Use Welfare Schemes: Sarpanch
ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
చంద్రయ్యపల్లి సర్పంచ్ ఆరేల్లి లతవీరేశం గౌడ్.
దుగ్గొండి,నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ ఆరేల్లి లతవీరేశం గౌడ్ అన్నారు.ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా దుగ్గొండి మండలం పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఆయా గ్రామాల సర్పంచ్ల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. మండలంలో నిర్వహించిన పలు గ్రామసభల్లో ఎంపీడీవో లెక్కల అరుంధతి, ఎమ్మార్వో సమ్మక్క, ఎంపీఓ శ్రీధర్ గౌడ్, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు, తో పాటు పలువురు అధికారులు గ్రామ సభలో పాల్గొన్నారు. దుగ్గొండి మండలంలోని చంద్రాయపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక గ్రామసభ సర్పంచ్ ఆరేల్లి లతవీరేశం గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ బ్యాంక్ ఖాతల్లో పడటం లేవని పలువురు ప్రజలు ఆరోపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్స్ ప్రభుత్వం అందించాలని కలెక్టర్ కు తెలుపుతూ తీర్మానం చేసుకున్నారు.గ్రామంలో అభివృద్ధి కోసం వార్డు సభ్యులు అధికారుల సమన్వయంతో పార్టీలకతీతంగా గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేష్, గ్రామ స్పెషల్ ఆఫీసర్ రాహుల్, ఉప సర్పంచ్ బొమ్మినేని సుధాకర్ రెడ్డి, వార్డు సభ్యులు కక్కెర్ల సారంగం,స్వరూప, అంగన్వాడి టీచర్, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
