Grand May Day Celebrations in Serilingampally
శ్రమశక్తికి నివాళి.. మే డే వేడుకలు ఘనం
- కార్మికుల శ్రమతోనే దేశాభివృద్ధి: సీనియర్ నాయకులు ఆంజనేయులు సాగర్
శేరిలింగంపల్లి,నేటి ధాత్రి :-
సమాజ నిర్మాణంలో ప్రతి ఇటుకను పేర్చి, దేశాభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్న కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని అంజయ్య నగర్ డివిజన్ సీనియర్ నాయకులు ఆంజనేయులు సాగర్ అన్నారు. శుక్రవారం అంజయ్య నగర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ కాలనీలో ‘స్ఫూర్తి భవన నిర్మాణ కార్మిక సంఘం’ ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్మిక సంఘం నేతలతో కలిసి మే డే జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆంజనేయులు సాగర్ మాట్లాడుతూ.. మనం అనుభవిస్తున్న ప్రతి సౌకర్యం వెనుక ఒక కార్మికుడి కష్టం దాగి ఉందన్నారు. కష్టపడి పనిచేసే గుణం ఉన్నప్పుడే సమాజంలో గౌరవం లభిస్తుందని, కార్మికులందరూ తమ హక్కులతో పాటు బాధ్యతలను గుర్తిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తుచేశారు.కార్మికుల సమస్యల పరిష్కారానికి, వారి ఐక్యతకు ఇలాంటి వేడుకలు వేదికగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రజానాట్య మండలి అధ్యక్షుడు సుధాకర్, సురేష్ సాగర్, వేలాద్రి రామకృష్ణ, జి. తిరుపతయ్య, ఎస్. రాజు, ఎస్. బాలస్వామి, చిన్న సాగర్, మహేందర్ సాగర్, శ్రీను, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
