https://epaper.netidhatri.com/
` కారుకు ఎదురులేదు…బిఆర్ఎస్ గెలుపుకు తిరుగులేదు!
`పార్లమెంటు ఎన్నికలలో బిఆర్ఎస్ కే మెజారిటీ సీట్లు.
కేసిఆర్ రోడ్ షోలకు ప్రజలు బ్రహ్మరథం… పార్లమెంటు ఎన్నికలలో బిఆర్ఎస్ గెలుపుకు సంకేతం అంటున్న రాజ్యసభ సభ్యుడు
వద్దిరాజు రవిచంద్ర, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న ప్రచార విశేషాలు… ఆయన మాటల్లోనే..
` కాంగ్రెస్ పని అయిపోయింది.
`బిజేపికి దేశంలోనే ఎదురుగాలి వీస్తోంది.
`తెలంగాణలో కారుకు తట్టుకునే శక్తి ఏ పార్టీకి లేదు.
`అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ చేసిన అతి ప్రచారం నమ్మారు.
`కాంగ్రెస్ అబద్ధాలు నిజమనుకొని విశ్వసించారు.
`కేవలం అధికారం కోసం కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం తేలిపోయింది.
`మళ్లీ ప్రజలు కేసిఆర్ నాయకత్వం వైపు చూస్తున్నారు.
`కేంద్రంలో బిఆర్ఎస్సే కీలకం కానుంది.
`తెలంగాణ సంక్షేమం కాంక్షించేది కేసిఆర్ మాత్రమే.
`తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది కేసిఆరే.
`కాంగ్రెస్ కోరుకునేది రాజకీయాలు మాత్రమే.
`నెలలోనే కాంగ్రెస్ బండారం బైట పడిరది.
`తెలంగాణ ప్రజలను గోస పెడుతోంది.
`కాంగ్రెస్ను జనం నమ్మే స్థితిలో లేరు.
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్లమెంటు ఎన్నికల్లో సంచలనాలు నమోదు కాబోతున్నాయి. బిఆర్ఎస్కు పూర్వ వైభవం దగ్గర్లోనే వుంది. పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ మెజార్టీ సీట్లు సాధించే క్రమంలో వుంది. ప్రజలు మళ్లీ బిఆర్ఎస్ వైపు చూస్తున్నారు. కేసిఆర్ నాయకత్వం కోరుకుంటున్నారు. కేసిఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అనుకుంటున్నారు. తెలంగాణ సాధించిన కేసిఆర్కు ప్రజల సాధకబాధకాలు తెలుసు. తెలంగాణ సమస్యలు తెలుసు. వాటికి పరిష్కారం కూడా కేవలం కేసిఆర్కే తెలుసు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి, మాయ చేసి అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కాని వాటి అమలు సాధ్యాసాధ్యాలను భేరీజు వేసుకోలేదు. అందుకు కసరత్తు జరగలేదు. ఎలా అమలు చేయాలన్నదానిపై ఎలాంటి ప్రణాళిక లేదు. దాంతో నోటికొచ్చిన వాగ్ధానాలు కురిపించారు. గ్యారెంటీలంటూ ప్రచారం చేసుకున్నారు. తీరా గెలిచాక వాటిని అమలు చేయలేక చతికిల పడుతున్నారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోలేక సతమతమౌతున్నారు. ప్రజలనుంచి చీత్కారాలు ఎదుర్కొంటున్నారు. రైతులను నుంచిశాపనార్దాలు ఎదుర్కొంటున్నారు. అన్నం ఉడికిందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు చాలు. కాంగ్రెస్ పాలన బాగుందా లేదా? అన్నది తేల్చేందుకు ప్రజలకు నెల కూడా పట్టలేదు. ప్రమాణ స్వీకారం రోజే ఆరు గ్యారెంటీలపై సంతకాలు చేస్తామన్నారు. డిసెంబర్9 నాడే రెండు లక్షల రుణ మాఫీ అన్నారు. ఆ తర్వాత వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. రైతు రుణ మాఫీ మీద మళ్లీ మాట మార్చారు. ఇప్పుడు కొత్తగా ఆగష్టు 15 అంటున్నారు. అంతేకాకుండా ఆ గడువులోపైనా ఏక కాలంలో రుణ మాఫీ చేస్తారా? అన్నదానిపై భరోసా లేదు. రైతు బంధు పేరు మార్చి భరోసా అని చెప్పి ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకున్నది. ప్రజలకిచ్చిన భరోసాని గాలికొదిలేసింది. రాజకీయాలు తప్ప, పాలన చేతగాని వాళ్లు, పాలకలౌతే, నిత్యం కుర్చీల కొట్లాటే వుంటుంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో అదే జరుగుతోంది. అందుకే గత పదేళ్లుగా కాంగ్రెస్ను నమ్మేందుకు ఇష్టపడలేదు. ఒక్కసారి ప్లీజ్..ప్లీజ్ అంటూ వేడుకున్న కాంగ్రెస్ను కనికరించినందకు ప్రజలు బాధపడుతున్నారు. అర్హత లేని వాళ్లను అందలమెక్కిస్తే ఇలాగే వుంటుందని ఆవేదన చెందుతున్నారు. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ వైపు ప్రజలు ఆసక్తిగా చూసున్నారు. కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్దంగా వున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కారుకు తిరుగులేదు. బిఆర్ఎస్ గెలుపుకు ఎదురులేదు. మెజార్టీ సీట్లు బిఆర్ఎస్కే కట్టబెటేందుకు ప్రజలు ఎప్పుడో డిసైడ్పోయారు. అందుకే ఇటీవల కేసిఆర్ సభలకు, రోడ్షోలకు ప్రజలు స్వచ్చందంగా తరలి వస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుపు ఇదే సంకేతం. అంటున్న రాజ్య సభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, నేటి ధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్న ప్రచార విశేషాలు ఆయన మాటల్లోనే….
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయింది.
మూడు నెలల్లోనే కాంగ్రెస్ అసలు రంగు బైట పడిరది. కాంగ్రెస్ అంటేనే కష్టాలు..నష్టాలు..కరువులు, బాధలు, ప్రజలకు వెతలు. ప్రజల జీవితాల మధ్య అగాధాలు..రైతన్నల ఆర్తనాదాలు..ఆడ బిడ్డలకు నీళ్ల బిందెల గోసలు..కరంటు కోతలు. ఇన్ని కష్టాలు ఏక కాలంలో పెట్టే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే ప్రజలు ఆ పార్టీని పూర్తి స్ధాయిలో గత శాసన సభ ఎన్నికల్లో నమ్మలేదు. అత్తెసరు మెజార్టీ కట్టబెట్టారు. బలమైన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ను ఎంచుకున్నారు. కాంగ్రెస్ ఏ మాత్రం ఎటమటం చేసినా తోకలు కత్తిరించేందుకు బిఆర్ఎస్కు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. కాని ముఖ్యమంత్రే కత్తెర్లు జేబులో తిరుగుతుంటానంటున్నారు. ఇదెక్కడి విచిత్రమో..రాజకీయ వైచిత్యమో రేవంత్ రెడ్డే చెప్పాలి. దేశంలో ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నామా? చూశామా? ఒక ముఖ్యమంత్రి ప్రతి పక్ష నేతల పేగులు మెడలేసుకొని తిరుగుతానన్న సందర్భాలున్నాయా? ముఖ్యమంత్రి స్ధాయిలో వున్న వ్యక్తే శాంతి భద్రతల సమస్యలు సృష్టించేలా కాంగ్రెస్ కార్యకర్తలు మానవ బాంబులౌతారని అనొచ్చా? ముఖ్యమంత్రి ప్రజలకు ఆదర్శంగా వుండేలా వుండాలి? తప్ప ప్రజల్లో ఆవేశాలు రెచ్చగొట్టేలా వుండకూడదు. ఏ రైతుల ఓట్లతో గద్దెనెక్కారో..ఆ రైతులే రైతుబంధు గురించి ప్రశ్నిస్తే చెప్పుతో కొడతామంటూ మంత్రులు మాట్లాడడంతో కాంగ్రెస్ అంటేనే ప్రజల్లో హేవ భావం కలిగింది. ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేర్చలేరు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు. ప్రశ్నకు ప్రశ్నే సమాధానంతో ప్రజలను ఎల్లకాలం మభ్యపెట్టలేరు. కాంగ్రెస్ మబ్బులు తొలగిపోతున్నాయి. కాంగ్రెస్ అసలు రంగులు బైట పడుతున్నాయి. ఊసరవెళ్లి రంగులు మార్చినట్లు కాంగ్రెస్ పాలకులు రోజుకో ముచ్చట చెప్పడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంత సేపు గత మా ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలతో కాల యాపన తప్ప , కాంగ్రెస్ చేసేదేమీ లేదు. ఏ వర్గానికి కాంగ్రెస్ న్యాయం చేస్తున్న లేదు అన్నది తేలిపోయింది.
ఇక మళ్లీ కేసిఆర్ యుగం మళ్లీ ప్రజలు కోరుకుంటున్నారు.
ఇప్పుడున్న పరిస్దితుల్లో కారును తట్టుకునే స్ధితి ఏ పార్టీకి లేదు. రాదు కూడా…కారుకు ఎదురు నిలబడడం అంటే పోషమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్లే అన్నది కాంగ్రెస్, బిజేపిలకు అర్ధమైంది. బిఆర్ఎస్ అంటే రాజకీయాలకు, సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్. నాయకులను, ప్రజా సేవకులను తయారు చేసే కార్మాగారం. కేసిఆర్ శిక్షణలో ప్రజా చైతన్యాన్ని నేర్చుకున్న గులాబీ సైనికుల ముందు ఏ పార్టీ శ్రేణులు నిలబడలేరు. అసెంబ్లీ ఎన్నికల్లో అతి ప్రచారం, దుష్ప్రచారం..అసత్య ప్రచారం..అర్దం లేని ప్రచారం.. చేసి అలవి కాని హమీలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీకి నూకలు తెలంగాణలో చెల్లినట్లే.. ఇక పార్లమెంటు ఎన్నికల్లో చేయి తిరగబడినట్లే…మళ్లీ ప్రజలకు అభయ హస్తం అన్న అబద్దపు మాట వినిపించకుండా సరైన గుణపాఠం తప్పదన్నట్లే…ప్రజల ఆలోచనలు కనిపిస్తున్నాయి. మళ్లీ బిఆర్ఎస్కు మెజార్టీ సీట్లు కట్టబెడితేనే తెలంగాణ బాగు పడుతుందని నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమైన బిఆర్ఎస్ను కాదనుకున్నందుకు, కాంగ్రెస్ను ప్రజలు ఆదరించినందుకు తిప్పలు పడుతున్నారు. గెలిపించిన ప్రజల సంక్షేమం గాలికి వదిలేసి, ఎక్కే ప్లైట్,దిగే ఫ్టైట్ అన్నట్లు డిల్లీకి చక్కర్లు కొట్టడానికే కాంగ్రెస్ పాలకులకు సరిపోతోంది. ఇక ప్రజలు సమస్యలు పట్టించుకునే తీరిక ఎక్కడిది. ప్రజా సంక్షేమానికి సమయమెక్కడిది. అందుకే ప్రజల గురించి ఆలోచనలేని కాంగ్రెస్ను పక్కన పెడితే గాని కాంగ్రెస్కు గుణం రాదు. కాంగ్రెస్కోరుకునేది కేవలం రాజకీయం మాత్రమే. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ను ప్రజలు పక్కన పెట్టనున్నారు. తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్కు మెజార్టీస్ధానాలు కట్టబెట్టేందుకు సిద్దపడుతున్నారు.
అసలు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్ధుల పూర్వాశ్రమాలు, మూలాలు ఎక్కడివో ప్రజలకు కూడ తెలుసు. ఎందుంకంటే కాంగ్రెస్కు పోటీ చేసేందుకు అభ్యర్ధులే లేరు.
కేవలం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో మాత్రమేవుంది. నాయకుల కొరత మెండుగా వుంది. కాంగ్రెస్ నమ్మి రాజకీయాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, నాయకుల కర్మాగారామైన బిఆర్ఎస్ నుంచి నేతలు కాంగ్రెస్ దిగుమతి చేసుకున్నది. టికెట్లు ఇచ్చి బరిలో నిలిపింది. ఈ విషయం ప్రజలకు తెలియదా? ప్రజలు అంత అమాయకులనుకుంటున్నారా? శాసన సభ ఎన్నికల్లో గెలిస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ గెలవాలంటే రాష్ట్రం నుంచి కాంగ్రెస్ను గెలిపించాలని మెలిక పెడితే, ప్రజలు ఊరుకుంటారా? కర్రు కాల్చి వాత పెడతారు… కాంగ్రెస్ అడ్రస్ లేకుండా చేస్తారు. పార్లమెంటు స్దానాలలో కాంగ్రెస్ను ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తారు.ఇదే నిజం..ముమ్మాటికీ తధ్యం…కారు గెలవడం తెలంగాణకు చారిత్రక అవసరం. తెలంగాణ రైతుల ప్రయోజనాలకు శ్రీకారం. ప్రజల సంక్షేమానికి మార్గం. అందుకే కాంగ్రెస్ను రాజకీయాలకు దూరం తరిమితే తప్ప, తెలంగాణలో సంక్షేమాలు ప్రజల దరి చేరవు. కేసిఆర్ నాయకత్వంలోనే మేలైన పాలన. మెరుగైన జన జీవనం. మళ్లీ తెలంగాణ అన్నపూర్ణగా అవతరణం.