కెమెరా కంటిలో నేరం.. నేరస్తుడికి తప్పించుకునే దారి లేదు…

కెమెరా కంటిలో నేరం.. నేరస్తుడికి తప్పించుకునే దారి లేదు!

సీసీ కెమెరాల కంటికి నేరస్తులు చిక్కు.. 65 కేసులు చేదించిన పోలీసులు..

గ్రామాలపై కెమెరా కవచం.. నేరాలకు చెక్కు పెట్టే పోలీస్ వ్యూహం..

కెమెరా ఉన్నచోట నేరానికి భయం.. రామయంపేట సర్కిల్లో 900 సీసీ కెమెరాలు..

చూస్తున్న కెమెరా.. తగ్గుతున్న నేరాలు! పోలీసుల చేతిలో బలమైన ఆయుధం..

ఒకప్పుడు నేరం చేసి ఎవరు చూడలేదని నేరస్తులు ధైర్యంగా తప్పించుకునే రోజులు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. ప్రతి వీధిలో ప్రతి కూడలిలో నిశ్శబ్దంగా గమనిస్తున్న సీసీ కెమెరా కంటికి నేరం దాచుకోవడం అసాధ్యంగా మారుతుంది. రామాయంపేట పోలీస్ సర్కిల్ పరిధిలో ఏర్పాటైన వందలాది కెమెరాలు నేరాలపై గట్టిగా వేస్తూ నేరస్తుల గుండెల్లో భయం నింపుతున్నాయి. ఈ కెమెరాల ఆధారంగా ఇప్పటికే పలు కేసులు వేగంగా ఛేదించడంతో ప్రజల్లో భద్రత భావం పెరుగుతుండగా గ్రామాల్లో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీసులు సూచిస్తున్నారు.

రామాయంపేట మార్చి 13 నేటి ధాత్రి (మెదక్)

ఒకప్పుడు గ్రామంలో నేరం జరిగితే… “ఎవరు చేశారు?” అనే ప్రశ్నకు సమాధానం దొరకడానికి రోజులు, నెలలు పట్టేది.
బాధిత కుటుంబాలు న్యాయం కోసం తలుపులు తట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. నిశ్శబ్దంగా చూస్తున్న ఒక చిన్న కెమెరా… నేరాన్ని కూడా, నేరస్తుడినీ పట్టుకునే సాక్ష్యంగా నిలుస్తోంది.
రామాయంపేట పోలీస్ సర్కిల్ పరిధిలో సీసీ కెమెరాలు ప్రజల భద్రతకు అండగా నిలుస్తున్నాయి. సర్కిల్ పరిధిలో ప్రస్తుతం దాదాపు 900 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని సీఐ వెంకటరాజా గౌడ్ తెలిపారు. ఈ కెమెరాల ఆధారంగా ఇప్పటికే సుమారు 65 కేసులను వేగంగా ఛేదించడం సాధ్యమైందని ఆయన వెల్లడించారు.
గతంలో జరిగిన కొన్ని హత్యలు, దొంగతనాలు, యాక్సిడెంట్లకు సంబంధించిన కీలక ఆధారాలు కూడా సీసీ కెమెరాల ద్వారానే బయటపడ్డాయని పోలీసులు చెబుతున్నారు. ఎవరూ చూడలేదనుకున్న చోట కూడా ఒక కెమెరా మాత్రం నిశ్శబ్దంగా అన్నీ రికార్డ్ చేస్తోంది.

సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో నేరాలు తగ్గుతాయని పోలీసులు స్పష్టంగా చెబుతున్నారు. ఎందుకంటే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారు కూడా కెమెరా కంటిని చూసి వెనక్కి తగ్గే పరిస్థితి వస్తోంది. యాక్సిడెంట్ చేసి పారిపోవాలని భావించే వారు కూడా ఇప్పుడు కెమెరాల కారణంగా తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది.
గ్రామాల్లో ముఖ్యమైన కూడళ్లు, మార్కెట్ ప్రాంతాలు, దేవాలయాల పరిసరాలు వంటి చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు మరింత భద్రత కలుగుతుందని పోలీసులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సీఐ వెంకటరాజా గౌడ్ తెలిపారు.

సమాజం సురక్షితంగా ఉండాలంటే పోలీసులు మాత్రమే కాదు… ప్రజల సహకారం కూడా అవసరం. ప్రతి గ్రామంలో కెమెరాలు ఏర్పాటు అయితే… ప్రతి వీధి ఒక నిశ్శబ్ద సాక్షిగా మారుతుంది. అప్పుడు నేరం చేయాలనుకునే వారి గుండెల్లోనే భయం మొదలవుతుంది.
సమాజ భద్రత కోసం… కెమెరా కన్ను ఎప్పుడూ మేల్కొని ఉంటుంది.

కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి..

కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి..

బీసీలకు రూ.20,000 కోట్ల కేటాయింపే న్యాయం..

మెట్టు గంగారాం డిమాండ్..

రామాయంపేట ఫిబ్రవరి 19 నేటి ధాత్రి (మెదక్)

వచ్చే ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ బడ్జెట్‌లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీల సంక్షేమానికి రూ.20,000 కోట్లు కేటాయించి చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో భాగంగా మహాత్మా జ్యోతిబా పూలే పేరుతో చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని, కాంట్రాక్టుల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, బీసీ ఉపాధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఇప్పటివరకు ఆ హామీలు అమలు కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ.9,200 కోట్లు, 2025-26 బడ్జెట్‌లో రూ.11,405 కోట్లు కేటాయించినప్పటికీ, వాస్తవంగా ప్రతి ఏడాది సుమారు రూ.300 కోట్లు మాత్రమే వినియోగించబడుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో సుమారు 60 శాతం జనాభా బీసీలే ఉన్నప్పటికీ, కేవలం మూడు శాతం నిధులు మాత్రమే కేటాయించడం, అందులోనూ ఒక్క శాతం కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధికి వినియోగించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.
ప్రభుత్వం బీసీ సంఘాలతో చర్చించి, రానున్న బడ్జెట్‌లో కామారెడ్డి డిక్లరేషన్‌కు అనుగుణంగా రూ.20,000 కోట్లు కేటాయించి, చట్టబద్ధమైన బీసీ కార్పొరేషన్ ద్వారా అమలు చేయాలని కోరారు. కేటాయించిన ప్రతి రూపాయి కూడా బీసీల అభివృద్ధికే ఖర్చు అయ్యేలా పారదర్శక వ్యవస్థ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించి, వాస్తవ ఖర్చుల్లో వెనుకబడటం సరికాదని, ఇప్పటికైనా బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మెట్టు గంగారాం ప్రభుత్వాన్ని కోరారు.

రామాయంపేటలో ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ బ్రాంచ్ ప్రారంభం..

రామాయంపేటలో ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ బ్రాంచ్ ప్రారంభం..

రామాయంపేట, నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట పట్టణంలోని పాత పెట్రోల్ బంక్ సమీపంలో ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ సంస్థ కొత్త బ్రాంచ్‌ను జోనల్ హెడ్ శ్రీ గంధం కృష్ణ కుమార్ ప్రారంభించి జ్యోతి వెలిగించి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ముత్తూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ సంస్థ 1887లో తిరువనంతపురం, కేరళలో స్థాపించబడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3600కు పైగా బ్రాంచులతో విస్తరించింది. ఈ బ్రాంచ్‌లు హైదరాబాద్ జోన్‌లోకి వస్తాయి” అని తెలిపారు.

తక్కువ డాక్యుమెంటేషన్‌తో గోల్డ్ లోన్స్,
టూ వీలర్ లోన్స్, బిజినెస్ లోన్స్,
చిన్న వ్యాపారుల అభివృద్ధికి రుణ సదుపాయాలు.
మనీ ట్రాన్స్ఫర్ సర్వీసులు,
బీమా ఉత్పత్తులు (జీవ, ఆరోగ్య, జనరల్)
ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ సేవలు,
బిల్లు పేమెంట్లు, మొబైల్ రీఛార్జీలు, ఇతర డిజిటల్ సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ శ్రీపద్ శాస్త్రి, ఏరియా మేనేజర్ అమర్నాథ్, బ్రాంచ్ మేనేజర్ శేఖర్ రెడ్డి, నందిని, వనిత, శ్రీకాంత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version