ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి.
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని యాసంగి పంట ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ , అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి ధాన్యం కొనుగోలు పురోగతి పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ,యాసంగి మార్కెటింగ్ సీజన్ లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతిపాదించిన 240 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 119 ఐకేపి, 21 పాక్స్, 7 మెప్మా, 1 డి .సి.ఎం.ఎస్. మొత్తం 148 కేంద్రాలను ఓపెన్ చేశామని, మరో రెండు రోజుల వ్యవధిలో మిగిలిన 92 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకుని వచ్చే ధాన్యం తేమ శాతం , ఇతర ప్రమాణాలను చెక్ చేసి ఎఫ్.ఏ.క్యు ఉన్న ధాన్యం మద్దతు ధర పై కొనుగోలు చేసీ ఓ.పి.ఎం.ఎస్.లో ఎంట్రీ చేయాలని అన్నారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్రక్ షీట్స్ ప్రకారం సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని, ఎక్కడైనా రైస్ మిల్లర్లు ధాన్యం దించుకొని పక్షంలో ఇంటర్మీడియట్ గోదాము లకు తరలించాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో ఉన్న ఖాళీ గోదాము లను సమీపంలో గల కోనుగోలు కేంద్రాలకు ట్యాగ్ చేయాలని కలెక్టర్ తెలిపారు.ప్రతి మండలం సమీపంలో గల గోదాములను ధాన్యం భద్ర పరిచేందుకు హైర్ పద్దతిలో తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో డి.ఆర్డి.ఓ శేషాద్రి, డి.ఏ.ఓ అఫ్జలి బేగం, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, పౌర సరఫరాల శాఖ అధికారులు రజిత, వసంత లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.