు బొజ్జ సురేశ్, నల్ల నర్సయ్య, సమైక్య అధ్యక్షులు రాధిక, శారద, శిల్ప, వివిధ గ్రామాల వివో ప్రతినిధులు, వివోఏలు పాల్గొన్నారు.
