రోడ్డు మనది కాదు.. అది వాళ్ళది..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: దశాబ్దాల క్రితం, రోడ్లను వాటి స్థితిని బట్టి పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోకి, మిగిలిన వాటిని ఆర్&బి శాఖ పరిధిలోకి తీసుకువచ్చారు. మరమ్మతులు, కల్వర్టుల నిర్మాణం లేదా ఇతర సమస్యలు తలెత్తితే, ఆయా శాఖల అధికారులు వాటిని పరిష్కరించేవారు. ట్రాఫిక్ పెరిగినందున, పంచాయతీ రాజ్ శాఖ రోడ్లను ఆర్&బికి, ఆర్&బి రోడ్లను జాతీయ రహదారుల శాఖలకు బదిలీ చేస్తూ, వాటి హోదాను ఉన్నతీకరిస్తున్నారు. జహీరాబాద్-ఎల్గోయ్ రహదారి ‘మాది కాదు’ అని చెబుతూ రెండు శాఖల అధికారులు బాధ్యత నుంచి తప్పించుకోవడంతో, అనేక గ్రామాల్లోని ప్రజలు గందరగోళానికి గురయ్యారు.
ప్రమాదకరమైన పరిస్థితి..
జహీరాబాద్ పట్టణం నుండి అల్గోల్ మరియు పోట్పల్లి మీదుగా ఎల్లోయికి 13.20 కిలోమీటర్ల రహదారి ఉంది. ఈ రహదారి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్) గుండా వెళుతూ ఝురసంగం మరియు మీర్జాపూర్(బి) రహదారికి కలుస్తుంది. నాలుగైదు దశాబ్దాల క్రితం పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ రహదారి, జహీరాబాద్, ఝరసంగం, న్యాల్కల్ మండలాల్లోని అనేక గ్రామాలలో ప్రజల రాకపోకలకు ఉపయోగపడుతుంది. పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా, అప్పటి ప్రభుత్వం 2018 జూన్లో ఈ రహదారిని రోడ్లు మరియు భవనాల (ఆర్&బి) విభాగానికి బదిలీ చేస్తూ ఒక జీవో జారీ చేసింది. సమగ్ర వివరాలతో పాటు గుంతలను పూడ్చి రోడ్డును మరమ్మతు చేయాలని ఆర్&బి శాఖ అధికారులు బదులిచ్చారు. ఆరేళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో మోకాళ్ల లోతు గుంతలు ఏర్పడి, ద్విచక్ర వాహనదారులు నిరంతరం ప్రమాదాలకు గురవుతున్నారు. 20 రోజుల క్రితం ఆల్గోలు సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో రోడ్డు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు నిరసన తెలిపినప్పటికీ, దానివల్ల ప్రయోజనం లేకపోయింది.
