Overloaded Autos Endanger Farm Workers
అటు ఎండలో ఇటు ఆటోలో ఇబ్బందులు
అధిక లోడుతో కూలీల రవాణాపై చర్యల డిమాండ్
పరకాల,నేటిధాత్రి
ప్రాంతంలో వ్యవసాయ పనుల కోసం కూలీలను ఆటోలలో పరిమితికి మించి ఎక్కించుకొని తరలిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఒకవైపు మండుతున్న ఎండలో కూలీలు అలమటిస్తుంటే,కూలీలు మరోవైపు ఆటోలలో ఇరుకుగా ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వ్యవసాయ క్షేత్రాలకు సమయానికి చేరుకోవాల్సిన అవసరంతో డ్రైవర్లు ఒకేసారి అధిక సంఖ్యలో కూలీలను ఎక్కించుకొని ప్రయాణాలు నిర్వహిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.దీంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురికావడంతో పాటు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి.ఇప్పటికే ఇలాంటి అధిక లోడుతో ప్రయాణాల కారణంగా పలుచోట్ల కూలీలకు సంబంధించిన ప్రమాద ఘటనలు చోటుచేసుకున్న సందర్భాలు ఉన్నాయని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించకపోవడం ఆందోళనకు దారితీస్తోంది.కూలీల ప్రమేయం లేకుండానే వారిని అధిక సంఖ్యలో ఎక్కించుకోవడం వారి భద్రతను ప్రమాదంలో పడేస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఎండ తీవ్రత కారణంగా శారీరకంగా అలసిపోయే పరిస్థితుల్లో

ఈ రవాణా విధానం మరింత ఇబ్బందులను కలిగిస్తోంది.ఈ నేపథ్యంలో సంబంధిత ఆర్టీఏ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు,ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత మరియు ప్రమాదాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రజలు సూచిస్తున్నారు.అదేవిధంగా,స్థానిక పోలీసులు కూడా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి అధిక లోడుతో నడుస్తున్న ఆటోలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.కూలీల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు మరియు పోలీసులు సమన్వయంతో చర్యలు చేపడితే,ఈ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారం లభించే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
