Special Committee for Telangana Activists
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రత్యేక కమిటీ
జీవో 679 జారీ చేసిన ప్రభుత్వం, హర్షం వ్యక్తం చేసిన ఉద్యమకారులు – కాంగ్రెస్ నేతలు
నర్సంపేట, నేటిధాత్రి:
తెలంగాణ ఉద్యమకారుల సేవలను అధికారికంగా గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే కేశవరావు నేతృత్వంలో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ మేరకు జీవో నెంబర్ 679 జారీ చేయడంపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణ ఉద్యమ నేత, కాంగ్రెస్ జిల్లా నాయకులు దండెం రతన్ కుమార్, మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ప్రజల దశాబ్దాల పోరాట ఆకాంక్షలను, అమరవీరుల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని వారు కొనియాడారు. కేసీఆర్ పాలనలో ఉద్యమకారులకు సముచిత స్థానం, గుర్తింపు లేకుండా అన్యాయం జరిగిందని ఆరోపించారు.ఉద్యమకారుల గుర్తింపునకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎస్ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డిలను సభ్యులుగా నియమించడం కాంగ్రెస్ నిబద్ధతకు నిదర్శనమన్నారు. జీవో 679 జారీతో ఉద్యమకారుల ఆత్మగౌరవం నిలబడుతుందని, కాంగ్రెస్ పాలన ప్రజా పాలన అని వారు పేర్కొన్నారు.
