అధికారులుగా చేయలేని సేవ..నాయకులుగా చేస్తారా?

-రాజకీయాలంటే మాటలు కాదు..అధికారుల పెత్తనం అసలే కాదు!

-అప్పుడు జనానికి దూరం…ఇప్పుడు దగ్గరయ్యేందుకు ఆరాటం?

-అధికారులు రాజకీయాలు…రాణించలేక అవస్థలు!

-రాజకీయాలలోకి అధికారులు..సక్సెస్‌ కాలేక తలనొప్పులు!

-ఏదో ఒక పార్టీలో చేరి పదవులు పొందిన వారున్నారు.

-ప్రత్యేకంగా పెత్తనం చేయాలనుకొన్న వారు ఊగిసలాడుతున్నారు.

-మీడియా ప్రాపకం కోసం పాకులాడుతున్నారు.

-అతి విశ్వాసంతో రాజకీయాలను ఏలుదామనుకున్నారు.

-రాణించలేక చతికిలపడిపోతున్నారు.

-ఒంటరి పోరాటంలో అలసిపోయి పార్టీల పంచన చేరుతున్నారు.

-అక్కడ గుర్తింపు కోసం ఆరాపడుతున్నారు.

-నిన్నటిదాకా పోరాటం చేసిన వారి పంచన చేరిన వారు వున్నారు.

-రెండు తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి వారున్నారు.

-ఉనికి కోసం తహతహలాడుతున్నారు.

-అధికారిగా వున్నప్పుడు ప్రజలకు దూరంగా వున్నారు.

-రిటైర్‌ అయ్యాక రాజకీయాలలో చేరి జనాన్ని ఉద్దరిస్తామంటారు.

-రాజకీయ పదవుల కోసం అర్రులు చాస్తున్నారు.

-సవాలు చేసిన పార్టీలు పంచన చేర్చుకునేందుకు రాయబారాలు చేస్తున్నారు.

-వున్న పేరును చెడగొట్డుకొని, విమర్శల పాలౌతున్నారు.

-రాజకీయ విశ్లేషకుల పాత్రలు పోషిస్తూ నిత్యం మీడియాలో వుంటున్నారు.

-ప్రతి సమస్య మీద ఏదో ఒక డిబేట్‌ లో పాల్గొంటున్నారు.

-ఎప్పటికైనా అవకాశాలు రాకపోతాయ అని ఎదురుచూస్తున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఉద్యోగులు ముదిరితే నాయకులౌతారంటే ఇదేనేమో! రాను రాను రాజకీయాల్లోకి ఉద్యోగులు పెద్దఎత్తున వచ్చే అవకాశాలుకూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగులుగా ఎడాపెడా సంపాదించి, తర్వాత వాటిని రాజకీయాల కోసం కొంత ఖర్చు చేసి, మరింత దోచుకునేందుకు మార్గం వేసుకునే వారు చాలా మంది క్యూలో వున్నట్లున్నారు. తొండ ముదిరితే ఊసరవెళ్లి అవుతుందన్నది ఎంత నిజమే ఉద్యోగులు నాయకులైతే కూడా అదే జరుగుతుంది. అంతకు మించి ప్రజలు కూడా వారి నుంచి ఏదీ ఆశించడం లేదు. నిజాయితీగా ఉద్యోగం చేసిన ఎంత పెద్ద అధికారులైనా ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాని కొంత మంది మాత్రమే రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు. వాళ్లేమీ జీవితాలు త్యాగంచేసిన వారు కాదు. ఉద్యోగం చేసిన నాడు వారి జీతాల నుంచి జనానికి సేవ చేసిన వారు కాదు. కాని ఆగష్టు 15, జనవరి 26 నాడు పుటక్కున దేశ భక్తి పుట్టుకొచ్చి, జెండా వందనం అయిపోగానే చట్టుక్కున మర్చిపోయినట్లే వుంటుంది. ఉద్యోగం చేసినంత కాలం వారి జీవిత కాలం మొత్తం సామాన్యుడిని దగ్గర తీసుకున్న సందర్భాలే వుండవు. కాని అంతా అయిపోయాక రాజకీయాల్లోకి వచ్చే ముందుకు ఎవరూ చూడని, వినని ముచ్చట్లన్నీ చెప్పేస్తుంటారు. జనాన్ని నమ్మించే ప్రయత్నాలు చేస్తుంటారు. అలా రాజకీయాల్లోకి వచ్చిన వారిలో సక్సెస్‌ రేటు చాలా తక్కువ. ఇయితే ఇక్కడ కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పుకోవాలి. తమకు తాము గొప్ప బలవంతులమని, అతి విశ్వాసానికి వెళ్లిన నాయకులెవరూ తెలుగు రాష్ట్రాలలో సక్సెస్‌ అయిన వారు లేరు. ముందుగా చెప్పుకోవాల్సిన నాయకుడు జయప్రకాశ్‌ నారాయణ్‌. ఏకంగా లోక్‌సత్తా అనేపార్టీ పెట్టారు. ఉద్యోగానికి రాజీనామా చేసి అవినీతి రహితసమాజ నిర్మాణం కోసం పోరాటం చేస్తానన్నాడు. ఉమ్మడి రాష్ట్ర్రంలో ఓ పదేళ్ల పాటు రాజకీయం చేశాడు. కాని ప్రజలు ఆదరించలేదు. పైగా ఆయనకు రాజకీయాలు చేసేంత సొమ్మెక్కడిది అని జనం ప్రశ్నించుకున్నారు. ఒక దశలో హైదరాబాద్‌ నగరమే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోని అనేక నగరాల్లో లోకస్‌ సత్తాను ముందుగా విస్తరించాలని చూశారు. ఆ రోజుల్లో హైదరాబాద్‌తోపాటు, అనేక నగరాల్లో లోక్‌ సత్తా గురించి ఆయన చేసిన ప్రచారం కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆ సొమ్ము ఎక్కడిది? అన్న ప్రశ్న మొదలైంది. దాంతో అప్పటి నుంచి ఆయన పతనం కూడా మొదలైంది. ఏపి ప్రజలు ఆదరించలేదు. తెలంగాణ ప్రజలు దరి చేర్చుకోలేదు. తెలంగాణ ఉద్యమం మీద లేని పోని కిరికిరి పెట్టే ప్రయత్నం చేసి మొదటికే మోసం తెచ్చుకున్నాడు. 2009లో ఓసారి జనం నమ్మి చూద్దామని కూకట్‌ పల్లి నుంచి గెలిపించారు. కాని ఆయన నాయకుడిగా పనిచేయలేదు. అమెరికాలో రాజకీయం ఇలా వుంటుంది. లండన్‌లో ఇలా వుంటుంది. ఇక్కడ కూడా అదే అమలు చేద్దామన్నట్లు మాటలు చెప్పారు. ప్రజలకు దూరమయ్యారు. రేషన్‌ కార్డు కోసం మన దేశంలో నాయకుడికి దగ్గరకు వెళ్లడమే ప్రజలకు అలవాటు. అదే రివాజు. తర్వాత అదికారులకు అర్జీలు పెట్టుకుంటారు. ఇలాంటి సమయంలో రేషన్‌ కార్డు కావాలంటే రెవిన్యూ కార్యాలయానికి వెళ్లి ధరఖాస్తు చేసుకోవాలి. నా దగ్గరకు వస్తే నేనేం చేస్తా?అని అన్నట్లు వార్తలు వచ్చాయి. అంతే సామాన్యుడికి ఎంత దగ్గరగా వుంటే నాయకుడు అంత ప్రజల గుండెల్లో వుంటాడు. అధికారికి ప్రజలకు దూరం వుండడమే తెలుసు. డాబు, దస్కం చూపించడమే అలవాటు. అలాంటి వారు ప్రజలకు చేరువ కావడం అన్నది దుర్లభం. ఎంత మంది అదికారి అనే పేరున్నా, నేరుగా ప్రజలకు సేవ చేసే నాయకుడు కాలేదు. 1999 ఎన్నికల్లో చంద్రబాబు నాయకుడు తటస్ధులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి, సరికొత్త రాజకీయం చూపిస్తానన్నాడు. ఎన్నికల్లో మాజీ సిబిఐ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసిన విజయరామారావును ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేయించారు. అలా మరి కొంత మందికి అవకాశాలు కల్పించారు. ఆ ఎన్నికల్లో వాళ్లంతాగెలిచారు. అందులో ఓ నలుగురికి కూడా మంత్రి పదవులు ఇచ్చారు. ఆ నలుగురు ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. ప్రజలకు గుర్తు కూడా లేరు. కాకపోతే ఒక్కసారైనా గెలిచారు. మంత్రి పదవులు కూడా అనుభవించారు. అలా ఒకపార్టీని నమ్ముకొని రాజకీయాలు చేసిన ఉద్యోగులు అంతో ఇంతో రాజకీయంగా కూడా రాణించారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన మాజీమంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ లాంటి వారు రాజకీయాలలో ఇప్పటికీ కీలకభూమిక పోషిస్తున్నారు. తొలి తెలంగాణ మండలి చైర్మన్‌గా పనిచేసిన స్వామీ గౌడ్‌ ఉద్యోగ సంఘ నాయకుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. తర్వాత బిఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి మండలి సభకు చైర్మన్‌ అయ్యారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన శంకర్‌ నాయక్‌ కూడా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. తర్వాత మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అలా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఎమ్మెల్సీ కోదండరాం రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ పెట్టారు. కాని ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయనే గెలవలేకపోయారు. బిఆర్‌ఎస్‌లో చేరి వుంటే ఎప్పుడో రాజకీయంగా మరో స్ధాయిలో వుండేవారు. కాని ఆయన వేసిన తప్పటడుగుల మూలంగా పార్టీ పెరిగింది లేదు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిచింది లేదు. కాకపోతే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు తెలిపడంతో ఇటీవల ఎమ్మెల్సీ అయ్యారు. 2023 ఎన్నికల ముందు పోలీస్‌ ఉన్నతాధికారిగా పనిచేసిన ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ , తన ఉద్యోగానికి రాజీనామాచేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనను బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. అయినా దాన్ని కాదనుకొని రాజకీయాల్లోకి వచ్చారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంమీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. తానే స్వయంగా ఒక రాజకీయ పార్టీ పెట్టాలని అనుకున్నారు. కాని బిఎస్పీ పార్టీలో చేరి ఆ పార్టీ తెలంగాణ కన్వీనర్‌గా పనిచేశారు. గత ఎన్నికల్లో ఆయన కూడా పోటీ చేశారు. అప్పుడు గాని రాజకీయాలంటే ఏమిటో ఆయనకు అర్ధం కాలేదు. దాంతో బిఎస్పీని వదిలేసి బిఆర్‌ఎస్‌లో చేరారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అదికారంలో వున్నప్పుడే ఆయన పార్టీలో చేరితే ఆయన రాజకీయం మరోలా వుండేది. కాని ఆయన అడుగడుగునా కేసిఆర్‌ను విమర్శిస్తూ వెళ్లారు. ఒక రకంగా బిఆర్‌ఎస్‌ ఓటమికి ఆయన కూడా నీటి బొట్టుగా మారారు. అప్పుడు కేసిఆర్‌ను తూర్పార పట్టిన ప్రవీణ్‌ కుమార్‌ ఇప్పుడు ఆకాశానికెత్తుకుంటున్నారు. అంటే ఉద్యోగులు కూడా అవకాశ వాద రాజకీయాలు చేయడానికి మాత్రమే వచ్చారని అర్దం చేసుకోవచ్చు. గతంలో కూడా ఉద్యోగులు కొంత మంది రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్‌లో చేరి పదవులు పొందిన వారున్నారు. వరంగల్‌ ఎంపిగా రెండు సార్లు గెలిచిన సిరిసిల్ల రాజయ్య ఒకప్పుడు ఉద్యోగం చేసిన వారే. ప్రస్తుత మహబూబాబాద్‌ ఎంపి బలరాం నాయక్‌ కూడా ఒకప్పుడు ఉద్యోగి. ఆయన గతంలో ఎంపిగా గెలిచి కేంద్రంలో మంత్రి పదవి నిర్వహించారు. ఈసారి మళ్లీ ఎంపిగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక టీచర్‌గా పనిచేసిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, గత నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తూ వస్తున్నారు. ఒకటి రెండు ఓటములు తప్ప ఆయన వరుస విజయాలు సాదిస్తూవచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 9 సంవత్సరాలపాటు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగేళ్లపాటు ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతూ వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపి మాజీ ముఖ్యమంత్రి జగన్‌ కేసును పర్యవేక్షించిన సిబిఐ. జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఇంటిపేరు జేడిగా స్ధిరపర్చుకున్న లక్ష్మి నారాయణ రాజకీయాల్లో విజయాలు చవి చూడలేకపోతున్నారు. సొంతంగా పార్టీ పెట్టి చతికిలపడిపోయారు. కొన్ని పార్టీలు తిరిగి అక్కడ కూడా నెగల్లేక పోయారు. ఇప్పుడు రాజకీయాలపై యువత అవగాహన కార్యాక్రమాలు చేపడుతున్నారు. మీడియాలో విశ్లేషకులుగా పనిచేస్తున్నారు. ఎంతో సమర్ధవంతమైన అధికారిగా ఆయనకు వున్న పేరును రాజకీయాల్లోకి వచ్చి చెడగొట్టుకున్నారు. ప్రజల్లో వున్న గుర్తింపు తనకు తానే చెరిపేసుకున్నారు. ఒకప్పుడు ఆయన మాట కోసం మీడియా ఎగబడిపోతుండేది. ఇప్పుడు తన మాటలు చెప్పడంకోసం మీడియా సంస్దల చుట్టూ లక్ష్మినారాయణ తిరగాల్సి వస్తుంది. ఉద్యోగం చేసినప్పుడు ఆయన ప్రజలకు ఏంసేవ చేశారో లేదోగాని, రాజకీయాల్లోకి వచ్చి సేవ చేద్దామనుకుంటు ప్రజలు స్వాగతించలేదు.
ఇక పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొన వారు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. రాణించాలని కూడా చూస్తున్నారు. వారిపై మరో ప్రత్యేక కధనం త్వరలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!