ఫ్లెక్సీలతో ఆకర్షించి లక్షల్లో దోపిడి
అనుమతులు ఏవి లేకున్నా ఆదాయానికి డోకా లేదు
వెంచర్ల పేరుతో ముంచేస్తున్న పట్టించుకోని అధికారులు
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో వెంచర్ల పేరుతో భూవిక్రయ దందా జోరుగా సాగుతుంది. ఇందులో ఒకటైన శ్రీ వెంకటేశ్వర వెంచర్ స్థానిక పంచాయతీ నుండి సరైన అనుమతులు పొందకుండా ఇంటి నిర్మాణాలు చేపడుతూ వెంచర్ నిర్వాహకులు దర్జాగా ఉంటున్నారు.దీంతో అనుమతులు లేని ఇంటి నిర్మాణ సమాచారాన్ని హైడ్రా అధికారులకు ఇవ్వాలని స్థానిక గ్రామస్తులు కోరుతున్నారు.జైపూర్ మండలంలో ఇదివరకే అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.పట్ట భూములను చూపి గుట్టు చప్పుడు కాకుండా లావాణ పట్టా భూములని ప్లాట్లుగా విభజించి వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే.ప్రభుత్వ అనుమతుల ప్రకారం గ్రామపంచాయతీకి ఇచ్చిన భూమిలో గ్రౌండ్, పార్క్ స్థలాలతో పాటు రోడ్లు డ్రైనేజీ సౌకర్యాలను అభివృద్ధి చేశాకే క్రయ విక్రయాలు జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ పనులేవి చేయకుండానే మండలంలోని శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ వ్యాపారులు గత కొద్ది రోజుల క్రిందట మండల నాయకుల సమక్షంలో భారీ ఎత్తున వ్యాపారాన్ని ప్రారంభించి,ప్రజలను ఆకర్షించి చట్ట విరుద్ధంగా ప్లాట్లను అమ్ముతూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు.డిటిసిపి అనుమతి ఉంది అంటూ మండల కేంద్రం లోని తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారిని ఆనుకొని సర్వేనెంబర్ 102 మరియు103 లో గల భూమిని వెంచర్ పేరుతో ఫ్లాట్స్ గా తయారు చేసి క్రయవిక్రయాలు చేస్తున్నారు.ప్రభుత్వ అనుమతుల ప్రకారం వెంచర్ వేసే సంబంధిత భూమిలో 10% గ్రీన్ బెల్ట్ కోసం గ్రామపంచాయతీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి వెంచర్లో మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత మరో 10 శాతం భూమిని గ్రామపంచాయతీకి అప్పగించాలి. దాని తరువాతనే భూమి రిలీజ్ చేసుకొని క్రయవిక్రయాలు జరుపుకోవాలి. కానీ మౌలిక సదుపాయాలు పూర్తి చేయకుండా సౌకర్యాల నిర్మాణాలు చేపట్టకుండా మధ్యతరగతి ప్రజలను మోసం చేసి అక్రమ ధనార్జనకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం ధరలు నిర్ణయించి అమ్మకాలు జరపకుండా శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇష్టానుసారంగా అధిక ధరకు అమ్ముతూ కోట్ల ఆదాయం పొందుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా అనుమతులు పొందినట్లుగా పత్రాలకే పరిమితమై పూర్తిస్థాయి సౌకర్యాలు చేపట్టకుండా క్రయవిక్రయాలు చేపట్టి సామాన్య ప్రజల నడ్డి విరిస్తున్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిలోని చౌరస్తాలలో ప్రచారం కొరకు భారీ ఆకారాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షించి అధిక మొత్తాన్ని వసూలు చేస్తూ మోసం చేస్తున్నారు. ఉన్నతాధికారులు దానిపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రజలు కోరుతున్నారు.