సమస్యల తిష్ట బోజ్యానాయక్ తండా.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: జిల్లాస్థాయి అధికారులు కింది స్థాయి అధికారులకు ఎన్నిసార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చిన, అధికారులు ఆదేశాలు జారీచేసిన కింది స్థాయి సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బోజ్యానాయక్ తండా పంచాయతీ పరిధిలోని పూర్యా నాయక్ తండా, రామ్ చందర్ నాయక్ తండా , టోప్యా నాయక్ తండాలలో పలు సమస్యలు నెలకొన్నాయి. గురువారం పలు తండాలను పరిశీలించగా బోజ్యానాయక్ తండా లో సగం మందికి మాత్రమే నీటి సరఫరా జరుగుతుంది. మరి కొంతమందికి నీటి సరఫరా కావడం లేదు. గ్రామపంచాయతీ ట్రాక్టర్ గత మూడు నెలల నుంచి పనిచేయకపోవడంతో మూలన పడింది.పాఠశాల ఆవరణలో నర్సరీ పెంపకం నిర్లక్ష్యంగా కనిపించింది. రామ్ చందర్ నాయక్ తండా కు సరైన రోడ్డు మార్గం లేదు. పూర్యా నాయక్ తండా లో మినీ ట్యాంక్ వద్ద అపరిశుభ్రంగా ఉంది. మురికి కంపు కొడుతుంది. తండావాసులకు సరిపడా నీటి సరఫరా జరగడం లేదు. టోప్యా నాయక్ తండాలలో ఇటీవలనే నూతనంగా మంచినీటి బోర్లు వేశారు. బోర్ నుంచి తండా వరకు పైప్ లైన్ వేయకపోవడంతో ఓ మహిళ రైతుకు చెందిన వ్యవసాయ పైపులను అమర్చి నీటిని అందిస్తున్నారు. సిసి రోడ్లు అసలుకే కనిపించలేదు. నాలుగు తండాలో కలిపి అనుసంధాన రోడ్లు లేక వైద్యం, ఇతర గ్రామాలకు వెళ్లే గిరిజనులు, బడికి వెళ్ళే విద్యార్థులు వృద్ధులు, మహిళలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే టోప్యా నాయక్ తండాకు గ్రామపంచాయతీ కార్యదర్శి సందర్శించడం లేదని గిరిజన వాసులు వాపోయారు.
సమస్యలు పరిష్కరిస్తాం.. ఎంపీడీవో సుధాకర్
బోజ్యానాయక్ తండా గ్రామపంచాయతీలో నెలకొన్న పలు సమస్యలపై ఝరాసంగం మండల అభివృద్ధి అధికారి సుధాకర్ వివరణ కోరగా సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. పైప్ లైన్ విషయంలో ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.