తెలంగాణ ప్రజలను నిరుత్సాహపర్చిన మోడీ ప్రసంగం
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు
భూపాలపల్లి నేటిధాత్రి
దేశ ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ బహిరంగ సభలో చేసిన ప్రసంగం తెలంగాణ ప్రజల ఆశలను నీరుగార్చడమే కాకుండా నిరుత్సాహపర్చింది. నీతి సూత్రాలు వల్లించి ఊకదంపుడుగా ఉపన్యాసం చేశారు. అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు అన్నాడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎందుకు అడ్డుకుంటున్నారు? రాష్ట్రానికి ఆర్థికంగా రావాల్సిన నిధులు ఎందుకు తగ్గుతున్నాయి? అనే విషయాలకు సమాధానం చెప్పలేదు.
రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే మాతో జట్టుకట్టండని, తమకు అనుకూలంగా వ్యవహరించాలని, ముఖ్యమంత్రికి పరోక్షంగా మోడీ సంకేతమివ్వడం రాజ్యాంగ విరుద్ధం. పెట్రోల్ వాడకాన్ని నియంత్రించాలని, ప్రజారవాణాలోను, మెట్రోరైల్లో వెళ్ళాలని, బంగారం కొనొద్దని, విదేశీ పర్యటనలు చేయొద్దని, నిత్యావసర సరుకుల ధరలు పెరగబోతున్నాయని సంకేతాన్ని ఇచ్చారు. కానీ ధరలు పెరగడానికి ప్రధానకారణమైన యుద్ధాన్ని ఆపకుండా, అమెరికా అధ్యక్షుడి ముందు మోకరిల్లే వైఖరిని ప్రభుత్వం అనుసరిస్తోంది. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్, విద్యుత్ సవరణ బిల్లు తెచ్చి విద్యుత్తును ప్రైవేటుపరం చేసే విధానాలు అమలు చేస్తున్నది.
మోడీ ఉపన్యాసంలో తెలంగాణ రాష్ట్ర సమస్యల ప్రస్తావన లేకుండా రాష్ట్రంలో అధికారంలోకి ఎలా రావాలనే అంశం మీదనే కేంద్రీకరణ కనిపిస్తున్నది. మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఈ తెలంగాణ గడ్డ, అదే పోరాట స్ఫూర్తితోనే బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజానీకానికి సిపీఐ(ఎం) విజ్ఞప్తి చేస్తున్నది. అని వారు అన్నారు
