బడి బస్సులు భద్రమేనా…?

బడి బస్సులు భద్రమేనా…?

పాఠశాలలు మొదలయ్యాయి…పిల్లల ఫీజులు, పుస్తకాలు కొనటంలో విద్యార్థుల తల్లితండ్రులు తలమునకలు అవుతున్నారు. పుస్తకాల రేట్లు ఎమ్మార్పీ రేటుకు ఎక్కువ ఉన్నా, అసలు పుస్తకాలపై రేటు లేకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులుచేసి కొనవలసి వస్తుందని తల్లితండ్రుల వాదన. దూరప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు పాఠశాల యాజామాన్యం బస్సులు ఏర్పాటు చేస్తుంది. కానీ వాటికి ఫిట్‌నెస్‌ పరీక్షల నిమిత్తం ఆర్టీఏ కార్యాలయానికి రావాల్సిన బస్సులు నేటివరకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకునేందుకు కార్యాలయం మొహం చూసిన పాపానపోలేదు. ఫిట్‌నెస్‌ పరీక్షలు చేసేందుకు అధికారులు సన్నద్ధమైనా…కళాశాల, పాఠశాలల యాజమాన్యలు మాత్రం ఫిట్‌నెస్‌ చేయించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆర్టీఏ యంత్రాంగం పాఠశాలకు చెందిన బస్సులు సభలకు, ఇతర కార్యక్రమాలకు వినియోగించరాదని నిబంధన ఉన్నా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. దీంతో ఇంజన్లు మరమ్మతులకు గురై ఆకస్మాత్తుగా కళాశాల, పాఠశాలల బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఎక్కడో ఒకచోట తరచూ పాఠశాలల బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు ప్రమాదాల బారినపడుతూనే ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలతో పిల్లలకు బంగారు భవిష్యత్‌ అందించాలనే కల నెరవేరకపోగా తల్లిదండ్రులకు కడుపుకోతే మిగులుతోంది. రాష్ట్రప్రభుత్వం పాఠశాల, కళాశాల బస్సుల ప్రమాదాలను నివారించేలా నిబంధనలు ఈ విద్యాసంవత్సరంలో కఠినతరం చేసింది అని చెప్పొచ్చు. దీంతో అధికారులు అప్రమత్తమై వాహనాల పనితీరు, సామర్థ్యాన్ని, నిబంధనల అమలుతీరును గుర్తించే పనిలోపడ్డారు. బస్సుల సామర్థ్య నిర్థారణ విషయంలో నిబంధనలు మేరకు అన్నీ సక్రమంగా ఉంటేనే ధ్రువీకరణపత్రం ఇవ్వాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, జిల్లా రవాణాశాఖ అధికారులు మాత్రం తూతూ మంత్రంగానే ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆ శాఖ ఉన్నతాధికారులకు కొన్ని విద్యాసంఘాలు చేసిన ఫిర్యాదుల మేరకు ఉన్నతాధికారులు పరిశీలన నిమిత్తం నేటి నుండి బస్సులపై ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నామని ఆర్టీఏ అధికారులు తెలిపారు. బడి సమయంలో కాకుండా రోడ్డుపై తిరిగే స్కూల్‌ బస్సులను సీజ్‌చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అలాగే, సభలు, ఇతరత్రా కార్యక్రమాలకు వెళ్లే బడిబస్సులను కూడా రవాణాశాఖ సరికొత్త నిబంధనలతో సీజ్‌ చేస్తున్నట్టు తెలిసింది. ఇదిలాఉండగా, జిల్లాలో వివిధ విద్యాసంస్థలకు వెయ్యికి పైగా బస్సులు ఈ పదిరోజుల్లో వరంగల్‌లోని అన్ని పాఠశాల, కళాశాలలు బస్సులు సామర్థ్యం పరీక్షలలో అర్హత పొందాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ కేవలం పదులసంఖ్యలో మాత్రమే అర్హత పత్రాలు పొందాయి. ఈ ఏడాది అధికారులు నిబంధనలు కఠినతరం చేసిన వాటిని కచ్చితంగా అమలు చేస్తుండటంతో ఫిట్‌నెస్‌ పరీక్షలకు యాజమాన్యాలు ఆసక్తి చూపడంలేదని చెప్పొచ్చు. దీంతో గడువు ముగిసే సమయానికి అన్ని బస్సుల పరిశీలన పూర్తయ్యే విదంగా పని చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు దీంతో ఆర్టీఏ అధికారులు హైరానా పడాల్సివస్తోంది. కొన్ని ప్రైవేటు పాఠశాలలు చివరిరోజు వరకు ఆగి ఆ తర్వాత పైపైన పరీక్షలతో ధ్రువపత్రాలను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

బడి బస్సు సామర్థ్య పరీక్ష చేయించాలంటే ముందుగా సంబంధిత వెబ్‌సైట్‌లో చలానా ఇంకా బస్సు వివరాలు పొందుపరచాలి. ఆ ప్రక్రియ పూర్తయ్యాక బస్సును తనిఖీకి ఏ సమయంలో తీసుకెళ్లాలో వివరాలు వస్తాయి. ఆ మేరకు సంబంధిత రవాణాశాఖ కార్యాలయానికి వెళ్ళి సామర్థ్య పరీక్ష పూర్తి చేయించుకోవాల్సివుంటుంది. గతంలో ఎలా ఉన్న ఈసారి మాత్రం నిబంధనలు కఠినతరం చేయడంతో గడువు ముగిసేనాటికి బడి బస్సులన్నింటికీ సామర్ధ్య నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలంటూ ఆర్టీఏ అధికారి చెప్పారు. నిబంధనలు పాటించకపోయినా, సకాలంలో ధ్రువీకరణ పత్రం పొందకపోయినా యాజమాన్యాలపై కఠినచర్యలు తీసుకుంటామంటూ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ పురుషోత్తం తెలిపారు.

నిబంధనలు ఇవే…

బడి బస్సు వయస్సు 15 ఏళ్ళులోపు ఉండాలి. కచ్చితంగా బీమా కలిగి ఉండాలి.

వాహనం ముందు వెనుక పాఠశాల బస్సు అని, సంస్థపేరు రాయించాలి. దాని పక్కనే పిల్లల చిత్రాలు ఉండాలి.

సీట్లు సౌకర్యవంతంగా ఉండాలి. బస్సు వెనుక వైపు అత్యవసర ద్వారం తప్పనిసరి.

పిల్లలు ఎక్కటానికి వీలుగా ఫుట్‌బోర్డు మొదటిమెట్టు నేల నుంచి 325 మి.మీ. లోపు ఎత్తు ఉండాలి.

అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స పరికరాలు అవసరమైన మందులు ఉంచాలి.

బస్సుల ముందు భాగంలో తెలుపు, వెనుక ఎరుపు, పక్కనే పసుపు రంగు రేడియం స్టిక్కర్లు అమర్చాలి.

బ్రేక్‌, హారన్‌, ఇంజన్‌ కండిషన్‌ సక్రమంగా ఉండేలా చూడాలి.

డ్రైవర్‌ ఫోటో, లైసెన్స్‌ వివరాలను అందరికీ తెలిసేలా బస్సులోపల బోర్డు ఏర్పాటు చేయాలి.

నిత్యం ప్రయాణించే విద్యార్థుల జాబితాను బస్సులో ఉంచాలి.

విద్యార్థులను ఎక్కించేందుకు దించేందుకు ప్రతీ బస్సుకు ఒక అటెండర్‌ను ఏర్పాటు చేయాలి.

రోజూ రాకపోకలు రూట్‌మ్యాప్‌ బస్సులో అతికించాలి.

పాఠశాల ఆవరణలో పార్కింగ్‌ చేసేలా చర్యలు చేపట్టాలి.

యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి కమిటీని ఏర్పాటు చేసి ప్రతీ నెలా బస్సు స్థితిని పరీక్షించాలి.

ప్రతీరోజూ ప్రయాణించే మార్గాన్ని ప్రధానోపాధ్యాయులు పరిశీలించాలి.

ఉపాధ్యాయుల నుంచి ఒకరు, పిల్లల తల్లిదండ్రుల నుంచి మరోకరు బస్సులో ప్రయాణించాలి.

సమస్యలుంటే నేరుగా రవాణాశాఖ అధికారులకు కమిటీ సభ్యులు ఫిర్యాదు చేయాలి.

ఆర్టీఏ అధికారులు, విద్యార్థుల తల్లితండ్రులు పైన పేర్కొన్న విధంగా పాటిస్తే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు దారి వేయొచ్చని చెప్పొచ్చు.

5బస్సులు సీజ్‌చేసిన అధికారులు

నేటివరకు సామర్థ్య నిర్దారణ పాటించని పాఠశాల బస్సులను వరంగల్‌ అర్బన్‌ రూరల్‌ జిల్లా మిత్తం మీద 5 బస్సులు సీజ్‌ చేసినట్టు డిటిసి పురుషోత్తం తెలిపారు. ఇంకా ఈ తనికీలు జరుగుతాయని వీలైనంత త్వరగా కార్యాలయంలో ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవాలని, లేదంటే బస్సులను సీజ్‌ చేయటం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *