Farmers Protest Over Paddy Procurement Delay
వడ్ల కొనుగోలులో జాప్యంపై మాజీ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత మహేందర్ రెడ్డి ఆగ్రహం
యాదాద్రి నేటి ధాత్రి:
ముల్కలపల్లిలో రైతుల పక్షాన ధర్నాలో పాల్గొన్న మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత మహేందర్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి మరియు మండల నాయకులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలం ముల్కలపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై ఆలేరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునిత మహేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి పది రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనకపోవడంపై ఆమె మండిపడ్డారు.గురువారం ముల్కలపల్లి గ్రామంలో పర్యటించిన ఆమె, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం కుప్పలను పరిశీలించి రైతుల గోడును విన్నారు. అనంతరం రైతుల పక్షాన ముల్కలపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతు
* కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అడుగడుగునా వంచిస్తోందని, కొనుగోలు కేంద్రాల్లో పది రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నా పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
* కనీస ఐకేపీ కేంద్రాల్లో నేటికీ గన్నీ బ్యాగులు (గునె సంచులు), కాంటాలు అందుబాటులో లేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు.
* ఈరోజు శాంతియుతంగా నిరసన తెలిపామని, రేపటిలోగా కొనుగోళ్లు ప్రారంభించకపోతే వేలాదిమంది రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
* రైతుల సమస్యలపై ధర్నా నిర్వహిస్తున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆమె మండిపడ్డారు.
* రైతును రాజు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేడు రైతులను రోడ్డు పాలు చేస్తోందని, రైతుల ఉసురు ఈ ప్రభుత్వానికి కచ్చితంగా తగులుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతు నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు.
