Teachers Urged to Attend State Education Conference
టీపీటీఫ్ రాష్ట్ర విద్యా సదస్సుకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలిరావాలి
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ పిలుపు
టిపిటిఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు వాల్ పోస్టర్, కరపత్రిక ఆవిష్కరణ
ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునే పూర్తి బాధ్యత ఉపాధ్యాయులదే
వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడంలో నిత్య విద్యార్థులు కావాలి
కేసముద్రం/ నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం,పాఠశాలల, ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 30 ఏప్రిల్ 2026, ఉదయం 10 గంటలకు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర విద్యా సదస్సుకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ పిలుపునిచ్చారు. గురువారం కేసముద్రం విలేజ్ ఉన్నత పాఠశాలలో అధ్యక్షులు గుండు సురేందర్ నేతృత్వంలో టిపిటిఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు గోడపత్రిక మరియు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ
ఈ సదస్సులో
ప్రస్తుత విద్యా పరిస్థితులు భవిష్యత్ దిశ అనే అంశం పై
డా. జె. గోవింద్ నికోలస్, ఐఏఎస్
జాతీయ విద్యా విధానం సమాజంపై ప్రభావం
అనే అంశంపై ప్రొ. ఎం. కొదండరాం ,బడ్జెట్, నిధుల కేటాయింపు – ప్రభుత్వ బాధ్యత
అనే అంశంపై ప్రొ. జి. హరగోపాల్,
తెలంగాణలో అమలవుతున్న విద్యా విధానాలు – వాస్తవ పరిస్థితులు అనే అంశంపై
ప్రొ. చింతకండి కాశీం, విద్యార్థుల హక్కులు – ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ అనే అంశంపై కె. శ్రీనివాస్ లు విశ్లేషణాత్మక అవగాహనను కల్పిస్తారని ఆయన వివరించారు. అంతేకాకుండా
ప్రధాన సమస్యలైన
ప్రభుత్వ పాఠశాలల మూసివేత మరియు విలీనాలు, ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ లో ఆలస్యం, విద్యా రంగానికి తక్కువ బడ్జెట్ కేటాయింపు, ప్రైవేటీకరణ వల్ల ప్రభుత్వ విద్యపై ప్రభావం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యా నాణ్యత తగ్గడం, విద్యార్థుల హాజరు తగ్గిపోవడం మొదలగు అంశాలపై చర్చిస్తారని వివరించారు. కావున ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై సమకాలీన అంశాలపై, వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ ఉపాధ్యక్షులు చీకటి వెంకట్రాం నర్సయ్య, మండల శాఖ కార్యదర్శి వీసం నర్సయ్య, అప్పాల నాగరాజు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్, ఉపాధ్యాయులు, రమేష్, శ్రీనివాస్, సౌరం సుధాకర్, శిరీష, నాగమణి, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.
