BRS Protest Against Bandi Sanjay
బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని ధర్నా
సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఆయన కుమారుడు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదు అయిన నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా, బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పట్టణ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, పరిసర మండలాల అధ్యక్షులు, తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు గజ వెంకట రాజన్న మాజీ జెడ్పిటిసి కోడి అత్తయ్య, మాజీ ఎంపీపీ మానస పడగల రాజు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నా సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

అదే సమయంలో మరోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డివేణి గోపి ఆధ్వర్యంలో కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతసేపు వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసు బలగాలతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఇరువర్గాలతో మాట్లాడి వారిని శాంతింపజేసి పరిస్థితిని సర్దుమణిగేలా చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలు అత్యంత సున్నితమైనవని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా, పారదర్శకంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరైనా తప్పు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సిందేనని అన్నారు.అలాగే ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి నిజానిజాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. నైతిక విలువలు, ప్రజా విశ్వాసం కాపాడే నాయకత్వం అవసరమని, ప్రజల్లో ఉన్న అనుమానాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడ్డారు.
