విత్తన స్వయం సమృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం :
ఎమ్మెల్యే కాలే యాదయ్య
శంకరపల్లి, నేటిధాత్రి :
విత్తన స్వయం సమృద్ధే లక్ష్యంగా రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీ చేస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శంకర్ పల్లి పట్టణ కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకం కింద రైతులకు ఉచితంగా కంది విత్తనాలు (మినీ కిట్స్ – చిరు సంచులు)ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించి, స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందన్నారు. నకిలీ విత్తనాల అమ్మకాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.