కాలం మారినా ఆ గ్రామాల్లో మారని సంప్రదాయం!
జహీరాబాద్ నేతి ధాత్రి:
జీవిత శైలి ఎన్ని మార్పులు చెందినా.. ఆధునికత ఎంతగా విస్తరించినా.. మన పూర్వీకుల విలువలు, సంప్రదాయాలు కొన్ని ప్రాంతాల్లో నేటికీ సజీవంగా ఉన్నాయి. తెలంగాణ – కర్ణాటక – మహారాష్ట్ర సరిహద్దుల్లోని కంగ్టి, పిట్లం, బీదర్ (కర్ణాటక), నాందేడ్, దెగ్లూర్ (మహారాష్ట్ర) వంటి ప్రాంతాలు ఈ విషయానికి ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. సాధారణంగా నాగుల పంచమి అంటే పాములకు పూజలు చేసి, పుట్టలో పాలు పోయడం గుర్తుకు వస్తుంది. కానీ ఇక్కడ నాగులపంచమికి అత్యంత విశిష్టత ఉంది.
కాలం ఎలా మారినా, ఈ పర్వదినాన్ని సంప్రదాయబద్ధంగా జరుపుకుంటూ సంప్రదాయాలకు పట్టం కడుతున్నారు. ప్రతి ఇంట్లోనూ సోదరీమణులకు, మేనకోడళ్లకు, తోబుట్టువుల కూతుళ్లకు జాకెట్ బట్టలు, రెండు కుడకలు వంటి ప్రత్యేక బహుమతులు ఇవ్వడం ఓ ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇంతకీ ఈ సంస్కృతి గొప్పతనం ఏంటంటే అన్నదమ్ములు లేని పరిస్థితుల్లోనైనా, వారి పిల్లలకు బహుమతులు తీసుకెళ్లడం ద్వారా బంధాలను కాపాడుతున్నారు. ఇది కేవలం ఆచారంగా కాకుండా, బంధాలను బలపరిచే ఒక ఆదర్శంగా మారింది. ఆడపడుచుల పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ, ఇంటి పరంపరలను గౌరవంగా నిలుపుతూ సాగుతున్న ఈ పండుగ గతాన్ని తలపెట్టి, భవిష్యత్తును నిర్మించేలా మారుతోంది. సాంకేతిక యుగంలోనూ ఈ సాంప్రదాయ ధారలు మరింత శక్తివంతంగా ముందుకు సాగుతున్నాయి.