AMC Chairperson Swaroopa Strong Warning Over Farmers Issue
రైతు పేరుతో రాజకీయం చేస్తే ఊరుకోము
– ప్రోటోకాల్ ఉల్లంఘించకుండా గౌరవంగా ఆహ్వానించాము
– వీలైతే రైతులను ఆదుకోవడానికి ప్రయత్నం చేయండి
– మీడియా సమావేశంలో ఖండించిన ఏఎంసీ చైర్మన్ స్వరూప, రైతులు, కాంగ్రెస్ నేతలు
సిరిసిల్ల ప్రతినిధి(నేటి ధాత్రి):
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవాలలో తాము ఎలాంటి ప్రోటోకాల్ ని ఉల్లంఘించలేదని, కావాలని బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ చైర్ పర్సన్ ను వెంట పెట్టుకుని వచ్చి దూర్భాషలాడుతూ, దౌర్జన్యాలకు దిగి, రచ్చ చేశారని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెల్ముల స్వరూప ఆరోపించారు. రైతులు డైరెక్టర్లతో కలిసి శుక్రవారం సిరిసిల్ల క్లబ్ లో వెల్ముల స్వరూప మీడియా సమావేశం నిర్వహించి మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, ఆమె భర్త జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, బీఆర్ఎస్ కౌన్సిలర్ల చర్యలను తీవ్రంగా ఖండించారు. పెద్దూరు, ముష్టి పెళ్లి, చంద్రంపేట, రగుడు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా నిర్ణీత సమయాన్ని కంటే గంటన్నర ఆలస్యంగా సుమారు 100 మంది మార్బలంతో మద్యం సేవించి వచ్చి ప్రోటోకాల్ ఉల్లంఘించారని తాము రానిదే ఎలా ప్రారంభిస్తారని దుర్భాషలాడుతూ హంగామా సృష్టించారని అన్నారు. వేసవి ఎండలో కొనుగోలు కేంద్రం వద్ద రైతులు, మహిళలు గంటల తరబడి వేచి ఉన్నారని అయినప్పటికీ మెప్మా అధికారులు మున్సిపల్ చైర్ పర్సన్ కోసం వేచి చూశారని, ఆలస్యంగా వచ్చిన మున్సిపల్ చైర్ పర్సన్ కు టెంకాయ ఇచ్చి కొట్టమని ప్రోటోకాల్ ప్రకారమే నడుచుకున్నారని తెలిపారు. అయినప్పటికీ చైర్పర్సన్ భర్త బీఆర్ఎస్ నాయకుడు విచక్షణ రహితంగా బూతులు మాట్లాడారని, తమ మాటలు వినిపించుకోకుండా వ్యవహరించారన్నారు. ఏఎంసీ చైర్మన్ ను కూడా టెంకాయ కొట్టనివ్వకుండా భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఈ కార్యక్రమాలలో చైర్మన్ భర్తకు ఏమి సంబంధం ఉందని, ఇలా రైతులు మహిళలు ఉండగా దౌర్జన్యానికి దిగారన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ కూడా రైతుపై దౌర్జన్యానికి దిగాడని, బూతు పురాణం ప్రారంభించాడని ఆరోపించారు. ఒకవైపు వర్షాలు పడి కల్లాల వద్ద ధాన్యం తడిసి రైతులు నష్టపోయి ఏడుస్తుంటే వారి పట్ల సహాయక చర్యలు చేపట్టకుండా రైతుల పేరుతో రాజకీయం చేస్తున్నారని అన్నారు. విలీన గ్రామాల ప్రజలు వీరి చర్యలను గమనించాలన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ తనకు తల్లి లాంటి స్థానంలో ఉన్నారని తాను ప్రోటోకాల్ ఉల్లంఘించకుండా గౌరవంగా ఆహ్వానించినప్పటికీ ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారని అన్నారు. తాము చదువుకున్న వారం కనుక విచక్షణతో వ్యవహరించామని, పార్టీ కౌన్సిలర్ పై చేయి కూడా ఎత్తారని ఇలాంటి చిల్లర పనులు మానుకోవాలన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను 10 సంవత్సరాల పాటు మద్యం తాగిస్తూ పోషించారని, కానీ తమకు కూడా కార్యకర్తలు ఉన్నారని, 10 మంది కార్యకర్తలు ఉన్నా వారు విచక్షన కార్యకర్తలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేసిన తాము అడ్డుకోలేదని, రైతుల పేరుతో రాజకీయం చేస్తే ఊరుకోబమని, రైతుల జోలికి వస్తే బాగుండదని స్వరూప హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, ఎలుక తిరుపతి, దుబాల వెంకటేశం, మార్గం లక్ష్మణ్, బూర దశరథం, పిస్క మదు, ఆడెపు జగన్, ఖాజా, కోడం అరుణ, మెరుగు శేఖర్, .స్వర్గం రాజు, కూరపాటి శ్రీశైలం, పరశురాములు, నక్క నరసయ్య, శైలజ, శ్రీనివాస్ రెడ్డి, భరత్ తదితరులు పాల్గొన్నారు.
