Police Issue Summer Safety Advisory
వేసవి సెలవుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి*
గీసుగొండ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీఐ విశ్వేశ్వర్ కీలక సూచనలు
గీసుగొండ,నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నుండి వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో గీసుగొండ ప్రాంత ప్రజలకు పోలీసులు పలు ముఖ్య సూచనలు జారీ చేశారు. పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సీఐ విశ్వేశ్వర్ కీలక సూచనలు చేశారు.విద్యాశాఖ ఆదేశాల మేరకు సెలవుల సమయంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం పూర్తిగా నిషేధమని, ఈ నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నందున మధ్యాహ్న సమయంలో పిల్లలను బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే బావులు, చెరువులు, కాలువలు వంటి ప్రమాదకర ప్రాంతాలకు ఈత కోసం వెళ్లకుండా పిల్లలను కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని పేర్కొన్నారు.అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని తెలిపారు.ప్రజలందరూ పై సూచనలు పాటించి పిల్లల భద్రతకు సహకరించాలని గీసుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. విశ్వేశ్వర్ విజ్ఞప్తి చేశారు.
