వరంగల్ తూర్పు శాసనసభ్యునిగా మీకు సేవలందించాను
ముఖ్యమంత్రి కేసీఆర్ రెండవ సారి అవకాశం కల్పించారు
మీ ఆశీర్వాదం నా పూర్వ జన్మసుకృతం
ఎనుమాముల మార్కెట్ లోకి మీ ఆశీర్వాదం కోసం వచ్చాను
మీ ఆశీర్వాదాన్ని గుర్తుంచుకుని మీకు మరింత సేవ చేస్తాను
భవిష్యత్ లో మీ ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను
కారు గుర్తుకు ఓటు వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను
వరంగల్ తూర్పు, నేటిధాత్రి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా ఆసియాలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ అయిన ఏనుమాములలో మంగళవారం ఉదయం ఎమ్మెల్యే నన్నపునేని ప్రచారం నిర్వహించారు. చాంబర్ ఆఫ్ కామర్స్, దడువాయిలు, హమాలీలు, గుమస్తా కార్మికులు, పత్తి, మిర్చి వ్యాపారులు, చాటకూలి మహిళలు, ఇతర కార్మికులతో ఎమ్మెల్యే సమావేశమై ఓటు అభ్యర్థించారు.మార్కెట్ లో కలియ తిరుగుతూ ప్రజలను, కార్మికులను, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపార వాణిజ్యాలు, వివిధ విభాగాల కార్మికులు ఎమ్మెల్యే నరేందర్ కు మూకుమ్మడిగా మద్దతు తెలిపి, అభివృద్ధికి నోచుకోని ఓరుగల్లు తూర్పున కనీవినీ ఎరగని రీతిలో ఎమ్మెల్యే నరేందర్ అభివృద్ధి చేసి తన మార్క్ ఉంచారని, అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకుందామని, కారు గుర్తుపై ఓటు వేసి నరేందర్ గెలుపుతో భాగస్వామ్యం అవుతామని నినదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,
వరంగల్ తూర్పు శాసనసభ్యుడిగా తనకు అవకాశం ఇస్తే 4100కోట్ల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేశామన్నారు. రెండు సంవత్సరాలు కరోనాల పోయిందని, మిగతా మూడు సంవత్సరాల్లో 1250కోట్లతో 24అంతస్తుల హాస్పిటల్ నిర్మిస్తున్నామని, నూతన బస్ స్టేషన్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, నూతన కలెక్టరేట్ జిల్లా కేంద్రం, ఏడు గురుకుల పాఠశాలలు, ప్రధాన రహదారులు, అంతర్గత సిసి రోడ్లు, ఇలా గొప్పగా అభివృద్ధి చేశామన్నారు. నియోజకవర్గంలో ఇన్నర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చాం. రాబోవు రోజుల్లో రింగ్ రోడ్డు చుట్టూ కంపెనీలు నెలకొల్పే విధంగా తాము ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని, యువతకు ఉపాధి అవకాశం కల్పిస్తామన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ వారికి స్థలం, నిధులు కేటాయించడం జరిగిందని, మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వచ్చినప్పుడు వారి సమస్యల గురించి ప్రస్తావించడం జరిగిందని, ఆ సమస్యలన్నిటిని తీర్చే జిమ్మేదారి తనదేనని ఎమ్మెల్యే తెలిపారు. పోయిన ఎన్నికల్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపార వాణిజ్య, అన్ని విభాగాల కార్మికులు మూకుమ్మడిగా తనకు మద్దతు తెలిపి తనను ఆశీర్వదించి గెలిపించారని, నేడు అదే విధంగా ముక్తకంఠంతో వారందరు తనకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో రైతులకు రైతుబంధు 16 వేలకు పెంచుతున్నారని, మహిళలకు సౌభాగ్య లక్ష్మి ద్వారా మూడు వేల రూపాయలు, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 400కి గ్యాస్, ప్రతీ కార్మికుడికి బీమా వైద్యం చేయించుకోవడానికి 15లక్షల వెసులుబాటు, ఆసరా పెన్షన్ 2వేలు నుండి 5వేలు, వికలాంగుల పెన్షన్ 4వేలు నుండి 6వేలు, ఇలా అన్ని వర్గాలను ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టో రూపొందించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో 22వందల డబల్ బెడ్ రూమ్స్, ప్రభుత్వ పథకమైన గృహలక్ష్మి, దళితబంధు, బీసీబందు, మైనారిటీబంధు, ఇలా అన్నిట్లో నిరుపేదలైన కార్మికులకు, ప్రజలకు అందిస్తామన్నారు.
ప్రజల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా తాను పనిచేస్తానని, ఒక నిరుపేద బిడ్డగా లారీ డ్రైవర్ కొడుకుగా 500 రూపాయల నౌకరితో ప్రారంభమైన తన ప్రస్థానం, నేడు అంచలంచలుగా కష్టపడి ఎదిగి ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఉన్నానని, రాబోవు ఎన్నికల్లో మీ పూర్తి మద్దతిచ్చి మరోమారు తనను ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా ఎమ్మెల్యే కోరారు.
దడవాయి యూనియన్ ఆధ్వర్యంలో సన్మానం
ఈ సందర్భంగా మార్కెట్ కి ప్రచారానికి విచ్చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపనేని నరేందర్ కు మార్కెట్ “దడవాయి యూనియన్” తరపున మద్దతు ప్రకటిస్తూ, యూనియన్ ఆధ్వర్యంలో నన్నపనేని నరేందర్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో దడవాయి యూనియన్ అధ్యక్షుడు ఈటెల దేవేందర్, ప్రధాన కార్యదర్శి సోల రవి, ఉపాధ్యక్షుడు బోనాల వీరన్న, కోశాధికారి రంగు రవీందర్, రాంకిషన్, దడువాయి యూనియన్ మాజీ అధ్యక్షుడు కందికొండ రాజేందర్, దడువాయిలు సులుగం అశోక్, నిమ్మాని నాంపెల్లి తదితరులు పాల్గొన్నారు.