Protest Against Commercial Gas Price Hike
వాణిజ్య గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించుకోవాలి
కేసముద్రం/ నేటి ధాత్రి
కేంద్ర ప్రభుత్వం పెంచిన వాణిజ్య గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని సిపిఐ మండల నాయకులు మంద భాస్కర్ డిమాండ్ చేశారు. శనివారం కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంద భాస్కర్ మాట్లాడుతూ అధిక ధరలను అరికట్టవలసిన కేంద్ర ప్రభుత్వం ప్రజలపై పెను భారం మోపుతుందన్నారు. ఈ సంవత్సరం కేవలం ఐదు నెలల లోనే 6 సార్లు గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గమన్నారు. ఇతర రాష్ట్రాల ఎన్నికల అనంతరం వాణిజ్య గ్యాస్ ధరలు పెంచడం వలన హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లు మూతపడే ప్రమాదం ఉందని దీంతో వాటిపై ఆధారపడ్డ కార్మికులు, యాజమాన్యం జీవనోపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెరిగిన ధరల వల్ల హోటల్లు మరియు గ్రామాల్లోని చిన్న హోటల్లు మూతపడ్డాయని అన్నారు. గ్యాస్ ధరల పెంపు వలన టిఫిన్, టీ, భోజనం రేట్లు పెరిగి సామాన్య ప్రజలపై భారం పెరిగి జేబులకు చిల్లు పడుతుందన్నారు. కార్పొరేట్ శక్తులకు అనేక రాయితీలుస్తూ సామాన్య ప్రజలపై ధరల భారం మోపడం మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టుగా ఉందన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్గొండ వెంకన్న, ఎస్.కె మౌలానా, ఉప్పలయ్య, వెంకన్న, ఎస్ కే జిలాని, పాషా, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
